శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము - పి.నారాయణరావు Back   Home 

రెండవ అధ్యాయము

ఈ గ్రంధరచనకు కారణము, పూనుకొనుటకు అసమర్థతయు అధైర్యము; గొప్పవివాదము; హేమాండ్ పంతు అను బిరుదు ప్రదానము; గురువుయొక్క యావశ్యకత.

ఈ గ్రంధరచనకు ముఖ్యకారణము

మొదటి యధ్యాయములో గోధుమలను విసరి యా పిండిని ఊరిబయట చల్లి కలరా జాడ్యమును తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించితిని. ఇదేగాక శ్రీ సాయి యొక్క యితర మహిమలు విని సంతోషమిచితిని. ఆ సంతోషమే నన్నీ గ్రంధము వ్రాయుటకు వురికొల్పినది. ఇందేగాక బాబా గారి వింతలీలలను చర్యలును మనస్సున కానందము కలుగజేయును. అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును. తుదకు పాపములను బోగొట్టును గదా యని భావించి బాబాయొక్క పవిత్ర జీవితమును, వారి బోధలును వ్రాయ మొదలిడితిని. యోగీశ్వరుని జీవితచరిత్ర తర్కమును న్యాయమును కాదు. అది మనకు సత్యము, ఆధ్యాత్మికమునైన మార్గమును జూపును.

పూనుకొనుటకు అసమర్ధతయు, ధైర్యము

ఈ పనిని నెరవేర్చుటకు తగిన సమర్ధతగలవాడను కానని హేమాడ్ పంతు అనుకొనెను. అతడిట్లనియెను. "నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవితచరిత్రయే నాకు తెలియదు. నా మనస్సే నాకు గోచరము కాకున్నది. ఇట్టి స్థితిలో యోగీశ్వరుని చరిత్రను ఎట్లు వ్రాయగలుగుదును? అవతారపురుషుల లక్షణముల నెట్లు వర్ణించగలను? వేదములే వారిని పొగడలేకుండెను. తాను యోగియయినగాని యోగి యొక్క జీవితమును గ్రహించ జాలడు. అట్టిచో వారి మహిమలు నేనెట్లు కీర్తించగలను? సప్తసముద్రముల లోతును గొలువవచ్చును ఆకాశమును గుడ్డలో వేసి మూయవచ్చును. కానీ యోగిశ్వరుని చరిత్ర వ్రాయుట బహుకష్టము. ఇది గొప్ప సాహసకృత్యమని నాకు తెలియును. నలుగురు నవ్వునట్లు అగుదునేమోయని భయపడి శ్రీ సాయిశ్వరుని అనుగ్రహముకొరకు ప్రార్ధించితిని.

మహారాష్ట్ర దేశములోని మొట్టమొదటికవియు, యోగీశ్వరుడునగు జ్ఞానేశ్వరమహారాజు యోగులచరిత్ర వ్రాసినవారిని భగవంతుడు ప్రేమించునని చెప్పియున్నారు. ఏ భక్తులు యోగుల చరిత్రములు వ్రాయ కుతూహలపడెదరో వారి కోరికలను నెరవేరునట్లు వారి గ్రంధములు కొనసాగునట్లు చేయుటకు యోగులనేక మార్గముల నవలంభించెదరు. యోగులే యట్టిపనికి ప్రేరేపింతురు. దానిని నెరవేర్చుట భక్తుని కారణమాత్రునిగా నుంచి వారివారి కార్యములను వారే కొనసాగించుకొనెదరు. 1700 శ.క. సంవత్సరములో మహీపతి పండితుడు యోగీశ్వరుల చరిత్రలను వ్రాయుటకు కాంక్షించెను. యోగులతనిని ప్రోత్సహించి, కార్యమును కొనసాగించిరి. అట్లే 1800 శ.క. సంవత్సరములో దాసగణుయొక్క సేవను ఆమోదించిరి. మహీపతి నాలుగు గ్రంధములను వ్రాసెను. అవి భక్తవిజయము, సంతవిజయము, భక్తలీలామృతము, సంతలీలామృతము అనునవి. దాసగణు వ్రాసినవి భక్తలీలామృతము, సంతకధామృతమును మాత్రమే. ఆధునిక యోగులు చరిత్రలు వీనియందు గలవు. భక్తలీలామృతములోని 31,32, 33 అధ్యాయములందును, సంతకధామృతములోని 57వ యధ్యాయమందును సాయిబాబా జీవితచరిత్రయు, వారి బోధలును చక్కగా విశదీకరింపబడినవి. ఇవి సాయిలీలా మాసపత్రిక, సంచికలు 11,12, సంపుటము 17 నందు ప్రచురితము. చదువరులు ఈ యధ్యాయములు కూడ పఠించవలెను. శ్రీ సాయిబాబా అద్భుతలీలలు బాంద్రా నివాసియగు సావిత్రి బాయి రఘునాధ్ తెండూల్కర్ చే చక్కని చిన్న పుస్తకములో వర్ణింపబడినవి. దాసగణు మహారాజుగారు కూడ శ్రీ సాయి పాటలు మధురముగా వ్రాసియున్నారు. గుజరాత్ భాషలో అమిదాసు భవాని మోహతా అను భక్తుడు శ్రీ సాయి కధలను ముద్రించినారు. సాయినాధ ప్రభ అను మాసపత్రిక శిరిడీలోని దక్షిణ భిక్ష సంద్థవారు ప్రచురించి యిన్నారు. ఇన్ని గ్రంధములుండగా ప్రస్తుత సచ్చరిత్ర వ్రాయుటకు కారణమేమైయుండును? దాని యవసరమేమి? యని ప్రశ్నింపవచ్చును.

