శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము - పి.నారాయణరావు Back   Home 

ఇరువది నాలుగవ అధ్యాయము

బాబా హాస్యము, చమత్కారము, శనగల లీల
1.హేమాడ్ పంతు 2.సుదామ 3.అన్నా చించణీకర్, మావిశీబాయి - కధలు.

ప్రస్తావన

ఈ అధ్యాయములోగాని, వచ్చే అధ్యాయములోగాని ఫలానిది చెప్పెదమనుట ఒక విధముగ అహంకారమే. మన సద్గురుని పాదములకు అహంకారమును సమర్పించినగాని, మన ప్రయత్నమందు జయమును పొందము. మన మహంకారరహితుల మయినచో, మన జయము నిశ్చయము.

సాయిబాబాను పూజించుటచే ఇహపరసౌఖ్యములు రెంటిని పొందవచ్చును. మన మూలప్రకృతియందు పాతుకొని, శాంతిసౌఖ్యములను పొందెదము. కాబట్టి ఎవరయితే క్షేమమును కోరెదరో వారు గౌరవాదరములతో సాయిబాబా లీలలను వినవలెను; మననము చేయవలెను. దీనిని నెరవేర్చినచో వారు సులభముగా జీవితమరమావధిని పొందెదరు. తుదకు మోక్షానందమును పొందెదరు.

సాధారణముగా నందరు హాస్యము, చమత్కార భాషణమన్న నిష్టపడెదరు గాని, తాము హాస్యాస్పదులగుట కిష్టపడరు. కాని బాబా చమత్కారమార్గము వేరు. అది అభినయముతో కూడినప్పుడు చాల సంతోషదాయకముగ నీతిదాయకముగ నుండెడిది. కావున ప్రజలు తాము వెక్కిరింతలపాలై నప్పటికి అంతగా బాధపడేవారు కారు. హేమాడ్ పంతు తన విషయమునే యీ క్రింద తెలుపుచున్నాడు.

శనగల కధ

శిరిడీలో ఆదివారమునాడు సంత జరిగెడిది. చుట్టుప్రక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధులలో దుకాణములు వేసికొని వారి సరుకులు అమ్ముచుండెడివారు. ప్రతిరోజు మధ్యాహ్నము 12 గంటలకు మసీదు నిండుచుండెను. ముఖ్యముగా ఆదివారమునాడు క్రిక్కిరిసి పోవుచుండెను. ఒక ఆదివారమునాడు హేమాడ్ పంతు సాయిబాబా ముందు కూర్చొని బాబా పాదము లొత్తుచు మనస్సునందు జపము చేయుచుండెను. బాబా ఎడమ వైపు శ్యామా, కుడివైపు వామనరావు వుండిరి. శ్రీమాన్ బుట్టీ, కాకాసాహెబ్ దీక్షిత్ మొదలగువారు కూడ నుండిరి. శ్యామా నవ్వుచు అణ్ణా సాహెబుతో "నీ కోటుకు శనగగింజ లంటినట్లున్నవి చూడుము" అనెను. అట్లనుచు హేమాడ్ పంతు చొక్కాచేతులను తట్టగా శనగగింజలు నేల రాలెను. హేమాడ్ పంతు తన చొక్కా ఎడమ చేతి ముందుభాగమును సాచెను. అందరికి ఆశ్చర్యము కలుగునట్లు కొన్ని శనగగిజలు క్రిందకి దొర్లుట ప్రారంభించెను. అక్కడున్నవారు వానిని ఏరుకొనిరి.

