శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము - పి.నారాయణరావు Back   Home 

(నాలుగవదినము పారాయణము - ఆదివారము)

ఇరువదిమూడవ అధ్యాయము

యోగము - ఉల్లిపాయ
1.శ్యామా పాముకాటు బాగగుట 2.కలరా నియమముల నుల్లంఘించుట 3.గురుభక్తి పరీక్ష.

ప్రస్తావన

నిజముగా నీజీవుడు త్రిగుణములకు అనగా సత్వరజస్తమోగుణములకు అతీతుడు. కాని మాయచే గప్పబడి, వాని నైజమగు సచ్చిదానందమును మరచుచు తాను శరీరమే యనుకొనుచు, అట్టి భావనతో తానే చేయువాడు, అనుభవించువాడు అని యనుకొనుచు, లెక్కలేని బాధలలో చిక్కుకొనుచు విముక్తి ని గాంచలేకున్నాడు. విమోచనము నకు మార్గమొక్కటే గలదు. అది గురుని పాదములయందు ప్రేమ మయమగు భక్తి. గొప్పనటుడగు సాయి తన భక్తులను వినోదింపచేసి వారిని తన నైజములోనికి మార్చెను.

ఇంతకు పూర్వము చెప్పిన కారణములచే మేము సాయిని భగవంతుని యవతారముగా నెన్నుచున్నాము. కాని వారెల్లప్పుడు తాము భగవంతుని సేవకుడనని చెప్పెడివారు. వారు అవతారపురుషులయినప్పటికి ఇతరులు సంతృప్తికరముగా నెట్లు ప్రవర్తింపవలెనో చూపుచుండెడివారు; ఆయా వర్ణాశ్రమములకు విధింపబడిన కర్మల నెట్లు నెరవేర్చవలెనో తెలిపెడివారు. ఇతరులతో దేనిలోనయిన పోటి పడెడివారు కారు. తనకొరకేమైన చేయుమని యితరులను కోరెడి వారు కారు. సమస్త చేతనాచేతనములందు, భగవంతుని జూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితమని, ఎవరిని నిరాదరించుటగాని, అవమానించుట గాని వారెరుగరు. సమస్తజీవులలో వారు నారాయణుని గాంచుచుండెడివారు. "నేను భగవంతుడను" అని వారెన్నడు అనలేదు. భగవంతుని విధేయ సేవకుడనని చెప్పేవారు. భగవంతుని ఎల్లప్పుడూ తలచువారు. ఎల్లప్పుడు "అల్లా మాలిక్" అనగా భగంతుడే సర్వాధికారియని యనుచుండెడివారు.

మేమితర యోగులనెరుగము. వారెట్లు ప్రవర్తింతురో, ఏమి చేసెదరో, ఎట్లు తినెదరో తెలియదు. భగవత్కటాక్షముచే వారవతరించి యజ్ఞానులకు, బద్ధజీవులకు విమోచనము కలుగజేసెదరని సూత్రమెరుగురుము. మన పుణ్యమేమైన యున్నచో యోగుల కధలను లీలలను వినుటకు కుతూహలము కలుగును. లేనిచో నట్లు జరుగదు. ఇక నీ యధ్యాయములోని ముఖ్య కధలను చూచెదము.

