శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము - పి.నారాయణరావు Back   Home 

ముప్పది మూడవ అధ్యాయము

ఊదీ మహిమ
1.తేలుకాటు, ప్లేగు జ్వరములు నయమగుట. 2. జాం నేర్ చమత్కారము. 3. నారాయణరావు జబ్బు. 4. బాల బువ సుతార్ 5. అప్పాసాహెబు కులకర్ణి 6. హరి భావు కర్ణిక్ - కధలు.
గత అధ్యాయములో గురువు మహిమను వర్ణించితిమి. ఇందులో ఊదీ మహిమను వర్ణించెదము.

ప్రస్తావన

మనమిప్పుడు గొప్ప యోగీశ్వరులకు నమస్కరించెదము. వారి కరుణాకటాక్షములు, కొండంత పాపములను గూడ నశింపజేయును. మనలోని దుర్గుణములను పోగొట్టును. వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు బోధిచును. అమృతానందమును ప్రసాదించును. "ఇది నాది, అది నీది, యను భేదభావము వారి మనస్సులందు పుట్టదు. వారి ఋణమును ఈ జన్మయందుగాని వచ్చే పెక్కుజన్మలయందు గాని మనము తీర్చుకొనలేము.

ఊదీ ప్రాసాదము

బాబా యందరివద్దనుంచి దక్షిణ తీసుకొనుచుండునని యందరికి తెలిసిన విషయము. ఈ విధముగా వసూలుచేసిన మొత్తములో నెక్కువ బాగము దానము చేసి మిగతదానితో వంట చెరకును (కట్టెలను) కొనుచుండెను. ఈ కట్టెలను బాబా ధునిలో వేయుచుండెను. దానిని నిత్యము మంట పెట్టుచుండెను. అది ఇప్పటికి నటులే మండుచున్నది. అందులోని బూడిదనే ఊదీ యనుచున్నాము. బాబా దానిని భక్తులకు తమతమ ఇండ్లకు తిరిగి పోవునప్పుడు పంచిపెట్టెడివారు.

ఊదీవలన బాబా ఏమి బోధించ నుద్దేశించెను? ప్రపంచములో కనిపించు వస్తువులన్నియు బూడిదవలె అశాశ్వతములు. పంచభూతము లచే చేయబడిన మన శరీరములన్నియు సౌఖ్యముల ననుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిద యగును. ఈ సంగతి జ్ఞప్తికి దెచ్చుటకై బాబా భక్తులకు ఊదీ ప్రాసాదమును పంచిపెట్టుచుండెను. ఈ ఊదీ వలననే బ్రహ్మము నిత్యమనియు, ఈ జగత్తు అశాశ్వతమనియు, ప్రపంచములో గల బంధువులు, కొడుకుగాని, తండ్రిగాని, తల్లిగాని, మనవాండ్రు కారనియు బాబా బోధించెను. ఈ ప్రపంచములోనికి మనము ఒంటరిగా వచ్చితిమి. ఒంటరిగానే పోయెదము. ఊదీ యనేకవిధముల శారీరిక మానసిక రోగములను బాగుచేయుచుండెను. భక్తుల చెవులలో బాబా ఊదీద్వారా దక్షిణ ద్వారా నిత్యానిత్యములకు గల తారతమ్యము, అనిత్యమైనదానియందభిమానరాహిత్యము గంటమ్రోతవలె వినిపించుచుండెను. మొదటిది (ఊది) వివేకమును, రెండవది (దక్షిణ) వైరాగ్యమును బోధించుచుండెను. ఈ రెండును కలిగియున్నగాని సంసారమనే సాగరమును దాటలేము. అందుచే బాబా యడిగి దక్షిణ తీసికొనుచుండెను. శిరిడీనుంచి యింటికి పోవునప్పుడు భక్తులకు ఊదీయే ప్రసాదముగా నిచ్చి, కొంత నుదుటిపై వ్రాసి తన వరదహస్తమును వారి శిరస్సులపై నుంచుచుండెను. బాబా సంతోషముతో నున్నప్పుడు పాడుచుండెడివారు. పాటలలో ఊదీ గురించి యొకటి పాడుచుండిరి. దాని పల్లవి "కల్యాణ రామ రారమ్ము; గోనెలతో ఊదీ తేతెమ్ము." బాబా దీనిని చక్కని రాగముతో మధురముగా పాడుచుండెడివారు.

