శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము - పి.నారాయణరావు Back   Home 

పదునైదవ అధ్యాయము

నారదీయ కీర్తనపద్ధతి; చోల్కరు చక్కెరలేని టీ; రెండు బల్లులు.

6వ అధ్యాయములో శిరిడీలో జరుగు శ్రీ రామనవమి యుత్సవముగూర్చి చెప్పితిమి. ఆ యుత్సవమెట్లు ప్రారంభమయ్యెను? ఆ సమయములో హరిదాసును దెచ్చుట ఎంత కష్టముగా నుండెడిది? తుదకు ఆ పనిని దాసుగణు మహారాజు నిర్వహించునట్లు బాబా శాశ్వతముగా నియమించుట, దానిని ఇప్పటివరకు దాసుగణు జయప్రదముగా నడుపుట యనునవి. (చదువరులు జ్ఞాపకముంచుకొనియే యుందురు) ఈ అధ్యాయములో దాసుగణు హరికధల నెట్లు చెప్పువారో వర్ణింపచడును.

నారదీయకీర్తన పద్ధతి

సాధారణముగ మహారాష్ట్ర దేశములో హరిదాసులు హరికధ చెప్పునప్పుడు ఆడంబరమైన నిండు అంగరఖాలు వేసికొనెదరు. తలపైని పాగా గాని, పేటా (ఒకవిధమైన ఎర్రని మహారాష్ట్రపు టోపి) కాని, పొడవైన కోటు, లోపల చొక్కా, పైన నుత్తరీయము, మామూలుగా ధరించెడి ధొవతిని కట్టుకొనెదరు. ఈ ప్రకారముగ దుస్తులు ధరించి, శిరిడీలో హరికధ చెప్పుటకై దాసగణు తయారయ్యెను. బాబా శెలవు పొందుటకై బాబా వద్దకు బోయెను. బాబా అతనితో "ఓ పెండ్లి కొడుకా! ఇంత చక్కగా దుస్తులు వేసికొని ఎక్కడకు పోవుచున్నావు?" అనెను. హరికధ చెప్పుటకు పోవుచున్నానని దాసుగణు జబాబిచ్చెను. అప్పుడు బాబా ఇట్లనెయె. "ఈ దుస్తులన్ని ఎందుకు? కోటు, కండువా, టోపి మొదలగునవి నా ముందర వెంటనే దీసి పారవేయుము. శరీరము పైనవి వేసికొనకూడదు." వెంటనే దాసుగణు వానినన్నిటిని తీసి బాబా పాదములవద్ద నుంచెను. అప్పటినుంచి హరికధ చెప్పునప్పుడు వానిని దాసుగణు ధరించలేదు. నడుము మొదలు తలవరకు ఏమియు వేసికొనలేదు. చేతిలో చిరుతలు మెడలో పూలమాల ధరించేవాడు. ఇది తక్కిన హరిదాసులు అవలంబించు పద్ధతికి వ్యతిరేకము. నారదమహర్షి యే హరికధలు ప్రారంభించినవాడు. వారు తలపైని, శరీరము పైన ఏమియు తొడిగేవారు కారు. చేతియందు వీణను ధరించి ఒకచోటునుంచి ఇంకొక చోటికి హరినామ సంకీర్తన చేయుచు పోవువారు.

చోల్కరు చక్కెర లేని తేనీరు

పూనా అహమ్మదునగరు జిల్లాలలో బాబాను గూర్చి యందరికి తెలియునుగాని నానాసాహెబు చాందోర్కరు ఉపన్యాసముల వల్లను, దాసుగణు హరికధలవల్లను, బాబా పేరు కొంకణదేశమంతయు ప్రాకెను. నిజముగా దాసుగణు తన చక్కని హరికధల వల్ల బాబాను అనేకులకు పరిచయ మొనర్చెను. హరికధలు వినుటకు వచ్చినవారికి అనేకరుచులుండును. కొందరు హరిదాసుగారి పాండిత్యమునకు సంతసించెదరు; కొందరికి వారి నటన; కొందరికి వారి పాటలు; కొందరికి హాస్యము, చమత్కారము; సంతసము గలుగజేయును. కధాపూర్వమున దాసుగారు సంభాషించు వేదాంతవిషయములు వినుటకు కొందరు; అసలు కధను వినుటకు కొందరు వచ్చెదరు. వచ్చినవారిలో చాల కొద్దిమందికి మాత్రమే భగవంతునియందుగాని, యోగులయందు గాని, ప్రేమ-విశ్వాసములు కలుగును. కాని దాసుగణు యొక్క హరికధలు వినువారల మనస్సులపై కలుగు ప్రభావ మతిసమ్మోహనకరముగా నుండెను. ఇచ్చట నొక యుదాహరణము నిచ్చెదము.

