శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము - పి.నారాయణరావు Back   Home 

ముప్పదవ అధ్యాయము

శిరిడీకి లాగుట
1.వాణినివాసి కాకాజీ వైద్య, 2. బొంబాయి నివాసి పంజాబి రామలాల్.
ఈ అధ్యాయములో బాబా శిరిడీకి ఈడ్చిన యిద్దరు భక్తుల వృత్తాంతము చెప్పుకొందము.

ప్రస్తావన

దయామయుడు, భక్తవత్సలుడునగు శ్రీ సాయికి నమస్కారము. వారు దర్శనమాత్రముననే భవసాగరమును తరింపజేసి మన ఆపదలను బాపెదరు. వారు నిర్గుణస్వరూపులైనను, భక్తుల కోరుటచే సగుణ స్వరూపము వహించిరి. భక్తుల కాత్మసాక్షాత్కారము కలిగించుటే యోగుల కర్తవ్యము. అది యోగీశ్వరుడైన సాయినాధునకు ముఖ్యతమ మైనది, తప్పనిసరి యైనది. వారి పాదముల నాశ్రయించినవారి పాపము లెల్ల నశించును. అట్టివారి ప్రగతి నిశ్చయము. వారి పాదములు స్మరించుచు పుణ్యక్షేత్రములనుండి బ్రాహ్మణులు వచ్చి వారి సన్నిధిలో వేదశాస్త్రములు పారాయణ చేసి, గాయత్రీమంత్రమును జపించెదరు. దుర్బలులము, పుణ్యహీనుల మగుటచే భక్తి యనగా నేమో మనకు దెలియదు. మనకింత మాత్రము తెలియును. ఇతరులు మనలను విడిచిపెట్టునప్పటికి సాయి మాత్రము మనలను విడువడు. వారి కృపకు పాత్రులైనవారు కావలసినంత శక్తి, జ్ఞానము, నిత్యానిత్యవివేకములను పొందెదరు.

భక్తుల కోరికలను పూర్తిగా గ్రహించి సాయి వానిని నెరవేర్చును. అందుచేత ఎవరికి కావలసినవి వారు పొంది, కృతజ్ఞతతో నుండెదరు. కాని మేము వారికి సాష్టాంగనమస్కారము చేసి, వేడుకొనెదము. మా తప్పులన్నియు క్షమించి సాయి మా యారాటములన్నియు బాపుగాక. కష్టములపాలై సాయినీవిధముగా ప్రార్థించువారి మనస్సు శాంతించి, బాబా కటాక్షముచే వారు సంతుష్టి నందెదరు.

దయాసముద్రుడగు సాయి కటాక్షించుటచే హేమడ్ పంతు ఈ గ్రంధమును వ్రాయగలిగెనని చెప్పుకొనెను. లేకున్నచో తనకు గల యోగ్యత ఎంత? ఎవరింత కఠినమైన పనికి పూనుకొనగలరనెను. శ్రీ సాయి ఈ భారమంతయు వహించుటచే హేమాడ్ పంతుకు కష్టము గాని, శ్రమగాని కానరకుండెను. తన వాక్కును, కలమును గూడ ప్రేరేపించుటకు శక్తివంతమగు జ్ఞానమనే వెలుతురుండగా నతడు సంశయము గాని, ఆరాటము గాని పొందనేల? అతడు వ్రాసిన యీ పుస్తకరూపమున శ్రీ సాయి అతని సేవను గైకొనెను. ఇది యతని గత జన్మల పుణ్యపరంపరచే ప్రాప్తించెను. కావున నాతడదృష్టవంతుడననియు పుణ్యాత్ముడననియు అనుకొనెను.

ఈ క్రింది కధ సాధారణ కధ కాదు; స్వచ్ఛమైన యమృతము. దీని నెవరు త్రాగెదరో, వారు సాయి మహిమను సర్వాంతర్యామిత్వమును దెలిసికొందురు. వాదించువారు, విమర్శించువారు ఈ కధలను చదువనక్కరలేదు. దీనికి కావలసినది యంతులేని ప్రేమ, భక్తి, వివాదము కాదు. జ్ఞానులు, భక్తివిశ్వాసములు గలవారు లేదా యోగుల సేవకుల మనుకొనువారు, ఈ కధలనిష్టపడి మెచ్చుకొనెదరు. తదితరులు కాకమ్మకధ లనుకొందురు. అదృష్టవంతులయిన సాయిభక్తులు సాయి లీలలను కల్పతరువుగా భావించెదరు. ఈ సాయి లీలామృతమును త్రాగినచో అజ్ఞానులకు జన్మరాహిత్యము కలుగును, గృహస్థులకు సంతృప్తి కలుగును, ముముక్షువుల కిది సాధనగా నుపకరించును. ఇక ఈ అధ్యాయములోని కధను ప్రారంభించెదము.