ఈ సంఘటనము హాస్యమునకు తావిచ్చెను. అక్కడున్నవారందరు ఆశ్చర్యపడిరి. ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కాచేతిలో నెట్లు ప్రవేశించియుండెనో ఊహింపనారంభించిరి. శనగలు చొక్కాలో నెట్లు దూరి యచట నిలువగలిగినవో హామాడ్ పంతు కూడ గ్రహించ లేకుండెను. ఎవ్వరికిని సరియైన సమాధానము తోచక జవాబు నివ్వనప్పుడు అందరును ఈ యద్భుతమున కాశ్చర్యపడుచుండగా బాబా ఇట్లనియె, "వీనికి (అణ్ణసాహెబుకు) తానొక్కడే తిను దుర్గుణ మొకటి గలదు. ఈనాడు సంతరోజు శనగలు తినుచు ఇక్కడకు వచ్చినాడు. వాని నైజము నాకు తెలియును. ఈ శనగలే దానిని నిదర్శనము. ఈ విషయములో నేమి యాశ్చర్యమున్నది?"

హేమాడ్ పంతు :- బాబా నేనెప్పుడు ఒంటరిగా తిని ఎరుగను. అయితే యీ దుర్గుణమును నాపై నేల మోపెదవు? ఈనాటికి ఎన్నడును శిరిడీలోని సంత నేను చూచి యుండలేదు. ఈ దినము కూడ నేను సంతకు పోలేదు. అట్లయినచో నేను శనగల నెట్లు కొనియుంటిని? నేను కొననపుడు నేనెట్లు తినియుందును? నా దగ్గరనున్నవారికి పెట్టకుండ నేనెప్పుడేమియు తిని ఎరుగను.

బాబా:- అవును అది నిజమే. దగ్గరున్నవారికిచ్చెదవు. ఎవరును దగ్గర లేనప్పుడు నీవుగాని, నేను గాని ఏమి చేయగలము? కాని నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా? నేనెల్లప్పుడు నీ చెంత లేనా? నీవేదైన తినుటకు ముందు నాకర్పించుచున్నావా?

నీతి

ఈ సంఘటనమున బాబా ఏమి చెప్పిరో జాగ్రర్తగా గమనించెదము. పంచేంద్రియములకంటే ముందే, మనస్సు, బుద్ధి విషయానందమనుభవించును. కనుక మొదలే భగవంతుని స్మరించవలెను. ఇట్లు చేసినచో, నిది కూడ ఒకవిధముగ భగవంతుని కర్పితమగును. విషయములను విడచి పంచేంద్రియములుండలేవు. కనుక ఆ విషయములను మొదట గురుని కర్పించినచో వానియందభిమానము సహజముగ అదృశ్యమైపోవును. ఇవ్విధముగా కామము, క్రోధము, లోభము మొదలగువాని గూర్చిన వృత్తులన్నిటిని (ఆలోచనలను) మొట్టమొదట గురుని కర్పించవలెను. ఈ అభ్యాసము నాచరించినచో దేవుడు వృత్తులన్నియు నిర్మూలనమగుటకు సహాయపడును. విషయముల ననుభవించుముందు బాబా మనచెంతనే యున్నట్లు భావించినచో, నా వస్తువుననుభవింపవచ్చునా? లేదా? యను ప్రశ్న ఏర్పడును. ఏది యనుభవించుటకు తగదో దానిని విడిచిపెట్టెదము. ఈ విధముగ మన దుర్గుణములన్నియు నిష్క్రమించును. మన శీలము చక్కబడును. గురువు నందు ప్రేమ వృద్ధిపొందును. శుద్ధజ్ఞానము మొలకెత్తును. ఈ జ్ఞానము వృద్ధిపొందినపుడు దేహబుద్ధి నశించి, బుద్ధి చైతన్యఘనమున లీనమగును. అప్పుడే మన కానందము, సంతృప్తి కలుగును. గురువునకు, దేవునకు ఎవరు భేదము నెంచెదరో వారు దైవము నెచ్చటను జూడలేరు. భేదభావములన్నిటిని ప్రక్కకు త్రోసి, గురువును, దేవుని ఒకటిగా భావించవలెను. ఈ ప్రకారముగ గురుని సేవించినచో భగవంతుడు నిశ్చయముగ ప్రీతిచెందును. మన మనస్సులను స్వచ్చము చేసి, ఆత్మసాక్షాత్కారము ప్రసాదించును. క్లుప్తముగ చెప్పునదేమన మనము గురుని స్మరించనిదే ఏ వస్తువును పంచేంద్రియములతో ననుభవించరాదు. మనస్సును ఈ విధముగా శిక్షించినచో మనమెల్లప్పుడు బాబాను జ్ఞప్తియందుంచుకొనెదము. మనకు బాబా ధ్యానమెన్నో రెట్లు వృద్ధిపొందును. బాబా సగుణస్వరూపము మన కండ్ల ఎదుట నిలుచును. అప్పుడు భక్తి, వైరాగ్యము, మోక్షము మన వశమగును. మన మనస్సునందు బాబాను ఎప్పుడయితే నిలుపగలమో, అప్పుడు మనము ఆకలిని, పిపాసను, సంసారమును మరచెదము. ప్రపంచసుఖములందు గల యభిలాష నశించి మన మనస్సులు శాంతిని, అనందమును పొందును.