ఇదంతయు ఊదియొక్క అధ్యాత్మిక ప్రాముఖ్యము దానికి భౌతిక ప్రాధాన్యము కూడకలదు. అది ఆరోగ్యము ను, ఐశ్వర్యమును యాతురుతలనుండి విమోచనము మొదలగునవి యొసగుచుండెను. ఇక ఊదీ గూర్చిన కధలను ప్రారంభించెదము.

తేలుకాటు

నాసిక్ నివాసియగు నారాయణ మోతీరాం జాని యనునతడు బాబా భక్తుడు. అతడు రామచంద్ర వామనమోదక్ యను బాబా భక్తుని వద్ద ఉద్యోగము చేయుచుండెను. అతడు ఒకసారి తన తల్లితో శిరిడీకి పోయి బాబా ను దర్శించెను. అప్పుడు స్వయముగా బాబా అతడు మోదక్ సేవను మాని, తాను సొంతముగా వ్యాపారము పెట్టుకొనవలెనని చెప్పెను. కొన్నిదినముల తరువాత బాబా మాటసత్యమయ్యెను. నారాయణ జాని ఉద్యోగము మాని స్వయముగా "ఆనందాశ్రమము" అను హోటలు పెట్టెను. అది బాగా అభివృద్ధి చెందెను. ఒకసారి యీ నారాయణరావు స్నేహితునికి తేలు కుట్టెను. దాని బాధ భరింపరానంత యుండెను. అటువంటి విషయములలో ఊదీ బాగా పనిచేయును. నొప్పియున్నచోట ఊదీని రాయవలెను. అందుచే నారాయణరావు ఊదీ కొరకు వెదకెను. కాని అది కనిపించలేదు. అతడు బాబా పటము ముందర నిలచి బాబా సహాయము కోరి, బాబా నామజపము చేసి, బాబా పటము ముందు రాలిపడిన అగరువత్తి బూడిద చిటికెడంత తీసిదానినే ఊదీగా భావించి నొప్పి యున్నచోట రాసెను. అతడు ఊదీ రాసిన చేయి తీసివేయగనే నొప్పి మానిపోయెను. ఇద్దరు ఆశ్చర్యానందములలో మునిగిరి.

ప్లేగు జబ్బు

ఒకానొకప్పుడు బాంద్రా లో నుండు బాబా భక్తుని కొమార్తె వేరొకగ్రామమున ప్లేగు జ్వరముతో బాధపడుచుండెను. తనవద్ద ఊదీ లేదనియు, కనుక ఊదీ పంపుమనియు నానాసాహెబు చాందోర్కరు గారికి అతడు కబురు పంపెను. ఈ వార్త నానాసాహెబ్ కు ఠాణా రైల్వేస్టేషనువద్ద తెలిసెను. అప్పుడతడు భార్యతో కూడ "కల్యాణ్" పోవుచుండెను. వారివద్ద అప్పుడు ఊదీ లేకుండెను. కావున రోడ్డుపైని మట్టిని కొంచెము తీసి, సాయి నామజపము చేసి, సహాయము నభ్యర్థించి నానా సాహెబు తన భార్య నుదిటిపై రాసెను. ఆ భక్తుడిదంతయు జూచెను. అతడు తన కొమార్తె ఇంటికి పోవుసరికి మూడు రోజుల నుండి బాధపడుచున్న వాని కూతురు జబ్బు నానాసాహెబు తన భార్య నుదిటిపై మట్టిని పూసినప్పటినుండి తగ్గెనని విని మిక్కిలి సంతసించెను.

