శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము - పి.నారాయణరావు Back   Home 

ఇరువదిరెండవ అధ్యాయము

పాము విషమునుంచి తప్పించుట1. బాలాసాహెబు మిరీకర్. 2. బాపుసాహెబు బుట్టీ, 3. అమీరు శక్కర్, 4. హేమాడ్ పంతు, సర్పములను చంపుటగూర్చి బాబా అభిప్రాయము

ప్రస్తావన

బాబాను ధ్యానించుటెట్లు? భగవంతుని నైజమునుగాని, స్వరూపమునుగాని, అగాధములు. వేదములుగాని వెయ్యి నాలుకలు గల ఆదిశేషుడుగాని వానిని పూర్తిగ వర్ణింపలేరు. భక్తులు భగవంతుని రూపమును చూచి కనుగొని తీరవలెను. ఎందుకనగా తమ యానందమునకు భగవంతుని పాదములే ముఖ్యమార్గమని వారికి తెలియును. జీవిత పరమార్థమును పొందుటకు గురుని పాదములనే ధ్యానించవలెను గాని, యింకొక మార్గము లేదని వారలకు తెలియును. హేమాడ్ పంతు ఒక సులభమైన మార్గమును ఉపదేశరూపముగా చెప్పుచున్నాడు. అది ధ్యానమునకు భక్తికికూడ అనుకూలించును.

నెలలో కృష్ణపక్షమున రానురాను వెన్నెల క్రమముగా క్షీణించును. తుదకు అమావాస్యనాడు చంద్రుడు కానరాడు. వెన్నెల కూడ రాదు. శుక్లపక్షమును ప్రారంభించగనే ప్రజలు చంద్రుని చూచుటకు ఆతురపడెదరు. మొదటి దినము చంద్రుడు కానరాడు. రెండవనాడది సరిగా కనిపించదు. అప్పుడు రెండు చెట్టుకొమ్మల మధ్య గుండా చూడుమనెదరు. ఆతురతతో నేకధ్యానముతో ఆ సందుద్వారా చూచునపుడు దూరముగా నున్న చంద్రుని యాకారమొక గీతవలె గాన్పించును. వారప్పుడు సంతసించెదరు. ఈ సూత్రము ననుసరించి బాబా తేజమును జూచెదముగాక. బాబా కూర్చున్న విధానమును జూడుడు. అది యెంత సుందరముగా నున్నది! వారు కాళ్ళను ఒక దానిపైని ఇంకొకటి వేసియున్నరు. కుడికాలు ఎడమ మోకాలుపై వేసియున్నారు. ఎడమచేతి వ్రేళ్ళు కుడి పాదముపై వేసియున్నారు. కుడికాలి బొటనవ్రేలుపై చూపుడు వ్రేలున్ను, మధ్యవ్రేలున్ను వున్నవి. ఈ కూర్చున్న విధమును బట్టి చూడగా బాబా మనకీ దిగువ విషయము చెప్ప నిశ్చయించుకొన్నట్లున్నది. "నా ప్రకాశమును చూడవలెనంటే, అహంకారమును విడిచి మిక్కిలి యణకువతో చూపుడు వ్రేలుకు మధ్య వ్రేలుకు మధ్యనున్న బొటనవ్రేలుపై దృష్టిని సారించినచో నా ప్రకాశమును చూడగలరు. ఇది భక్తికి సులభమైన మార్గము."

