శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము - పి.నారాయణరావు Back   Home 

ఇరువదియొకటవ అధ్యాయము

1. వి.హెచ్. ఠాకూరు 2. అనంతరావు పాటంకర్ 3. పండరీపురము ప్లీడరు - వీరి కధలు.

ఈ అధ్యాయములో హేమాడ్ పంతు వినాయక హరిశ్చంద్ర ఠాకూరు బి.ఏ.అనంతరావు పాటంకర్ (పూనా), పండరీపురము ప్లీడరు గూర్చిన కధలు చెప్పెను. ఈ కధలన్నియు నానందదాయకమైనవి. ఇవి సరిగా చదివి గ్రహించినచో, ఆధ్యాత్మికమార్గమునకు దారి చూపును.

ప్రస్తావన

సామాన్యముగ మన గతజన్మపుణ్యసముపార్జనమువలని యదృష్టముచే యోగీశ్వరుల సాంగత్యము పొంది దానివలన మేలు పొందెదము. దీనికి ఉదాహరణముగా హేమాడ్ పంతు తన సంగతినే చెప్పుచున్నాడు. బొంబాయి దగ్గరగానున్న బాంద్రాకు ఇతడు చాలాకాలము మేజస్ట్రీటుగ నుండెను. అక్కడ పీరుమౌలానా యను మహమ్మదీయ యోగిపుంగవుడు నివసించుచుండెను. అనేకమంది హిందువులు పారశీకులు, ఇతర మతస్థులుపోయి వారిని దర్శించుచుండిరి. అతని పురోహితుడగు యూనస్, హేమాడ్ పంతును అనేకసార్లు పీరుమౌలానాను దర్శించుమని చెప్పెను. కాని ఎదో కారణముచేత అతడు చూడలేకపోయెను. అనేక సంవత్సరముల తరువాత అతనివంతు వచ్చెను. అతడు శిరిడీకి పోయి, శాశ్వతముగా శిరిడీసాయిసంస్థానములో చేరెను. దురదృష్టులకు ఇట్టి యోగుల సాంగత్యము లభించదు. కేవలము అదృష్టవంతులకే యట్టిది లభించును.

యోగీశ్వరుల వ్యవస్థ

అత్యంత ప్రాచీనకాలమునుండి ప్రపంచమున యోగీశ్వరుల వ్యవస్థ వున్నది. అనేకమంది యోగులనేకచోట్ల అవతరించి వారి వారికి విధింపబడిన పనులను నెరవేర్చెదరు. వారనేకచోట్ల పని చేసినను అందరా భగవంతుని యాజ్ఞానుసారము నెరవేర్చెదరు. కాన ఒకరు చేయునది యింకొకరికి తెలియును. ఒకరు చేసినదానిని ఇంకొకరు పూర్తి చేసెదరు. దీనిని బోధించుట కొకయుదాహరణ మీ దిగువ కలదు.

వి.హెచ్. ఠాకూరుగారు బి.ఏ.

వీరు రెవెన్యూ శాఖలో గుమాస్తాగా నుండిరి. ఆయన ఒకానొకప్పుడు బెళగాం సమీపమందలి వఢ్ గాం అను పట్టణమున కొక సర్వే పార్టీతో వచ్చెను. అక్కడ "అప్ప" యను కన్నడయోగిని దర్శించి వారి పాదములకు నమస్కరించెను. ఆ యోగి నిశ్చలదాసు రచించిన "విచారసాగర" మను వేదాంతగ్రంధమును సభలో నున్నవారికి బోధించుచుండెను. ఠాకూరు పోవునపుడు వారి సెలవు కోరగా వారిట్లు చెప్పిరి. "ఈ పుస్తకమును నీవు చదువవలెను. నీ వట్లు చేసినచో నీ కోరికలు నెరవేరును. ముందుముందు నీ యుద్యోగమునకు సంబంధించిన పనిమీద ఉత్తరదిక్కునకు బోయినప్పుడు నీవొక గొప్పయోగిని నీ యదృష్టముచే కలిసికొనెదవు. వారు నీ భవిష్యత్తుమార్గమును చూపెదరు. నీ మనస్సునకు శాంతి కలుగజేసెదరు. నీ కానందము కలుగజేసెదరు."

