శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము - పి.నారాయణరావు Back   Home 

మూడవ అధ్యాయము

సాయిబాబా యనుమతియు వాగ్ధానము, భక్తులకొరకు నిర్ణయించిన పని - బాబా కధలు సముద్రమధ్యమున దీపస్థంభములు - వారి ప్రేమ, రోహిల్లా కధ - వారి మృదుమధురమైనట్టియు యమృతతుల్యమైనట్టియు పల్కులు

సాయిబాబా యొక్క యనుమతియు వాగ్ధానమును

వెనుకటి యధ్యాయములో వర్ణించిన ప్రకారము శ్రీ సాయిసచ్చరిత్ర వ్రాయుటకు బాబా పూర్తి యనుమతి నొసంగుచు యిట్లు నుడివిరి. "సచ్చరిత్ర వ్రాయువిషయములో నా పూర్తి సమ్మతినిచ్చెదను. నీ పనిని నీవు నిర్వర్తించుము. భయపడకుము. మనస్సు నిలకడగా నుంచుము. నా మాటలయందు విశ్వాసముంచుము. నా లీలలు వ్రాసినచో నవిద్య నిష్ర్కమించి పోవును. వానిని శ్రద్ధాభక్తులతో నెవరు వినెదరో వారికి ప్రపంచమందు మమత క్షిణించును. బలమైన భక్తి ప్రేమ కెరటములు లేచును. ఎవరయితే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును.

యిది విని రచయిత మిక్కిలి సంతసించెను. వెంటనే నిర్బయుడయ్యెను. కార్యము జయప్రదముగా సాగునని ధైర్యము కలిగెను. అటుపైని మాధవరావు దేశపాండేవైపు తిరిగి బాబా యిట్లనెను.

"నా నామము ప్రేమతో నుచ్చరించినవారి కోరిక లన్నియు నెరవేర్చెదను. వారి భక్తిని హెచ్చించెదను. వారి నన్ని దిశలందు కాపాడెదను. ఏ భక్తులయితే మనఃపూర్వకముగా నాపై నాధారపడియున్నారో వారీ కధలు వినునప్పుడు మిక్కిలి సంతసించెదరు. నా లీలలను పాడువారి కంతులేని యానందమును శాశ్వతమైన తృప్తిని ఇచ్చెదనని నమ్ముము. ఎవరయితే నన్ను శరణాగతి వేడెదరో, నన్ను భక్తి విశ్వాసములతో పూచించెదరో, నన్నే స్మరించెదరో, నా యాకారమును మనస్సున నిలిపెదరో వారిని బంధనములనుండి తప్పించుట నా మూఖ్యలక్షణము. ప్రపంచములోని వానినన్నిటిని మరచి నా నామమునే జపించుచు, నా పూజనే సల్పుచు, నా కధలను జీవితమునే మననము చేయుచు, ఎల్లప్పుడు నన్ను జ్ఞప్తియందుంచుకొనువారు ప్రపంచ విషయములందెట్లు తగులుకొందురు? వారిని మరణమునుండి బయటకు లాగెదను. నా కధలే వినినచో అది సకలరోగములు నివారించును. కాబట్టి భక్తిశ్రద్ధలతో నా కధలను వినుము. వానిని మనమున నిలుపుము. అనందమునకు తృప్తికి నిదియే మార్గము. నా భక్తులయొక్క గర్వాహంకారములు నిష్ర్కమించిపోవును. వినువారికి శాంతి కలుగును. మనఃపూర్వకమైన నమ్మకముగలవారికి శుద్ధచైతన్యముతో తాదాత్మ్యము కలుగును. సాయి సాయి యను నామమును జ్ఞప్తి యందుంచుకొన్నంత మాత్రమున, చెడు పలుకుటవలన, వినుటవలన కలుగు పాపములు తొలిగి పోవును."

