శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము - పి.నారాయణరావు Back   Home 

పండ్రెండవ అధ్యాయము

శ్రీ సాయి లీలలు. 1.కాకామహాజని, 2.ధుమాల్ ప్లీడరు, 3.నిమోంకర్ భార్య, 4.ములేశాస్త్రి, 5.ఒక డాక్టరు - వీరి అనుభవములు.

భక్తులను బాబా ఎట్లు కలుసుకొనేవారో ఎట్లు ఆదరించేవారో ఈ యధ్యాయములో చూచెదము.

యోగుల కర్తవ్యము

శిష్టులను రక్షించుటకు దుష్టులను శిక్షించుటకు భగవంతుడవతరించుచున్నాడను సంగతి పూర్వపు అధ్యాయములలో తెలిసికొన్నాము. కాని యోగుల కర్తవ్యము పూర్తిగా వేరే. వారికి మంచివాడును చెడ్డవాడును నొకటే. వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గమున ప్రవర్తించునట్లు చేసెదరు. భవసాగరమును హరించుటకు వారగస్త్యుల వంటివారు. అజ్ఞానమనే చీకటిని నశింపచేయుటకు వారు సూర్యునివంటివారు. భగవంతుడు యోగుల హృదయమున నివసించును. యధార్థముగ భగవంతునికంటే వారు వేరుకారు. యోగులలో నొకరగు సాయి, భక్తుల క్షేమముకొరకు అవతరించిరి. జ్ఞానములో నుత్కృష్టులై, దైవీతేజస్సుతో ప్రకాశించుచు వారు అందరిని సమానముగ ప్రేమించు వారు. వారికి దేనియందు నభిమానము లేకుండెను. శత్రువులు, మిత్రులు, రాజులు, ఫకీరులు, అందరు వారికి సమానమే. వారి పరాక్రమమును వినుడు. భక్తుల కొరకు తన పుణ్యము నంతను వ్యయపరచి యెప్పుడును వారికి సహాయము చేయుటకు సిద్ధముగా నుండువారు. వారి కిచ్చలేనిచో భక్తులు వారివద్దకు రాలేకుండిరి. వారి వంతు రానిదే వారు బాబాను స్మరించువారు కారు. వారి లీలలు కూడ ఎరిగి యుండరు. అట్టివారికి బాబాను జూచుట కెట్లు బుద్ధి పుట్టును? కొందరు బాబాను చూడవలెననుకొనిరి. కాని బాబా మహాసమాధి చెందులోపల వారికా యవకాశాము కలుగలేదు. బాబాను దర్శించువలెనను కోరిక కలవారనేకులున్నారు. కాని వారి కోరికలు నెరవేరలేదు. అట్టివారు విశ్వాసముతో బాబా లీలలను వినినచో దర్శనమువల్ల కలుగు సంతుష్టి పొందుదురు. కొందరదృష్టవశమున వారి దర్శనము చేసికొన్నను, బాబా సన్నిధిలో ఉండవలెనని కోరినను నచ్చట ఉండలేకుండిరి. ఎవ్వరును తమ యిష్టనుసారము శిరిడీ పోలేకుండిరి. అచ్చట నుండుటకు ప్రయత్నించినను ఉండలేకుండిరి. బాబా యాజ్ఞ ఎంతవరకు గలదో యంతవరకే వారు శిరిడీలో నుండగలిగిరి. బాబా పొమ్మనిన వెంటనే శిరిడీ విడువవలసి వచ్చుచుండెను. కాబట్టి సర్వము బాబా ఇష్టముపై నాధారపడి యిండెను.

కాకా మహాజని

ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని శిరిడీ పోయెను. అచ్చటొక వారము రోజులుండి గోకులాష్టమి యుత్సవమును చూడవలెననుకొనెను. బాబాను దర్శించినవెంటనే అతనితో బాబా యిట్లనిరి. "ఎప్పుడూ తిరిగి యింటికి పోయెదవు?" ఈ ప్రశ్న విని కాకా యాశ్చర్యపడెను. కాని జవాబు నివ్వవలసియుండెను. బాబా యాజ్ఞ ఎప్పుడయిన నప్పుడే పోయెదనని కాకా జవాబిచ్చెను. అందులకు బాబా యిట్లనియెను. "రేపు, పొమ్ము" బాబా వాక్కు ఆజ్ఞ తో సమానము. కావున నట్లే చేయవలసి వచ్చెను. అందుచే నా మరుసటిదినమే కాకా మహాజని శిరిడీ విడిచెను. బొంబాయిలో తన కచేరికి పోగానే వాని యజమాని వాని కొరకే కనిపెట్టుకొని యున్నట్లు తెలెసెను. ఆఫీసు మేనేజరు హఠాత్తుగా జబ్బుపడెను. కావున కాకా మహాజని ఉండవలసిన యవసరమెంతేని యుండెను. యజమాని శిరిడీలో నున్న కాకా కొక యుత్తరము ఈ విషయమై వ్రాసెను. అది బొంబాయికి తిరిగి చేరినది.

