శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము - పి.నారాయణరావు Back   Home 

18, 19 అధ్యాయములు

హేమాడ్ పంతును బాబా ఎట్లు ఆమోదించి యాశీర్వదించెను? సాఠే గారి కధ దేశముఖ్ గారి భార్యకధ; సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారిజూపుట; ఉపదేశములో వైవిధ్యము; నిందగూర్చి బోధ; కష్టమునకు కూలి.

గత రెండు అధ్యాయములలో బ్రహ్మజ్ఞానము నభిలషించు ఒక ధనికుని బాబా ఎట్లు ఆదరించెనో హేమాడ్ పంత్ వర్ణిచెను. ఈ వచ్చే రెండు అధ్యాయములలో హేమాడ్ పంతును బాబా ఎట్లు అమోదించి మోక్షమునకు మార్గము చూపుచుండెనో, ఆత్మోన్నతి గూర్చి, నిందా వాక్యములగూర్చి, కష్టమునకు కూలి మొదలగువానిగూర్చి, బాబా వారి ప్రబోధలెట్టివో వర్ణింతుము.

ప్రస్తావము

సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను గనిపెట్టి, వారి మనస్సు కలతచెందకుండ తగిన బోధచేసి, తుదకు వారి లక్ష్యమైన ఆత్మసాక్షాత్కారమునకు దారి చూపుననువిషయ మందరికి తెలిసినదే. ఈ విషయములో సద్గురువు బోధించుదాని నితరులకు వెల్లడి చేయరాదని కొందరనెదరు. అట్లు గురువు బోధించినదానిని వెల్లడి చేసినచో ఆ బోధలు నిష్ప్రయోజనము లగునని వారి యాలోచన. ఇది సరియైనది కాదు. సద్గురువు వర్షకాలపు మేఘమువంటివారు. వారు తమ యమృతతుల్యములైన బోధలు పుష్కలముగా విశాలప్రదేశములందు కురిసెదరు. వానిని మనమనుభవించి హృదయమునకు తృప్తికరముగా జీర్ణించుకొని పిమ్మట నిస్సంకోచముగా ఇతరుల మేలుకొరకు వెల్లడి చేయవలెను. ఇది వారు మన జాగ్రదవస్థలోనే గాక స్వప్నావస్థలో కూడ తెలియజేయు విషయములకు వర్తించును. తన స్వప్నమందు గనిన "రామరక్షాస్తోత్రమును బుధకౌశిక ఋషి ప్రచురించిన యుదాహరణము నిచ్చట తెలిపెదము."

ప్రేమగల తల్లి, గుణమిచ్చుచేదైన ఔషధములను బిడ్డ క్షేమముకొరకే బలవంతముగా గొంతుకలోనికి త్రోయునట్లు, ఆధ్యాత్మిక విషయములను బాబా తన భక్తులకు బోధించువారు. వారి మార్గము రహస్యమైనది కాదు. అది బహిరంగమైనది. వారి బోధలు ననుసరిచిన భక్తుల ధ్యేయము నెరవేరెడిది. సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాన నేత్రములను తెరిపించి యాత్మయొక్క దైవీసౌదర్యములను జూపి, మన కాంక్షలను నెరవేర్చెదరు. ఇది జరిగిన పిమ్మట, మన ఇంద్రియ విషయ వాంఛలు నిష్క్రమించి, వివేక వైరాగ్యములను జంట ఫలములు చేతికి వచ్చును. నిద్రలో కూడ ఆత్మజ్ఞానము మొలకెత్తును. సద్గురువుల సహవాసము చేసి, వారిని సేవించి, వారి ప్రేమను పొందినచో నిదంతయు మనకు లభించును. భక్తుల కోరికలు నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి, మన కష్టములను బాధలను తొలగించి, మనల సంతోషపెట్టును. ఈ యభివృద్ధి పూర్తిగా సద్గురుని సహాయము వలననే జరుగును. సద్గురువును భగవంతుని వలే కొలువవలెను. కాబట్టి మనము సద్గురువును వెదకవలెను. వారి కథలను వినవలెను. వారి పాదములకు సాష్టంగనమస్కారము చేసి వారి సేవ చేయవలెను. ఇక ఈ అధ్యాయములోని ముఖ్య కధను ప్రారంభించెదము.