ఒక క్షణము బాబా జీవితమును గమనించెదము. బాబా నివాసము వలన శిరిడీ యొక యాత్రాస్థలమాయెను. అన్ని మూలలనుండి ప్రజలచట గుమిగూడుచుండిరి. బీదవారు గొప్పవారు కూడ అనేకవిధముల మేలు పొందుచుండెడివారు. బాబా యొక్క యనంత ప్రేమను, ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును, వారి సర్వాంతర్యామిత్వమును వర్ణించగల వారెవ్వరు? వీనిలో నేదైన నొకదానిని గాని, యన్నియుగాని యనుభవించినవారు ధన్యులు. ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘమౌనము పాటించువారు. అది వారియొక్క బ్రహ్మబోధము. ఇంకొకప్పుడు చైతన్యఘనులుగా నుండువారు. ఆనందమునకవతారముగా, భక్తులచే పరివేష్టితులై యుండెడివారు. ఒక్కొక్కప్పుడు వారు నీతి బోధించు కధలను చెప్పెడివారు. ఇంకొకప్పుడు హాస్యము, తమాషా చేయుటలో మునిగెడివారు. ఒకప్పుడు సూటిగా మాట్లాడువారు. ఒక్కొక్కప్పుడూ కోపోద్దీపితుడా యని తొచువారు. ఒక్కొక్కప్పుడు తమ బోధలు క్లుప్తముగా చెప్పుచుండెడివారు. ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదములోనికి దించెడివారు. అనేకసార్లు ఉన్నదున్నట్లు మాట్లాడెడివారు. ఈ ప్రకారముగ వారనేక సలహాలు అవసరము ప్రకారమనేక మందికి ఇచ్చుచుండెడివారు. వారి జీవితమగోచరమైనది. మన మేధాశక్తికి భాషకు అందుబాటులో నుండెడిదికాదు. వారి ముఖమును జూచుటయందు ఆసక్తిగాని వారితో సంభాషించుటగాని, వారి లీలలు వినుటయందుగాని తనివి తీరెడిది కాదు. అయినప్పటికి సంతోషముతో నుప్పొంగుచుండేవారము. వర్షబిందువులను లెక్కించగలము; తోలుసంచిలో గాలిని మూయగలము. కాని బాబా లీలలను లెక్కింపలేము. వానిలో నొక్కదానిని గూర్చి చెప్పెదము. భక్తుల యాపదలను కనుగొని భక్తులను వానినుండి సకాలమున బాబా ఎట్లు తప్పించుచుండెనో యిచట చెప్పుదుము.

బాలాసాహెబు మిరీకర్

సర్దారు కాకాసాహెబు మిరీకర్ కొడుకగు బాలా సాహెబు మిరీకర్ కోపర్ గాం కు మామలత్ దారుగా నుండెను. చితలీ గ్రామ పర్యటనకు పోవుచుండెను. మార్గమధ్యమున బాబా ను చూచుటకు శిరిడి వచ్చెను. మసీదుకు బోయి, బాబాకు నమస్కరించెను. అతని యోగక్షేమముల గూర్చి మాట్లాడునప్పుడు బాబా జాగ్రర్తగా నుండవలెనని హెచ్చరిక చేయుచు నిట్లడిగెను. "నీకు మన ద్వారకామాయి తెలియునా?" బాలా సాహెబునకు బోధపడక పోవుటచే అతడూరకుండెను. "నీ విప్పుడూ కూర్చున్నదే ద్వారకామాయి. ఎవరయితే యామెతొడపయి కూర్చొనెదరో యామె వారిని కష్టములనుండి యాతురతల నుండి తప్పించును. ఈ మసీదుతల్లి చాల దయార్దృ హృదయురాలు. ఆమె నిరాడంబర భక్తులకు తల్లి. వారిని కష్టములనుండి తప్పించును. ఒక్కసారి మనుజులు ఆమె తొడపై కూర్చొనినచో, వారి కష్టము లన్నియు పోవును. ఎవరామె నీడ నాశ్రయించెదరో వారికి ఆనందము కలుగును." అనెను. పిమ్మట బాలా సాహెబుకు ఊదీప్రసాదమిచ్చి వాని శిరస్సుపై చేయి వేసెను. బాలాసాహెబు పోవుచుండగా బాబా యిట్లనెను. "నీకు పొడుగాటి బాబా తెలియునా? అనగా సర్పము." ఎడమ చేతిని మూసి, దానిని కుడిచేతి వద్దకు తెచ్చి పాముపడగవలె వంచి, "అది మిక్కిలి భయంకరమైనది. కాని ద్వారకా మాయిబిడ్డల నేమి చేయగలదు? ద్వారకామాయి కాపాడుచుండగా, ఆ సర్పమేమి చేయగలదు?" అనెను.

