శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము - పి.నారాయణరావు Back   Home 

పదమూడవ అధ్యాయము

మరికొన్ని సాయిలీలలు, జబ్బులు నయమగుట, 1.భీమాజీపాటీలు 2.బాలాషంపీ 3.బావుసాహెబు బుట్టీ 4.ఆళందిస్వామి 5. కాకామహాజని 6. హార్ధనివాసి దత్తోపంతు

మాయయొక్క యనంతశక్తి

బాబా మాటలు క్లుప్తముగాను, భావగర్భితముగను, అర్థపూర్ణముగను, శక్తి వంతముగను, సమతూకముతోను నుండెడివి. వారు ఎప్పుడు తృప్తిగా, నిశ్చింతగా నుండువారు. బాబా యిట్లనెను "నేను ఫకీరయినప్పటికి, యిల్లుగాని భార్యగాని లేనప్పటికి, ఏ చీకుచింతలు లేనప్పటికి ఒకేచోట నివసించుచున్నాను. తప్పించుకొనలేని మాయ నన్ను బాధించుచున్నది. నేను నన్ను మరచినను ఆమెను మరువలేకున్నాను. ఎల్లప్పుడు ఆమె నన్నావరించుచున్నది. ఈ భగవంతుని మాయ బ్రహ్మ మొదలగు వారినే చికాకు పరచునప్పుడు, నావంటి ఫకీరనగ దానికెంత? ఎవరయితే భగవంతుని ఆశ్రయించెదరో వారు భగవంతుని కృపవల్ల ఆమె బారినుండి తప్పించుకొందురు." మాయాశక్తి గూర్చి బాబా ఆ విధముగా పలికెను. మహాభాగవతములో శ్రీ కృష్ణుడు యోగులు తన జీవస్వరూపములని ఉద్దవునకు చెప్పియున్నాడు. తన భక్తుల మేలుకొరకు బాబా యేమి చెప్పియున్నారో వినుడు. "ఎవరు అదృష్టవంతులో ఎవరి పాపములు క్షిణించినవో, వారు నాపూజ చేసెదరు. ఎల్లప్పుడు సాయి సాయి యని నీవు జపించినచో నిన్ను సప్తసముద్రములు దాటించెదను. ఈ మాటలను విశ్వసింపుము. నీవు తప్పక మేలుపొందెదవు. పూజ తంతుతో నాకు పనిలేదు. షోడపశోపచారములు గాని అష్టాంగయోగములు గాని నాకు అవసరము లేదు. భక్తి యున్న చోటనే నా నివాసము." బాబాకు పూర్తిగా శరణాగతులైనవారి క్షేమముకొరకు బాబా ఏమి చేసెనో వినుడు.

భీమాజీ పాటీలు

పూనా జిల్లా, జున్నరు తాలూకా, నారాయణగాం గ్రామమందు భీమాజీపాటీలు 1909 వ సంవత్సరములో భయంకరమైన దీర్ఘమైన ఛాతి జబ్బుతో బాధపడుచుండెను. తుదకు అది క్షయగా మారెను. అన్నిరకముల ఔషధములను వాడెను గాని ప్రయోజనము లేకుండెను. నిరాశ చెంది "ఓ భగవంతుడా! నారాయణా! నాకిప్పుడు సహాయము చేయుము." అని ప్రార్థించెను. మన పరిస్థితులు బాగుండునంతవరకు మనము భగవంతుని తలచము అను సంగతి యందరికి తెలిసినదే. కష్టములు మనల నావరించునప్పుడు మనము భగవంతుని జ్ఞప్తికి దెచ్చుకొందము. అట్లనే భీమాజికూడ భగవంతుని స్మరించెను. ఈ విషయమై బాబా భక్తుడగు నానా సాహెబు చాందోర్కరుతో సలహా చేయవలె ననుకొనెను. కావున వారికి తన జబ్బుయొక్క వివరములన్నియు దెలుపుచు నొక లేఖ వ్రాసి యతని యభిప్రాయమడిగెను. బాబా పాదములపై బడి బాబాను శరణు వేడుకొనుట యొక్కటే యారోగ్యమునకు సాధనమని నానాసాహెబు చాందోర్కరు జవాబు వ్రాసెను. అతడు నానాసాహెబు సలహాపై ఆధారపడి శిరిడీ పోవుట కేర్పాటులన్నియు చేసెను. అతనిని శిరిడీకి తెచ్చి మసీదులోనున్న బాబా ముందర పెట్టిరి. నానాసాహెబు శ్యామ గూడ నచ్చట నుండిరి. ఆ జబ్బు వాని గత జన్మలోని పాప కర్మల ఫలితమని చెప్పి, దానిలో జోక్యము కలుగజేచికొనుటకు బాబా యిష్టపడకుండెను. కాని రోగి తనకు వేరే దిక్కులేదనియు, నందుచే చివరకు వారి పాదముల నాశ్రయించితిననియు మొరపెట్టుకొని వారి కటాక్షమునకై వేడుకొనెను. వెంటనే బాబా హృదయము కరిగెను. వారిట్లనిరి. "ఆగుము, నీ యాతురతను పారద్రోలుము; నీ కష్టములు గట్టెక్కినవి. ఎంతటి పీడ, బాధలున్న వారైనను ఎప్పుడయితే మసీదు మెట్లు ఎక్కుదురో వారి కష్టములన్నియు నిష్క్రమించి సంతోషమునకు దారితీయును. ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయార్దృహఋదయుడు. వారీ రోగమును బాగుచేసెదరు. అందరిని ప్రేమతోను దయతోను, కాపాడెదరు."