యోగము - ఉల్లిపాయ

ఒకనాడు యోగాభ్యాసము చేయు విధ్యార్థి ఒకడు నానాసాహెబు చాందోర్కరు తో శిరిడీకి వచ్చెను. అతడు యోగశాస్త్రమునకు సంబంధించిన గ్రంధములన్నియు చదివెను. తుదకు పతంజలి యోగసూత్రములు కూడ చదివెను. కాని, యనుభవమేమియు లేకుండెను. అతడు మనస్సును కేంద్రీకరించి సమాధిస్థితిలో కొంచెము సేపయిన నుండలేకుండెను. సాయిబాబా తన ఎడ ప్రసన్నుడైనచో చాలసేపు సమాధిలోనుండుట నేర్పెదరని అతడనుకొనెను. ఈ లక్ష్యముతో నాతడు శిరిడీకి వచ్చెను. అతడు మసీదుకు పోయి చూచుసరికి బాబా ఉల్లి పాయతో రొట్టె తినుచుండిరి. దీనిని చూడగనే అతనికి మనస్సున ఒక యాలోచన తట్టేను. "రుచిలేని రొట్టెను పచ్చియుల్లిపాయతో తినువాడు నా కష్టముల నెట్లు తీర్చగలడు? నన్నెట్లు ఉద్ధరించగలడు?" సాయిబాబా యతని మనస్సున నున్నదానిని కనిపెట్టి నానాసాహెబుతో నిట్లనియెను. "నానా! ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకొను శక్తి గలదో వారే దానిని తినవలెను." ఇది విని, యోగి యాశ్చర్యపడెను, వెంటనే బాబా పాదములపయి బడి సర్వస్యశరణాగతి చేసెను. స్వచ్చమైన మనస్సుతో తన కష్టముల దెలిపి ప్రత్యుత్తరముల బడసెను. ఇట్లు సంతృప్తి చెంది యానందించిన వాడై బాబా ఊది ప్రసాదముతో ఆశీర్వచనములతో శిరిడి విడిచెను.

పాముకాటునుండి శ్యామాను కాపాడుట

ఈ కధను ప్రారంభించక పూర్వము హేమాడ్ పంత్, జీవుని పంజరములోనున్న రామచిలుక తో సరిపోల్చవచ్చుననిరి, రెండును బంధింపబడియే యున్నవి; ఒకటి శరీరములోను, రెండవది పంజరమందును. రెండును తమ ప్రస్తుతస్థితియే బాగున్నదని యనుకొనుచున్నవి. సహాయకుడు వచ్చి, వానిని బంధములనుండి తప్పించగనే వానికి నిజము తెలియును., భగవత్కటాక్షముచే గురువు వచ్చి వారి కండ్లను తెరిపించి బంధవిముక్తుల జేసినప్పుడు వారి దృష్టి యన్నిటికంటే గొప్ప స్థితివైపు బోవును. అప్పుడే గతించిన జీవితముకంటే రానున్నది గొప్పదియని గ్రహింతురు.