హరి వినాయక సాఠే

సాఠే యనువాడు ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగియుండెను. కాలాంతరమున వ్యాపారములో చాల నష్టము పొందెను. ఇంక మరి కొన్ని విషయములతనిని చీకాకు పరచెను. అందుచే నతడు విచార గ్రస్తుడయ్యెను; విరక్తి చెందెను. మనస్సు చెడి చంచలమగుటచే నిల్లు విడచి చాలా దూరము పోవలెననుకొనెను. మానవుడు సాధారణముగా భగవంతుని గూర్చి చింతించడుగాని కష్టములు, నష్టములు దుఃఖములు చుట్టుకొనినప్పుడు భగవంతుని ధ్యానము చేసి విముక్తి పొందుటకు ప్రార్థించును. వాని పాపకర్మలు ముగియువేళకి భగవంతుడు వానినొక యోగీశ్వరునితో కలిసికొనుట సంభవింపచేయును. వారు తగిన సలహా యిచ్చి వాని క్షేమమును జూచెదరు. సాఠే గారికి కూడ అట్టి అనుభవము కలిగెను. అతని స్నేహితులు శిరిడీకి వెళ్ళుమని సలహా నిచ్చిరి. ఆచ్చట సాయిబాబాను దర్శించి యనేకమంది శాంతి పొందుచుండిరి. వారి కోరికలు గూడ నెరవేరుచుండెను. సాఠేగారికి ఇది నచ్చెను. వెంటనే 1917 వ సంవత్సరములో శిరిడీ కి వచ్చెను. అచ్చట శాశ్వత బ్రహ్మవలే స్వయంప్రకాశుడై, నిర్మలుడు శుద్ధస్వరూపుడునకు సాయిబాబాను చూచిన వెంటనే యతనికి మనశ్చాంచల్యము తగ్గిపోయి శాంతి కలిగెను. వాని పూర్వజన్మ పుణ్యమువలన బాబా యొక్క పవిత్రమయిన పాదసేవ లభించెను. అతడు గొప్ప మనోబలము గలవాడగుటచే వెంటనే గురుచరిత్ర పారాయణము మొదలుపెట్టెను. 7 రోజులలో చరిత్ర చదువుట పూర్తికాగానే బాబా యానాడురాత్రి అతనికొక దృష్టాంతమును చూపెను. అది యిట్లుండెను. బాబా గురుచరిగ్రము చేతిలో బట్టుకొని దానిలోని విష్యములను ఎదుట కూర్చున్న సాఠేకు బోధించుచున్నట్లు, అతడు దానిని శ్రద్ధగా వినుచున్నట్లు చూచెను. సాఠే నిద్రనుండి లేచిన వెంటనే కలను జ్ఞాపకముంచుకొనెను. మిగుల సంతసించెను. అజ్ఞానమనే నిద్రలో గుర్రుపెట్టి నిద్రపోవుచున్న తనవంటి వారిని లేపి, గురుచరితామృతమును రుచి చూపుట బాబా యొక్క దయార్ధృఅహృదయమె గదా యనుకొనెను. ఆ మరుసటి దిన మాదృశ్యమును కాకా సాహెబు దీక్షితుకు తెలియజేచి దాని భావమేమయి యుండునో సాయిబాబా నడిగి తెలిసికొనుమనెను. ఒక సప్తాహము చాలునో లేక యింకొక సప్తాహము చేయవలెనో కనుగొను మనెను. సమయము దొరికినప్పుడు కాకా సాహెబు బాబాను ఇట్లడిగెను. "ఓ దేవా! యీ దృశ్యమువలన సాఠేకు ఏమని చెప్ప నిశ్చయించితివి? ఆతడూరకొనవలెనా లేక యింకొక సప్తాహము చేయవలెనా అతడు అమాయక భక్టుడు; అతని కోరిక నెరవేర్చవలెను. అతనికి దృష్టాంతార్థమును బోధించవలెను. వాని నాశీర్వదింపు" డన బాబా "అతడు గురుచరిత్ర నింకొక సప్తాహము పారాయణ చేయవలెను. ఆ గ్రంధమును జాగ్రర్తగా పఠించినచో నాతడు పావనుడగును; మేలు పొందగలడు భగవంతుడు ప్రీతి చెంది వానిని ప్రపంచబంధములనుండి తప్పించును" అనెను.

ఆ సమయమున హేమాడ్ పంతు అచ్చట నుండి, బాబా కాళ్ళనొత్తుచుండెను. బాబా పలుకులు విని యతడు తన అనస్సులో నిట్లనుకొనెను. "సాఠే ఒక్కవారమే పారాయణ చేసి ఫలితమును పొందెనా నేను నలుబది సంవత్సరములనుండి పారాయణ చేయుచున్నాను. గాని నాకు ఫలితము లేదా! అతడిక్కడ 7 దినములు మాత్రమే నివసించెను. నేనో 7 సంవత్సరములనుంచి యున్నాను. నా ప్రయత్నములు నిష్ఫలమా ఏమి? చాతకపక్షి మేఘమునుంచి పడు నీటిబిందువుకై కనిపెట్టుకొని యున్నట్లు నేను కూడ బాబా తమ దయామృతమును నాపై వర్షించెదరని వారి బోధనలచే నన్ను ఆశీర్వదించెదరని కనిపెట్టుకొని యున్నాను." ఈ యాలోచన వాని మనస్సులో మొదలిన వెంటనే బాబా దానిని గ్రహించెను. భక్తుల మనస్సులో నుండెడి యాలోచనలన్నియు బాబా గ్రహించెడివారు. అంతియేగాక, చెడ్డ యాలోచనలను అణచుచు, మంచి యాలోచనలను ప్రోత్సహించువారు. హేమాడ్ పంతు మనస్సును గనిపెట్టి బాబా వానిని వెంటనే లేపి, శ్యామా వద్దకు పోయి అతనివద్ద 15 రూపాయలు దక్షిణ తీసికొని, అతనితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మనెను. బాబా మనస్సున కారుణ్యోదయమయ్యెను. కాన వారిట్లా ఆజ్ఞాపించిరి. బాబా యాజ్ఞను జవదాట గలవారెవ్వరు?

హేమాడ్ పంతు వెంటనే మసీదు విడచి శ్యామా గృహమునకు వచ్చెను. అప్పుడే యతడు స్నానము చేసి ధోవతి కట్టుకొనుచుండెను. అతడు బయటకి వచ్చి హేమాడ్ పంతునిట్లడిగెను. "మధ్యాహ్న హారతి సమయమందు మీరిక్కడ యేలయున్నారు? మీరు మసీదునుండి వచ్చుచున్నట్లున్నదే! మీరేల చీకాకుతో చంచలముగా నున్నారు? మీరొంటరిగా వచ్చినారేల? కొంతసేపు కూర్చొని విశ్రాంతి చెందుడు. నా పూజను ముగించి వచ్చెదను. ఈలోగా తాంబూలము వేసికొనుడు. పిమ్మట సంతోషముగా కొంతసేపు కూర్చొని మాట్లాడెదము." అట్లనుచు అతడు లోపలికి పోయెను. హేమాడ్ పంతు ముందర వసారాలో కూర్చొనెను. కిటికీలో "నాధభాగవత" మను ప్రసిద్ధ మరాఠీ గ్రంధముండెను. ఇది భాగవతములోని ఏకాదశస్కంధమునకు ఏకనాధుడు వ్రాసిన వ్యాఖ్యానము. సాయిబాబా సిఫారసు చేయుటచే బాపుసాహెబు దీక్షితు ప్రతిదినము శిరిడీలో భగవద్గీత, దాని మరాఠీ వ్యాఖ్యానము "భావార్థదీపిక" లేదా జ్ఞానేశ్వరి (శ్రీ కృష్ణునకు అర్జునునకు జరిగిన సంభాషణ) నాధభాగవతము, (శ్రీ కృష్ణునకు అతని సేవకుడగు ఉద్దవునకు జరిగిన సంభాషణ) భావార్థ రామాయణమును, నిత్యము చదువుచుండెడివాడు. భక్తులు వచ్చి బాబాను ప్రశ్నలు వేయునపుడు బాబా కొంతవరకు జవాబిచ్చి, అటుపైన వారిని ఆ గ్రంధముల పురాణ కాలక్షేపము వినుమనుచుండెను. ఈ గ్రంధములే భాగవత ధర్మములోని ముఖ్యగ్రంధములు. భక్తులు పోయి వినునప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికర సమాధానములు లభించుచుండెను. హేమాడ్ పంతు కూడ నిత్యము నాధభాగవతమును పారాయణము చేయువాడు.

