శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము - పి.నారాయణరావు Back   Home 

ముప్పదియైదవ అధ్యాయము

(ఊదీప్రభావము)
పరీక్షింపబడి లోటులేదని కనుగొనుట
1.కాకామహాజని స్నేహితుడు, యజమాని 2. బాంద్రా అనిద్ర రోగి 3. బాలాపాటీలు నేవాస్కర్

ఈ అధ్యాయములో కూడ ఊదీమహిమ వర్ణింతము. ఇందులో బాబా రెండు విషయములలో పరీక్షింపబడి లోపము లేదని కనుగొనబడుట గూడ చెప్పబడినది. బాబాను పరీక్షించు కధలు మొట్టమొదట చెప్పబడును.

ప్రస్తావన

ఆధ్యాత్మికవిషయములో లేదా సాధనలందు, శాఖలు, మనయభివృద్ధికి అడ్డుపడును. భగవంతుడు నిరాకారుడని నమ్మువారు భగవంతుడాకారముగలవాడని నమ్మువారిని ఖండించి యది వట్టి భ్రమ యనెదరు. యోగీశ్వరులు మామూలు మానవులు మాత్రమే, కనుక వారికి నమస్కరింపనేల యందురు. ఇతరశాఖలవారు కూడ అక్షేపణ చేయుచు వారి సద్గురువు వారికి ఉండగా ఇతర యోగులకు నమస్కరించి వారికి సేవ చేయనేల? యందురు. సాయిబాబా గూర్చి కూడ నట్టి యాక్షేపణ చేసిరి. శిరిడీకి వెళ్ళిన కొందరిని బాబా దక్షిణ యడిగెను. యోగులు ఈ ప్రకారముగా ధనము ప్రోగుచేయుట శ్రేయస్కరమా? వారిట్లు ధనము జాగ్రత్త చేసినచో వారి యోగిగుణము లెక్కడ? అని విమర్శించిరి. అనేకమందు బాబాను వెక్కిరించుటకు శిరిడీకి వెళ్ళి తుదకు వారిని ప్రార్థించుట కచటనే నిల్చిపోయిరి. అటువంటి రెండు ఉదాహరణ లీ దిగువ నిచ్చుచున్నాము.

కాకా మహాజని స్నేహితుడు

కాకా మహాజని స్నేహితుడు నిరాకారస్వరూపుడగు భగవంతునారాధించువాడు. విగ్రహారాధనమున కాతడు విముఖుడు. అతడు ఊరకనే వింతలేమైన తెలిసికొనుటకు శిరిడీకి పోవనంగీకరించెను. కాని బాబాకు నమస్కరించననియు, వారికి దక్షిణ యివ్వననియు చెప్పెను. కాకా యా షరతులకు ఒప్పుకొనెను. ఇద్దరును శనివారమునాడు రాత్రి బొంబాయి విడిచి యా మరుసటి దినము శిరిడీ చేరిరి. వారు మసీదు మెట్లను ఎక్కగనే కొంచెము దూరమున నున్న బాబా, మహాజని స్నేహితుని మంచిమాటలతో నాహ్వానించెను. ఆ కంఠధ్వని మిక్కిలి చిత్రముగా నుండెను. ఆ కంఠము అతని తండ్రి కంఠమువలె నుండెను. ఆ కంఠము గతించిన తన తండ్రిని జ్ఞప్తికి దెచ్చెను. శరీరము సంతోషముతో నుప్పొంగెను. కంఠపు ఆకర్షణశక్తి ఏమని చెప్పుదును? మిగుల నాశ్చర్యపడి యా స్నేహితుడు "ఇది తప్పనిసరిగ మా తండ్రి కంఠమే" యనెను. వెంటనే మసీదు లోపలికి వెళ్ళి, తన మనోనిశ్చయమును మరచినవాడై, బాబా పాదములకు నమస్కరించెను.