గత అధ్యాయములో మిరీకర్ కు రానున్న యపాయము గనిపెట్టి దానినుండి యతనిని తప్పించిన కధ వింటిరి. అంతకంటే ఘనమగు కధను ఇచ్చట వినెదరు. ఒకనాడు శ్యామాను విషసర్పము కరచెను. అతని చిటికెనవ్రేలును పాము కరచుటచే శరీరములోనికి విషము వ్యాపింప మొదలిడెను. బాధ ఎక్కువగా నుండెను. శ్యామా తాను మరణించెద ననుకొనెను. స్నేహితులాతని విఠోబా గుడికి తీసికొనిపోవ నిశ్చయించిరి. పాము కాట్లు అచ్చట బాగగుచుండెను. కాని శ్యామ తన విఠోబా యగు బాబా వద్దకు పరుగిడెను. బాబా అతనిని జూడగనే ఊసడించుకొని వానిని తిట్టనారంభించెను. కోపోద్ధీపితుడయి బాబా యిట్లనైయె, "ఓరి పిరికి పురోహితుడా! ఎక్కవద్దు, నీ వెక్కినచో నేమగునో చూడు" మని బెదిరించి తరువాత ఇట్లు గర్జించెను. "పో, వెడలి పొమ్ము, దిగువకు పొమ్ము." బాబా ఇట్లు కోపోద్ధీపితుడగుట జూచి శ్యామా మిక్కిలి విస్మయ మందెను., నిరాశ చెందెను, అతడు మసీదు తన యిల్లుగా బాబా తన యాశ్రయముగా భావించుచుండెను. ఇట్లు తరిమివేసినచో తానెక్కడకు పోగలడు? అతడు ప్రాణమందాశ వదలుకొని యూరకుండెను. కొంతసేపటికి బాబా మామూలు స్థితికి వచ్చెను. శ్యామా దగ్గరకు పోయి కూర్చుండెను. అప్పుడు బాబా యిట్లనెను. "భయపడవద్దు. ఏ మాత్రము చింతించకు. ఈ దయార్ద్ర ఫకీరు నిన్ను రక్షించును. ఇంటికి పోయి ఊరక కూర్చుండుము. బయటికి పోవద్దు. నాయందు విశ్వాసముంచుము. నిర్భయుడవు కమ్ము. ఆతురపడవద్దు." ఇట్లని శ్యామను ఇంటికి పంపించెను. వెంటనే బాబా తాత్యా పటేలును, కాకా సాహెబు దీక్షితును అతనివద్దకు పంపి తన కిష్టము వచ్చినవి తినవచ్చుననియు, గృహములోనే తిరుగవచ్చుననియు, కాని పండుకొనగూడదనియు, ఈ సలహాల ప్రకారము నడుచుకొమ్మనెను. కొద్దిగంటలలో శ్యామా బాగుపడెను. ఈ పట్టున జ్ఞప్తియందుంచుకొనవలసిన దేమన బాబా పలికిన 5 అక్షరముల మంత్రము (పో, వెడలిపొమ్ము, క్రిందకు దిగు) శ్యామాను ఉద్దేశించినదిగాక సర్పమును అజ్ఞాపించిన మాటలు. దాని విషము పైకి ఎక్కరాదనియు, అది శరీరమంతట వ్యాపింపరాదనియు ఆజ్ఞాపించిరి. మంత్రములలో నారితేరిన తక్కినవారివలె, వారేమంత్రము ఉపయోగింప నవసరము లేకుండెను. మంత్రబియ్యము గానీ, తీర్థము గానీ ఉపయోగించనవసరము లేకుండెను. శ్యామా జీవితమును రక్షించుటలో వారి పలుకులే మిక్కిలి బలమైనవి.

ఎవరైన ఈ కధగాని యింక నితరకధలుగాని, వినినచో బాబా పాదములయందు స్థిరమైన నమ్మకము కలుగును. మాయయను మహాసముద్రమును దాటుట కు బాబా పాదములను హృదయములో ధ్యానించవలెను.

కలరా రోగము

ఒకప్పుడు శిరిడీ లో కలరా భయంకరముగా చెలరేగుచుండెను. గ్రామవాసులు మిక్కిలి భయపడిరి. వారితరులతో రాకపోకలు మానిరి. గ్రామములో పంచయితీవారు సభచేసి రెండత్యవసరమైన నియమములు చేసి కలరా నిర్మూలించ ప్రయత్నించిరి. అవి ఏవన - 1.కట్టెల బండ్లను గ్రామములోనికి రానీయకూడదు. 2. మేకను గ్రామములో కోయరాదు. ఎవరయిన వీనిని ధిక్కరించినచో వారికి జరిమానా వేయవలెనని తీర్మానించిరి. బాబా కిదంతయు వట్టి చాదస్తమని తెలియును. కాబట్టి బాబా యా చట్టములను లక్ష్యపెట్టలేదు. ఆ సమయములో కట్టెలబండి యొకటి ఊరిలోనికి ప్రవేశించుచుండెను. ఊరిలో కట్టెలకు కరువున్నదని అందరికి తెలియును. అయినప్పటికి కట్టెలబండిని తరిమివేయుటకు ప్రయత్నించుచుండిరి. బాబా యీ సంగతి తెలిసికొనెను. అచ్చటికి వచ్చి, కట్టెల బండిని మసీదుకు తీసికొనిపొమ్మని యుత్తరువు నిచ్చెను. బాబా చర్యకు వ్యతిరేకముగ చెప్పుటకెవ్వరు సాహసించలేదు. ధునికొరకు కట్టెలు కావలసియుండెను. కనుక బాబా కట్టెలను కొనెను. నిత్యాగ్నిహోత్రివలె బాబా తన జీవితమంతయు ధునిని వెలిగించెయే యుంచెను. అందులకయి వారికి కట్టెలవసరము గనుక నిల్వచేయువారు. బాబా గృహమనగా మసీదు, ఎప్పుడూ తెరచియుండెడిది, ఎవరయిన పోవచ్చును. దానికి తాళము గాని చెవిగాని లేదు. కొందరు తమ యుపయోగము కొరకు కొన్ని కర్రలను తీసికొని పోవువారు. అందుకు బాబా ఎప్పుడును గొణుగుకొనలేదు. ఈ ప్రపంచమంతయు దేవుడే యావరించి యుండుటచే వారికి ఎవరియందు శతృత్వముండెడిది గాదు. వారు పరిపూర్ణవిరాగులై నప్పటికి, సాధారణగృహస్థులకు ఆదర్శముగ నుండుటకై యిట్లు చేయుచుండెడివారు.