ఆ దినము నిత్యము చదువు భాగము పూర్తి చేయకయే కొందరు భక్తులతో కలసి మసీదుకు పోయెను. శ్యామా ఇంటి కిటికీలోనున్న నాధభాగవతము తీయగా తానానాడు పూర్తిచేయని భాగము తెరచుకొనెను. తన నిత్య పారాయణము పూర్తిచేయుటకే కాబోలు బాబా యచ్చటకు పంపెనని యనుకొనెను. కావున దానిని పూర్తి చేసెను. పిమ్మట శ్యామా తన పూజను ముగించి బయటకి వచ్చెను. వారిరువురికి ఈ దిగువ సంభాషణ జరిగెను.

హేమాడ్ పంతు :- నేను బాబా వద్ద నుండి యొక వార్త తీసికొని వచ్చినాను. నీవద్ద నుండి 15 రూ|| లు దక్షిణ తీసికొని రమ్మని వారు నన్ను అజ్ఞాపించి యున్నారు. కొంతసేపు నీతో కూర్చొని మాట్లాడిన పిమ్మట మసీదుకు రమ్మని యన్నారు.

శ్యామా:- (ఆశ్చర్యముతో) నా వద్ద డబ్బులేదు. నా 15 సాష్టాంగ నమస్కారములు డబ్బునకు బదులుగా తీసికొని బాబా వద్దకు వెళ్ళుము.

హేమాడ్ పంతు:- సరే నీ నమస్కారము లామోదించబడెను. మనము కూర్చొని కొంతసేపు మాట్లాడుకొనెదము. మన పాపములను నశింపచేయునట్టి బాబా లీలలును, కధలను చెప్పుము.

శ్యామా:- అయితే కొంతసేపు కూర్చొనుము. ఈ భగవంతుని (బాబా) లీలలు మిక్కిలి యాశ్చర్యకరమైనవని నీకిదివరకే తెలియును. నేను పల్లెటూరివాడను; నివా చదువుకొన్న పట్టణవాసివి. నీవిక్కడకు వచ్చిన తరువాత కొన్ని లీలలు చూచియే యుందువు. వానిని నీ ముందు నేనెట్లు వర్ణించగలను" సరే యీ తమలపాకులు, వక్క, సున్నము, తీసికొని తాంబూలము వేసికొనుము. నేను లోపలకు బోయి దుస్తులు ధరించి వచ్చెదను.

కొద్ది నిమిషములలో శ్యామా బయటకి వచ్చి హేమాడ్ పంతు తో మాట్లాడుచు కూర్చొనెను. అతడిట్లనియెను. "ఈ భగవంతుని (బాబా) లీల కనుగొనశక్యము కానిది. వారి లీలల కంతులేదు. వాని నెవరు గమనించగలరు? వారీ లీలలతో వినోదించు నట్లగుపడినను వారు వాని నంటినట్లు కాన్పించరు. మావంటి జానపదుల కేమి తెలియును? బాబాయే యీ కధల నెందుకు చెప్పరాదు? మీ వంటి పండితులను నా వంటి మూర్ఖుని వద్ద కేల పంపుచున్నారు? వారి మార్గములు ఊహించరానివి. అవి మానవుల చేష్టలు కావని చెప్పగలను." ఈ ఉపోద్ఘాతముతో శ్యామా యిట్లనెను. "నాకొక కథ జ్ఞాపకమునకు వచ్చుచున్నది. ఇది మీకు చెప్పెదను. నా కది స్వయముగా తెలియును. భక్తుడెంత మనోనిశ్చయముతో పట్టుదలతో నుండునో; బాబా యంత త్వరగా సహాయపడును. ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠినపరీక్ష చేసిన పిమ్మట వారికి ఉపదేశము నిచ్చును. (ఇచ్చట ఉపదేశమనగా నిర్దేశనము.)

ఉపదేశమనుమాట విన్నతోడనే హేమాడ్ పంతు మనస్సులో నొక స్మృతి తళుక్కుమనెను. వెంటనే సాఠేగారి గురుచరిత్ర పారాయణము జ్ఞప్తికి వచ్చెను. తన మనస్సునకు శాంతి కలిగించు నిమిత్తము బాబ తన నచ్చటకు పంపియుండు ననుకొనెను. అయినప్పటికి ఈ భావము నణచుకొని, శ్యామా చెప్పు కధలను వినుటకు సిద్ధపడెను. ఆ కధ లన్నియు బాబాకు తన భక్తులందెట్టి దయాదాక్షిణ్యములు గలవో తెలుపును. వానిని వినగ హేమాడ్ పంతుకు ఒక విధమైన సంతోషము కలిగెను. శ్యామ ఈ దిగువ కధను చెప్పదొడంగెను.