భావూ సాహెబు ధుమాళ్ (ప్లీడరు)

పై దానికి వ్యతిరేకమగు కధ నిప్పుడు వినుడు. భావూ సాహెబు ధుమాళ్ కోర్టుపనిపై నిఫాడ్ పోవుచుండెను. దారిలో దిగి శిరిడీ పోయెను. బాబా దర్శనము చేసెను. వెంటనే నిఫాడ్ పోవ ప్రత్నించెను. కాని బాబా యందుల కాజ్ఞ ఇవ్వలేదు. శిరిడీలోనే ఇంకొక వారముండునట్లు చేసెను. ఈలోగా నిఫాడ్ మెజస్ట్రేటుకు కడుపునొప్పి వచ్చె కేసు వాయిదా పడెను. తరుగాత ధుమాళ్ నిఫాడ్ కు పోయి కేసుకు హాజరగుటకు సెలవు పొందెను. అది కొన్ని నెలలవరకు సాగెను. నలుగురు మెజిస్ట్రేటులు దానిని విచారించిరి. తుట్టతుదకు ధుమాళ్ దానిని గెలిచెను. అతని కక్షిదారు విడుదలయ్యెను.

నిమోన్ కర్ భార్య

నిమోను గ్రామం వతనుదారును, గౌరవమెజిస్ట్రేటును అగు నానా సాహెబు నిమోనుకర్ , శిరిడీలో తన భార్యతో నుండెను. ఆ దంపతులు తమ కాలమంతయు మసీదులోనే గడుపుచు బాబా సేవ చేయుచుండిరి. బేలాపూరులో నున్న వారి కుమారుడు జబ్బుపడెను. బేలాపూర్ పోయి బాలుని, అచటి బంధువులను జూచి, యక్కడ కొన్ని దినము లుండవలెనని తల్లి నిశ్చయించుకొనెను. కాని ఆ మరుసటిదినమే తిరిగి రావలెనని భర్త చెప్పెను. ఆమె సందిగ్థములో పడెను. ఆమెకు ఏమి చేయుటకు తోచలేదు. ఆమె దైవము శ్రీ సాయినాధుడే యామెకు సహాయపడెను. బేలాపూరుకు పోవుటకు ముందు ఆమె బాబా దర్శనముకై వెళ్ళెను. అప్పుడు బాబా సాఠేవాడ ముందర నానా సాహెబు మొదలగువారితో నుండెను. అమె బాబా వద్దకుపోయి సాష్టాంగ నమస్కారములు చేసి బేలాపూరు పోవుటకు ఆజ్ఞ నిమ్మని వేడుకొనెను. బాబా ఇట్లు చెప్పెను. "వెళ్ళుము, ఆలస్యము చేయకుము, ప్రశాంతముగా, నెమ్మదిగా బేలాపూరులో సుఖముగా నాలుగుదినము లుండుము; నీ బంధువులందరిని చూచిన పిమ్మట శిరిడీకి రమ్ము." బాబా మాటలెంత సమయానుకూలముగ నుండెనో గమనించుడు. నానా సాహెబు ఆదేశమును బాబా ఆజ్ఞ రద్దుచేసెను.