కాకాజీ వైద్య

నాసిక్ జిల్లా వాణీ లో కాకాజీవైద్య యనువాడుండెను. అతడచటి సప్తశ్రింగి దేవతకు పూజారి. అతడనేకకష్టనష్టముల పాలై మనశ్శాంతిని పోగొట్టుకొని, చంచలమనస్కుడయ్యెను. అట్టి పరిస్థితులలో ఒకనాటి సాయంకాలము దేవతాలయమునకు బోయి తనను ఆందోళననుండి కాపాడుమని హృదయపూర్వకముగా వేడుకొనెను. అతని భక్తికి దేవత సంతసించి యానాటి రాత్రి యాతనికి స్వప్నమున గాన్పించి "బాబా వద్దకు పొమ్ము, నీ మనస్సు శాంతి వహించు" ననెను. ఈ బాబా ఎవరో దేవి నడిగి తెలిసికొనుటకు కాకాజీ యుత్సహించెను. కాని ఇంతలోనే అతనికి మెలకువ కలిగెను. ఈ బాబా ఎవరై యుండవచ్చునని అతడు యోచించెను. కొంతసేపు అలోచించినపిమ్మట యీ బాబా త్రయంబకేశ్వరుడు (శివుడు) కావచ్చునని అతడు పుణ్యస్థలమగు త్రయంబకము (నాసిక్ జిల్లా) వెళ్ళెను. అచ్చట పదిరోజులుండెను. అక్కడున్నంతకాలము వేకువజామున స్నానము చేసి, రుద్రమును జపించుచు, అభిషేకమును తదితరపూజలను గావించెను. అయినప్పటికి మునుపటివలెనే అశాంతమనస్కుడుగా నుండెను. పిమ్మట స్వగ్రామము నకు తిరిగివచ్చి దేవతను తిరిగి వేడుకొనెను. ఆ రాత్రి ఆమె స్వప్నములో గనిపించి యిట్లనెను. "అనవసరముగా త్రయంబకేశ్వర మెందుకు వెళ్ళినావు? బాబా యనగా శిరిడి సాయిబాబా యని నా అభిప్రాయము."

శిరిడీకి పోవుటెట్లు? ఎప్పుడు పోవలెను? బాబాను జూచుటెట్లు? అని కాకాజీ మనోవ్యాకులత పొందుచుండెను. ఎవరయిన యోగీశ్వరుని చూడవలెననుకున్నచో, ఆ యోగియేగాక దైవముకూడ అతని కోరికను నెరవేర్చుటకు సహాయపడును. యధార్థముగా యోగియు, భగవంతుడును నొకరే. వారిలో నేమియు భేదము లేదు. ఎవరైన తానై పోయి యోగిని దర్శించుటన్నది యుత్త బూటకము. యోగి సంకల్పించనిదే వారిని జూడగలుగు వారెవరు? యతని యాజ్ఞ లేక చెట్టు ఆకు గూడ కదలదు. యోగి దర్శనమునకై భక్తుడు ఎంత వేదన పడునో, ఎంత భక్తివిశ్వాసములు జూపునో, యంత త్వరగాను, బలముగాను, అతని కోరిక నెరవేరును. దర్శనమునకై ఆహ్వానించువాడే వచ్చువానికి స్వాగతసన్నాహము లొనర్చును. కాకాజీ విషయములో అట్లే జరిగెను.