దీనికి జవాబు మిక్కిలి తేలిక. సాయిబాబాజీవితచరిత్ర సముద్రము వలే విశాలమైనది; లోతైనది. అందరు దీనియందు మునిగి భక్తి జ్ఞానములను మణులను తీసి కావలసినవారికి పంచిపెట్టవచ్చును. శ్రీ సాయిబాబా నీతిబోధకమగు కధలు, లీలలు మిక్కిలి యాశ్చర్యము కలుగజేయును. అవి మనోవికలత పొందిన వారికి విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి యానందము కలుగజేయును. ఇహపరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును. వేదములవలే రజకములు ఉపదేశకములునునగు బాబాప్రబోధలు విని, వానిని మననము చేసినచో భక్తులు వాంచించునవి అనగా బ్రహ్మైక్యయోగము, అష్టంగయోగ ప్రావీణ్యము, ధ్యానానందము పొందెదరు. అందుచే బాబా లీలలను పుస్తకరూపమున వ్రాయ నిశ్చయించితిని. బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగుల ఆనందము కలుగజేయును. అందుచేత బాబా గారి యాత్మసాక్షాత్కారఫలితమగు పలుకులు, బోధలు సమకూర్చుటకు పూనుకొంటిని. సాయిబాబాయే యీ కార్యమునకు నన్ను ప్రోత్సహించెను. నా యహంకారమును వారి పాదములపై నుంచి శరణంటిని. కావున నా మార్గము సవ్యమైనదనియు బాబా యిహపరసౌఖ్యములు తప్పక దయచేయుననియు నమ్మియుంటిని.

నేను నా యంతట ఈ గ్రంధరచనకు బాబా యొక్క యనుమతిని పొందలేకుంటిని. మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామా అను వారు బాబాకు ముఖ్యభక్తుడు. వారిని నా తరఫున మాట్లాడుమంటిని. నా తరఫున వారు బాబాతో నిట్లనిరి. "ఈ అన్నాసాహెబు మీ జీవితచరిత్రను వ్రాయ కామ్కించుచున్నాడు. భిక్షాటనముచే జీవించు ఫకీరును నేను, నా జీవితచరిత్ర వ్రాయనవసరము లేదని యనవద్దు. మీరు సమ్మతించి సహాయపడినచో వారు వ్రాసెదరు. లేదా మీ కృపయే దానిని సిద్ధింపజేయును. మీ యొక్క యనుమతి యాశీర్వాదము లేనిదే యేదియు జయప్రదముగా చేయలేము." సాయిబాబా దీనిని వినినంతనే మనస్సు కరిగి నాకు ఊదీ ప్రసాదము పెట్టి యాశీర్వదించెను. మరియు నిట్లు చెప్ప దొడంగెను. "కధను, అనుభవములను, ప్రోగు చేయుమను. అక్కడక్కడ కొన్ని ముఖ్యవిషయములను టూకీగా వ్రాయుమను. నేను సహాయము చేసెదను. వాడు కారణమాత్రుడే కానీ నా జీవితచరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలెను. వాడు తన యహంకారమును విడువవలెను. దానిని నా పాదములపైన బెట్టవలెను. ఎవరయితే వారి జీవితములో నిట్లు చేసెదరో వారికే నేను మిక్కిలి సహాయమపడెదను. నా జీవిత చర్యలకొరకే కాదు. సాధ్యమైనంతవరకు వారి గృహకృత్యములందును తోడ్పడెదను. వాని యహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చునకు కూడ లేకుండునప్పుడు నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసికొందును. నా కధలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును. వారు ఆత్మ సాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందెదరు. నీకు తోచిన దానినే నీవు నిర్థారణ చేయుటకు ప్రయత్నించకుము. యితరుల యభిప్రాయములను కొట్టివేయుటకు ప్రయత్నించకుము. ఏ వెషయముపైనైననూ కీడు మేలు ఎంచు వివాదము కూడదు."