జామ్నేర్ చమత్కారము

1904-1905 వ సంవత్సరమున నానాసాహెబు చాందోర్కర్ జామ్నేర్ లో, మామలతదారుగా నుండెను. ఇది ఖాండేషు జిల్లాలో శిరిడీకి 100 మైళ్ళ దూరములో నున్నది. ఆయన కొమార్తె మైనతాయి గర్భిణి, ప్రసవించుటకు సిద్ధముగా నుండెను. ఆమె స్థితి బాగులేకుండెను. ఆమె రెండుమూడు దినములనుండీ ప్రసవవేదన పడుచుండెను. నానాసాహెబు ఔషధము లన్నియు వాడెను. కాని ప్రయోజనము లేకుండెను. అప్పుడు బాబాను జ్ఞప్తికి దెచ్చుకొని వారి సహాయము వేదెను. శిరిడీలో రామగిరి బువ యను సన్యాసి యుండెను. బాబా అతనిని బాపుగిర్ బువ యనువారు. అతని స్వగ్రామము ఖాందేషులో నుండెను. అతడచ్చిటికి పోవుటకు నిశ్చయించుకొనెను. బాబా అతనిని బిలిచి మార్గమధ్యమున జామ్నేర్ లో కొంత విశ్రాంతి తీసికొని నానాసాహెబు కు ఊదీని హారతి పాటను ఇమ్మనెను. తనవద్ద రెండేరూపాయలున్నవనియు, అవి జలగాం వరకు రైలుటిక్కెటుకు సరిపోవుననియు, కాబట్టి జలగాం నుండి జామ్నేర్ పోవుటకు (సుమారు 30 మైళ్ళు) ధనము లేదని రామగిర్ బువ చెప్పెను. అన్నియు సరిగా అమరును గాన, నివు కలతజెందనవసరము లేదని బాబా పలికెను. శ్యామాను బిలిచి మాధవ ఆడ్కర్ రచించిన హారతిని వ్రాయుమనెను. హారతి పాటను ఊదీని రామగిర్ బువాకిచ్చి నానాసాహెబుకు అందజేయుమనెను. బాబ మాటలపయి ఆధారపడి రాంగిర్ బువ శిరిడీ విడిచి, రాత్రి రెండున్నర గంటలకు జలగాం' చేరెను. అచటికి చేరునప్పటికి అతనిచెంత 2 అణాలు మాత్రమే యుండెను. కాబట్టి కష్టదశలో నుండెను. అప్పుడే ఎవరో "బాపుగిర్ బువా ఎవరు?" అని కేక వైచుచుండిరి. బువా యచ్చటికి పోయి తానేయని చెప్పెను. నానాసాహెబు పంపించినారని చెప్పుచు ఆ బంట్రోతు ఒక చక్కని టాంగావద్దకు దీసికొని పోయెను. దానికి రెండు మంచి గుర్రములు కట్టియుండెను. ఇద్దరు అందులో కూర్చుండి బండిని వదలిరి. టాంగా వేగముగా బోయెను. తెల్లవారుజామున టాంగా యొక సెలయేరువద్దకు చేరెను. బండి తోలువాడు గుర్రములను నీళ్ళు త్రాగించుటకు పోయెను. బంట్రోతు రామగిర్ బువాను ఫలహారము చేయుమని, ఫలహారపు దినుసులను బెప్పేను. గడ్డముమీసములున్న ఆ బంట్రోతు బట్టలు చూచి రామగిర్ బువాయతడు మహమ్మదీయుడని సంశయించి ఫలహారములు తినకుండెను కాని యా బంట్రోతు తాను హిందువుననియు, గర్ వాల్ దేశపు క్షత్రియుడననియు, నానాసాహెబు ఆ ఫలహారముల బంపెను గన, తినుటకు కెట్టి సంశయము వలదనెను. అప్పుడిద్దరు కలిసి ఫలహారము చేసి బయలు దేరిరి. ఉషఃకాలమున జామ్నేర్ చేరిరి. ఒంటికి పోసుకొనుటకై రామగిర్ బువా టాంగా దిగి రెండు మూడు నిమిషములలో వచ్చెను. తిరిగి వచ్చుసరికి టాంగా కాని, టాంగా తోలువాడు కాని, బంట్రోతు కాని లేకుండిరి. బాపుగిర్ బువ నోటివెంట మాట రాకుండెను. దగ్గరనున్న కచేరికి బోయి యడుగగా, నానా సాహెబు ఇంటివద్దనే యున్నట్లు దెలిసెను. నానాసాహెబుగారింటికి వెళ్ళి తాను శిరిడీ సాయిబాబా వద్దనుంచి వచ్చినట్లు చెప్పెను. బాబా ఊదీ, హారతి పాట నానాసాహెబుకందజేసెను. మైనతాయి చాల దుస్థితిలో నుండెను. అందరామెగూర్చి మిగుల ఆందోళన పడుచుండిరి. నానాసాహెబు తన భార్యను బిలిచి ఊదీని నీళ్ళలో కలిపి కొమార్తె కిచ్చి హారతిని పాడుమనిరి. బాబా మంచి సమయములో సహాయము బంపెననుకొనిరి. కొద్ది నిమిషములలో ప్రసవము సుఖముగా జరిగెనని వార్త వచ్చెను. గండము గడచినదని చెప్పిరి. నానాసాహెబు గారు టాంగాను నౌకరును, ఫలహారములను పంపినందుకు బాపుగిర్ బువా ఆయనకు కృతజ్ఞత తెలుపగా నాతడు మిక్కిలి యాశ్చర్యపడెను. శిరిడీ నుండి ఎవ్వరు వచ్చుచున్నది అతనికి తెలియదు. కనుక నతడేమియు పంపియుండలేదని చెప్పెను.