శ్రీమతి రాధాబాయి దేశ్ ముఖ్

రాధాబాయి యను ముసలమ్మ యుండెను. ఆమె ఖాశాబా దేశ్ ముఖ్ తల్లి. బాబా ప్రఖ్యాతి విని ఆమె సంగమనేరు గ్రామ ప్రజలతో కలసి శిరిడీ కి వచ్చెను. బాబా ను దర్శించి మిక్కిలి తృప్తి చెందెను. ఆమె బాబాను గాఢముగ ప్రేమించెను. బాబా ను తన గురువుగా చేసికొని ఏదైన యుపదేశమును పొందవలెనని మనోనిశ్చయము చేసికొనెను. ఆమె కొంకేమియు తెలియకుండెను. బాబ యామెను ఆమోదించక మంత్రోపదేశము చేయనిచో నుపవాసముండి చచ్చెదనని మనోనిశ్చయము చేసికొనెను. ఆమె తన బసలోనే యుండి భోజనము, నీరు మూడుదినములవరకు మానివేసెను. ఆమె పట్టుదలకు నేను (శ్యామా) భయపడి యామె పక్షమున బాబాతో నిట్లంటిని. 'దేవా! మీరేమి ప్రారంభించితిరి? నీ వనేకమంది నిచ్చటకు ఈడ్చెదవు. ఆ ముదుసలిని, నీ వెరిగియే యుందువు. ఆమె మిక్కిలి పట్టుదల గలది. ఆమె నీపైన ఆధారపడి యున్నది. ఆమె చచ్చువరకు ఉపవసింప నిశ్చయించుకొని యున్నది. నీవు ఆమె నామోదించి ఉపదేశమిచ్చునంతవరకు కామె యిట్లు చేయనున్నది. ఏమైన హాని జరిగినచొ ప్రజలు నిన్నే నిందించెదరు. నీవు తగిన ఆదేశ మివ్వకపోవుటచే ఆమె చచ్చినదని లోకులనెదరు. కాబట్టి యామెను కరుణించుము. ఆశీర్వదించుము. తగిన సలహా యిమ్ము." ఆమె మనోనిశ్చయమును జూచి, బాబా యామెను బిలిపించి, ఈ క్రింది విధముగా బోధించి యామె మనస్సును మార్చెను.

"ఓ తల్లీ! అనవసరమైన యాతన కేల పాల్పడి చావును కోరుచున్నావు? నీవు నిజముగ నా తల్లివి; నేను నీ బిడ్దను. నా యందు కనికరించి నేను చెప్పునది పూర్తిగా వినుము. నీకు నా వృత్తాంతమంత చెప్పెదను. నీవు దానిని బాగా వినినచో నీ కది మేలు చేయును. నాకొక గురువుండెను. వారు గొప్ప యోగీశ్వరులు; మిక్కిలి దయార్దృఅ హృదయులు. వారికి చాలాకాలము శుశ్రూష చేసితిని. కాని నా చెవిలో వారే మంత్రము నిడలేదు. వారిని విడుచు తలపే లేకుండెను. వారితోనే యుండుటకు, వారిసేవ చేయుటకు, వారివద్ద కొన్ని ఉపదేశములను గ్రహించుటకు నిశ్చయించుకొంటిని. కాని వారి మార్గము వారిది. వారు నా తల కొరిగించిరి; రెండు పైసలు దక్షిణ యడిగిరి. వెంటనే యిచ్చితిని. "మీ గురువుగారు పూర్ణకాము లయినచో వారు మిమ్ములను దక్షిణ యడుగనేల? వారు నిష్కాములని యెట్లనిపించుకొందురు?" అని మీరడుగవచ్చును. దానికి సమాధానము సూటిగా చెప్పగలను. వారు డబ్బును లక్ష్యపెట్టేవారు కారు. ధనముతో వారు చేయున దేమున్నది? వారు కోరిన రెండు కాసులు 1.దృఢమైన విశ్వాసము 2. ఓపిక లేదా సహనము. నేనీ రెండు కాసులను లేదా వస్తువులను వారి కర్పించితిని. వారు సంతోషించిరి.

నా గురువును 12 సంవత్సరములు ఆశ్రయించితిని. వారు నన్ను పెంచిరి. భోజనము నకుగాని వస్త్రమునకుగాని నాకు లోటు లేకుండెను. వారు పరిపూర్ణులు. వారిది ప్రేమావతారమని చెప్పవచ్చును. నేను వారి నెట్లు వర్ణించగలను? వారు నన్ను మిక్కిలి ప్రేమించెడివారు. ఆ విధమైన గురువే యుండరు. నేను వారిని జూచునప్పుడు, వారు గొప్ప ధ్యానములో నున్నట్లు గనుపించుచుండిరి. మేమిద్దరమానందములో మునిగెడివారము. రాత్రింబవళ్ళు నిద్రాహారములు లేక నేను వారివైపు దృష్టి నిగిడ్చితిని. వారిని చూడనిచో నాకు శాంతి లేకుండెను. వారి ధ్యానము వారి సేవ తప్ప నాకింకొకటి లేకుండెను. వారే నా యాశ్రయము. నా మనస్సు ఎల్లప్పుడు వారియందే నాటుకొని యుండెడిది. ఇదియే ఒక పైసా దక్షిణ. సాబూరి (ఓపిక) యనునది రెండవ పైసా. నేను మిక్కిలి యోరిమి తో చాలకాలము కనిపెట్టుకొని వారి సేవ చేసితిని. ఈ ప్రపంచమనే సాగరమును ఓపిక అను ఓడ నిన్ను సురక్షితముగా దాటించును. సాబూరి యనునది పురుషలక్షణము. అది పాపము లన్నిటిని తొలగించును; కష్టములను పారద్రోలును. అనేక విధముల అవాంతరముల తొలగించి, భయమును పారద్రోలును. తుదకు జయమును కలుగజేయును. సాబూరి యనునది సుగుణములకు గని, మంచి యాలోచనకు తోడువంటిది. నిష్ట (నమ్మకము), సాబూరి (ఓపిక) అన్యోన్యము ప్రేమించు అక్కచెల్లెండ్ర వంటివారు.