నాసిక్ నివాసియగు ములేశాస్త్రి

ములేశాస్త్రి యాచారముగల బ్రాహ్మణుడు. ఆయన నాసిక్ నివాసి. ఆయన ఆరుశాస్త్రములను చదివిరి. ఆయనకు జ్యోతిషము, సాముద్రికము కూడ బాగుగ తెలియును. అతడు నాగపూరు కోటీశ్వరుడగు బాపు సాహెబు బుట్టీని కలిసికొనుటకు శిరిడీ వచ్చెను. బుట్టీని చూచిన పిదప బాబా దర్శనముకై మసీదుకు పోయెను. బాబా తన డబ్బుతో మామిడిపండ్లను, కొన్ని ఫలహార వస్తువులను కొని మసీదులోనున్న వారందరికీ పంచిపెట్టుచుండెను. బాబా చిత్రముగా మామిడిపండును అన్ని వైపుల నొక్కుచుండెను. దానిని తినువారు నోట బెట్టుకొని చప్పచేయుటకు వీలగుచుండెను. అరటిపండ్ల నొలిచి గుజ్జును భక్తులకు పంచిపెట్టి తొక్కలు బాబా యించుకొనెడివారు. ములేశాస్త్రి సాముద్రికము తెలిసినవాడగుటచే పరీక్షించుటకై బాబాను చేయి చాచుమని యడిగెను. బాబా దానిని వినక నాలుగు అరటిపండ్ల నిచ్చెను. తరువాత నందరు వాడా చేరిరి. ములేశాస్త్రి స్నానము చేసి మడిబట్టలు కట్టుకొని యగ్ని హోత్రము మొదలగునవి యాచరించుటకు మొదలిడెను. బాబా మామూలుగనే లెండీతోటకు బయలుదేరెను.

మార్గమధ్యమున "గేరు (ఎర్రరంగు) తయారుగ నుంచుడు. ఈనాడు కాషాయవస్త్రమును ధరించెదను" అని బాబా యనెను. ఆ మాట లెవరికీ బోధపడలేదు. కొంతసేపటికి బాబా లెండీతోటనుంచి తిరిగివచ్చెను. మధ్యాహ్నహారతి కొరకు సర్వము సిద్ధమయ్యెను. మధ్యాహ్నహారతికి తనతో వచ్చెదరా యని ములేశాస్త్రిని బుట్టీ యడిగెను. సాయంకాలము బాబా దర్శనము చేసికొనెదనని శాస్త్రి బదులు చెప్పెను. అంతలో బాబా తన యాసనముపై కూర్చుండెను. భక్తులు వారికి నమస్కరించిరి. హారతి ప్రారంభమయ్యెను. బాబా నాసిక్ బ్రాహ్మణుని వద్దనుండి దక్షిణ తెమ్మనెను. బుట్టీ స్వయముగా దక్షిణ తెచ్చుటకై పోయెను. బాబా యాజ్ఞ అతనికి చెప్పగనే అతడు ఆశ్చర్యపడెను. తనలో తానిట్లనుకొనెను. "నేను పూర్తిగా ఆచారవంతుడను, నేనెందులకు దక్షిణ నీయవలెను? బాబా గొప్ప యోగియై వుండవచ్చును. నేను వారిపై ఆధారపడియుండలేదు." గొప్ప యోగివంటి సాయి ధనికుడగు బుట్టీద్వారా దక్షిణ అడుగుటచే అతడు కాదనలేక పోయెను. తన పూజ ముగియక ముందే వెంటనే బుట్టీతో మసీదుకు బయలుదేరెను. తాను పవిత్రుడననుకొని, మసీదట్టిది కాదని, బాబాకు దూరముగ నిలువబడి, పువ్వులను బాబాపై విసరెను. హఠాత్తుగా బాబా స్థానములో , గతించిన తన గురువగు ఘోలవ్ స్వామి కూర్చొని యుండెను. అతడు ఆశ్చర్యపోయెను. అది యొక స్వప్నమేమోయని తలెచెను. కాని యతడు జాగ్రదవస్థలో నున్నప్పుడు స్వప్నమెట్లగును? అయితే వారి గురువచ్చట కెట్లు వచ్చెను? అతని నోట మాట రాకుండెను. చైతన్యము తెచ్చుకొని తిరిగి యాలోచించెను. కాని తన గురువు మసీదులో నెందుకుండునని భావించెను. తుదకు మనస్సందిగ్థము లన్నియు విడచి మసీదు పైకెక్కి, తన గురువు పాదములపై బడి లేచి చేతులు జోడించుకొని నిలుపబడెను. తక్కిన వారందరు బాబా హారతిని పాడిరి. కాని ములేశాస్త్రి తన గురుని నామము నుచ్చరించెను. గొప్పజాతివాడనను గర్వము, తాను పవిత్రుడనను సంగతిని యుటుండనిచ్చి తన గురుని పాదములపైబడి సాష్టాంగమొనర్చి, కండ్లు మూసికొనెను. లేచి కండ్లు తెరచునంతలో, బాబా వానిని దక్షిణ యడుగుచున్నట్లు గాంచెను. బాబావారి చిన్న యాకారమును ఊహకందని వారి శక్తిని జూచి ములేశాస్త్రి మైమరచెను; మిక్కిలి సంతుష్టి చెందెను. అతని నేత్రములు సంతోషబాష్పములచే నిండెను. బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణ నొసంగెను. తన సందేహము తీరినదనియు తన గురువును దర్శించితిననియు చెప్పెను. బాబా యొక్క ఆ యాశ్చర్యలీలను గాంచిన వారందరు నిర్ఘాంతపోయిరి. అప్పుడు వారు బాబా పలికిన పలుకులు "గేరు తెండు! కాషాయవస్త్రముల ధరించెద" నను మాటల అర్థము గ్రహించిరి. అట్టిది సాయియొక్క యాశ్చర్యకరమైన లీల.

