శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము - పి.నారాయణరావు Back   Home 

ఇరువదవ అధ్యాయము

కాకానౌకరిపిల్ల ద్వారా దాసుగణు సమస్య పరిష్కరించుట

ఈ అధ్యాయములో దాసుగణుయొక్క సమస్య కాకాసాహెబు పనిపిల్ల ఎట్లు పరిష్కరించెనో హేమాడ్ పంతు చెప్పెను.

ప్రస్తావన

మౌలికముగ సాయి నిరాకారుడు. భక్తులకొరకాకారమును ధరించెను. ఈ మహాజగన్నాటకమునందు మాయయను నటి సాయముతో వారు నటుని పాత్ర ధరించిరి. సాయిని స్మరించి ధ్యానింతము గాక. శిరిడీకి పోయి యచ్చటి మధ్యాహ్నహారతి పిమ్మట జరుగు కార్యక్రమమును జాగ్రత్తగా గమనింతము. హారతి అయినపిమ్మట సాయి మసీదు బయటకు వచ్చి, గోడప్రక్కన నిలిచి ప్రేమతోను, దయతోను భక్తులకు ఊదీ ప్రసాదమును పంచిపెట్టుచుండెను. భక్తులు కూడ సమానమయిన ఉత్సాహముతో వారి సమక్షమున నిలిచి పాదములకు నమస్కరించి, బాబావైపు చూచుచు ఊదీ ప్రసాదపు జల్లు లనుభవించుచుండిరి. బాబా భక్తుల చేతులలో పిడికిళ్ళతో ఊదీ పోయుచు, వారి నుదుటిపై తమ చేతులతో ఊదీబొట్టు పెట్టుచుండిరి. వారి హృదయమున భక్తుల ఎడ అమితమైన ప్రేమ. బాబా భక్తుల నీ క్రింది విధముగ పలుకరించు చుండెను.

"అన్నా! మధ్యాహ్నభోజనమునకు పొమ్ము; బాబా! నీ బసకు పో; బాపూ! భోజనము చేయుము." ఈ విధముగ ప్రతి భక్తుని పల్కరించి యింటికి సాగనంపుచుండెను. ఇప్పటికి అది యంతయు ఊహించుకొన్నచో ఆ దృశ్యములను గాంచి సంతసించవచ్చును. వానిని భావనకు దెచ్చుకొని యానందించవచ్చును. మనోదృశ్యమున సాయిని నిల్పి వారిని ఆపాదమస్తకము ధ్యానింతము. వారి పాదములపైబడి సగౌరవముగ ప్రేమతోను వినయముగ సాష్టాంగనమస్కార మొనర్చుచు ఈ అధ్యాయములోని కధను చెప్పెదము.

ఈశావాస్యోపనిషత్తు

ఒకప్పుడు దాసుగణు ఈశావాస్యోపనిషత్తుపై మరాఠీభాషలో వ్యాఖ్య వ్రాయుటకు మొదలిడెను. మొట్టమొదట ఈ ఉపనిషత్తు గూర్చి క్లుప్తముగా చెప్పెదము.

వేదసంహితలోని మంత్రములు గలదగుటచే దానిని మంత్రోపనిషత్తు అని యందురు. దానిలో యజుర్వేదములోని 40 వ ధ్యాయమగు "వాజసనేయ సంహిత" యుండుటచే దానికి వాజసవేయసంహితోపనిషత్తని కూడ పేరు. వైదికసమ్హితలుండుటచే, దీని నితర ఉపనిషత్తుల కన్న శ్రేష్టమని భావించెదరు. దీనికొక యుదాహరణము. ఉపనిషత్తులన్నిటిలో పెద్దదియగు బృహదారణ్యకోపనిషత్తు ఈశావాస్యోపనిషత్తు పై వ్యాఖ్యయని పండితుడగు సాత్వలేకర్ గారు భావించుచున్నారు.