ఠాకూరు జున్నరుకు బదిలీ యయ్యెను. అచటికి పోవుటకై నానేఘాటు లోయను దాటి పోవలసియుండెను. ఈ లోయ మిక్కిలి లోతైనది. దానిని దాటుట చాల కష్టము. దానిని దాటుట కెనుబోతు తప్ప యితరమేదియు నుపయోగించరు. కావున ఎనుబోతుపై లోయను దాటుటచే అతనికి బాధ కలిగెను. అచ్చటనుండి కల్యాణ్ కు పెద్దయుద్యోగముపై బదిలి యయ్యెను. అచట నానాసాహెబు చాందోర్కరుతో పరిచయము కలిగెను. ఆయనవలన సాయిబాబాగూర్చి యనేక సంగతులు తెలిసికొని వారిని చూడకాంక్షించెను. ఆ మరుసటిదినమే నానాసాహెబు శిరిడీపోవుటకు నిశ్చయించుకొనెను. కావున ఠాకూరును తనతో కూడ రమ్మని యడిగెను. ఠాకూర్ తనకు ఠాణాలో సివిల్ కేసుండుటచే రాలేనని చెప్పెను. అందుచే నానాసాహెబు ఒక్కడే వెళ్ళెను. ఠాకూరు ఠాణాకు వెళ్ళెను. కాని యచ్చట కేసు వాయిదా పడెను. అతడు నానాసాహెబు వెంట శిరిడీకి వెళ్ళకపోవుటచే మిక్కిలి పశ్చాత్తాపపడెను. అయినప్పటికి శిరిడీ వెళ్ళెను. అంతకుముందొకనాడు నానాసాహెబు శిరిడీ విడిచిపెట్టెనని తెలిసెను. ఇతరస్నేహితులు కొందరు కలిసిరి. వారు ఠాకూరును బాబా వద్దకు దీసికొనిపోయిరి. అతడు బాబాను జూచి వారి పాదములకు నమస్కరించి మిక్కిలి సంతసించెను. అతనికండ్లు ఆనందబాష్పములచే నిండెను; ఒడలు గగుర్పొడిచెను. కొంతసేపటికి సర్వజ్ఞుడగు బాబా యిట్లనెను. "ఇచ్చటి మార్గము అప్పా బోధించునీతులంత సులభమైనది కాదు. నానేఘూటులో ఎనుబోతు పైన సవారి చేయునంత సులభము కాదు. ఈ యధ్యాత్మమార్గము మిగుల కఠినమైనది. కావలసినంత కృషి చేయవలసియుండును." ఠాకూరొక్కనికే తెలియు ఈ ముఖ్యమైన గుర్తులు మాటలు వినగనే యతడు యమితానందపరవశుడయ్యెను. కన్నడ యోగి చెప్పిన మాటలు యధార్థములని గ్రహించెను. రెండుచేతులు జోడించి బాబా పాదములపై శిరస్సు ను పెట్టి, తనను స్వీకరించి యాశీర్వదించవలెనని ప్రార్థించెను. అప్పుడు బాబా యిట్లనెను. "అప్పా చెప్పినదంతయు నిజమే కాని యవన్నియు అభ్యసించి ఆచరణలో పెట్టవలెను. ఊరకనే చదువుట వలన ప్రయోజనము లేదు. నీవు చదివినదంతయు నాలోచించి యాచరణలో పెట్టవెలెను. లేనిచో దాని ప్రయోజనమేమియు నుండదు. గురుని యాశీర్వాదము లేని ఉత్తపుస్తకజ్ఞాన మాత్మసాక్షాత్కారము లేనిచో ప్రయోజనము లేనిది." విచారమసాగరమును పుస్తములోని సిద్ధాంతభాగమాతడు చదివియుండెను, గాని యాచరణలో పెట్టతగిన దానిని శిరిడీలో నేర్చెను. ఈ దిగువ చెప్పిన యింకొక కధ కూడ నీ సత్యమును బలపరచును.

అనంతరావు పాటంకర్

పూనా పెద్దమనుష్యుడొకడు అనంతరావు పాటంకర్ యను వాడు బాబాను చూడగోరెను. శిరిడీ వచ్చి బాబా దర్శనము చేసెను. అతని కండ్లు సంతుష్టి చెందెను. అతడానందించెను. అతడు బాబా పాదములపయిబడి, తగిన పూజచేసినపిమ్మట బాబాతో ఇట్లనెను. "నేనెక్కువగా చదివితిని, వేదములను, వేదాంతములను, ఉపనిషత్తులను చదివితిని. అష్టాదశపురాణములు వింటిని. నా మనస్సునకు శాంతి యైననుకలుగుట లేదు. కనుక నా పుస్తకజ్ఞానమంతయు నిష్ప్రయోజనము. పుస్తకజ్ఞానములేని నిరాడంబరభక్తులు నాకంటే మేలు. మనస్సు శాంతి పొందనిచో పుస్తకజ్ఞానమంతయు వ్యర్థము. నీ దృష్టివలన నీ చమత్కారపు మాటలవలనను నీవు శాంతి ప్రసాదింతువని వింటిని. అందుచే నేనిచ్చటికి వచ్చితిని. కావున నాయందు దాక్షిణ్యము చూపుము. నన్ను ఆశీర్వదించుము." పిమ్మట బాబా ఒక నీతికధను ఈ విధముగ చెప్పెను.