ఉదయమొకసారి మధ్యాహ్నమొకసారి బాబా దక్షిణ యడుగగా కాకా మహాజని యిచ్చెను. బాబా కాకానే దక్షిణ యడుగుచుండెను. కాని యతని స్నేహితుని అడుగలేదు. అతని స్నేహితుడు కాకా చెవిలో "బాబా నిన్నే రెండుసారులు దక్షిణ యడిగెను. నేను నీతో నున్నాను. నన్నెందుకు విడిచిపెట్టుచున్నారు?" అని యడిగెను. "నీవే బాబాను అడుగుము" అని యతడు జవాబిచ్చెను. తన స్నేహితుడేమని చెవిలో నూదుచున్నాడని బాబా కాకా మహాజని నడుగగా, తన స్నేహితుడు తానుకూడ దక్షిణ యివ్వవచ్చునాయని బాబాను యడిగెను. బాబా "నీ కిచ్చుటకు మనమున నిష్టము లేకుండెను. కాన నిన్నడుగలేదు. కాని, యిప్పుడు నీకిష్టమున్న ఎడల ఇవ్వవచ్చు" ననెను. కాకా యిచ్చినంత అనగా 17 రూపాయలు దక్షిణను అతని స్నేహితుడు కూడ నిచ్చెను. బాబా యపుడు కొన్ని మాటలు సలహారూపముగా నిట్లు చెప్పెను. "నీవు దానిని తీసివేయుము; మనకు మధ్య నున్న యడ్డును తీసివేయుము. అప్పుడు మనమొకరినొకరు ముఖాముఖి చూచుకొనగలము; కలిసికొనగలము." పోవుటకు బాబా వారికి సెలవునిచ్చెను. ఆకాశము మేఘములతో కమ్మియున్నప్పటికీ వర్షము వచ్చునేమోయను భయము కలుగుచున్నప్పటికి ప్రయాస లేకుండ ప్రయాణము సాగునని బాబా యాశీర్వదించెను. ఇద్దరు సురక్షితముగా బొంబాయి చేరిరి. అతడు ఇంటికిపోయి తలుపు తీయుసరికి రెండు పిచ్చుకలు చచ్చిపడియుండెను. ఇంకొకటి కిటికీ ద్వారా ఎగిరిపోయెను. తానే కిటికీలు తెరచియుంచినచో పిచ్చుకలు రక్షింపబడియుండును. వాని యదృష్టానుసారముగ నవి చచ్చెను. మూడవదానిని రక్షించుటకై బాబా త్వరగా తనను బంపెననుకొనెను.