శ్యామా మ్రొక్కు

కాకాజీ శిరిడికి పోవుట కాలోచించుచుండగా, ఒక యతిధి అతనిని శిరిడీకి తీసికొనిపోవుట కతని యింటికే వచ్చెను. అతడింకెవడో కాదు , బాబాకు ముఖ్యభక్తుడగు శ్యామాయే. శ్యామా ఆసమయమున వాణికి ఎట్లు వచ్చెనో చూతము. శ్యామా బాల్యములో జబ్బుపడి నప్పుడు ఆయన తల్లి తమ గృహదేవతయగు వాణిలో ని సప్తశ్రింగి కి జబ్బు నయము కాగానే నీ దర్శనము నకు వచ్చి, బిడ్డను నీ పాదములపై బెట్టెదనని మ్రొక్కుకొనెను. కొన్ని సంవత్సరముల పిమ్మట.. ఆ తల్లికి కుచములపై తామర లేచి అమి మిక్కిలి బాధపడెను. తనకు నయమైనచో రెండు వెండి కుచములు సమర్పించెదనని అప్పుడింకొక మ్రొక్కు మ్రొక్కెను. కాని ఈ రెండు మ్రొక్కులు కూడ ఆమె చెల్లించలేదు. ఆమె చనిపోవునపుడు ఈ సంగతి శ్యామా కు చెప్పి రెండు మ్రొక్కులు చెల్లించు భారము నాతనిపై వైచి అమె మృతిచెందెను. శ్యామా కొన్నాళ్ళకు ఈ మ్రొక్కులను పూర్తిగా మరచెను. ఇట్లు 30 సంవత్సరములు గడచెను. అప్పట్లో శిరిడీకి ఒక పేరుపొందిన జ్యోతిష్కుడు వచ్చి నెల దినములచట మకాము చేసెను. అతను శ్రీమాన్ బుట్టీ మొదలగువారికి చెప్పిన భవిష్యత్తు సంతృప్తికరముగా నుండెను. శ్యామా తమ్ముడు బాపాజి జ్యోతిషపడితుని సంప్రదించగా అతడు తల్లి మ్రొక్కుకున్న మ్రొక్కులు చెల్లించక పోవుటచే వారికి కష్టములు సప్తశ్రింగిదేవత కలుగజేయుచున్న దనెను. బాపాజీ యీ సంగతి శ్యామాకు తెలియపరచెను. అప్పుడు శ్యామా కు సర్వము జ్ఞప్తికి వచ్చెను. ఇంకను అలస్యము చేసినచో హానికరమని ఎంచి శ్యామా ఒక కంసాలిని బిలచి, రెండు వెండి కుచములను చేయించెను. మసీదుకు బోయి, బాబా పాదములపై బడి, రెండు కుచముల నచట బెట్టి, తన మ్రొక్కులను చెల్ల జేయుమని, బాబాయే తన సప్తసృంగి దేవత యగుటచే వాని నామోదించుమని వేడెను. నీవు స్వయముగా బోయి సప్తసృంగి దేవతకు మ్రొక్కును చెల్లింపుమని బాబా నిర్బంధించెను. బాబా ఊదీని ఆశీర్వాదమును పొంది, శ్యామా వాణీ పట్టణమునకు బయలుదేరెను. పూజారి యిల్లు వెదకుచు తుదకు కాకాజీ యిల్లు చేరెను. అప్పుడు కాకాజీ శిరిడీకి పోవలెనని గొప్ప కుతూహలముతో నుండెను. అట్టి సమయములో శ్యామా వారింటికి వెళ్ళెను. ఇది ఎంత ఆశ్చర్యకరమైన కలయికయో చూడుడు!

"మేరెవ్వరు? ఎచటనుండి వచ్చినా" రని కాకాజీ యడిగెను. "నాది శిరిడీ, నేను సప్తశృంగికి మ్రొక్కు చెల్లించుటకిక్కడకు వచ్చినా" నని శ్యామా యనెను. శిరిడి నుండి వచ్చెనని తెలియగానే శ్యామాను కాకాజీ కౌగిలించుకొనెను. ప్రేమచే మైమరచెను. వారు సాయిలీలల గూర్చి ముచ్చటించుకొనిరి. శ్యామా మ్రొక్కులన్నియు చెల్లించిన పిమ్మట వారిద్దరు శిరిడీకి బయలుదేరిరి. శిరిడీకి వేరగనే, కాకాజీ మసీదుకు బోయి బాబాను జూచి, వారి పాదములపై బడెను. అతని కండ్లు కన్నీటితో నిండెను. అతని మనస్సు శాంతించెను. సప్తశ్రింగిదేవత స్వప్నములో తెలియపరచిన రీతిగా బాబాను చూడగనే అతని మనస్సు లోని చంచలత్వమంతయు పోయి ప్రశాంతి వహించెను. కాకాజీ తన మనస్సులో నిట్లనుకొనెను. "ఏమి ఈ యద్భుతశక్తి, బాబా ఏమియు పలుకలేదు ఉత్తర ప్రత్యుత్తరములు కూడ జరుగలేదు. ఆశీర్వచనముల నైన పలుకలేదు. కేవలము వారి దర్శనమే సంతోషమునకు కారణమయ్యెను. వారి దర్శనమాత్రముననే నామనోచాంచల్యము పోయినది. అంతరంగమున ఆనందముద్భవించినది. ఇదియే దర్శనభాగ్యము. "అతడు తన దృష్టి సాయినాధుని పాదములపై నిగిడించెను. అతని నోట మాట రాకుండెను. బాబా లీలలు విని, యతని సంతోషమున కంతులేకుండెను. బాబాను సర్వస్య శరణాగతి వేడెను. తన వేదనను బాధలను మరచెను. స్వచ్చమైన యానందమును పొందెను. అక్కడ 12 రోజులు సుఖముగా నుండి తుదకు బాబా శలవు తీసుకొని వారి ఊదీ ప్రసాదము, ఆశీర్వచనము పొంది యిల్లు చేరెను.