భక్తులకు వేర్వేరు పనులు నియమించుట

భగవంతుడు వేర్వేరు భక్తులను వేర్వేరు పనులకు నియమించును. కొందరు దేవాలయములు, మఠములు, నదులలో మెట్లు, కట్టుటకు నియమితులగుదురు. భగవంతుని లీలలను పాడుటకు కొందరు నియుక్తులగుదురు. కొందరు తీర్థయాత్రలకు పోదురు. నన్నీ సచ్చరిత్ర వ్రాయుమని నియమించిరి. అన్ని విషయములు పూర్తిగా తెలియని వాడినగుటచే, నీ పనికి నాకు అర్హత లేదు. అయితే యింత కఠినమైన పని నేనెందుకు ఆమోదించవలెను? సాయిబాబా జీవితచరిత్రను వర్ణించువారెవ్వరు? సాయియొక్క కరుణయే యంత కఠినమైన పని యొనర్చు శక్తిని ప్రసాదించినది. నేను చేత కలము పట్టుకొనగనే సాయిబాబా నా యహంకారమును పెరికివేసి వారి కధలను వారే వ్రాసికొనిరి. కనుక ఈ కధలు వ్రాసిన గౌరవము సాయిబాబాకే చెందును గాని నాకు గాదు. బ్రాహ్మణుడనై పుట్టినప్పటికినీ శ్రుతి స్మృతి యను రెండు కండ్లు లేకుండుటచే సాయిసచ్చరిత్రను వ్రాయలేకుంటిని. కానీ భవగంతుని అనుగ్రహము మూగవాని మాట్లాడునట్లు చేయును; కుంటినానిని పర్వతములు దాటునట్లు చేయును. తన యిచ్ఛానుసారము పనులు నెరవేర్చుకొనుటలో ఆ భగవంతునికే యా చాతుర్యము కలదు. హార్మోనియమునకు గాని వేణువునకు గాని ధ్వనులు ఎట్లు వచ్చుచున్నవో తెలియదు. అది వాయించువానికే తెలియును. చంద్రకాంతము ద్రవించుట, సముద్రముప్పొంగుట వానివల్ల జరుగదు, కాని చంద్రోదయమువల్ల జరుగును.

బాబా కధలు దీపస్తంభములు

సముద్రమధ్యమందు దీపస్తంభములుండును. పడవలపై పోవువారు ఆ వెలుతురు వల్ల రాళ్ళు రప్పలవల్ల కలుగు హోనులను తప్పించుకొని సలభముగా పోవుదురు. ప్రపంచమను మహాసముద్రములో బాబా కధలను దీపములు దారిచూపును. అవి అమృతముకంటే తియ్యగా నుండి ప్రపంచయాత్ర చేయు మార్గమును సులభముగను నున్నగను చేయును. యోగీశ్వరుల కధలు పవిత్రములు. అవి మన చెవులద్వారా హృదయమందు ప్రవేశించునపుడు శరీర స్పృహయును, అహంకారమును, ద్వంద్వభావములును నిష్ర్కమించును. అవి మన హృదయమందు నిల్వచేసినచో సందేహములు పటాపంచలయిపోవును. శరీరగర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వ చేయబడును. శ్రీ సాయిబాబా కీర్తి, వర్ణనలు ప్రేమతో పాడినగాని వినిన గాని భక్తుని పాపములు పటాపంచలగును. కాబట్టి యివియే మోక్షమునకు సులభసాధనము. కృతయుగములో శమదమములు (అనగా నిశ్చలమనస్సు, శరీరము) త్రేతాయుగములో యాగము, ద్వాపరయుగములో పూజ, కలియుగములో భగవన్మహిమలను నామములను పాడుట, మోక్షమార్గములు. నాలుగు వర్ణములవారు ఈ చివరి సాధనమును అవలంబించవచ్చును. తక్కిన సాధనములు అనగా యోగము, యాగము, ధ్యానము, ధారణము అవలంబించుట కష్టతరము. కాని భగవంతుని కీర్తిని మహిమను పాడుట యతిసులభము. మనమనస్సును మాత్రము అటువైపు త్రిప్పవలెను. భగవత్కధలను వినుటవలన్ పాడుట వలన మనకు శరీరమందు గల అభిమానము పోవును. అది భక్తులను నిర్మోహులుగ జేసి, తుదకు ఆత్మసాక్షాత్కారము పొందునట్లు చేయును. ఈ కారణముచేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సచ్చరితామృతమును వ్రాయించెను. భక్తులు దానిని సులభముగ చదువగలరు; వినగలరు. చదువునప్పుడు వినునప్పుడు బాబాను ధ్యానించవచ్చును. వారి స్వరూపమును మనస్సునందు మననము చేసికొనవచ్చును. ఈ ప్రకారముగా గురువునందు తదుపరి భగవంతునియందు భక్తి కలుగును. తుదకు ప్రపంచమందు విరక్తి పొంది యాత్మసాక్షాత్కారము సంపాదించగలుగుదుము. సచ్చరితామృతము వ్రాయుట తాయరుచేయుట బాబా యొక్క కటాక్షముచేతనే సిద్ధించినవి. నేను నిమిత్తమాత్రుడుగనే యింటిని.