నా గురువు నానుండి యితర మేమియు నాశించియుండలేదు. వారు నన్ను ఉపేక్షింపక సర్వకాలసర్వావస్థలయందు కాపాడుచుండెడి వారు. నేను వారితో కలసి యుండెడివాడను. ఒక్కొక్కప్పుడు వారిని విడిచి యుండినను వారి ప్రేమకు ఎన్నడును లోటు కలుగలేదు. వారు తమ దృష్టిచేతనే నన్ను కాపాడుచుండెడివారు. తాబేలు తన పిల్లలను కేవలము దృష్టితో పెంచునట్లు నన్ను కూడ మా గురువు దృష్టితో పోషించుచుండెడివారు. తల్లి తాబేలు ఒక ఒడ్డున నుండును. బిడ్డ తాబేలు రెండవ యొడ్డున ఉండును. తల్లి తాబేలు, పిల్ల తాబేలు అహారము పెట్టుటగాని పాలిచ్చుటగాని చేయదు. తల్లి పిల్లలపై దృష్టిని పోనిచ్చును. పిల్లలెదిగి పెద్దవి యగును. అట్లనే మా గురువుగారు తమ దృష్టిని నాయందు నిల్పి నన్ను ప్రేమతో గాపాడిరి. ఓ తల్లి! నా గురువు నాకు మంత్రమేమియు ఉపదేశించలేదు. నేను నీ చెవిలో మంత్రమెట్లు ఊదగలను? గురువుగారి ప్రేమమయమయిన తాబేలు చూపే మనకు సంతోషము నిచ్చునని జ్ఞాపక ముంచుకొనుము. మంత్రముగాని యుపదేశముగాని ఎవ్వరివద్దనుంచి పొందుటకు ప్రయత్నించకుము. నీ యాలోచనలు నీ చేష్టలు నాకొరకే వినియోగించుము. నీవు తప్పక పరమార్థము పొందెదవు. నా వైపు సంపూర్ణహృదయముతో చూడుము. నేను నీ వైపు అట్లనే చూచెదను. ఈ మసీదులో కూర్చొని నేను నిజమునే చెప్పెదను. నిజము తప్ప మరేమియు మాట్లాడను. ఏ సాధనములుగాని యారు శాస్త్రములలో ప్రావీణ్యముగాని యవసరము లేదు. నీ గురువు నందు నమ్మకము విశ్వాసము నుంచుము. గురువే సర్వమును చేయువాడని కర్తయనియు పూర్తిగా నమ్ముము. ఎవరయితే గురువు యొక్క మహిమను, గొప్పదనమును గ్రహించెదరో, ఎవరయితే గురువు హరిహరబ్రహ్మల (త్రిమూర్తుల) యవతారమని ఎంచెదరో వారే ధన్యులు."

ఈ ప్రకారముగా ఉపదేశించి బాబా యా ముసలమ్మ ను ఒప్పించెను. ఆమె బాబాకు నమస్కరించి యుపవాసమును ఒదలుకొనెను.

ఈ కధను జాగ్రర్తగాను, శ్రద్ధగాను విని దాని ప్రాముఖ్యమును, సందర్భమును గుర్తించి, హేమాడ్ పంతు మిక్కిలి యాశ్చర్యపడెను. ఈ యాశ్చర్యకరమైన బాబా లీలను జూచి అతని ఆపాద మస్తకము పులకరించెను. సంతోషముతో నుప్పొంగెను. గొంతుక యారిపోయెను. ఒక్క మాటైన మాట్లాడుటకు చేతకాకుండెను. శ్యామా అతని నీ స్థితిలో జూచి "ఏమి జరిగినది; ఏలా యూరకున్నావు? అట్టి బాబా లీలలు నీకెన్ని వర్ణించవలెను?" అని యడిగెను.

అదే సమయమందు మసీదులో గంట మ్రోగెను. మధ్యాహ్న హారతి పూజ ప్రారంభమయ్యెనని గ్రహించిరి. కనుక శ్యామా, హేమాడ్ పంతు మసీదుకు త్వరగా పోయిరి. బాపుసాహెబు జోగు అప్పుడే హారతి ప్రారంభించెను. స్త్రీలు మసీదు నిండిరి. దిగువ ఖాళీ జాగాలో పురుషులు నిండిరి. అందరు బాజాభజంత్రీలతో నొకే వరుసతో హారతి పాడుచుండిరి. బాబాకు కుడివైపు శ్యామా; ముందర హేమాడ్ పంతు కూర్చొనిరి. వారిని జూచి బాబా హేమాడ్ పంతును శ్యామా యిచ్చిన దక్షిణ నిమ్మనెను. శ్యామా రూపాయలకు బదులు నమస్కారముల నిచ్చిననియు, శ్యామా ప్రత్యక్షముగా గలడు కనుక అడుగవచ్చుననెను. బాబా ఇట్లనెను, "సరే, మీరిద్దరు కొంతసేపు మాట్లాడితిరా అట్లయినచో మేరేమి మాట్లాడితిరో చెప్పుము." గంటల చప్పుడును, మద్దెల శబ్దమును, పాటల ధ్వనిని లెక్కింపక హేమాడ్ పంతు బాబాకు జరిగిన దంతయు చెప్పుటకు ఆతురపడెను. తాము ముచ్చటించిన దంతయు చాలా ఆనందము కలుగుజేసినదనియు ముఖ్యముగా ముసలమ్మ కధ మిక్కిలి యాశ్చర్యము కలుగజేసినదనియు, దానిని విని బాబా లీలలు అగోచరమని, తెలిసికొంటిననియు, ఆ కధ రూపముతో తన్ను బాబా ఆశీర్వదించిరని హేమాడ్ పంతు చెప్పెను. అప్పుడు బాబా యిట్లనియె, "కధ చాల అద్భుతమైనది. నీ వెట్లు ఆనందించితివి? నాకా విషయమై వివరములన్నియు చెప్పుము." అప్పుడు హేమాడ్ పంతు తానింతకుముందు విన్న కధను పూర్తిగా బాబాకు వినిపించి, యది తన మనమునందు శాశ్వత ప్రభవమును కలిగించినదని చెప్పెను. ఇది విని బాబా మిగుల సంతసించెను. "ఆ కధ నీకు నచ్చినదా? దాని ప్రాముఖ్యమును నీవు గుర్తించితివా?" యని బాబా హేమాడ్ పంతు నడిగెను. "అవును బాబా! నా మనశ్చాంచల్యము నిష్క్రమించినది. నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగినది. సత్య మార్గమును కనుగొనగలిగితిని." అని హేమాడ్ పంతు బదులిచ్చెను.