అక్కడున్నవారందరు దీని భావమును తెలిసికొనుటకు, దానికి మిరీకరుకు గల సంబంధమును దెలిసికొనుటకు కుతూహల పడుచుండిరి. కాని బాబా నీవిషయమై యడుగుటకు ధైర్యము లేకుండెను. బాలా సాహెబు బాబాకు నమస్కరించి మసీదును విడచి శ్యామాతో వెళ్ళెను. బాబా శ్యామాను బిలచి బాలాసాహెబుతో చితళీ వెళ్ళి యానందించుమనెను. బాబా యాజ్ఞానుసారము శ్యామా కూడ తనవెంట వచ్చెదనని బాలాసాహెబుతో చెప్పెను. అసౌకర్యముగ నుండునని కాన, రావద్దని బాలాసాహెబు శ్యామాతో చెప్పెను. శ్యామా బాబాకీ సంతగి దెలిపెను. బాబా యిట్లనెను. "సరే, వెళ్ళవద్దు, వాని మంచి మనము కోరితిమి. ఏది నుదుట వ్రాసియున్నదో యది కాక తప్పదు."

ఈ లోపల బాలాసహెబు తిరిగి యాలోచించి శ్యామాను వెంటరమ్మనెను. శ్యామా బాబా వద్దకేగి సెలవు పుచ్చుకొని బాలాసాహెబు తో టాంగాలో బయలుదేరెను. వారు రాత్రి 9 గంటలకు చితళీ చేరిరి. ఆంజనేయాలయములో బసచేసిరి. కచేరి లో పనిచేయువారెవ్వరు రాలేదు; కావున నెమ్మదిగా నొకమూల కూర్చొని మాట్ళాడుచుండిరి. చాపపైని కూర్చొని బాలాహాహెబు వార్తాపత్రిక చదువుచుండెను. అతడు ధరించిన అంగవస్త్రముపై నొక సర్పముండెను. దాని నెవ్వరును చూడలేదు. అది బుసకొట్టుచు కదలుచుండెను. ఆధ్వని నౌకరు వినెను. అతడొక లాంతరు దెచ్చి, సర్పమును జూచి పాముపామని యరచెను. బాలాసాహెబు భయపడెను. వణుకుట ప్రారంభించెను. శ్యామా కూడ ఆశ్చర్యంపడెను. అందరు మెల్లగా కట్టెలను దీసిరి. బాలాసాహెబు నడుమునుండి పాము దిగుటకు ప్రారంభించెను. దానిని కొట్టి చంపివేసిరి. ఈ ప్రకారముగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబును హానినుండి తప్పించిరి. బాబాయందు బాలాసాహెబుకు గల ప్రేమ దృఢమయ్యెను.

బాపుసాహెబు బుట్టీ

నానా సాహెబు డేంగలే యను గొప్ప జ్యోతిష్కుడు, బాపూసాహెబు బుట్టీ శిరిడీలో నుండునపుడు ఒకనాడిట్లనెను. "ఈ దినము ఆశుభము. నీ ప్రాణమునకు హాని కలదు." ఇది బాపు సాహెబును చలింపజేసెను. ఆయన యధాప్రకారము మసీదుకు రాగా బాబా బాపుసాహెబుతో నిట్లనియె. "ఈ నానా ఏమనుచున్నాడు? నీకు మరణమున్నదని చెప్పుచున్నాడు. సరే, నీవు భయపడనక్కరలేదు. వానికి ధైర్యముతో నిట్లు చెప్పుము. "మృత్యువు ఎట్లు చంపునో చూచెదము గాక." ఆనాటి సాయంకాలము బాపుసాహెబు బుట్టీ మరుగుదొడ్డికి పోయెను. అక్కడొక పామును జూచెను. అతని నౌకరు దానిని చూచెను. ఒక రాయినెత్తి కొట్టబోయెను. బాపుసాహెబు పెద్దకర్రను దీసికొని రమ్మనెను. నౌకరు కర్రను తీసికొని వచ్చునంతలో, పాము కదలిపోయి యదృశ్యమయ్యెను. ధైర్యముతో నుండుమని ఆడిన బాబా పలుకులను బాపుసహెబు జ్ఞప్తికి తెచ్చుకొని సంతోషించెను.