సుదాముని కధ

పై కధ చెప్పుచున్నప్పుడే హేమాడ్ పంతుకు సుదాముని కధ జ్ఞప్తికి వచ్చెను. అందులోకూడ ఇదే నీతి యున్నది. కనుక దాని నిక్కడ చెప్పుచున్నాము.

శ్రీ కృష్ణుడు, ఆని యన్న బలరాముడు, మరియొక సహపాఠి సుదముడను వాడును గురువగు సాందీపని యాశ్రమములో నివసించుచుండిరి. శ్రీ కృష్ణబలరాములను అడవికి పోయి కట్టెలు తీసికొని రమ్మని గురువు పంపెను. సాందీపని భార్య సుదాముని కూడ అదే పని మీద ముగ్గురికొరకు శనగలిచ్చి పంపెను. కృష్ణుడు సుదాముని యడవిలో గలసి యిట్లనెను. "దాదా నాకు నీళ్ళు కావలెను, నాకు దాహము వేయుచున్నది." సుదాముడు, "ఉత్త కడుపుతో నీరు త్రాగకూడదు, కనుక కొంత తడవాగుట మంచి" దనెను. కాని తనవద్ద శనగలున్నవని, కొంచెము తినుమని యనలేదు. శ్రీ కృష్ణుడు అలసియుండుటచే సుదాముని తొడపయి తలయుంచి గుర్రుపెట్టుచు నిద్రపోయెను. ఇది కనిపెట్టి సుదాముడు తన జేబులోని శనగలు తీసి తినుట కారంభించెను. హఠత్తుగ శ్రీ కృష్ణుడిట్లనియె. "దాదా! ఏమి తినుచుంటివి? ఎక్కడనుంచి యీ శబ్దము వచ్చుచున్నది?" సుదాముడిట్లనెను, "తినుట కేమున్నది? నేను చలితో వణకుచున్నాను. నా పండ్లు కట కట మనుచున్నవి, విష్ణుసహస్రనామమును కూడ సరిగ ఉచ్చరించలేకున్నాను." ఇది విని సర్వజ్ఞుడగు శ్రీ కృష్ణుడిట్లనెను, "నేనొక స్వప్నమును గంటిని. అందులో ఒకడింకొకరి వస్తువులను దినుచుండెను. ఏమి తినుచుంటివని యడుగగా ఏమున్నది తినుటకు మన్నా? యనెను. అనగ తినుటకేమియు లేదని భావము. రెండవవాడు "తధాస్తు" అనెను. దాదా! ఇది ఒక స్వప్నము. నా కివ్వకుండ నీవేమి తినవని నాకు తెలియును. స్వప్న ప్రభావముచే నీవేమి తినుచుంటివని యడిగితిని." శ్రీ కృష్ణుడు సర్వజ్ఞుడనిగాని, అతని లీలలు గాని తెలిసియున్నచో సుదాముడట్లు చేసియుండడు. కాబట్టి అతడు చేసినదానిని తానే యనుభవింపవలసి వచ్చెను. శ్రీ కృష్ణుని ప్రియస్నేహితుడయినప్పటికి అతని ఉత్తరకాల మంతయు గర్భదారిద్ర్యముచే బాధపడవలసి వచ్చెను. కొన్నాళ్ళకు భార్య కష్టము చేసి సంపాదించిన పిడికెడు అటుకులు సమర్పించగనే శ్రీ కృష్ణుడు సంతసించి ఒక బంగారు పట్టణము ననుభవించుట కిచ్చెను. ఎవరికయితే దగ్గరున్నవారికియ్యకుండ తిను అలవాటుండునో వారు దీనిని జ్ఞప్తియందుంచుకొనవలెను.