కాకామహాజని - యజమాని

ధక్కర్ ధరమ్సె జెఠాభాయి, హైకోర్టు ప్లీడరు కొక కంపెని గలదు. దానిలో కాకా మేనేజర్ గా పనిచేయుచుండెను. యజమానియు మేనేజరును అన్యోన్యముగా నుండెడివారు. కాకా శిరిడీకి అనేకసారులు పోవుట, కొన్నిదినములచటనుండి తిరిగి బాబా యనుమతి పొంది వచ్చుట, మొదలగునవి ధక్కరుకు తెలియును. కుతూహలము కోసము, బాబాను పరీక్షించు ఆశక్తితోను, ధక్కర్ కాకాతో హోళీ సెలవులలో శిరిడీకి పోవ నిశ్చయించుకొనెను. కాకా ఎప్పుడు తిరిగి వచ్చునో యనునది నిశ్చయముగా తెలియదు కనుక ధక్కరింకొకరిని వెంట తీసుకొని వెళ్ళెను. ముగ్గురు కలసి బయలుదేరిరి. బాబా కిచ్చుటకై కాకా రెండుసేర్ల ఎండుద్రాక్షపండ్లు (గింజలతోనున్నవి) దారిలో కొనెను. వారు శిరిడీకి సరియైన వేళకు చేరి, బాబా దర్శనమునకయి మసీదుకు బోయిరి. అప్పుడక్కడ బాబాసాహెబు తర్ఖడుండెను. ధక్కర్ మీరెందుకు వచ్చితిరని తర్ఖడు నడిగెను. దర్శనముకొరకని తర్ఖడు జవాబిచ్చెను. మహిమ లేమైన జరిగినవాయని ధక్కర్ ప్రశ్నించెను. బాబా వద్ద ఏమైన అద్భుతములు చూచుట తన నైజము కాదనియు, భక్తులు ప్రేమతో కాంక్షించునది తప్పక జరుగుననియు తర్ఖడ్ చెప్పెను. కాకా బాబా పాదములకు నమస్కరించి ఎండు ద్రాక్షపండ్లను అర్పించెను. బాబా వానిని పంచిపెట్టుమని యాజ్ఞాపించెను. ధక్కరుకు కొన్ని ద్రాక్షలు దొరికెను. అతనికి అవి తినుటకిష్టము లేదు. ఎందుచేతననగా తన వైద్యుడు కడిగి శుభ్రపరచనిదే తినకూడదని సలహా యిచ్చియుండెను. ఇప్పుడాతనికి అది సమస్యగా తోచెను. తనకు వానిని తినుట ఇష్టములేదు. కాని బాబా తినుట కాజ్ఞాపించుటచే పారవేయలేకుండెను. పారవేసినట్లయితే బాగుండదని వానిని నోటిలో వేసికొనెను. గింజల నేమి చేయవలయునో తోచకుండెను. మసీదులో గింజలుమ్మివేయుటకు జంకుచుండెను. తన యిష్టమునకు వ్యతిరేకముగ తుదకు తన జేబులోనే వేసికొనెను. బాబా యోగి యయినచో తనకు ద్రాక్షపండ్లు ఇష్టము లేదని తెలియదా? బాబా వానినేల బలవంతముగా నిచ్చెను? ఈ యాలోచన అతని మనస్సున తట్టగానే బాబా ఇంకను మరికొన్ని ద్రాక్షపండ్లు ఇచ్చెను. అతడు వానిని తినలేదు. చేతిలో పట్టుకొనెను. బాబా వానిని తినుమనెను. వారి యాజ్ఞానుసారము తినగా వానిలో గింజలు లేకుండెను. అందుకతడు మిగుల నాశ్చర్యపడెను. అద్భుతములు చూడలేదనుకొనెను గాన నాతనిపై నీ యద్భుతము ప్రయోగింపబడెను. బాబా తన మనస్సును గనిపెట్టి గింజలుగల ద్రాక్షపండ్లను గింజలు లేనివానిగా మార్చివేసెను. ఏమి యాశ్చర్యకరమైన శక్తి! బాబాను పరీక్షించుటకు తర్ఖడు కెట్టి ద్రాక్షలు దొరికెనని యడిగెను. గింజలతోనున్నవి దొరికెనని తర్ఖడ్ చెప్పెను. ధక్కరు ఆశ్చర్యపడెను. తనయందుద్భవించుచున్న నమ్మకము దృఢపరచుటకై బాబా యధార్థముగా యోగి ఐనచో ద్రాక్షపండ్లు మొట్టమొదట కాకా కివ్వవలెననుకొనెను. అతని మనస్సునందున్న యీ సంగతి కూడ గ్రహించి, బాబా కాకావద్దనుంచి ఎండుద్రాక్షల పంపిణి ప్రారంభింపవలయునని యాజ్ఞాపించెను. ఈ నిదర్శనముతో ధక్కరు సంతుష్టి చెందెను.

శ్యామా ధక్కరును కాకా యజమానిగ బాబాకు పరిచయము చేసెను. అందుకు బాబా యిట్లనెను. "అతడెట్లు వానికి యజమాని కాగలడు? అతని యజమాని వేరొకరు గలడు." కాకా యీ జవాబుకు చాలా ప్రీతిచెందెను. తన మనోనిశ్చయము మరచి ధక్కరు బాబాకు నమస్కరించి వాడాకు తిరిగిపోయెను.