ప్రొఫెసరు రానడె గా రిట్లనుచున్నారు. ఈశావాస్యోపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికి దానిలో అంతర్ దృష్టిని కలిగించు అనేకాంశము లున్నవి. 18 శ్లోకములలో, ఆత్మగూర్చి విలువైన యపురూపమగు వర్ణన, అనేకాకర్షణలకు దుఃఖములకు తట్టుకొను స్థైర్యముగల ఆదర్శ యోగీశ్వరుని వర్ణన యిందున్నవి. తరువాతి కాలమున సూత్రీకరింపబడిన కర్మయోగసిద్ధాంతముల ప్రతిబింబమే యుపనిషత్తు. తుదకు జ్ఞానమునకు కర్మలకు సమన్వయముగనున్న సంగతులు చెప్పబడినవి. ఈ యుపనిషత్తులోని సారాంశమేమన జ్ఞానమార్గమును కర్మయోగమును సమన్వయము చేసి చెప్పుట. ఇంకొకచోట వారిట్లనిరి "ఈశావాస్యోపనిషత్తులోని కవిత్వము నీతి, నిగూడతత్వము, వేదాంతముల మిశ్రమము."

పై వర్ణనుబట్టి యీ ఉపనిషత్తును మరాఠీ భాషలోనికి అనువాదము చేయుట ఎంతకష్టమో గమనించవచ్చును. దాసుగణు దీనిని మారాఠీ ఓవీ చందములో వ్రాసెను. దానిలోని సారాంశమును గ్రహించలేకుండుటచే వ్రాసినదానితో నతడు తృప్తి చెందలేదు. కొందరు పండితుల నడిగెను. వారితో చర్చించెను. కాని, వారు సరియైన సమాధానమియ్యకుండిరి. కావున దాసుగణు కొంతవరకు వికలమనస్కుడయ్యెను.

సద్గురువే బోధించుటకు యోగ్యత, సమర్థత గలవారు

ఈ యుపనిషత్తు వేదములయొక్క సారాంశము. ఇది యాత్మసాక్షాత్కారమునకు సంబంధించిన శాస్త్రము. ఇది జనన మరణములనే బంధములను తెగగొట్టు ఆయుధము లేదా కత్తి. ఇది మనకు మోక్షమును ప్రసాదించును. కనుక నెవరయితే యాత్మసాక్షాత్కారము పొంది యున్నారో యట్టివారే ఈ ఉపనిషత్తులోని అసలు సంగతులు చెప్పగలరని అతడు భావించెను. ఎవరును దీనికి తగిన సమాధానము నివ్వనపుడు దాసుగణు సాయిబాబా సలహా పొందనిశ్చయించుకొనెను. అవకాశము దొరికినప్పుడు శిరిడీకి పోయి సాయిబాబాను కలిసి, వారి పాదములకు నమస్కరించి, ఈశావాస్యోపనిషత్తులోని కష్టముల జెప్పి, సరియైన యర్థము చెప్పుమని వారిని వేడుకొనెను. సాయిబాబా యాశీర్వదించి యిట్లనెను. "నీవు తొందరపడవద్దు, ఆ విషయములో నెట్టి కష్టము లేదు. కాకాసాహెబు దీక్షితుని పనిపిల్ల తిరుగుప్రయాణములో నీ సందేహమును విలీపార్లేలో తీర్చును." అప్పుడక్కడ నున్నవారు దీనిని విని, బాబా తమాషా చేయుచున్నాడని యనుకొనిరి. భాషాజ్ఞానములేని పనిపిల్ల ఈ విషయమెట్లు చెప్పగలదనిరి. కాని దాసుగణు యిట్లనుకొనలేదు. బాబా పలుకులు బ్రహ్మవాక్కు లనుకొనెను.