గురుభక్తిని పరీక్షించుట

రెండవ కలరా నిబంధనమును బాబా ఎట్లు ధిక్కరించెనో చూతము. నిబంధన లమలులో నున్నప్పుడెవరో యొక మేకను మసీదుకు తెచ్చిరి. ఆ ముసలి మేక దుర్బలముగ చావుకు సిద్ధముగ నుండెను. అ సమయమున మాలేగాం ఫకీరు పీర్ మహమ్మద్ ఉరఫ్ బడే బాబా యచటనే యుండెను. సాయి బాబా దానిని ఒక కత్తి వ్రేటుతో నరికి, బలి వేయుమని బడేబాబాకు చెప్పెను. ఈ బడేబాబా యందు సాయిబాబాకు ఎక్కువ గౌరవము. ఆయన ఎల్లప్పుడు సాయిబాబాకు కుడివయిపు కూర్చొనెడివారు. చిలుము బడేబాబా పీల్చినపిదప, సాయి బాబా పీల్చి యితరుల కిచ్చెడివారు. మధ్యాహ్నభోజనసమయమందు సాయి బడేబాబాను పిలిచి ఎడమప్రక్కన కూర్చుండబెట్టుకొనిన పిమ్మట భోజనమును ప్రారంభించువారు. దక్షిణరూపముగా వసూలయిన పైకమునుంచి ఆయనకు దినమొక్కంటికి 50 రూపాయలు సాయిబాబా యిచ్చుచుండెడివారు. బడేబాబా పోవునపుడు 100 అడుగులవరకు సాయిబాబా వెంబడించువారు. అట్టిది బాబాకు వారికి గల సంబంధము. సాయిబాబా వారిని మేకను నరుకు మనగా అనవసరముగా దానిని చంపనేల యని బడేబాబా నిరాకరించెను. అప్పుడు సాయిబాబా శ్యామాను ఆపని చేయుమనెను. అతడు రాధాకృష్ణమాయివద్దకు బోయి కత్తిని దెచ్చి బాబా ముందు పెట్టెను. ఎందులకు కత్తిని దెప్పించిరో తెలిసికొనిన పిమ్మట రాధాకృష్ణమాయి దానిని తిరిగి తెప్పించుకొనెను. ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామా పోయెను, కాని వాడలో నుండి త్వరగా రాలేదు. తరువాత కాకాసాహెబు దీక్షిత్ వంతు వచ్చెను. వారు మేలిమి బంగారమే కాని, దానిని పరీక్షించవలెను. ఒక కత్తి దెచ్చి నరుకుమని బాబా యాజ్ఞాపించెను. అతడు సాఠేవాడకు బోయి కత్తిని దెచ్చెను. బాబా యుత్తరువు కాగానే దానిని నరకుటకు సిద్ధముగా నుండెను. అతడు స్వచ్చమైన బ్రాహ్మణకుటుంబములో పుట్టి చంపుట యనునది ఎరుగకుండిరి. హింసించుపనులను చేయుటయందిష్టము లేనివాడయినప్పటికి, మేకను నరకుటకు సంసిద్ధుడయ్యెను. బడేబాబా యను మహమ్మదీయుడే యిష్టపడనప్పుడు ఈ బ్రాహ్మణుడేల సిద్ధపడుచుండెనని యందరాశ్చర్యపడుచుండిరి. అతడు తన ధోవతిని ఎత్తి బిగించి కట్టుకొనెను. కత్తిని పయికెత్తి బాబా యాజ్ఞకై ఎదురు చూచుచుండెను. బాబా 'ఏం యాలోచించుచుంటివి? నరుకుము" అనెను. అతని చేతిలోనున్న కత్తి మేకపై పడుటకు సిద్ధముగా నుండగా బాబా "ఆగు" మనెను. "ఎంతటి కఠినాత్ముడవు. బ్రాహ్మణుడవయి మేకను చంపెదవా?" యనెను. బాబా యాజ్ఞానుసారము దీక్షిత్ కత్తిని క్రిందబెట్టి బాబాతో యిట్లనియె. "నీ యమృతమువంటి పలుకే మాకు చట్టము. మాకింకొక చట్టమేమియు తెలియదు. నిన్నే ఎల్లప్పుడు జ్ఞప్తియందుంచుకొనెదము. నీ రూపమును ధ్యానించుచు రాత్రింబవళ్ళు నీ యాజ్ఞలు పాటింతుము. అది ఉచితమా? కాదా? యనునది మాకు తెలియదు, దానిని మేము విచారించము. అది సరియైనదా? కాదా? యని వాదించము, తర్కించము, గురువు ఆజ్ఞ అక్షరాల పాలించుటయే మా విధి, మా ధరమ్ము."