అమీరు శక్కర్

కోపర్ గాం తాలూకాలో కొరాలే గ్రామనివాసి అమీరు శక్కర్. అతడు కసాయి జాతికి చెందినవాడు; బాంద్రాలో కమీషను వ్యాపారి, పలుకుబడి కలవాడు. అతడు కీళ్ళ వాతము జబ్బుతో బాధపడుచుండుటచే భగవంతుని జ్ఞప్తికి దెచ్చుకొని వ్యాపారమును విడిచిపెట్టి శిరిడీ చేరి బాధ నుండి తప్పింపుమని బాబాను వేడెను. చావడిలో కూర్చొనుమని బాబా యాజ్ఞాపించెను. అటువంటి రోగికి ఈ స్థలము సరియైనది కాదు. అది ఎల్లప్పుడు చెమ్మగ నుండును. గ్రామములో నింకేదైన స్థలము బాగుండెడిది. బాబా పలుకులే తగిన యౌషదము, నిర్ణయసూత్రము. మసీదుకు వచ్చుటకు బాబా యనుజ్ఞనివ్వలేదు. చావడిలో కూర్చొనుమని యాజ్ఞాపించెను. అది వానికి మిక్కిలి లాభకారి యయ్యెను. ఎందుకనగా బాబా ఉదయము సాయంకాలము చావడి వైపు పోవుచుండెను. అదియును గాక దినము విడిచి దినము ఉత్సవముతో బోయు బాబా యచట నిద్రించుచుండెను. అందుచే అమీరు బాబా యొక్క సాంగత్యమును సులభముగ పొందుచుండెను. పూర్తిగ 9 మాసములు అమీరు శక్కర్ అక్కడ నుండెను. తరువాత ఆ స్థలముపై విసుగు కలిగెను. ఒకనాటి రాత్రి ఎవరికి చెప్పకుండ కోపర్ గాం పారిపోయెను. అచ్చటొక ధర్మశాలలో దిగెను. అచ్చటొక ఫకీరు చచ్చుటకు సిద్ధముగా నుండెను. నీళ్ళు కావలెననగా, అమీరు పోయి తెచ్చి యిచ్చెను. ఆ నీళ్ళను త్రాగి ఫకీరు చనిపోయెను. అమీరు చిక్కులో పడెను. అతడు పోలీసువారికి తెలియపరచినచో, మొట్టమొదట సమాచారమును దెచ్చిన వాడగుటచే వీనికావిషయమేమైన తెలిసియుండునని పట్టుకొనెదరు. ఆ చావునకు కూడ అతడు కారణభూతుడయి యుండవచ్చునని యనుమానించెదరు. బాబా యాజ్ఞ లేనిది శిరిడీ విడిచి పెట్టుట తనదే తప్పని అతడు గ్రహించెను; పశ్చాత్తాపపడెను. శిరిడీ పోవ నిశ్చయుంచుకొని యా రాత్రియే యచటినుండు శిరిడీకి పోయెను. మార్గమధ్యమున బాబా నామమును జపము చేయుచుండెను. సూర్యోదయమునకు ముందు శిరిడీ చేరి యాతురతనుండి తప్పించుకొనెను. బాబా యాజ్ఞానుసారము చావడి లోనే యుండి రోగముక్తుడయ్యెను. ఒకనాడు మధ్యరాత్రి బాబా "ఓ అబ్దుల్! పరుపువైపు ఏదో దుష్టప్రాణీ వచ్చుచున్నది." యని యరచెను. లాంతరు దీసికొని అబ్దుల్ వచ్చి బాబా పరుపు జూచెను గాని, ఏమియు గాన్పించలేదు. జాగ్రర్తగా చూడుమని బాబా చెప్పుచు నేలపై పటకాతో కొట్టుచుండెను. అమీరుశక్కర్ బాబా లీలను జూచి అచ్చటకు పాము వచ్చెనని బాబా అనుమానించి యుండునని యనుకొనెను. బాబా సాంగత్యమువలన, బాబా యాడు మాటల చేయు క్రియల భావమును అమీరు గ్రహించుచుండెను. (బాబా అబ్దుల్ ను లాంతరు తీసికొని రమ్మనెను.) అమీరు తన దిండుకు సమీపమున నేదో కదలుచుండుట గమనించెను. అంతలో నచ్చటొక పాము కనబడెను. అది తలను క్రిందికి పయికి ఆడించుచుండెను. వెంటనే దానిని చంపిరి. యిట్లు బాబా సకాలమున హెచ్చరిక చేసి అమీరును కాపాడెను.