మధ్యాహ్నహారతియైన పిమ్మట, వారందరు బాబా సెలవు దీసికొనుటకు మసీదుకు బోయిరి. శ్యామా వారి పక్షమున మాట్లాడెను. బాబా ఇట్లు చెప్పదొడంగెను.

"ఒక చంచలమనస్సుగల పెద్దమనుష్యుడుండెను. అతనికి ఆరోగ్యము ఐశ్వర్యము కూడ నుండెను. ఎట్టి విచారములు లేకుండెను. అనవసరమైన యారాటములు పైన వేసుకొని, యక్కడక్కడ తిరుగుచు మనశ్శాంతిని పోగొట్టుకొనుచుండెను. ఒక్కొక్కప్పుడు భారములన్నియు వదలివేయుచుండెను; మరొకప్పుడు వానిని మోయుచుండెను. అతని మనస్సునకు నిలకడ లేకుండెను. అతని స్థితి కనిపెట్టి కనికరించి నేను నీ కిష్టము వచ్చిన చోట నీ నమ్మకము పాదుకొల్పుము. ఎందుకిట్లు భ్రమించెదవు? ఒకే చోటు నాశ్రయించుకొని నిలకడగా నుండు" మని చెప్పితిని.

వెంటనే ధక్కరిదియంతయు తన గూర్చియే యని గ్రహించెను. కాకా కూడ తన వెంట రావలెననుకొనెను. కాని కాకాకు అంత త్వరగా శిరిడీ విడుచుట కాజ్ఞ దొరుకునని ఎవ్వరనుకొనలేదు. బాబా దీనిని కూడ కనుగొని కాకాను అతని యజమాని తో పోవుట కనుజ్ఞ ఇచ్చెను. ఈ విధముగా బాబా సర్వజ్ఞుడనుటకు ధక్కరు కొంకొక నిదర్శనము దొరికెను.

బాబా కాకాను 15 రూపాయలు దక్షిణ యడిగి పుచ్చుకొని అతని కిట్లని చెప్పెను. "నేనే ఒక రూపాయి దక్షిణ ఎవరివద్దనుంచి కాని తీస్కొనినచో దానికి పదిరెట్లు ఇవ్వవలెను. నేనూరకనే ఏమి తీసికొనను. యుక్తాయుక్తములు తెలియకుండగ నేనెవరిని అడుగను. ఫకీరెవరిని చూపునో వారివద్దనే నేను తీసుకొనెదను. ఎవరైన ఫకీరుకు గతజన్మనుంచి బాకీ యున్నచో, వానివద్దనే ధనము పుచ్చుకొందును. దానము చేయువాడిచ్చునది ప్రస్తుతము విత్తనములు నాటుటవంటిది. అదిమనుముందు గొప్ప పంట అనుభవించుట కొరకే. ధర్మము చేయుటకు ధనముపయోగించవలెను. దానిని సొంతమునకు వాడుకొనిన నది వ్యర్థమయి పోవును. గతజన్మలో నీ విచ్చియుంటేనే గాని, నీవిప్పుడనుభవించలేవు. కనుక ధనమును పొందవలెననిచో, దానిని ప్రస్తుత మితరుల కిచ్చుటే సరియైన మార్గము. దక్షిణ యిచ్చుచున్నచో వైరాగ్యము పెరుగును. దానివలన భక్తిజ్ఞానములు కలుగును. ఒక రూపాయి నిచ్చి 10 రూపాయలు పొందవచ్చును."