రహతా కుశాల్ చంద్

తెల్లవారుజామున వచ్చిన స్వప్నము నిజమగునని యందురు. ఇది సత్యమే కావచ్చు. కాని బాబా స్వప్నములకు కాలనియమము లేదు. ఒక ఉదహరణము: ఒకనాడు సాయంకాలము బాబా కాకాసహెబు దీక్షితును రాహతాకు పోయి, చాలరోజులనుండి చూడకుండుటచే, కుశాల్ చంద్ ను తీసికొని రమ్మనెను. ఒక టాంగాను దీసికొని కాకా రాహాతా వెళ్ళెను. కుశాల్ చంద్ ను కలిసికొని బాబా చెప్పిన వార్త నందజేసెను. దీనిని విని కుశాల్ చంద్ యాశ్చర్యపడెను. మధ్యాహ్న భోజనానంతరము నిద్రపోవుచుండగా తనకు స్వప్నములో బాబా కనబడి వెంటనే శిరిడీకి రమ్మనినందున నతడు శిరిడీకి పోవుటకు ఆతురతతో నున్నానని చెప్పెను. తన గుర్రము అచ్చట లేకుండుటచే, తన కుమారుని బాబాకు ఈ సంగతి దెలుపుటకై పంపెను. కుమారుడు ఊరు బయటకు పోవుసరికి దీక్షిత్ టాంగా తీసికొని వచ్చెను. కుశాల్ చందును దీసికొని రావలసినదని బాబా దీక్షితుకు చెప్పుటచే, నిద్దరు టాంగాలో కూర్చుండి శిరిడీ చేరిరి. కుశాల్ చంద్ బాబాను దర్శించెను. అందరు సంతసించిరి. బాబా ఈ లీలను జూచి, కుశాల్ చంద్ మనస్సు కరగెను.

పంజాబి రామలాల్ (బొంబాయి)

ఒకనాడు బొంబాయిలో నుండు పంజాబి బ్రాహ్మణుడు రామలాల్ యనువాడు స్వప్నమును గాంచెను. స్వప్నములో బాబా కనపడి శిరిడీకి రమ్మనెను. బాబా వానికి మహంతువలె గనిపించెను. కాని అతనికి వారెచట గలరో తెలియకుండెను. పోయి వారిని చూడవలెనని మనమున నిశ్చయించెను. కాని చిరునామా తెలియకుండుటచే చేయుట కేమియు తోచకుండెను. ఎవరినైన మనము పిలిచినచో వచ్చువారి కొరకు కావలసిన వన్నియు మనము సమకూర్చెదము. ఈ విషయములో కూడ అట్లనే జరిగెను. అతడు ఆనాడు సాయంకాలము వీధిలో పోవుచుండగా ఒక దుకాణములో బాబా ఫోటోను జూచెను. స్వప్నములో జూచిన మహంతు ముఖలక్షణములో పటములో నున్నవానితో సరిపోయెను. కనుగొనగా యా పటము సాయిబాబాదని తెలిసెను. అతడు వెంటనే శిరిడీకి పోయి యచ్చటనే తన యంత్యకాలమువరకుండెను.

ఈ విధముగా బాబా తన భక్తులకు దర్శన మిచ్చుటకై శిరిడీకి తీసికొని వచ్చుచుండెను. వారి యిహపరముల కోరికలు నెరవేర్చుచుండెను.

ఓం నమో శ్రీ సాయినాధాయ

శాంతిః శాంతిః శాంతిః

ముప్పదవ అధ్యాయము సంపూర్ణము

నాలుగవరోజు పారాయణము సమాప్తము.