ఠాణా లో నున్న కౌపీనేశ్వరాలయములో ఒకనాడు దాసుగణు మహారాజు హరికధ చెప్పుచు సాయి మహిమను పాడుచుండెను. కధను వినుటకు వచ్చినవారిలో చోల్కర్ యనునతడుండెను. అతడు పేదవాడు. ఠాణా సివిల్ కోర్టులో గుమాస్తాగా పనిచేయుచుండెను. దాసుగణు కీర్తన నతిజాగ్రత్తగా వినెను. వాని మనస్సు కరగెను. వెంటనే అక్కడనే మనస్సునందు బాబా ను ధ్యానించి ఇట్లు మ్రొక్కుకొనెను. "బాబా నేను పేదవాడను, నాకుంటుంబమునే నేను పోషించుకొనలేకున్నాను. మీ యనుగ్రహముచేత సర్కారువారి పరీక్షలో నుత్తీర్ణుడనై ఖాయమైన ఉద్యోగము లభించినచో నేను శిరిడీ వచ్చెదను. నీ పాదములకు సాష్టంగనమస్కారము చేసెదను. నీ పేరున కలకండ పంచిపెట్టుదును." వాని యదృష్టముచే చోల్కరు పరీక్షలో ప్యాసయ్యెను. ఖ్యాయమైన యుద్యోగము దొరికెను. కనుక మ్రొక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో నంత బాగుండు ననుకొనెను. చోల్కరు బీద వాడు. వాని కుటుంబము చాల పెద్దది. కనుక శిరిడీ యాత్ర చేయుటకు ఖర్చు పెట్టుకొనలేకుండెను. అందరికి తెలిసిన లోకోక్తి ప్రకారమెవరైన పర్వతశిఖరమునైన దాటవచ్చునుగాని బీదవాడు తన యింటి గడపనే దాటలేడు.

చోల్కరున కెటులైన శ్రీ సాయి మ్రొక్కును త్వరలో చెల్లించవలెనని యాతురత గలిగెను. కావున తన సంసారమునకగు ఖర్చులను తగ్గించి కొంత పైకమును మిగుల్చవలెనని నిశ్చయించుకొనెను. తేనీటిలో వేయు చక్కెరను మాని యా మిగిలిన ద్రవ్యమును దాచుటకు ప్రారంభించెను. ఇవ్విధముగా కొంత ద్రవ్యము మిగిల్చిన పిమ్మట, శిరిడీ వచ్చి బాబా పాదములపై బడెను. ఒక టెంకాయ బాబా కు సమర్పించెను. తాను మ్రొక్కుకున్న ప్రకారము కలకండ పంచిపెట్టెను. బాబాతో తాను సంతసించినట్లు తన కోరికలన్నియు ఆనాడు నెరవేరెననియు చెప్పెను. చోల్కరు బాపూసాహెబు జోగు గృహమందు దిగెను. అప్పుడు వీరిరువురు మసీదులో నుండిరి. ఇంటికి పోవుటకై వారు లేచి నిలువగా బాబా జోగును బిలిచి ఇట్లనెను. "నీ యతిధికి టీ కప్పులలో విరివిగా చక్కెర వేసి యిమ్ము" ఈ పలుకులలోని భావమును గ్రహించినవాడై చోల్కరు మనస్సు కరగెను. అతడాశ్చర్యమగ్ను డయ్యెను. వానికండ్లు బాష్పములచే నిండెను. తిరిగి బాబా పాదములపై బడెను. జోగు కూడ ఈ మాటలు విని టీ కప్పులలో చక్కెర ఎక్కువగా కలుపుట యనుదాని భావము ఏమైయుండునా అని యోచించెను. బాబా తన పలుకులచే చోల్కరు మనస్సునందు భక్తి, నమ్మకములను కలుగచేయవలెనని యుద్దేశించెను. వాని మ్రొక్కు ప్రకారము తనకు రావలసిన కండచక్కెర ముట్టినదనియు, తేయాకునీళ్ళలో చక్కెర నుపయోగించక పోవుట అను రహస్యమనోనిశ్చయమును చక్కగా కనుగొనెననియు చెప్పెను. బాబా ఇట్లు చెప్పనుద్దేశించెను. "నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంత నేనుండెదను. శరీరముతో నేనిచ్చట నున్నప్పటికి సప్తసముద్రముల కవ్వల మీరు చేయుచున్న పనులు నాకు తెలియును. ప్రపంచమున మీకిచ్చవచ్చిన చోటుకు పోవుడు. నేను మీ చెంతనే యుండెదను. నా నివాసస్థలము మీ హృదయమునందే కలదు. నేను మీ శరీరములోనే యున్నాను. ఎల్లప్పుడు మీ హృదయములలోను సర్వజనహృదయములందుగల నన్ను పూజింపుడు. ఎవ్వరు నన్ను ఈ విధముగా గుర్తించెదరో వారు ధన్యులు; పావనులు; అదృష్టవంతులు.