ప్రతి యయిదు నిమిషములకు రక్తము గ్రక్కుచుండిన ఆ రోగి బాబా సముఖమున యొకసారియైన రక్తము గ్రక్కలేదు. బాబా వానిని దయతో గాపాడెదనను ఆశాపూర్ణమైన మాటలు పలికిన వెంటనే రోగము నయమగుట ప్రారంభించెను. వానిని భీమాబాయి యింటిలో బసచేయుమని బాబా చెప్పెను. అది సదుపాయమైనదిగాని, యారోగ్యమయినదిగాని కాదు. కాని బాబా యాజ్ఞ దాటరానిది. అతడు అచ్చట నుండునపుడు బాబా రెండు స్వప్నములలో వాడొక పాఠశాలా విధ్యార్థిగా పద్యములు కఠోపాఠము చేయుకుండుటచే క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు కనిపించెను. రెండవ స్వప్నములో వాని ఛాతీపై పెద్దబండను వైచి క్రిందకు మీదకు త్రోయుటచే చాలా బాధ కలుగుచున్నట్లు జూచెను. స్వప్నములో పడిన ఈ బాధలతో వాని జబ్బు నయమై వాడు ఇంటికి పోయెను. అతడప్పుడప్పుడు శిరిడీ వచ్చుచుండెను. బాబా వానికి జేసిన మేలును జ్ఞప్తియందుంచుకొని బాబా పాదములపై సాష్టాంగనమస్కారములు చేయుచుండెను. బాబా తన భక్తుల వద్దనుంచి యేమియు కాంక్షించెడువారు కారు. వారికి కావలసినదేమన, భక్తులు పొందే మేలును జ్ఞప్తియందుంచుకొంటయు, మార్పులేని గట్టినమ్మకమును; భక్తియును, మహారాష్టదేశములో నెలకొకసారిగాని, పక్షమునకొకసారిగాని ఇండ్లలో సత్యనారాయణ వ్రతము చేయుట యలవాటు. కాని భీమాజీపాటీలు శ్రీ సత్యనారాయణ వ్రతమునకు మారుగా క్రొత్తగా సాయిసత్యవ్రతమును తన పల్లె చేరిన వెంటనే ప్రారంభించెను.

బాలాగణపతి షింపీ

బాలాగణపతి షింపీ యనువాడు బాబా భక్తుడు. మలేరియా జబ్బుచే మిగుల బాధపడెను. అన్నిరకముల ఔషధములు, కషాయములు పుచ్చుకొనెను. కాని నిష్ర్పయోజన మయ్యెను. జ్వరము కొంచెమైన తగ్గలేదు. శిరిడీకి పరుగెత్తెను, బాబా పాదములపై బడెను. బాబా వానికి వింత విరుగుడు - లక్షీమందిరము ముందరనున్న నల్ల కుక్కకు పెరుగన్నము కలిపి పెట్టుమని చెప్పెను. దీనినెట్లు నెరవేర్చవలెనో బాలాకు తెలియకుండెను. ఇంటికి పోయిన వెంటనే అన్నము పెరుగు సిద్దముగా నుండుట జూచెను. రెండును కలిపి లక్ష్మీమందిరము వద్దకు దెచ్చెను. అచ్చటొక నల్లని కుక్క తోక యాడించుకొనుచుండెను. పెరుగన్నము కుక్కముందర పెట్టెను. కుక్క దానిని తినెను. బాలా గణపతి మలేరియా జబ్బు శాశ్వతముగా పోయెను.