హేమాడ్ పంతు (తేలు - పాము)

1. తేలు :- బాబా చెప్పుటచే కాకాసాహెబు దీక్షితు శ్రీ ఏకనాధ మహారాజుగారి రెండు గ్రంధములు భాగవతమును, భావార్థరామాయణమును నిత్యము పారాయణ చేయుచుండెను. ఒకనాడు పురాణ కాలక్షేపము జరుగుచుండగా హేమాడ్ పంతు గూడ శ్రోత యయ్యెను. రామాయణములో ఆంజనేయుడు తన తల్లి యాజ్ఞానుసారము శ్రీ రాముని మహిమను పరీక్షించుభాగము చదువునపుడు వినువారందరు మైమరచి యుండిరి. అందులో హేమాడ్ పంతొకడు. ఒక పెద్ద తేలు హేమాడ్ పంతు భుజము పైబడి వాని యుత్తరీయముపయి కూర్చుండెను. మొదట దానిని నెవ్వరు గనిపెట్టకుండిరి. ఎవరు పురాణముల వినెదరో వారిని భగవంతుడు రక్షించును గావున హేమాడ్ పంతు తన కుడి భుజముపై నున్న తేలును చూచెను. అది చచ్చినదానివలె నిశ్శబ్దముగా కదలకుండెను. అది కూడ పురాణము వినుచున్నట్లు గనుపించెను. భగవంతుని కటాక్షముచే నితరులకు భంగము కలుగజేయుకుండ తన యుత్తరీయము రెండు విచరలను పట్టుకొని, దానిలో తేలుండునట్లు జేసి, బయటకు వచ్చి తోటలో పారవైచెను.

2. పాము :- ఇంకొకప్పుడు సాయంకాలము కాకాసాహెబు మేడమీద కొందరు కూర్చొని యుండిరి. ఒక సర్పము కిటికీలో నున్న చిన్న రంధ్రము ద్వారా దూరి చుట్టుకొని కూర్చొనెను. దీపమును దెచ్చిరి. మొదట యది వెలుతురుకు తడబడెను. అయినప్పటికి అది నెమ్మదిగా కూర్చొనెను. దాని తలమాత్రము క్రిందకు మీదకు నాడించుచుండెను. అనేకమంది బడితెలు, కర్రలు తీసుకొని వేగముగ పోయిరి. అది ఎటుకాని స్థలములో నుండుటచే దానిని చంపలేకుండిరి. మనుష్యుల శబ్దమును విని యా సర్పము వచ్చిన రంధ్రములోనికి గబగబ దూరెను. అందరు ఆపదనుండి తప్పించుకొనిరి.

బాబా అభిప్రాయము

ముక్తారాం యను నొక భక్తుడు పాము తప్పించుకొని పోవుటచే మంచియే జరిగినదనెను. హేమాడ్ పంతు అందుల కొప్పుకొనలేదు. అది సరియైన యాలోచన కాదనెను. పాములను చంపుటయే మంచిదనెను. ఇద్దరికీ గొప్ప వాక్కలహము జరిగెను. ముక్తారాం సర్పములు మొదలగు క్రూరజంతువులను చంపనవసరము లేదనెను. హేమాడ్ పంతు వానిని తప్పక చంపవలెననెను. రాత్రి సమీపించెను. కలహము సమాప్తి గాకుండెను. ఆ మరుసటిదిన మా ప్రశ్న ను బాబానడిగిరి. బాబా యిట్లు జవాబిచ్చెను. భగవంతుడు సకలజీవులందు నివసించుచున్నాడు. అవి సర్పములుగాని, తేళ్ళుగాని కానిండు. ఈ ప్రపంచమును నడిపించు సూత్రధారి భగవంతుడు. సకలజంతుకోటి పాములు, తేళ్ళతో సహా భగవదాజ్ఞను శిరసావహించును. వారి యాజ్ఞయైనగాని ఎవరు ఇతరులకు హాని చేయలేరు. ప్రపంచమంతయు వానిపై నాధారపడి యున్నది. ఎవ్వరును స్వతంత్రులు కారు. కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలెను. అనవసరమైన కలహములందు, చంపుటయందు పాల్గొనక యోపికతో నుండవలెను. దేవుడందరిని రక్షించువాడు."

ఓం నమో శ్రీ సాయినాధాయ

శాంతిః శాంతిః శాంతిః

ఇరువదిరెండవ అధ్యాయము సంపూర్ణము