బాబా చోల్కరుకెంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధముగా బోధించెనో గదా!

రెండు బల్లులు

ఈ అధ్యాయమును రెండు చిన్న బల్లుల కధతో ముగించెదము. ఒకనాడు బాబా మసీదులో కూర్చొని యుండెను. ఒక భక్తుడు బాబా ముందర కూర్చొని యుండెను. ఒక బల్లి టిక్కుటిక్కుమని పలికెను. కుతూహలమునకై యా భక్తుడు బల్లి పలికినదాని కర్థమేమని బాబానడిగెను. అది శుభశకునమా, లేక యశుభమా యని ప్రశ్నించెను. చెల్లెలు ఔరంగాబాదునుండి తనను చూచుటకు వచ్చునని యా బల్లి యానందించుచున్నదని బాబా పలికెను. భక్తుడు నిర్ఘాంతపోయి కిమ్మనక కూర్చుండెను. బాబా పలికినదానిని అతడు గ్రహించలేకుండెను. వెంటనే ఔరంగాబాదునుండి ఎవరో గుర్రముపై సాయిబాబా దర్శనమునకై శిరిడీ వచ్చిరి. అతడింకను కొందదూరము పోవలసియుండెను. కాని వాని గుర్రము ఆకలిచే ముందుకు పోలేకుండెను. గుర్రమునకు ఉలవలు కావలసి యుండెను. తన భుజముపై నున్న సంచిని తీసి ఉలువలు తీసుకొని వచ్చుటకై పోవునప్పుడు దానిలో నున్న ధూళిని విదిలెంచెను. అందులో నుండి ఒక బల్లి క్రిందపడి యందరు చూచుచుండగా గోడ నెక్కెను. ప్రశ్నించిన భక్తున కదంతయు జాగ్రత్తగా గమనించుమని బాబా చెప్పెను. వెంటనే యా బల్లి తన చెల్లెలువద్దకు సంతొషముతో పోయెను. చాలకాలము పిమ్మట అక్కచెల్లెండ్రు కలిసికొనిరి. కాన ఒకరినొకరు కౌగలించుకొని ముద్దిడుకొనిరి. గుండ్రముగా తిరుగుచు నధిక ప్రేమతో నాడిరి. శిరిడీ ఎక్కడ? ఔరంగాబాదెక్కడ? గుర్రపురౌతు ఔరంగాబాదునుంచి బల్లిని తీసికొని శిరిడీకి ఎట్లు వచ్చెను? రాబోయే యిద్దరు అక్క చెల్లెండ్రు కలియుదురని బాబా ముందుగనే ఎట్లు చెప్పగలిగెను? ఇది యంతయు బహువిచిత్రముగా నున్నది. ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుచున్నది.

ఉత్తర లేఖనము

ఎవరయుతే ఈ అధ్యాయమును భక్తిశ్రద్ధలతో నిత్యము పారాయణ చేసెదరో వారి కష్టములన్నియు శ్రీ సాయినాధుని కృపచే తొలగును.

ఓం నమో శ్రీ సాయినాధాయ

శాంతిః శాంతిః శాంతిః

పదునైదవ అధ్యాయము సంపూర్ణము