కాకా యొక్క పనిపిల్ల

బాబా మాటలందు పూర్తి విశ్వాసముంచి, దాసుగణు శిరిడీ విడిచి విలీపార్లే చేరి కాకాసాహెబు దీక్షితు యింటిలో బసచేసెను. ఆ మరుసటిదినముదయము దాసుగణు నిద్రనుంచి లేవగనే యొక బీదపిల్ల చక్కని పాటను మిక్కిలి మనోహరముగా పాడుచుండెను. అ పాటలోన విషయము ఎర్రచీర వర్ణనము. అది చాలా బాగుండెననియు, దాని కుట్టుపని చక్కగా నుండెననియు దాని యంచులు చివరలు చాల సుందరముగా నుండెననియు పాడుచుండెను. అ పాట అతనికి నచ్చెను. కావున దాసుగణు బయటకు వచ్చి వినెను. అది కాకా పనిమనిషి నామ్యా చెల్లెలు పాడుచుండెను. ఆమె చిన్నపిల్ల, ఆమె చింకిగుడ్డను కట్టుకొని పాత్రలు తోముచుండెను. ఆమె పేదరికము ఆమె సంతోషభావమును గాంచి, దాసుగణు అమెపై జాలిగొనెను. అ మరుసటిదినము రావు బహద్దర్ యం.వి.ప్రధాన్ తనకు ధోవతులచాపు లివ్వగ, ఆ పేదపిల్లకు చిన్న చీరనిమ్మని చెప్పెను. రావుబహుద్దర్ యొక మంచి చిన్న చీరను కొని యామెకు బహూకరించెను. ఆకలితో నున్నవారికి విందు భోజనము దొరికినట్లు ఆమె యమితానందపరవశురాలయ్యెను. అ మరుసటిదిన మామె యా క్రొత్త చీరను ధరించెను. సంతసముతో తక్కిన పిల్లలతో గిర్రున తిరుగుచు నాట్యము చేసెను. అందరికంటె తానే బాగుగ ఆడి పాడెను. మరుసటిదినము చీరను పెట్టెలో దాచుకొని మామూలు చింకిబట్ట కట్టుకొని వచ్చెనుగాని యామె యానందమునకు లోటు లేకుండెను. ఇదంతయు చూచి దాసుగణు జాలిభావము మెచ్చుకోలుగా మారెను. పిల్ల నిరుపేద కాబట్టి చింకిగుడ్డలు కట్టుకొనెను. ఇప్పుడు అమెకు కొత్తచీర గలదుగాని, దానిని పెట్టెలో దాచుకొనెను. అయినప్పటికి విచారమనునది గాని, నిరాశ యనునదిగాని లేక యాడుచుపాడుచుండెను. కాబట్టి కష్టసుఖములను మన భావములు మన మనోవైఖరిపై నాధారపడి యుండునని అతడు గ్రహించెను. ఈ విషయమును గూర్చి దీర్ఘాలోచన చేసెను. భగవంతుడిచ్చినదానితో మనము సంతసింపవలెను. భగవంతుడు మనల నన్ని దిశలనుండి కాపాడి మనకు కావలసినది ఇచ్చుచుండును కాన భగవంతుడు ప్రసాదించిన దంతయు మన మేలుకొరకే యని గ్రహించెను. ఈ ప్రత్యేకవిషయములో ఆ పిల్ల యొక్క పేదరికము, ఆమె చినిగినచీర, క్రొత్తచీర, దానినిచ్చిన దాత, దానిని పుచ్చుకొనిన గ్రహిత, దానభావము - ఇవి యన్నియు భగవంతుని యంశములే. భగవంతుడు ఈయన్నిటియందు వ్యాపించి యున్నాడు. ఇచట దాసుగణు ఉపనిషత్తులలోని నీతిని అనగా ఉన్న దానితో సంతుష్టిచెందుట, ఏది మనకు సంభవించుచున్నదో - యది ఎల్లయు భగవంతుని యాజ్ఞచే జరుగుచున్నదనియు, తుదకది మన మేలుకొరకే యనియు గ్రహించెను.