బాపు సాహెబు బుట్టీ

ఒకానొకప్పుడు బాపు సాహెబు బుట్టీ జిగట విరేచనములతోను పమనములతోను బాధపడుచుండెను. అతని అలమారు నిండ మంచి మందులుండెను. కాని ఏమియు గుణమియ్యలేదు. విరేచనములు వల్లను, పమనముల వల్లను బాపు సాహెబు బాగా నీరసించెను. అందుచే బాబా దర్శనమునకై మసీదుకు పోలేకుండెను. బాబా వానిని రమ్మని కబురు పంపెను. వానిని తన ముందు కూర్చొండబెట్టుకొని యిట్లనెను. "జాగ్రర్త! నీవు విరేచనము చేయకూడదు" అనుచు బాబా తన చూపుడు వ్రేలాడించెను. "పమనము కూడ ఆగవలెను" అనెను. బాబా మాటల సత్తువను గనుడు. వెంటనే రెండు వ్యాధులు పారిపోయెను. బుట్టీ జబ్బు కుదిరెను.

ఇంకొకప్పుడు అతడు కలరాచే బాధపడెను. తీవ్రమైన దప్పితో బాధపడుచుండెను. డాక్టరు పెళ్ళే యన్ని ఔషధములను ప్రయత్నించెను. కాని రోగము కుదరలేదు. అప్పుడూ బాపు సాహెబు బాబా వద్దకు వెళ్ళి ఏ ఔషధము పుచ్చుకొనినచో తన దాహము పోయి, జబ్బు కుదురునని సలహా అడిగెను. బాదాము పప్పు, పిస్తా, ఆక్రోటు, నానపెట్టి పాలు చక్కెర లో ఉడికించి యిచ్చినచో రోగము కుదురునని బాబా చెప్పెను. ఇది జబ్బును మరింత హెచ్చించునని ఏ డాక్టరయినను చెప్పును. కాని బాపుసాహెబు బాబా యాజ్ఞను శిరసావహించెను. పాలతో తయారుచేసి దానిని సేవించెను. వింతగా రోగము వెంటనే కుదిరెను.

ఆళంది స్వామి

ఆళందినుండి యొక సన్యాసి బాబా దర్శనమునకై శిరిడీకి వచ్చెను. అతనికి చెవిపోటెక్కువగా నుండి నిద్రపట్టకుండెను. వారు శస్త్రచికిత్స కూడ చేయించుకొనిరి. కాని వ్యాధి నయము కాలేదు. బాధ ఎక్కువగా నుండెను. ఏమి చేయుటకు తోచకుండెను. తిరిగి పోవునప్పుడు బాబా దర్శనమునకై వచ్చెను. అతని చెవిపోటు తగ్గుట కేదైన చేయుమని శ్యామా ఆ స్వామి తరఫున బాబాను వేడుకొనెను. బాబా అతనినిట్లు ఆశీర్వదించెను. "అల్లా అచ్ఛా కరేగా" (భగవంతుడు నీకు మేలు చేయును) స్వామి పూనా చేరెను. ఒక వారము రోజుల పిమ్మట శిరిడీకి ఉత్తరము వ్రాసెను. చెవిపోటు తగ్గెను; కాని వాపు తగ్గలేదు. వాపు పోగొట్టుకొనుటకై శస్త్రచికిత్స చేయుంచుకొనవలెనని బొంబాయి వెళ్ళెను. డాక్టరు చెవి పరీక్ష చేసి శస్త్ర చికిత్స యవసరము లేదని చెప్పెను. బాబా వాక్కుల శక్తి అంత యద్భుతమైనది.