బి.వి.దేవ్ గారీవిషయమై బాపురావు చాందోర్కరును, రాంగిర్ బువాను కలిసికొని విచారించి సాయి లీలా మాగజైన్ లో (xiii-11, 12, 13) గొప్ప వ్యాసమును ప్రకటించినారు. బి.వి. నరసిమ్హస్వామి మైనాతాయి, బాపూరావు చాందోర్కరు, రామగిరి బువాల వాజ్మూలమును సేకరించి "భక్తుల అనుభవములు" అనుగ్రహమున (3వ భాగము) ప్రకటించినారు.

భక్తనారాయణరావుకు బాబాను రెండుసారులు దర్శనము చేయుభాగ్యము కలిగెను. బాబా సమాధి చెందిన మూడేండ్లకు శిరిడీ పోవలెననుకొనెను. కాని, పోలేకపోయెను. బాబా సమాధి చెందిన యొక సంవత్సరములో నతడు జబ్బు పడి మిగుల బాధపడుచుండెను. సాధారణ చికిత్సలవలన ప్రయోజనము కలుగలేదు. కావున రాత్రింబవళ్ళు బాబాను ధ్యానించెను. ఒకనాడు స్వప్నములో నొక దృశ్యమును జూచెను. అందు బాబా అతనిని ఓదార్చి యిట్లనెను. "ఆందోళన పడవద్దు. రేపటినుంచి బాగగును. వారము రోజులలో నడువగలవు." స్వప్నములో చెప్పిన రీతిగా రోగము వారములో కుదిరెను. ఇచట మన మాలోచించవలసిన విషయమిది. "శరీరమున్నన్నాళ్ళు బాబా బ్రతికి యుండిరా? శరీరము పోయినదిగాన చనిపోయినారా?" లేదు. ఎల్లప్పుడు జీవించియే యున్నారు. వారు జననమరణముల కతీతులు. ఎవరయితే బాబా నొకసారి హృదయపూర్వకముగా ప్రేమించెదరో వారెక్కడున్నప్పటికి ఎట్టి సమయమందుగాని బాబానుంచి తగిన జవాబు పొందెదరు. వారెల్లప్పుడు మన ప్రక్కనే యుందురు. ఏరూపము లోనో భక్తునకు దర్శనమిచ్చి వాని కోరికను నెరవేర్చెదరు.

బాలబువ సుతార్

బొంబాయిలో నుండు యోగియగు బాలబువ సుతార్ 1917 వ సంవత్సరమున మొదటిసారి శిరిడి వచ్చెను. అతడు గొప్పభక్తుడు వారెల్లప్పుడు ధ్యానము, భజన చేయుటచే వారిని "నవయుగ తుకారాం'" అని పిలుచువారు. వారు బాబాకు నమస్కరించగా బాబా "నేనీతనిని నాలుగు సంవత్సరములనుండి ఎరుగుదును." అనెను. తాను మొదటి సారిగా ఇప్పుడే శిరిడీ వచ్చినవాడగుటచే బాలబువ ఇదెట్లు సంభవమనుకొనెను. కాని తీవ్రముగ నాలోచించగా బొంబాయిలో 4 సంవత్సరముల క్రిందట బాబా ఫొటోకు నమస్కరించినట్లు జ్ఞప్తికి వచ్చెను. బాబా మాటల ప్రాముఖ్యమును గ్రహించెను. తనలో తానిట్లనుకొనెను. "యోగులెంతటి సర్వజ్ఞులు సర్వాంతర్యాములు? తన భక్తులందు వారి కెంత ప్రేమ? నేను వారి ఫొటోను చూచుట వారిని స్వయముగ చూచినదానితో సమానమని నాకు బోధించిరి."