విశిష్టమైన బోధన విధానము

పై కధనుబట్టి చదువరి బాబా మార్గము మిక్కిలి విశిష్టమైన దయిను అపూర్వమైనదనియు గ్రహించును. బాబా శిరిడి విడువనప్పుటికి, కొందరిని మఛీంద్రగడ్ కు; కొందరిని కొళాపూరుకు గాని, షోలాపూరుకుగాని సాధననిమిత్తము పంపుచుండెను. కొందరికి సాధారణ రూపములోను కొందరికి స్వప్నావస్థలోను, అది రాత్రిగాని పగలుగాని, కాన్పించి కోరికలు నెరవేర్చు చుండెను. భక్తులకు బాబా బోధించు మార్గములు వర్ణింపనలవి కాదు. ఈ ప్రత్యేక విషయములో దాసుగణును విలీపార్లే పంపించి పనిపిల్లద్వారా అతని సమస్యను పరిస్కరించెను. కాని, విలీపార్లే పంపకుండ శిరిడిలోనే బాబా బోధించరాదా యని కొందరనవచ్చును. కాని బాబా అవలంబించినదే సరెయైన మార్గము కానిచో పేద నౌకరి పిల్ల, యామె చీరకూడ, భగవంతునిచే వ్యాపింపబడియున్నదని దాసుగణు ఎట్లు నేర్చుకొని యుండును?

ఈశావాస్యోపనిషత్తులోని నీతి

ఈశావాస్యోపనిషత్తులోనున్న ముఖ్యవిషయము అది బోధించు నీతిమార్గమే. ఈ ఉపనిషత్తులోనున్న నీతి దానిలో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయములపై ఆధారపడియున్నది. ఉపనిషత్తు ప్రారంభ వాక్యములే భగవంతుడు సర్వాంతర్యామి యని చెప్పుచున్నవి. దీనిని బట్టి మనము గ్రహించవలసిన దేమన మానవుడు భగవంతుడిచ్చినదానితో సంతుష్టి చెందవలెను. ఏలయన భగవంతుడన్ని వస్తువులయందు గలడు. కావున భగవంతుడేది యిచ్చెనో అదియెల్లతన మేలుకొరకే యని గ్రహించవలెను. దీనిని బట్టి యితరుల సొత్తుకై యాశించరాదనియు ఉన్నదానితో సంతుష్టి చెందవలెననియు, భగవంతుడు మన మేలుకొరకే దాని నిచ్చియున్నాడనియు, కావున నది మనకు మేలు కలుగజేయుననియు గ్రహించవలెను. దీనిలోని ఇంకొక నీతి యేమన మనుష్యుడెల్లప్పుడేదో తనకు విధింపబడిన కర్మను చేయుచునే యుండవలెను. శాస్త్రములో చెప్పిన కర్మలు నెరవేర్చవలెను. భగవంతుని యాజ్ఞానుసారము నెరవేర్చుట మేలు. ఈ ఉపనిషత్తు ప్రకారము కర్మ చేయకుండ నుండుట యాత్మనాశనమునకు కారణము. మానవుడు శాస్త్రములో విధింపబడిన కర్మలు నెరవేర్చుటవలన నైష్కర్మ్యాదర్శము పొందును. ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూచునో, ఆత్మయన్నిటియందుండుట్లున చూచునో, వేయేల సమస్తజీవరాశియు, సకలవస్తువులు ఆత్మగా భావించునో, యట్టివాడెందుకు మోహమును పొందును? వాడెందులకు విచారించును? అన్ని వస్తువులలో నాత్మను చూడకపోవుటచే మనకు మోహము, అసహ్యము, విచారము కలుగుచున్నవి. ఎవడయితే సకల వస్తుకోటిని ఒక్కటిగా భావించునో, ఎవనికయితే సమస్తమాత్మయగునో, వానికి మానవులు పడు సమాన్యబాధలతో సంబంధము లేదు. అనగా నతడు కష్టములకు మార్పుచెందడు.

ఓం నమో శ్రీ సాయినాధాయ

శాంతిః శాంతిః శాంతిః

ఇరువదవ అధ్యాయము సంపూర్ణము