బాబాయే మేకను చంపి బలివేసెదనని చెప్పిరి. మేకను "తకియా" యనుచోట చంపుటకు నిశ్చయించిరి. ఇది ఫకీరులు కూర్చొను స్థలము. అచటకు దానిని తీసికొనిపోవునపుడు మార్గమధ్యమున అది ప్రాణములు విడిచెను.

శిష్యులెన్ని రకములో చెప్పుచు ఈ యధ్యాయము హేమాడ్ పంతు ముగించుచున్నారు. శిష్యులు మూడు రకములు - 1. ఉత్తములు 2. మధ్యములు, 3. సాధారణులు.

గురువులకేమి కావలెనో గుర్తించి వెంతనే వారాజ్ఞాపించక పూర్వమే దానిని నెరవేర్చువారు ఉత్తము శిష్యులు. గురుని యాజ్ఞానుసారము ఆలసింపక అక్షరాల నెరవేర్చువారు మధ్యములు. ముడవ రకమువారు, అడుగడుగునకు తప్పులు చేయుచు గురుని అజ్ఞను వాయిదా వేసెదరు.

శిధ్యులకు దృఢమైన నమ్మకముండవలెను. తోడుగా బుద్ధికుశలత యోరిమి యున్నచో అట్టివారికి ఆధ్యాత్మికపరమావధి దూరము కాదు. ఉచ్ఛ్వాస, నిశ్శ్వాసములను బంధించుటగాని, హఠయోగము గాని యితర కఠినమయిన సాధనలన్నియు ననవసరము. పైన చెప్పిన గుణముల నలవరచుకొన్నచో, వారు ఉత్తరోత్తరోపదేశముల కర్హులగురురు. అప్పుడు గురువు తటస్థించి జీవితపరమావధిని పొందుటకై ఆధ్యాత్మిక మార్గమున నడిపింతురు.

వచ్చే అధ్యాయములో బాబా గారి హాస్యము, చమత్కారముల గూర్చి చెప్పుకొందము.

ఓం నమో శ్రీ సాయినాధాయ

శాంతిః శాంతిః శాంతిః

ఇరువదిమూడవ అధ్యాయము సంపూర్ణము