కాకామహాజని

కాకామహాజని యను నికొక భక్తుడు గలడు. అతడు నీళ్ళ విరేచనములతో బాధపడుచుండెను. బాబా సేవ కాటంకము లేకుండ నట్లు ఒక చెంబునిండ నీళ్ళు పోసి మసీదులో నొకమూలకు పెట్టుకొనెను. అవసరము వచ్చినప్పుడెల్ల పోవుచుండెను. బాబా సర్వజ్ఞుడగుటచే కాకా బాబాతో నేమి చెప్పకే, బాబా యే త్వరలో బాగుచేయునని నమ్మెను. మసీదు ముందర రాళ్ళు తాపన చేయుటకు బాబా సమ్మతించెను; కావున పని ప్రారంభమయ్యెను. వెంటనే బాబా కోపోద్దీపితుడై బిగ్గరగా నరచెను. అందరు పరుగెత్తి పారిపోయిరి. కాకా కూడ పరుగిడ మొదలిడెను. కాని బాబా అతనిని పట్టుకొని యచ్చట కూర్చుండ బెట్టెను. ఈ సందడిలో నెవరో వేరుశనగపప్పుతో చిన్న సంచిని అచ్చట విడిచి పారిపోయిరి. బాబా యొక పిడికెడు శనగపప్పు తీసి చేతులతో నలిపి, పొట్టును ఊదివైచి శుభ్రమైన పప్పును కాకాకిచ్చి తినుమనెను. తిట్టుట, శుభ్రపరచుట, తినుట యొకేసారి జరుగుచుండెను. బాబా కూడ కొంతపప్పును తినెను. సంచి ఉత్తది కాగానే నీళ్ళు తీసుకొనిరమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించెను. కాకా కుండతో నీళ్ళు తెచ్చెను. బాబా కొన్ని నీళ్ళు త్రాగి కాకాను కూడ త్రాగుమనెను. అప్పుడు బాబా యిట్లనెను. "నీ నీళ్ళ విరేచనములు ఆగిపోయినవి. ఇప్పుడు నీవు రాళ్ళు తాపన జేయు పనిని చూచుకొనవచ్చును." అంతలో పారిపోయిన వారందరును వచ్చిరి. పని ప్రారంభించిరి. విరేచనములు ఆగిపోవుటచే కాకా కూడ వారితో కలిసెను. నీళ్ళ విరేచనములకు వేరుశనగపప్పు ఔషధమా? వైద్యశాస్త్ర ప్రకారము వేరుశనగ పప్పు విరేచనములను హెచ్చించును గాని తగ్గించలేదు. ఇందు నిజమైన ఔషధము బాబా యొక్క వాక్కు.

హార్థా నివాసి దత్తోపంతు

దత్తోపంతు హార్ధా గ్రామ నివాసి. అతడు కడుపునొప్పితో 14 సంవత్సరములు బాధపడెను. ఏ ఔషధము వానికి గుణము నివ్వలేదు. బాబా కీర్తి వినెను. వారు జబ్బులను దృష్టిచేతనే బాగుచేసెదరను సంగతి తెలిసికొని శిరిడీకి పోయి, బాబా పాదములపై బడెను. బాబా వానివైపు దాక్షిణ్యముతో చూచి యాశీర్వదించెను. బాబా అతని తలపై తన హస్తము నుంచగనే, ఊదీ ప్రసాదము, ఆశీర్వాదము చిక్కగనే అయనికి గుణమిచ్చెను. ఆ జబ్బువలన తిరిగి బాధ ఎన్నడు లేకుండెను.

ఇంకొక మూడు వ్యాధులు

(1) మాధవరావు దేశపాండే మూలవ్యాధి చే బాధపడెను సోనాముఖి కషాయమును బాబా వానికిచ్చెను. ఇది వానికి గుణమిచ్చెను. రెండు సంవత్సరముల పిమ్మట జబ్బు తిరుగదోడెను. మాధవరావు ఇదే కషాయమును బాబా యాజ్ఞలేకుండ పుచ్చుకొనెను. కాని వ్యాధి అధికమాయెను. తిరిగి బాబా ఆశీర్వాదముతో నయమయ్యెను.

(2) కాకా మహాజని యన్న గంగాధరపంతు అనేకసంవత్సరములు కడుపునొప్పితో బాధపడెను. బాబా కీర్తి విని శిరిడీకి వచ్చెను. కడుపునొప్పి బాగుచేయుమని బాబాను వేడెను. బాబా వాని కడుపు ముట్టుకొని భగవంతుడే బాగుచేయగలడనెను. అప్పటినుండి కడుపు నొప్పి తగ్గెను. వాని వ్యాధి పూర్తిగా నయమయ్యెను.

(3) ఒకప్పుడు నానాసాహెబు చాందోర్కరు కడుపునొప్పితో మిగుల బాధపడెను. ఒకనాడు పగలంతయు రాత్రియంతయు చికాకు పడెను. డాక్టర్ల ఇంజక్షనులు ఇచ్చిరి. కాని, యవి ఫలించలేదు. అప్పుడతడు బాబా వద్దకు వచ్చెను. బాబా ఆశీర్వదించెను. దీనివల్లనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయెను.

ఈ కధలన్నియు నిరూపించుదేమన; అన్ని వ్యాధులు బాగగుట కసలైన ఔషధము బాబా యొక్క వాక్కు; ఆశీర్వాదము మాత్రమే కాని ఔషధములు కావు.

ఓం నమో శ్రీ సాయినాధాయ

శాంతిః శాంతిః శాంతిః

పదమూడవ అధ్యాయము సంపూర్ణము