తొమ్మిది ఉండల గుర్రపులద్ది నీతికధ (నవ విధ భక్తి)

ఒకనాడొకవర్తకుడిక్కడకు వచ్చెను. అతనిముందు ఆడగుర్రము లద్దివేసెను. అది తొమ్మిది యుండలుగా పడెను. జిజ్ఞాసువైన యా వర్తకుడు పంచెకొంగు సాచి తొమ్మిది యుండల నందులో పెట్టుకొనెను. ఇట్లు అతడు మనస్సును కేంద్రీకరించగలిగెను.

ఈ మాటల యర్థమును పాటంకర్ గ్రహించలేకుండెను. అందుచే నతడు గణేశదామోదర్ వురఫ్ దాదా కేల్కరు నిట్లు అడిగెను. "దీని వలన బాబా యుద్దేశమేమి?" అతడిట్లు జవాబు ఇచ్చెను. "నాకు గూడ బాబా చెప్పినదంతయు తెలియదుగాని వారి ప్రేరణ ప్రకారము, నాకు తోచినది నేను చెప్పెదను. ఆడగుర్రమనగా ఇచట భగవంతుని యనుగ్రహము. తొమ్మిదియుండల లద్ది యనగా నవవిధభక్తి. అవి యేమన.. 1. శ్రవణము (వినుట) 2. కీర్తనము (ప్రార్థించుట) 3. స్మరణము (జ్ఞప్తియందుంచుకొనుట) 4. పాదసేవనము (సాష్టాంగనమస్కార మొనర్చుట) 5. అర్చనము (పూజ) 6. నమస్కారము (వంగి నమస్కరించుట) 7. దాస్యము (సేవ) 8. సఖ్యత్వము (స్నేహము) 9. ఆత్మనివేదనము (ఆత్మను సమర్పించుట).

ఇవి నవవిధ భక్తులు. వీనిలో నేదయిన ఒక మార్గమునందు నమ్మకముంచి నడచుకొనినయెడల భగవంతుడు సంతుష్టి జెందును. భక్తుని గృహమందు ప్రత్యక్షమగును. భక్తిలేని సాధనము లన్నియు అనగా జపము, తపము, యోగము, మతగ్రంధముల పారాయణ, వానిలోని సంగతులనితరులకు బోధించుట యనునవి నిష్ప్రయోజనము. భక్తియే లేనిచో వేదములలోని జ్ఞానము, జ్ఞానియను గొప్ప ప్రఖ్యాతి, నామమాత్రమునకే చేయుభజన వ్యర్థము. కావలసినది ప్రేమాస్పదమయిన భక్తి మాత్రమే. నీవు కూడ ఆ వర్తకుడననుకొనుము. లేదా సత్యమును దెలిసికొనుటకు ప్రయత్నించుచున్న వ్యక్తి ననుకొనుము. వానివలే నవవిధభక్తులను ప్రోగు చేయుము. ఆతురతతో నుండుము. వానివలే నవవిధభక్తులను ఆచరణలో పెట్టుటకు సిద్ధముగా నుండుము. అప్పుడే నీకు మనఃస్థైర్యము శాంతి కలుగును.

ఆ మరుసటి దినము పాటంకర్ బాబాకు నమస్కరించుటకు పోగా, "గుర్రపు లద్ది తొమ్మిది ఉండలను ప్రోగుచేసితివా లేదా?" యని ప్రశ్నించెను. అతడు తాను నిస్సహాయుడననియు ప్రప్రధమమున తనను బాబా యాశీర్వదించవలెననియు ప్రార్థించెను. అట్లయినచో వానిని సులభముగా ప్రోగుచేయవచ్చు ననెను. అప్పుడు బాబా వానిని ఓదార్చుచు శాంతి క్షేమములు కలుగునని యాశీర్వదించెను. ఇది విని పాటంకర్ యపరిమితానందభరితుడయ్యెను.