వివాదమనగనే నన్ను హేమాడ్ పంతు అని పిల్చుటకు కారణమేమో మీకు చెప్పెదనను వాగ్ధానము జ్ఞప్తికి వచ్చినది. దానినే మీకు చెప్పబోవుచున్నాను. కాకా సాహెబు దీక్షిత్, నానా సాహెబు చాందోర్కరులతో నేనెక్కువ స్నేహముతో నుంటిని. వారు నన్ను శిరిడీ పోయి బాబా దర్శనము చేయుమని బలవంతము చేసిరి. అట్లే చేసెదనని వారికి నేను వాగ్ధానము చేసితిని. ఈ మధ్య నేదో జరిగినది. అది నా శిరిడీ ప్రయాణమున కడ్డుపడినది. లోనావలాలో నున్న నా స్నేహితుని కొడుకు జబ్బుపడెను. నా స్నేహితుడు మందులు, మంత్రములన్నియు నుపయోగించెను గాని నిష్పలమయ్యెను. జ్వరము తగ్గలేదు. తుదకు వాని గురువును పిలిపించి ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను. కాని ప్రయోజనము లేకుండెను. ఈ సంగతి విని "నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టి గురువుయొక్క ప్రయోజనమేమి? గురువు మనకు ఏమి సహాయము చేయలేనప్పుడు నేను శిరిడీ ఏల పోవలెను?" అని భావించి శిరిడీ ప్రయాణమును అపితిని. కానీ కానున్నది కాక మానదు అది యీ క్రింది విధముగా జరిగెను.

నానాసాహెబు చాందోర్కర్ ప్రాంత ఉధ్యోగి. వసయికి పోవుచుండెను. ఠాణా నుండి దాదరుకు వచ్చి యచ్చట వసయీ పోవు బండి కొరకు కనిపెట్టుకొని యిండెను. ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చెను. దానిలో కూర్చొని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి శిరిడి ప్రయాణమును వాయిదా వేయుటవల్ల నాపై కోపించెను. నానా చెప్పినది వినోదముగను సమ్మతముగానూ ఉండెను. అందుచే నా రాత్రియే శిరిడీ పోవ నిశ్చయించితిని. సామానులను కట్టుకొని శిరిడీ బయలుదేరితిని. దాదరు వెళ్ళి యచ్చట మన్ మాడ్ మెయిలుకొరకు వేచి యింటిని. బండి బయలుదేరునప్పుడు నేను కూర్చొనిన పెట్టెలోనికి సాయిబొకడు తొందరగా వచ్చి నా వస్తువులన్నియు జూచి ఎక్కడకు పోవుచుంటిరని నన్ను ప్రశ్నించెను. నా యాలోచన వారికి చెప్పితిని. వెంటనే బోరిబందరు స్టేషనుకు బోవలయునని నాకు సలహా చెప్పెను. ఎందుకనగా మన్మాడు పోవుబండి దాదరులో నాగదనెను. ఈ చిన్న లీలయే జరగకుండినచో నేననుకొనిన ప్రకారము ఆ మరునాటి ఉదయము శిరిడీ చేరుకోలేకపోయెడివాడను. అనేక సందేహములుకూడ కలిగి యిండును. కాని యది యట్లు జరుగలేదు. నా యదృష్టవశాత్తూ మరుసటి దినము సుమారు 9,10 గంటలలోగా శిరిడీ చేరితిని. నా కొరకు కాకాసాహెబు దీక్షిత్ కనిపెట్టుకొని యుండెను.