బాబా యిట్లు చెప్పెను. "నా పద్దతి మిక్కిలి విశిష్టమైనది. ఈ ఒక్క కధను జ్ఞప్తియందుంచుకొనుము. అది మిక్కిలి యుపయోగించును. ఆత్మసాక్షాత్కారమునకు ధ్యాన మవసరము. దాని నలవరచు కొన్నచో వృత్తులన్నియు శాంతించును. కోరికలన్నియు విడచి నిస్కామివై, నీవు సమస్త జీవరాశియందుగల భగవంతును ధ్యానించుము. మనస్సు ఏకాగ్రమైనచో లక్ష్యము నెరవేరును. సదా నా నిరాకార స్వభావమును ధ్యానించిన అదియే జ్ఞానస్వరూపము; చైతన్యము ఆనందము. మీరిది చేయలేనిచో మీరు రాత్రింబవళ్ళు చూచుచున్న నా యాకారమును ధ్యానించుడు. మీరిట్లు కొన్నాళ్ళు చేయగా మీ వృత్తులు కేంద్రీకృతమగును. ధ్యాత, ధ్యానము, ధ్యేయము అను మూడింటికి గల భేధము పోయి ధ్యానించువాడు, చైతన్యముతో నైక్యమై, బ్రహ్మముతో నభిన్నమగును. తల్లి తాబేలు నదికి ఒక యొడ్డున నుండును. దాని పిల్లలింకొక యొడ్డున నుండును. వానికి పాలిచ్చుటగాని, పొదువుకొనుటగాని చేయదు. దాని చూపు మాత్రమే వానికి జీవశక్తి నిచ్చుచున్నది. చిన్న తాబేళ్ళు ఏమీ చేయక తల్లిని జ్ఞాపకముంచుకొనును. తల్లి తాబేలు చూపు చిన్నవానికి యమృతధారవలె పని చేయును. అదియే వాని బ్రతుకునకు సంతోషమున కాధారము. గురువునకు శిష్యునకు గల సంబంధము ఇట్టిదే." బాబా యీ మాటలు పూర్తి చేయుసరికి, హారతి పూర్తి యాయెను. అందరు "శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహారాజ్ కీ జై" యని కేక పెట్టిరి. ఓ ప్రియమైన చదువరులారా! యీ సమయమందు మనముకూడ మసీదులోని గుంపులో కలసి యున్నట్లు భావించి మనము కూడ జయజయ ధ్వనులలో పాల్గొందము.

హారతి పూర్తి కాగానే, ప్రసాదము పంచి పెట్టిరి. బాబాకు నమస్కరించి బాపుసాహెబు జోగ్ బాబా చేతిలో కలకండ ముక్కను పెట్టెను. బాబా దానినంతను హేమాడ్ పంతు చేతిలో పెట్టి యిట్లనెను. "ఈ కధను నీవు మనసుకు పట్టించుకొని జ్ఞప్తి యందుంచుకొనినచో, నీ స్థితి కలకండ వలే తియ్యగా నుండును. నీ కోరికలన్నియు నెరవేరును. నీవు సుఖముగా నుందువు." హేమాడ్ పంతు బాబాకు సాష్టాంగనమస్కారము చేసి "ఇట్లు ఎల్లప్పుడు నాకు మేలు చేయుము, ఆశీర్వదించుము. కాపాడుము." అని బతిమాలెను. అందుకు బాబా యిట్లు జవాబిచ్చెను. "ఈ కధను వినుము. దీనిని మననము చేయుము. నిధిధ్యాసనము చేయుము. అట్లయినచో నీవు భగవంతుని ఎల్లప్పుడు జ్ఞప్తియందుంచుకొని ధ్యానించెదవు. భగవంతుడు నీ ముందర ప్రత్యక్షమగును."

ఓ ప్రియమైన చదువరులారా! అప్పుడు హేమాడ్ పంతుకు కలకండ ప్రసాదము దొరికెను. ఇప్పుడు మనము ఈ కధయనే కలకండ ప్రసాదము పొందెదము. దానిని హృదయపూరితముగా త్రాగి, ధ్యానించి, మనస్సున నిలిపెదము. ఇట్లు బాబా కృపచే బలముగాను సంతోషముగాను నుండెదము. తధాస్తు.

19 వ అధ్యాయము చివర హేమాడ్ పంతు కొన్ని యితర విషయములను జెప్పియున్నారు. అవి యీ దిగువ పొందుపరచితిమి.

మన ప్రవర్తన గూర్చి బాబా యుపదేశము.

ఈ దిగువ చెప్పిన బాబా పలుకులు సాధారనణమైనవయినప్పటికి అమూల్యములు. వానిని మనస్సునందుంచుకొని యట్లే చేసినచో, నవి మనకు మేలు చేయును. "ఏదైన సంబంధ ముండనిదే యొకరు ఇంకొకరి వద్దకు పోరు. ఎవరుగాని యెట్టి జంతువుగాని నీ వద్దకు వచినచో నిర్ధాక్షిణ్యముగా వానిని తరిమివేయకుము. వానిని చక్కగ ఆహ్వానించి తగిన మర్యాదతో చూడుము. నీవు దాహము గలవారికి నీరిచ్చినచో, ఆకలితో నున్న వారికి అన్నము పెట్టినచో, దిగంబరులకు గుడ్డ లిచ్చినచో, నీ వసారా యితరులు కూర్చొనుటకు విశ్రాంతి తీసికొనుటకు వినియోగించినచో నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతిజెందును. ఎవరైన ధనముకొరకు నీ వద్దకు వచ్చినచో, నీ కిచ్చుట కిష్టము లేకున్నచో నీవు యివ్వనక్కరలేదు, కాని వానిపై కుక్కవలే మొరగవద్దు. ఇతరులు నిన్నెంతగా నిందించినను, నీవు కఠినముగా జవాబు నివ్వకుము. అట్టి వానిని నీవెల్లప్పుడు ఓర్చుకొనినచో నిశ్చయముగా నీకు సంతోషము కలుగును. ప్రపంచము తలక్రిందులై నప్పటికి నీవు చలించకుము. నీవున్న చోటనే స్థైర్యముగా నిలచి, నెమ్మదిగా నీ ముందర జరుగుచున్న నాటకమును చూచుచుండుము. నీకు నాకు మధ్య గల గోడను నిర్మూలించుము. అప్పుడు మన మిద్దరము కలియు మార్గ మేర్పడును. నాకు నీకు భేధము గలదనునదియే భక్తుని గురువునకు దూరముగా నుంచుచున్నది. దానిని నశింపజేయునది మన ఐక్యత కలుగదు. "అల్లా మాలిక్" భగవంతుడే సర్వాధికారి. ఇతరులెవ్వరు మనలను కాపాడువారు కారు. భగవంతుని మార్గమసామాన్యము; మిక్కిలి విలువైనది; కనుగొనవీలులేనిది. వారి యిచ్చానుసారమే మనము నడచెదము. మన కోరికలను వారు నెరవేర్చెదరు. మనకు దారి చూపెదరు. మన ఋణానుబంధముచే మనము కలిసితిమి. ఒకరి కొకరు తోడ్పడి ప్రేమించి సుఖముగాను, సంతోషముగాను నుందము గాక. ఎవరయితే తమ జీవితపరమావధిని పొందెదరో వారు అమరులై సుఖముగా నుండెదరు. తక్కినవారందరు పేరునకే ఊపిరి సలుపువరకు మాత్రమే బ్రతికెదరు.

సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారిచూపుట

సాయిబాబా సద్విచారముల నెట్లు ప్రోత్సహించుచుండెనో తెలిసికొనుట మిగుల ఆసక్తికరముగా నుండును. భక్తి ప్రేమలతో వారికి సర్వస్యశరణాగతి చేసినచో వారు నీ కెట్లు పదే పదే సహాయపడెదరో తెలియును. ప్రక్కనుంచి లేవగనే నీ కేమయిన మంచి యాలోచన కలిగిన, తరువాత పగలంతయు దానిని వృద్ధిచేసినచో నీ మేధాశక్తి వృద్ధి పొందును. నీ మనస్సు శాంతి పొందును. హేమాడ్ పంతు దీనికై ప్రయత్నించదలచెను. ఒక బుధవారము రాత్రి పండుకొనేటప్పుడిట్లనుకొనెను. రేపు గురువారము. శుభదినము. శిరిడి పవిత్రమైన స్థలము కావున రేపటి దినమంతయు రామనామ స్మరణతోనే కాలము గడపెదను అని నిశ్చయించుకొని పరుండెను. ఆ మరుసటి దినము లేవగనే, రామనామము ప్రయత్నము లేకుండ జ్ఞప్తికి వచ్చెను. అతడు మిక్కిలి సంతసించెను. కాలకృత్యములు దీర్చుకొనిన పిమ్మట బాబాను జూచుటకు పువ్వులను దీసికొని పోయెను. దీక్షిత్ వాడా విడిచి బుట్టీవాడా దాటుచుండగా ఒక చక్కని పాట నివబడెను. ఔరంగబాదునుంచి వచ్చినవాడొకడు మసీదులో బాబా ముందర పాడుచుండెను. అది ఏకనాధుడు పాడినపాట "గురుకృపాంజన పాయో మేరే భాయి" యనునది. గురువు కృపయను అంజనము లభించెననియు దాని మూలమున తన కంట్లు తెరువబడి నవనియు, దానిచే తాను శ్రీ రాముని లోన, బయట, నిద్రావస్థలోను, జాగ్రదవస్థలోను, స్వప్నావస్థలోను నన్నిచోట్లను చూచితినని చెప్పెడు పాట యది. అనేక పాటలుండగ బాబా భక్తుడగు ఔరగాబాదునివాసి యీ పాట నేల పాడెను? ఇది సందర్భానుసారముగ బాబా చేసిన ఏర్పాటు కాదా? హేమాడ్ పంతు ఆనాడంతయు రామనామస్మరణచే కాలము గడుప నెంచినవాడు గావున నాతని మనోనిశ్చయమును దృఢపరచుటకై బాబా యీ పాటను పాడించియుండును.

రామ నామస్మరణఫలితమును గూర్చి యోగిశ్వరులందరిది ఒకే భావము. అది భక్తుల కోరికలు నెరవేర్చి వారిని కష్టముల నుండి కాపాడును.

ఉపదేశములో వైవిధ్యము - నిందగూర్చి బోధ

ఉపదేశించుటకు సాయిబాబాకు ప్రత్యేకస్థలముగాని, ప్రత్యేక సమయముగాని యక్కర్లేదు. ఏదైన యవకాశము కలిగినప్పుడు అవసరము వచ్చినప్పుడెల్ల వారు విరివిగా బోధించువారు. ఒకనాడు భక్తుడొకడు ఇంకొక భక్తునిగూర్చి పరోక్షమున ఇతరులముందు నిందించుచుండెను. ఒప్పులు విడిచి భక్తసోదరుడు చేసిన తప్పులనెన్నుచుండెను. మిక్కిలి హీనముగా తిట్టుటచే విన్నవారు విసిగిరి. అనవసరముగ కొందరితరులను నిందించుటచే అసూయ, దురభిప్రాయము మొదలగునవి కలుగును. యోగులు నిందల నింకొకవిధముగ భావించెదరు. మలినమును పోగొట్టుటకు కనేకమార్గములు గలవు. మట్టి, నీరు, సబ్బులుతో మాలిన్యము కడుగవచ్చును. పరులను నిందించువాని మార్గము వేరు. ఇతరుల మలినములను వాడు తన నాలికతో శుభ్రపరచును. ఒకవిధముగా వాడు నిందించువానికి సేవ చేయుచున్నాడు. ఎట్లన, వాని మలినమును వీడు తన నాలుకతో శుభ్రపరచుచున్నాడు. గావున తిట్టబడివవాడు, తిట్టిన వానికి కృతజ్ఞతలు తెలుపవలెను. నిందించువానిని బాబా సరిదిద్దు పద్ధతి విశిష్టమైనది. నిందించువాడు చేసిన యపరాధమును బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించెను. లెండీతోటకు బోవునప్పుడు మిట్టమధ్యాహ్నము వాడు బాబాను కలిసెను. బాబా వానికొక పందిని చూపి ఇట్లనెను. "చూడుము! ఈ పంది కసుపును ఎంత రుచిగా తినుచున్నదొ! నీ స్వభావమట్టిది. నీ మనస్ఫూర్తిగా నీ సోదరునే తిట్టుచున్నావు. ఎంతయో పుణ్యము జేయగ నీకు మానవ జన్మ లభించినది. ఇట్లుచేసినచో శిరిడి నీకు తోడ్పడునా?" భక్తుడు నీతిని గ్రహించి వెంటనే పోయెను.