శ్రుతి కూడ దీనినే నొక్కి చెప్పుచున్నది. మొదట భగవంతునికి అర్పించి, ఆ భుక్త శేషమునే మనము అనుభవించవలెను. బాబా కూడ దీనినే హాస్యరూపముగా యుక్తితో బోధించెను.

అణ్ణా చించణీకరు, మావిశీబాయి

హేమాడ్ పంతు ఇచట నింకొక హాస్యసంఘటనను అందులో బాబా చేసిన మధ్యవర్తిత్వమును వర్ణించెను. దామోదర్ ఘన్ శ్యాం బాబర్ వురఫ్ అణ్ణా చించణీకర్ యను భక్తుడొకడు గలడు. అతడు సరళుడు, మోటువాడు, ముక్కుసూటిగ మాట్లాడువాడు, ఎవరిని లక్ష్యపెట్టువాడు కాడు. ఉన్నదున్నట్లు చెప్పేవాడు. ఎప్పటి దప్పుడే తేల్చువాడు. బయటికి కఠినునివలెను, హఠము చేయువానివలెను, గన్పించినను, వాడు మంచిహృదయము గలవాడు. నక్కజిత్తులవాడు కాడు. అందుచే బాబా వానిని ప్రేమించుచుండెను. అందరు సేవ చేయునట్లే, యితడు కూడ మధ్యాహ్నము బాబా ఎడమచేతిని (కఠడా పైన వేసియుండు దానిని) తోముచుండెను కుడివయిపున ఒక ముసలి వితంతువు వేణుబాయి కౌజల్గి యనునామె యుండెను. అమెను బాబా "అమ్మా" యని పిలుచుచుండెను. ఇతరులు మావిశీబాయి యని పిలిచెడి వారు. అమెకూడ బాబాను సేవించుచుండెను. ఈమెది స్వచ్చమైన హృదయము. ఈమె బాబా నడుమును మొలను వీపును తన రెండు చేతుల వ్రేళ్ళు అల్లి, దానితో నొక్కుచుండెను. అమె దీనిని అతి తీవ్రముగా చేయుచుండెను. బాబా వీపు కడుపు కలిసిపోవునట్లు గాన్పించుచుండెను. ఇంకొకప్రక్క అణ్ణా తోముచుండెను. మావిశీబాయి ముఖము క్రిందకు మీదకగుచుండెను. ఒకసారి యామె మొఖము అణ్ణా ముఖము నకు చాల దగ్గరగా బోయెను. హాస్యమాడు నైజము గలదగుటచే నామె యిట్లనెను. "ఓహో! యీ అణ్ణా చెడ్డవాడు, నన్ను ముద్దుబెట్టుకొనుటకు యత్నించుచున్నాడు. ఇంత ముసలివాడయినప్పటికి నన్ను ముద్దు బెట్టుకొనుటకు సిగ్గులేదా?" యనెను. అణ్ణాకు కోపము వచ్చెను. చొక్కా చేతులు పైకెత్తి అతడిట్లనెను. "నేను ముసలివాడను దుర్మార్గుడ ననుచున్నావు. నేను వెర్రివాడనా? నీవే కలహమునకు కాలుదువ్వుచున్నావు." అక్కడున్న వారందరు ఈ ముసలివాండ్ర కలహమును జూచి నవ్వుచుండిరి. బాబా యిద్దరిని సమానముగ ప్రేమించువారు. కనుక ఇద్దరిని ఓదార్చవలెనని తలచి యీ క్రింది విధముగ నేర్పుతో సమాధానపరచెను. బాబా ప్రేమతో "ఓ అణ్ణా! ఎందుకనవసరముగ గోల చేయుచున్నావు? తల్లిని ముద్దు పెట్టుకొనినచో దానిలో అనౌచిత్యమేమి?" అనెను. బాబా మాటలు విని, ఇద్దరు సంతుష్టి చెందిరి. అందరు సరదాగా నవ్విరి. బాబా చమత్కారమునకు హృదయానందపూరితులైరి.