ఇది 1910 ప్రాంతములో జరిగినది. అప్పటికి సాఠేవాడ యొక్కటియే వచ్చు భక్తులకొరకు నిర్మింపబడి యిండెను. టాంగా దిగిన వెంటనే నాకు బాబాను దర్శించుటకు ఆత్రము కలిగెను. అంతలో తాత్యాసాహెబు నూల్కరు అప్పుడే మసీదునుండి వచ్చుచు బాబా వాడా చివరన ఉన్నారని చెప్పెను. మొట్టమొదట ధూళి దర్శనము చేయుమని సలహా యిచ్చెను. స్నానాంతరము ఓపికగా మరల చూడవచ్చుననెను. ఇది వినినతోడనే బాబా పాదములకు సాష్టంగనమస్కారము చేసితిని. ఆనందము పొంగిపొరలినది. నానాసాహెబు చాందోర్కరు చెప్పినదానికి ఎన్నో రెట్లు అనుభవమైనది. నా సర్వేంద్రియములు తృప్తిచెంది యాకలి దప్పికలు మరచితిని. మనస్సునకు సంతుష్టి కలిగెను. బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితములో గొప్ప మార్పు కలిగెను. నాకు శిరిడీ పోవలసినదని ప్రోత్సహించిన వారందరికీ నేనెంతో ఋణపడినట్లుగా భావించితిని. వారిని నా నిజమైన స్నేహితులుగా భావించితిని. వారి ఋణమును నేను తీర్చుకొనలేను. వారిని జ్ఞప్తికి దెచ్చుకొని, వారికి నా మనసులో సాష్టంగప్రణామము చేసితిని. నాకు తెలిసినంతవరకు సాయిబాబా దర్శనమువల్ల కలుగు చిత్రమేమన మనలోనున్న యాలోచనలు మారిపోవును. వెనుకటి కర్మల బలము తగ్గును. క్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగును. నా పూర్వజన్మసుకృతముచే నాకీ దర్శనము లభించినదనుకొంటిని. సాయిబాబాను చూచినంత మాత్రమున నీ ప్రపంచమంతయు సాయిబాబా రూపము వహించెను.

గొప్ప వివాదము

నేను శిరిడీ చేరిన మొదటి దినముననే నాకునూ బాలాసాహెబు భాటేకును గురువుయొక్క యావశ్యకతను గూర్చి గొప్ప వివాదము జరిగెను. మన స్వేచ్ఛను విడిచి యింకొకరికి ఎందుకు లొంగియుండవలెనని నేను వాదించితిని. మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క యావశ్యకత ఏమి? తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నించి జన్మనుండి తప్పించుకొనవలెను. ఏమీ చేయక సోమరిగా కూర్చొనువానికి గురువేమి చేయగలడు? నేను స్వేచ్ఛ పక్షమును ఆశ్రయించితిని. భాటే యింకొక మార్గము బట్టి ప్రారబ్ధము తరఫున వాదించుచు "కానున్నది కాకమానదు. మహనీయులుకూడ నీ విషయములో నోడిపోయిరి. మనుజుడొకటి తలంచిన భగవంతుడు వేరొకటి తలంచును. నీ తెలివి తేటలను అటుండనిమ్ము. గర్వముగాని యహంకారము కాని నీకు తోడ్పడవు." ఈ వాదన యొక గంటవరకు జరిగెను. కాని యిదమిత్ధమని చెప్పలేకుంటిమి. అలసిపోవుటచే ఘర్షణ మానుకొంటిమి. ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పినది. శరీరస్పృహ, అహంకారము లేకున్నచో వివాదమునకు తావులేదని నిశ్చయించితిమి. వేయేల వివాదమునకు మూలకారణం అహంకారము.

ఇతరులతో కూడ మేము మసీదునకో పోగా బాబా కాకాను బిలిచి యిట్లడుగ దొడంగెను. "సాఠేవాడలో నేమి జరిగినది? ఏమిటా వివాదము? అది దేనిని గూర్చి? ఈ హేమాడ్ పంతు ఏమని పలికెను?"

ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడితిని. సాఠేవాడ మసీదునకు చాల దూరముగ నున్నది. మా వివాదమునుగూర్చి బాబాకెట్లు దెలిసెను? అతడు సర్వజ్ఞుడై యిండవలెను. లేనిచో మా వాదన నెట్లు గ్రహించును? బాబా మన యంతరాత్మపై నధికారియై యిండవచ్చును.