ఈ మాటలు విని, ధక్కరు తన నిశ్చయమును మరచి 15 రూపాయలు బాబా చేతిలో పెట్టెను. శిరిడీకి వచ్చుట మేలయిన దనుకొనెను. ఏలన, అతని సంశయములన్నియును తొలగెను. అతడెంతయో నేర్చుకొనెను.

అటువంటివారి విషయములో బాబా ప్రయోగించు యక్తి మిక్కిలి యమోఘమయినది. అన్ని బాబాయే చేయుచున్నను, దేనియందభిమాన ముంచలేదు. ఎవరయినను నమస్కరించినను నమస్కరించక పోయినను, దక్షిణ యిచ్చినను, ఈయకున్నను తన కందరు సమానమే. బాబా ఎవరిని అవమానించలేదు. తనను పూజించినందుకు గర్వించెడివారు కాదు. తనను పూజించలేదని విచారించేవారు కాదు. వారు ద్వంద్వాతీతులు.

నిద్రపట్టని రోగము

బాంద్రానివాసి కాయస్థప్రభుజాతికి చెందిన ఒక పెద్దమనుష్యుడు చాలకాలము నిద్రపట్టక బాధపడుచుండెడివాడు. నిద్రించుటకై నడుము వాల్చగనే గతించిన తన తండ్రి స్వప్నములో గానిపించి తీవ్రముగా తిట్టుచుండెడివాడు. ఇది అతని నిద్రను భంగపరచి రాత్రియందస్థిరునిగా చేయుచుండెను. ప్రతిరోజిట్లు జరిగి, ఏమి చేయుటకు తోచకుండెను. ఒకనాడు బాబా భక్తునితో నీ విషయము మాట్లాడెను. బాబా ఊదియే దీనిని తప్పనిసరిగ బాగుచేయునని అతడు సలహా ఇచ్చెను. అతడువానికి కొంత ఊదీ నిచ్చి ప్రతిరోజు నిద్రించుటకు ముందు కొంచెము నుదుటికి రాసుకొని మిగత పొట్లమును తలక్రింద దిండుకు దిగువ బెట్టుకొనుమనెను. ఇట్లు చేసిన పిమ్మట, సంతోషము, ఆశ్చర్యము కలుగునట్లు అతనికి మంచినిద్రపట్టెను. ఎట్టి చికాకు లేకుండెను. అతడు సాయిని నిత్యము స్మరించుచుండెను. సాయిబాబా పటమును దెచ్చి గోడపై వ్రేలాడదీసెను. దానిని ప్రతిరోజు పూజించుచుండెను. గురువారము నాడు పూలమాల వేయుచుండెను. నైవేద్యము సమర్పించుచుండెను. పిమ్మట నతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయెను.

బాలాజీ పాటీలు నేవాస్కరు

వీరు బాబాకు గొప్పభక్తులు. వీరు ఫలాపేక్ష లేకుండ చాలమంచి సేవ చేసిరి ఇతడు శిరిడీలో బాబా ఏఏ మార్గముల ద్వారా పోవుచుండెనో వానినన్నిటిని తుడిచి శుభ్రము చేయుచుండెను. వారి యనంతరము ఈ పని రాధాకృష్ణామాయి, యతిశుభ్రముగ నెరవేర్చుచుండెను. ఆమె తరువాత అబ్దుల్లా చేయుచుండెను. బాలాజీ ప్రతిసంవత్సరము పంట కోయగనే దాని నంతయు దెచ్చి, బాబా కర్పితము చేయుచుండెను. బాబా ఇచ్చినదానితో తాను కుటుంబమును పోషించుకొనువాడు. ఈ ప్రకారముగా నతడు చాలసంవత్సరములు చేసెను. అతని తరువాత అతని కుమారుడు దానినవలంబించెను.