ఈ విధముగ బాబా సమయము వచ్చినప్పుడెల్ల ఉపదేశించు చుండెడివారు. ఈ యుపదేశములను మనస్సునందుంచుకొని పాటించినచో ఆత్మసాక్షాత్కారము దూరము కాదు. ఒక లోకోక్తి కలదు. "నా దేవుడున్నచో నాకు మంచముపైని కూడ బువ్వ పెట్టును." ఇది భోజనము, వస్త్రములగూర్చి చెప్పినది. ఎవరయిన దీనిని ఆధ్యాత్మిక విషయమై నమ్ముకొని ఊరకున్నచో చెడిపోయెదరు. ఆత్మసాక్షాత్కారమునకై సాధ్యమైనంత పాటు పడవలెను. ఎంతకృషి చేసిన నంత మేలు.

బాబా తాను సర్వాంతర్యామినని చెప్పెడివారు. అన్నిటియందు అనగ భూమి, గాలి, దేశము, ప్రపంచము, వెలుతురు, స్వర్గములందు వారు గలరు. అతడు అనంతుడు. బాబా మూడున్నర మూరల శరీరమని యనుకున్నవారికి పాఠము చెప్పుటకే వారు ఈ రూపములో నవతారమెత్తిరి. ఎవరైన సర్వస్వశరణాగతి చేసి రాత్రింబవళ్ళు వారిని ధ్యానించినచో, చక్కెర, తీపి, కెరటములు సముద్రము, కన్ను కాంతి, కలిసి యున్నట్లే అనుభవము పొందెదరు. ఎవరయితే చావుపుట్టుకలనుండి తప్పించుకొనుటకు ప్రయత్నించెదరో వారు శాంతము స్థిరమైన మనస్సుతో ధార్మికజీవనము గడుపవలెను. ఇతరుల మనస్సు బాధించునట్లు మాట్లాడరాదు. మేలొనరించు పనులనే చేయుచుండవలెను. తన కర్తవ్యకర్మల నాచరించుచు భగవంతునికి సర్వస్యశరణాగతి చేయవలెను. వాడు దేనికి భయపడనవసరము లేదు. ఎవరయితే భగవంతుని పూర్తిగా నమ్మెదరో, వారి లీలలను విని, యితరులకు చెప్పెదరో, ఇతరవిషయములేమియు నాలోచించరో, వారు తప్పక ఆత్మసాక్షాత్కారము పొందుదురు. అనేకమందికి బాబా నామమును జ్ఞప్తియందుంచుకొని, శరణువేడుమనెదరు. "తానెవరు" అనుదానిని తెలిసికొనగోరువారికి శ్రవణమును, మననమును చేయుమని సలహా నిచ్చెడివారు. కొందరికి భగవన్నామమును జ్ఞప్తియందుంచుకొనుమనువారు. కొందరికి తమ లీలలను వినుట, కొందరికి తమ పాదపూజ, కొందరికి ఆధ్యాత్మరామాయణము, జ్ఞానేశ్వరి మొదలగు గ్రంధములు చదువుట, కొందరికి తమ పాదములవద్ద కూర్చొనుట, కొందరిని ఖండోబా మందిరమునకు బంపుట, కొందరికి విష్ణుసహస్రనామములు, కొందరికి ఛాందోగ్యోపనిషత్తు, భగవద్గీత పారాయణ చేయుమని విధించుచుండెను. వారి యుపదేశములకు పరిమితి లేదు; అడ్డు లేదు. కొందరికి స్వయముగ నిచ్చువారు; కొందరికి స్వప్నములో నిచ్చేవారు. ఒక త్రాగుబోతుకు స్వప్నములో గనిపించి, ఛాతిపైన కూర్చొని, దానిని నొక్కివేసి ఎన్నడు త్రాగనని వాగ్దానము చేసినపిమ్మట వదలెను. కొందరికి స్వప్నములో "గురుబ్రహ్మాది" మంత్రార్థముల బోధించెను. ఒకడు హఠ యోగము చేయుచుండగా దానిని మానుమనెను. వారి మార్గములను జెప్పుట కలవి గాదు. ప్రపంచవిషయములో తమ ఆచరణలే ఉదాహరనముగా బోధించువారు. అట్టి వానిలో ఒకటి.

కష్టమునకు కూలి

ఒకనాడు మిట్టమధ్యాహ్నము బాబా, రాధాకృష్ణమాయి యింటి సమీపమునకు వచ్చి "నిచ్చెన తీసికొని రమ్ము" అనెను. ఒకడు పోయి దానిని తెచ్చి యింటికి చేరవేసెను. బాబా వామనగోడ్ కర్ యింటి పైకప్పు ఎక్కి రాధాకృష్ణమాయి యింటి పైకప్పును దాటి, ఇంకొక ప్రక్క దిగెను. బాబా యభిప్రాయమేమో ఎవరికీ తెలియలేదు. రాధాకృష్ణమాయి మలేరియా జ్వరముతో నుండెను. అమె జ్వరమును తొలగించుటకై బాబా యిట్లు చేసియుండును. దిగిన వెంటనే బాబా రెండు రూపాయలు నిచ్చెన తెచ్చినవాని కిచ్చెను. ఎవడో ధైర్యముచేసి నిచ్చెన తెచ్చినంతమాత్రమున వనికి రెండు రూపాయలేల యివ్వవలెనని బాబాను ప్రశ్నించెను. ఒకరి కష్టము నింకొకరుంచుకొనరాదు. కష్టపడువాని కూలి సరిగాను దాతృత్వముతోను ధారాళముగ నివ్వవలెనని బాబా చెప్పెను. బాబా సలహా ప్రకారము ప్రవర్తించినచో కూలి వాడు సరిగా పని చేయును. పని చేయించేవాడు, పని చేసేవారలుకూడ సుఖపడెదరు. సమ్మెలకు తావుండదు. మదుపు పెట్టువానికి, కష్టపడి కూలి చేయువాండ్రకు మనస్పర్థలుండవు.

ఓం నమో శ్రీ సాయినాధాయ

శాంతిః శాంతిః శాంతిః

18, 19 అధ్యాయములు సంపూర్ణము.