హేమాడ్ పంతు అను బిరుదునకు మూలకారణము

నన్నెందుకు హేమాడ్ పంతు అను బిరుదుతో పిలిచెను? ఇది హేమాద్రిపంతు అను నామమునకు మారుపేరు. దేవగిరి యాదవ వంశమున బుట్టిన రాజులకు ముఖ్యమంత్రి హేమాద్రిపంతు. అతడు గొప్ప పండితుడు, మంచి స్వభావము గలవాడు; చతుర్వర్గ చింతామణి, రాజప్రశస్తియను గొప్ప గ్రంధములను రచించినవాడు; మోడీ భాషను కనిపెట్టినవాడు. క్రొత్త పద్ధతి లెక్కలను కనిపెట్టినవాడు. నేనా వానికి వ్యతిరేక బుద్ధి కలవాడను. మేధాశక్తి యంతగా లేనివాడను. నా కొందుకీ బిరుదు నొసంగిరో తెలియకుండెను. ఆలోచన చేయగా నిది నా యహంకారమును చంపుటకొక యమ్మనియు, నేనెప్పుడును అణకువ నమ్రతలు కలిగి యిండవలెనని బాబా కోరిక యయి యిండవచ్చుననియు గ్రహించితిని. వివాదములో గెలిచినందులకు బాబా యీ రితిగా తెలివికి అభినందనము లిచ్చియుండునని యనుకొంటిని.

భవిష్యచ్చరితను బట్టి చూడగా బాబా పలుకులకు (దాభోల్కరును హేమాడ్ పంత్ అనుట) గొప్ప ప్రాముఖ్యము కలదనియు, భవిష్యత్తును తెలిసియే యట్లనెననియు భావించవచ్చును. ఏలయనగా హేమాడ్ పంతు శ్రీ సాయిసంస్థానమును చక్కని తెలివితేటలతో నడిపెను. లెక్కలను బాగుగా నుంచెను. అదే కాక భక్తి, జ్ఞానము, నిర్వ్యామోహము, ఆత్మసాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీ సాయి సచ్చరిత్రయను గొప్ప గ్రంధమును రచించెను.

గురువుయొక్క యావశ్యకత

ఈ విషయమై బాబా యేమనెనో హేమాడ్ పంతు వ్రాసియిండలేదు. కానీ కాకాసాహెబు దీక్షిత్ ఈ విషయమును గుర్చి తాను వ్రాసి కొనిన దానిని ప్రకటించెను. హేమాడ్ పంతు బాబాను కలసిన రెండవ దినము కాకాసాహెబు దీక్షిత్ బాబా వద్దకు వచ్చి శిరిడీ నుండి వెళ్ళవచ్చునా యని యడిగెను. బాబా యట్లే అని జవాబిచ్చెను. ఎవరో యెక్కడకు అని యడుగగా, చాల పైకి అని బాబా చెప్పగా , మార్గమెద్ది అని అడిగిరి. "అక్కడకు పోవుటకు అనేకమార్గములు కలవు. శిరిడీ నుంచి కూడ నొక మార్గము కలదు. మార్గము ప్రయాసకరమైనది. మార్గ మధ్యమున నున్న యడవిలో పులులు, తోడేళ్ళు కల" వని బాబా బదులిడెను. కాకాసాహెబు లేచి మార్గదర్శకుని వెంటదీసికొని పోయినచో నని యడుగగా, నట్లయినచో కష్టమే లేదని జవాబిచ్చెను. మార్గ దర్శకుడు తిన్నగా గమ్యస్థానము చేర్చును. మార్గమధ్యమున నున్న తోడేళ్ళు, పులులు, గోతుల నుండి తప్పించును. మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడవచ్చును. లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చును. దాభోళ్కరు అచ్చటనే యిండుటచే తన ప్రశ్న కిదియే తగిన సమాధానమని గుర్తించెను. వేదాంతవిషయములలో మానవుడు స్వేచ్చాపరుడా కాడా? యను వివాదమువలన ప్రయోజనము లేదని గ్రహించెను. నిజముగా, పరమార్థము గురుబోధలవల్లనే చిక్కుననియు రామకృష్ణులు వసిష్ఠ సాందీపులకు లొంగి యణకువతో నుండి యాత్మసాక్షాత్కారము పొందిరనియు, దానికి దృఢమైన నమ్మకము, ఓపికయను రెండు గుణములు ఆవశ్యకమనియు గ్రహించెను.

ఓం నమో శ్రీ సాయినాధాయ

శాంతిః శాంతిః శాంతిః

రెండవ అధ్యాయము సంపూర్ణము