సాయిబాబా యొక్క మాతృప్రేమ

ఆవు తన దూడ నెట్లు ప్రేమించునో యందరికీ తెలిసిన విషయమే. దాని పొదుగెల్లప్పుడు నిండియే యిండును. దూడకు కావలసినప్పుడెల్లకుడిచినచో పాలు ధారగా కారును. అలాగుననే బిడ్డకు ఎప్పుడు పాలు కావలెనో తల్లి గ్రహించి సకాలముందు పాలిచ్చును. బిడ్డకు గుడ్దలు తొడుగుటయందును, అలంకరించుటయందును తల్లి తగిన శ్రద్ధ తీసికొని సరిగా చేయును. బిడ్డకు ఈ విషయమేమియు తెలియదుగాని తల్లి తన బిడ్డలు చక్కగ దుస్తులు ధరించి అలంకరింపబడుట చూచి యమితానందం పొందును. తల్లి ప్రేమకు సరిపోల్చ దగిన దేదియు లేదు. అది యసామాన్యము; నిర్వ్యాజము. సద్గురువులు కూడ నీ మాతృప్రేమ వారి శిష్యులందు చూపుదురు. సాయిబాబాకు గూడ నాయందట్టి ప్రేమ యిండెను. దానికి క్రింది యుదాహరణ మొకటి.

1916 వ సంవత్సరములో నేను సర్కారు ఉద్యోగమునుండి విరమించితిని. నాకీయ నిశ్చయించిన పించను కుటుంబమును గౌరవముగా సాకుటకు చాలదు. గురుపౌర్ణమినాడు ఇతర భక్తులతో నేను కూడ శిరిడి పోయితిని. అణ్ణాచించణీకర్ నాగురించి బాబాతో నిట్లనెను. "దయచేసి వాని యందు దాక్షిణ్యము చూపుము. వానికి వచ్చు పించను సరిపోదు. వాని కుటుంబము పెరుగుచున్నది. వాని కెందేదైన ఉద్యోగ మిప్పించుము. వాని యాతురతను తీసివేయుము. వాని కానందము కలుగునట్లు చేయుము." అందులకు బాబా యిట్లు జవాబిచ్చెను. "వాని కింకొక ఉధ్యోగము దొరుకును, కాని వాడిప్పుడు నా సేవతో తృప్తిపడవలెను. వాని భోజనపాత్రలు ఎప్పుడు పూర్ణముగనే యిండును. ఎన్నటికి నిండుకొనవు. వాని దృష్టి నంతటినీ నా వైపు త్రిప్పవలెను. నాస్తికుల దుర్మార్గుల సహవాసము విడువవలెను. అందరియెడ అణకువ, నమ్రతలుండవలెను. నన్ను హృదయపూర్వకముగ పూజించవలెను. నాడిట్లు చేసినచో శాశ్వతానందు పొందును."

నన్ను పూచింపుడను దానిలోని ఈ "నన్ను" ఎవరు? అను ప్రశ్నకు సమాధానము "సాయిబాబా ఎవరు" అను దానిలో విశదీకరింపబడి యిన్నది. మొదటి అధ్యాయమునకు పూర్వము ఉపోద్ఘాతములో చూడుడు.