ఒక డాక్టరు

ఒకనాడొక మామలత్ దారు తన స్నేహితుడగు డాక్టరుతో శిరిడీకి వచ్చెను. ఆ డాక్టరు తన దైవము శ్రీ రాముడనియు, తాను మహమ్మదీయునికి నమస్కరించననియు, శిరిడీ పోవుటకు మనస్సు అంగీకరించలేదనియు చెప్పెను. నమస్కరించుమని బలవంతపెట్టువారు కాని చెప్పువారు కాని ఎవరు లేరని తనతో కలసి రావలెననియు సంతోషముగా కాలము పుచ్చవలెననియు మామలతదారు జవాబిచ్చెను. ఇట్టి ఉద్దేశముతోనే బాబాను చూచుటకు వారు మసీదుకు పోయిరి. అందరి కంటే ముందు డాక్టరు బాబాకు నమస్కరించుట జూచి అందరు ఆశ్చర్యనిమగ్నులైరి. తన మనోనిశ్చయమును మార్చుకొని మహమ్మదీయుని కెట్లు నమస్కరించెనని యందరు నడుగసాగిరి. తన ప్రత్యక్షదైవమగు శ్రీ రాముడు యాగద్దెయందు గాన్పించుటచే వాని పాదములపై బడి సాష్టాంగనమస్కారమొనర్చితినని డాక్టరు బదులిడెను. అట్లనునంతలో తిరిగి సాయిబాబానే యచ్చట గాంచెను. ఏమీ తోచక "ఇది స్వప్నమా యేమి? వారు మహమ్మదీయు డెట్లు? వారు గొప్ప యోగసంపన్నులయవతారము" అని నుడివెను.

ఆ మరుసటిదినమే డాక్టరు ఒక ప్రతిజ్ఞ చేసి యుపవాసముండెను. బాబా తనను ఆశీర్వదించువరకు మసీదుకు బోనను నిశ్చయముతో మసీదుకు వెళ్ళుట మానెను. ఇట్లు మూడు రోజులు గడచెను. నాలుగవ దినమున తన ప్రియస్నేహితుడొకడు ఖాందేషునుండి రాగా వానితో కలసి మసీదులోని బాబా దర్శనమునకై పోయెను. బాబాకు నమస్కరించిన పిమ్మట ఎవరైన బిలువగా తాను వచ్చెనా ఏమి యని బాబా అతనిని ప్రశ్నించెను. ఈ ప్రశ్న వినుసరికి డాక్టరు మనస్సు కరగెను. ఆనాటి రాత్రియే నిద్రలో బాబా యాశీర్వాద మందుకొనెను. గొప్ప యానంద మనుభవించెను. పిమ్మట తన గ్రామమునకు బోయెను. ఆ యానందము 15 దినములవరకనుభవించెను. ఆ ప్రకారముగా సాయి బాబా యందు భక్తి వానికనేక రెట్లు వృద్ధి పొందెను.

పై కధలవలన ముఖ్యముగా ములేశాస్త్రి కధ వలన నేర్చుకొనిన నీతి ఏమన మనము మన గురువునందే స్థిరమైన నమ్మక ముంచవలెను. దానిని ఇంకెక్కడికిని మార్చకూడదు. వచ్చే అధ్యాయములో మరికొన్ని సాయిలీలలు చెప్పెదను.

ఓం నమో శ్రీ సాయినాధాయ

శాంతిః శాంతిః శాంతిః

పండ్రెండవ అధ్యాయము సంపూర్ణము