ఊదీ ప్రభావము

ఒకనాడు బాలాజీ సాంవత్సరికమునాడు నేవాస్కరు కుటుంబము వారు కొంతమంది బంధువులను భోజనమునకు బిలచిరి. భోజనసమయానికి పిలచినవారికంటె మూడురెట్లు బంధువులు వచ్చిరి. నేవాస్కరు భార్యకు సంశయము కలిగెను. వండిన పదార్థములు వచ్చిన వారికి చాలవనియు, కుటుంబగౌరవమునకు భంగము కలుగుననియు ఆమె భయపడెను. ఆమె యత్తగారు ఓదార్చుచు, "భయపడకుము, ఇది మనది కాదు. ఇది సాయి యాహారమే. అన్ని పాత్రలు గుడ్డల్తో పూర్తిగ కప్పివేయుము. వానిలో కొంచెము ఊదీ వేయుము. గుడ్డ పూర్తిగ తీయకుండ వడ్డన చేయుము. సాయి మనలను కాపాడును" అనెను. ఆమె యా సలహా ప్రకారమే చేసెను. వచ్చినవారికి భోజనపదార్థములు సరిపోవుటయేగాక, ఇంకను చాల మిగిలెను. తీవ్రముగా ప్రార్థించినచో యధాప్రకారము ఫలితమును బొందవచ్చునని యీ సంఘటనము తెలుపుచున్నది.

సాయి పామువలె గాన్పించుట

ఒకనాడు శిరిడీనివాసి రఘూపాటీలు నెవాసెలో నున్న బాలాజీ పాటీలింటికి వెళ్ళెను. ఆనాడు సాయంకాలమొకపాము ఆవులకొట్టములోనికి బుసకొట్టుచు దూరెను. అందులోని పశువులన్నియు భయపడి కదలజొచ్చెను. ఇంటిలోనివారందరు భయపడిరి. కాని బాలాజీ శ్రీ సాయియే ఆ రూపమున వచ్చెనని భావించెను. ఏమియు భయపడక గిన్నెతో పాలు దెచ్చి సర్పము ముందు బెట్టి యిట్లనెను. "బాబా ఎందుకు బుసకొట్టుచున్నావు? ఎందులకీ యలజడి? మమ్ము బయపెట్టదలచితివా? ఈ గిన్నెడు పాలను దీసుకొని నెమ్మదిగా త్రాగుము." ఇట్లనుచు అతడు దాని దగ్గర నిర్భయముగా గూర్చుండెను. ఇంటిలోని తక్కిన వారు భయపడిరి. వారికి ఏమి చేయుటకు తోచకుండెను. కొద్ది సేపటిలో సర్పము తనంతట తానే మాయమైపోయెను. ఎంత వెదకినను కనిపించలేదు.

బాలాజీ కి ఇద్దరు భార్యలు, కొంతమంది బిడ్డలుండిరి. బాబా దర్శనమునకై వారప్పుడప్పుడు శిరిడీకి పోవుచుండెడివారు. వారికొరకు చీరలు, బట్టలు కొని యాశీర్వచనములతో బాబా వారికి ఇచ్చుచుండెడి వారు.

ఓం నమో శ్రీ సాయినాధాయ

శాంతిః శాంతిః శాంతిః

ముప్పదియైదవ అధ్యాయము సంపూర్ణము

ఇరువదియెనిమిదవ అధ్యాయము

అనేకసంవత్సరములు బాబా సేవచేసి యనగ పూజామధ్యాహ్న సాయంకాల హారతి సేవలు చేసి తుదకు 1912 లో మేఘశ్యాముడు కాలము నొందెను. బాబా వాని కళేబరముపయి చేతులు చాచి "ఇతడు నా నిజమయిన భక్తు"డనెను. బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చావుభోజీ ఏర్పాటు చేయుమనెను. కాకా సాహెబు దీక్షిత్ బాబా ఆజ్ఞ నెరవేర్చెను.

ఓం నమో శ్రీ సాయినాధాయ

శాంతిః శాంతిః శాంతిః

ఇరువదియెనిమిదవ అధ్యాయము సంపూర్ణము