పండరిపురము ప్లీడరు

ఒక చిన్న కధతో నీ అధ్యాయమును ముగించెదము. ఆ కధ బాబా సర్వజ్ఞుడని తెలుపును. ప్రజలు సరియైన మార్గమున బెట్టుటకు, వారి తప్పులను సవరించుటకు, బాబా సర్వజ్ఞత్వము నుపయోగించుచుండెను. ఒకనాడు పండరీపురమునుండి యొక ప్లీడరు వచ్చెను. అతడు మసీదుకు పోయెను; సాయిబాబాను దర్శించెను; వారి పాదములకు నమస్కరించెను; అడుగకుండగనే దక్షిణ యిచ్చెను; జరుగుచున్న సంభాషణలు వినుటకొక మూల గూర్చుండెను. బాబా యతనివైపు ముఖము త్రిప్పి యిట్లనెను. "ప్రజలెంత టక్కరులు? వారు పాదములపయి బడెదరు. దక్షిణ నిచ్చెదరు; చాటున నిందెంచెదరు." ఇది చిత్రము గాదా? ఈ టోపి (మాట) ప్లీడరుకు సరిపోయెను; అతడు దానిని ధరించెను. ఎవరికి గూడ ఈ విషయము బోధ పడకుండెను. ప్లీడరు దీనిని గ్రహించెనుగాని, ఎవ్వరికి చెప్పలేదు. వాడా లోనికి వచ్చిన పిమ్మట, ప్లీడరు కాకాసాహెబు దీక్షితున కిట్లనియెను. "బాబా చెప్పినదంతయు యధార్థమే. ఆ బాణము నాపయి ప్రయోగించిరి. అది నా గూర్చియే. నేనెవరిని, నిందించకూడదు, తృణీకరించరాదని బోధించుచున్నది. పండరిపురము సబ్ జడ్జియగు నూల్కర్ తన యారోగ్యాభివృద్ధి కొరకు శిరిడీ కి వచ్చెను. అచ్చట మకాము చేసెను. ప్లీడర్ల విశ్రాంతి గదిలో దీనిగూర్చి వివాదము జరిగెను. సబ్ జడ్జి బాధపడుచుండెడి రోగము లేయౌషధమును సేవించక శిరిడీకి పోయిన మాత్రమున బాగుకాగలవా? అని మాట్లాడుకొనిరి. సబ్ జడ్జిని వ్యాఖ్య చేసిరి. సాయిబాబాను నిందించిరి. నేను కూడ అందు కొంత భాగమును వహించితిని నేను చేసినది సమంజసము గాదని ఇప్పుడు సాయిబాబా నిరూపించెను. ఇది నాకు దూషణ కాదు. నాకిది యాశీర్వచనమే. ఇది నాకు ఒక ఉపదేశము. నేనికమీదట ఎవరిని దూషించరాదు. ఎవరిని నిందించరాదు ఇతరుల విషయములో జోక్యము కలుగజేసికొనరాదు."

శిరిడీ పండరీపురమునకు మూడు వందల మైళ్ళ దూరముననున్నది. బాబా సర్వజ్ఞుడగుటచే పండరీపురములోని ప్లీడర్ల విశ్రాంతి గదిలో నేమి జరిగెనో తెలిసికొనిరి. ఈ నడుమనున్న స్థలము, నదులు, అడవులు, పర్వతములు, వారి సర్వజ్ఞత్వమున కడ్డుపడలేదు. వారు సర్వమును జూడ గలిగిరి. అందరి హృదయములలో గలదానిని చదువగలిగిరి. వారికి తెలియని రహస్యమేదియు లేదు. దగ్గర నున్నవి, దూరముగనున్నవి ప్రతివస్తువు కూడ పగటికాంతివలె వారికి తేటతెల్లము. ఎవడయిన దూరముగా గాని దగ్గరగా గాని యుండనిమ్ము. బాబా సర్వాంతర్యామి యగుటచే వారి దృష్టినుంచు తప్పించుకొనుటకు వీలు లేదు. దీనిని బట్టి ప్లీడరొక నీతిని నేర్చుకొనెను. ఒకరిని గూర్చి చెడ్డ చెప్పరాదు. మరియు ననవసరముగ వ్యాఖ్యానము చేయరాదు. బాబా అతని దుర్గుణమును పోగొట్టి సన్మార్గమందు పెట్టెను.

ఇది యొక ప్లీడరును గూర్చినదైనప్పటికి అందరికి వర్తించును. కాబట్టి యీ కధ బోధించు నీతిని జ్ఞప్తియందుంచుకొని మేలు పొందెదము గాక.

సాయిబాబా మహిమ అగాధము, అట్లనే వారి లీలలు కూడ అట్టివే. వారి జీవితము గూడ అట్టిదే. వారు పరబ్రహ్మము యొక్క యవతారమే.

ఓం నమో శ్రీ సాయినాధాయ

శాంతిః శాంతిః శాంతిః

ఇరువదియొకటవ అధ్యాయము సంపూర్ణము