అప్పా సాహెబు కులకర్ణి

1917 వ సంవత్సరమున అప్పాసాహెబు కులకర్ణి వంతు వచ్చెను. అతడు ఠాణా కు బదిలీ యయ్యెను. బాలాసాహెబు భేటే అతనికి బాబా ఫోటో నిచ్చియుండెను. అతడు దానిని జాగ్రత్తగా పూజించుచుండెను. పువ్వులు, చందనము, నైవేద్యము బాబాకు నిత్యమర్పించుచు బాబాను చూడవలెనని మిగుల కాంక్షించుచుండెను. ఈ సందర్భమున బాబా పటమును మనఃపూర్వకముగ చూచినచో బాబాను ప్రత్యక్షముగా చూచినదానితో సమానమే యని చెప్పవచ్చును. (దీనికి నిదర్శనము పైన చెప్పబడిన కధ).

కులకర్ణి ఠాణాలో నుండగా భివండి పర్యటనకు బోవలసివచ్చెను. ఒక వారమురోజుల లోపల తిరిగి వచ్చుట కవకాశము లేకుండెను. అతడు లేనప్పుడు మూడవరోజున ఈ దిగువ యాశ్చర్యమయిన సంగతి జరిగెను. మధ్యాహ్నము 12 గంటలకు ఒక ఫకీరు అప్పాకులకర్ణి యింటికి వచ్చెను. వారి ముఖలక్షణములు సాయిబాబా ముఖలక్షణములతో సరిపోయెను. కులకర్ణి గారి భార్యాబిడ్డలు వారు శిరిడీ సాయిబాబా నా యని యడిగిరి. వారిట్లు నుడివిరి. "లేదు. నేను భగవంతుని సేవకుడను. వారి యాజ్ఞానుసారము మీ యోగక్షేమములను కనుగొనుటకు వచ్చితిని." అట్లనుచు దక్షిణ నడిగెను. ఆమె ఒక రూపాయి నిచ్చెను. వారొక చిన్నపొట్లముతో ఆమెకు ఊదీ నిచ్చి, దానిని పూజలో ఫొటోతో కూడ నుంచుకొని పూజించుమనిరి. పిమ్మట యిల్లు విడిచి వెళ్ళిపోయిరి. ఇక చిత్రమైన సాయిలీలను వినుడు.