బాబా నైజము, భక్తపరాయణత్వము

బాబా తన భక్తులను వారి వారి యిష్టానుసారము సేవ చేయుటకు అనుమతించుచుండెను. దీనిలో నితరులు జోక్యము కలుగజేసికొనుట బాబా కిష్టము లేదు. ఒక ఉదాహరణము నిచ్చెదము. ఈ మావిశీబాయియే యికొకప్పుడు బాబా పొత్తికడుపును తోముచుండెను. ఆమె ప్రయోగించు బలమును జూచి, యితర భక్తులు ఆతురపడిరి. వారిట్లనిరి. "అమ్మా! కొంచెము మెల్లగా తోముము. బాబా కడుపులోని ప్రేవులు, నరములు తెగిపోగలవు", ఇట్లనగనే, బాబా వెంటనే లేచి కోపముతో పటకాను నేలపై గొట్టెను. వారి కండ్లు నిప్పుకణములవలె ఎర్రనాయెను. బాబాను జూచుట కెవ్వరికి ధైర్యము లేకుండెను. బాబా పటకా చివరను రెండు చేతులతో పట్టుకొని పొత్తికడుపులోనికి గ్రుచ్చుకొనెను. ఇంకొక చివరను స్తంభమునకు నాటించెను. పటకా యంతయు పొత్తికడుపులో దూరునట్లు కానవచ్చుచుండెను. కొద్ది సేపటిలో పొత్తి కడుపు ప్రేలు ననుకొనిరి. బాబా క్రమముగా స్తంభమువైపు పోవుచుండెను. అందరు భయపడిరి. అశ్చర్యముతోను, భయముతోను మాట్లాడలేక మూగవాండ్రవలె నిలిచిరి. బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్టము అనుభవించిరి. తక్కిన భక్తులు అమెను బాబాకు హానిలేంకుండ తోముమనిరి. మంచి యుద్దేశముతో వారు ఈ మాటలనిరి. దీనికికూడ బాబా యొప్పుకొనలేదు. వారి మంచి ఉద్దేశమే బాబాను కష్టములో దించినందుకు వారాశ్చర్యపడిరి. ఏమియు చేయలేక కనిపెట్టుకొని చూచుచుండిరి. అదృష్టముచే బాబా కోపము తగ్గెను. పటకాను విడిచి గద్దెపయి కూర్చుండిరి. అప్పటినుండి భక్తుల యిష్టానుసారము సేవ చేయునప్పుడు ఇతరులు జోక్యము కలుగజేసికొనరాదను నీతిని నేర్చుకొనిరి. ఎవరి సేవ ఎట్టిదో బాబాకే గుర్తు.

ఓం నమో శ్రీ సాయినాధాయ

శాంతిః శాంతిః శాంతిః

ఇరువదినాలుగవ అధ్యాయము సంపూర్ణము