రోహిల్లా కధ

రోహిల్లా కధ విన్నచో బాబా ప్రేమ యెట్టిదో బోధపడును. పొడుగాటివాడును, పొడుగైన చొక్కా తొడిగినవాడును, బలవంతుడునగు రోహిల్లా యొకడు బాబా కీర్తి విని వ్యామోహితుడై శిరిడీ లో స్థిరనివాసము ఏర్పరుచుకొనెను. రాత్రింబగళ్ళు ఖురానులోని కల్మాను చదువుచు "అల్లాహు అక్బర్" యని ఆబోతు రంకెవేయునట్లు బిగ్గరగా నరచుచుండెను. పగలంతయు పొలములో కష్టపడి పనిచేసి యింటికి వచ్చిన శిరిడీ ప్రజలకు నిద్రాభంగమును అసౌకర్యమును కలుగుచుండెను. కొన్నాళ్ళవరకు వారు దీనిని ఓర్చుకొనిరి. తుదకు బాధ నోర్వలేక బాబా వద్ద కేగి రోహిల్లా అరపుల నాపుమని బతిమాలిరి. బాబా వారి ఫిర్యాదును వినకపోవుటయే కాక వారిపై కోపించి వారి పనులు వారు చూచుకొనవలసినదే కాని రోహిల్లా జోలికి పోవద్దని మందలించెను. రోహిల్లాకు ఒక దౌర్భాగ్యపు భార్యగలదనియు, ఆమె గయ్యాళి యనియు, ఆమె వచ్చి రోహిల్లాను తనను బాధపెట్టుననియు, రోహిల్లా ప్రార్ధనలు విని అదియేమి చేయలేక ఊరక యుండుననియి బాబా చెప్పెను. నిజముగా రోహిల్లాకు భార్యయే లేదు. భార్యయనగా దుర్భుద్ధియని బాబా యభిప్రాయము. బాబాకు అన్నిటికంటే దైవప్రార్థనలందు మిక్కుటమగు ప్రేమ. అందుచే రోహిల్లా తఫున వాదించి, ఊరిలోనివారి నోపికతో నోర్చుకొని బాధను సహింపవలసినదనియు నది త్వరలో తగ్గుననియు బాబా బుద్ధిచెప్పెను.

బాబా యొక్క యమృతతుల్యమగు పలుకులు

ఒకనాడు మధ్యాహ్నహారతి యయిన పిమ్మట భక్తులందరు తమ తమ బసలకు పోవుచుండిరి. అప్పుడు వారికి బాబా యీ క్రింది చక్కని యుపదేశమిచ్చిరి.

మీ రెక్కడ నున్నప్పటికీ నేమి చేసినప్పటికీ నాకు తెలియునని బాగుగా జ్ఞాపకముంచుకొనుడు. నేనందరి హృదయముల పాలించు వాడను; అందరి హృదయములలో నివసించువాడను. ప్రపంచమందుగల చరాచర జీవకోటి నావరించియున్నాను. ఈ జగత్తును నడిపించువాడను సూత్రధారిని నేనే. నేనే జగన్మాతను, త్రిగుణముల సామరస్యమును నేనే, ఇంద్రియ చాలకుడను నేనే. సృష్టిస్థితిలయకారకుడను నేనే. ఎవరయితే తమ దృష్టిని నావైపు త్రిప్పెదరో వారికే హానిగాని బాధగాని కలుగదు. ఎవరయితే నన్ను మరచెదరో వారిని మాయ శిక్షించును. పురుగులు, చీమలు, దృశ్యమాన చరాచరజీవకోటి యంతయు నా శరీరమే, నా రూపమే.

ఈ చక్కని యమూల్యమెన మాటలు వెని వెంటనే నా మనస్సులో నెవరి సేవ చేయక గురుసేవయే చేయుటకు నిశ్చయించితిని. కాని అణ్ణాచించణీకరు ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానము నా మనస్సునందుండెను. అది జరుగునా లేదా యని సందేహము కలుగుచుండెను. భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి. నాకొక సర్కారు ఉద్యోగము దొరకెను. కాని అది కొద్దికాలము వరకే. అటుపిమ్మట వేరే పనియేదియు చేయక శ్రీ సాయి సేవకు నా జీవితమంతయు సమర్పించితిని.

ఈ యధ్యాయము ముగించకముందు, చదువరులకు నేను చెప్పుదేమన, బద్దకము, నిద్ర, చంచలమనస్సు, శరీరమందభిమానము మొదలగు వానిని విడిచి, వారు తమ యావత్తు దృష్టిని సాఇబాబా కధల వైపు త్రిప్పవలెను. వారి ప్రేమ సహజముగా నుండవలెను. వారు భక్తి యొక్క రహస్యమును తెలిసికొందురు గాక. ఇతర మార్గము లవలంబించి అనవసరముగా నలసిపోవద్దు. అందరు నొకే మార్గమును గ్రొక్కుదురు గాక. అనగా శ్రీ సాయి కధలను విందురుగాక. ఇంది వారి యజ్ఞానమును నశింపజేయును; మోక్షమును సంపాదించి పెట్టును. లోభియెక్కడ నున్నప్పటికిని వాని మనస్సు తాను పాతిపెట్టిన సొత్తునందే యుండునట్లు, బాబాను కూడ నెల్లవారు తమ హృదయములందు స్థాపించు కొందురుగాక.

ఓం నమో శ్రీ సాయినాధాయ

ఓం శాంతిః శాంతిః శాంతిః

మూడవ అధ్యాయము సంపూర్ణము