భివండిలో తన గుర్రము జబ్బుపడగా అప్పాసాహెబు తన పర్యటన మానుకొనవలసి వచ్చెను. ఆనాటి సాయంకాలమే తిరిగి ఇల్లు చేరెను. ఫకీరు రాక భార్య వల్ల వినెను. ఫకీరుగారి దర్శనము దొరకనందులకు మిగుల మనోవేదన పొందెను. ఒక్కరూపాయి మాత్రమే దక్షిణ గా నిచ్చుటకిష్టపడకుండెను. తానే యింటివద్దనున్నచో 10 రూపాయలకు తక్కువగాకుండ దక్షిణ యిచ్చి యందుననెను. వెంటనే ఫకీరును వెదకుటకై బయలుదేరెను. మసీదులలోను, తక్కిన చోట్లను భోజనము చేయకయే వారికొరకు వెదకెను. అతని యన్వేషణ నిష్ఫలమయ్యెను. ఇంటికి వచ్చి భోజనము చేసెను. 32 వ అధ్యాయములో ఉత్తకడుపుతో భగవంతుని వెదకరాదని బాబా చెప్పినది చదువరి గమనించవలెను. అప్పాసాహెబిచ్చట ఒక నీతిని నేర్చుకొనెను. భోజనమయిన తరువాత చిత్రేయను స్నేహితునితో వాహ్యాళికి బయలుదేరెను. కొంతదూరము పోగా నెవరో వారివైపు త్వరగా వచ్చుచున్నట్లు గాన్పించెను. వారి ముఖలక్షణములబట్టి వారు తన యింటికి 12 గంటలకు వచ్చినవారే యని యనుకొనెను. వెంటనే ఫకీరు చేయి చాచి దక్షిణ యడిగెను. అప్పాసాహెబు ఒక రూపాయి నిచ్చెను. వారు తిరిగి యడుగగా ఇంకా రెండు రూపాయలిచ్చెను. అప్పటికి అతడు సంతుష్టి చెందలేదు. అప్పాసాహెబు చిత్రేవద్దనుంచి మూడు రూపాయలు తీసుకొని ఫకీరుకు ఇచ్చెను. వారింకను దక్షిణ కావలెననిరి. అప్పాసాహెబు వారినింటికి రావలసినదని వేడుకొనెను. అందరు ఇల్లు చేరిరి. అప్పాసాహెబు వారికి 3 రూపాయలిచ్చెను. మొత్తము తొమ్మిది రూపాయలు ముట్టెను. అప్పటికి సంతుష్టి చెందక ఫకీరు ఇంకను దక్షిణ యిమ్మనెను. అప్పాసాహెబు తనవద్ద పదిరూపాయల నోటు గలదనెను. ఫకీరు దానిని పుచ్చుకొని తొమ్మిది రూపాయలు తిరిగి యిచ్చివేసి యక్కడనుండి వెడలెను. అప్పాసాహెబు పదిరూపాయలిచ్చెదననెను గనుక ఆ మొత్తమును దీసికొని పవిత్రపరచిన పిమ్మట తొమ్మిది రూపాయలు నిచ్చివేసెను సంఖ్య 9 చాల ముఖ్యమైనది. అది నవవిధభక్తులను తెలియజేయును. (బాబా లక్ష్మీబాయి శిందే కు 9 రూపాయలు సమాధి సమయమందిచ్చిరి.) అప్పాసాహెబు ఊదీ పొట్లము విప్పి చూచెను. అందులో పువ్వులరెక్కలును అక్షతలునుండెను. కొంతకాలము పిమ్మట బాబాను శిరిడీలో దర్శించినప్పుడు వారి వెంట్రుక ఒకటి చిక్కెను. అతడు ఊదీ పొట్లమును, వెంట్రుకను, ఒక తాయెత్తులో పెట్టి తన దండపై కట్టుకొనెను. అప్పాసాహెబు ఊదీ ప్రభావమును గ్రహించెను. అతడు మిక్కిలి తెలివైనవాడయినప్పటికి నెలకు 40 రూపాయలు జీతము మాత్రమే దొరకుచుండెను. బాబా ఫోటోను ఊదీని పొందిన తరువాత 40 రూపాయల కెన్నో రెట్లు ఆదాయము వచ్చెను. మంచి పలుకుబడియు అధికారమును లభించెను. ఈ లౌకికమైన కానుకలేగాక దైవభక్తికూడ వృద్ధి యగుచుండెను. కావున బాబా ఊదీని పొందు భాగ్యము కలవారు స్నానము చేసినపిమ్మట ఊదీని నుదుట రాసికొని, కొంచెము నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థముగ భావించి పుచ్చుకొనవలెను.

హరిభావు కర్ణిక్

ఠాణా జిల్లా దహను గ్రామమునుండి హరిభావూ కర్ణిక్ అనునతడు 1917 వ సంవత్సరమూన గురుపౌర్ణమినాడు శిరిడీ కి వచ్చి బాబాను తగిన లాంచనములతో పూజించెను. వస్త్రములు దక్షిణ సమర్పించెను. శ్యామాద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగెను. అప్పుడే యింకొక రూపాయి బాబాకు దక్షిణ నివ్వవలెనని తోచగా మసీదు మరల ఎక్కుచుండగా, బాబా సెలవుపొందిన పిమ్మట తిరిగి వెనుకకు రారాదని విని ఇంటికి బయలు దేరెను. మార్గమధ్యమున నాసిక్ లో కాలారముని మందిరము ప్రవేశించి దర్శనము చేసికొని వెలుపలికి వచ్చుచుండగా నరసింగ మహారాజు అను యోగి తన శిష్యులను విడచి లోపల నుండి బయటకి వచ్చి, హరి భావూ ముంజేతి ని బట్టుకొని "నా రూపాయి నాకిమ్ము" అనెను. కర్ణిక్ మిగుల ఆశ్చర్యపడెను. రూపాయిని సంతోషముగ నిచ్చి, సాయిబాబా యివ్విధముగా తానివ్వనిశ్చయించుకొనిన రూపాయిని నరసింగ మహారాజుద్వారా గ్రహించెననుకొనెను.

యోగీశ్వరులంద రొకటే యనియు, ఏకాత్మభావముతో కార్యము లొనర్తురనియు నీకధ తెలుపుచున్నది.

ఓం నమో శ్రీ సాయినాధాయ

శాంతిః శాంతిః శాంతిః

ముప్పదిమూడవ అధ్యాయము సంపూర్ణము