(6 వ రోజు పారాయణము - మంగళవారము)
ముప్పదిఎనిమిదవ అధ్యాయము
1.బాబా వంటపాత్ర, 2. దేవాలయమును గౌరవించకుండుట, 3. కాలా లేదా మిశ్రమము, 4.
మజ్జిగ.
గత అధ్యాయములో బాబాగారి చావడి యుత్సవము వర్ణించితిమి. ఈ యధ్యాయములో మనము బాబా వంటపాత్ర
మొదలగువానిని గూర్చి చదివెదము.
తొలిపలుకు
ఓ సద్గురుసాయీ! నీవు పావనమూర్తివి; ప్రపంచమంతటికి ఆనందము కలుగజేసితివి, భక్తులకు మేలు
కలుగజేసితివి, నీ పాదముల నాశ్రయిచినవారి బాధలను తొలగించితివి. నిన్ను శరణు జొచ్చిన వారిని
ఉదారస్వభావుడవగుటచే వారిని పోహించి రక్షించెదవు. నీ భక్తుల కోరికల నెరవేర్చుటకు, వారికి మేలు
చేయుటకొరకు నీవవతరించెదవు. పవిత్రాత్మయను ద్రవసారమును బ్రహ్మమనెడి యచ్చులో పోయగా దానినుండి
యోగులలో నలంకారమగు సాయి వెడలెను. ఈ సాయి యాత్మారాముడే. స్వచ్చమైన దైవికానందమునకు వారు
పుట్టినిల్లు. జీవేచ్ఛ లన్నియు పొందినవారై వారు భక్తులను నిష్కాములను చేసి విముక్తుల జేసిరి.
బాబా వంటపాత్ర
యుగయుగములకు శాస్త్రములు వేర్వేరు సాధనములను ఏర్పాటు చేసియున్నవి. కృతయుగములో తపస్సు,
త్రేతాయుగములో జ్ఞానము ద్వాపరయుగములో యజ్ఞము, కలియుగములో దానము చేయువలెనని శాస్త్రములు
ఘోషించుచున్నవి. దానము లన్నింటిలో అన్నదానమే శ్రేష్టమయినది. మధ్యాహ్నము 12 గంటలకు భోజనము
దొరకనిచో మనము చాల బాధపడెదము. అట్టి పరిస్థితులలో నితర జీవులుకూడ నట్లే బాధ పడును. ఈ విషయము
తెలిసి ఎవరయితే బీదలకు, ఆకలితో నున్నవారికి, భోజనము పెట్టెదరో వారే గొప్ప దాతలు,
తైత్తరీయోపనిషత్తు ఇట్లు చెప్పుచున్నది. "ఆహారమే పరబ్రహ్మస్వరూపము, ఆహారమునుండెయే సమస్తజీవులు
ఉద్భవించినవి. చచ్చిన పిమ్మట నవి తిరిగి ఆహారములో ప్రవేశించును." మిట్టమధ్యాహ్నము మన
యింటికెవరైన అతిథి వచ్చినచో, వారి నాహ్వానించి భోజనము పెట్టుట మన విధి. ఇతర దానములు అనగా ధనము,
బట్టలు మొదలగునవి యిచ్చునపుడు కొంత విచక్షణ కావలెను. కాని యాహారవిషయములో నట్టి యాలోచన యనవసరము.
మన యింటికి మిట్టమధ్యాహ్న మెవరు వచ్చినను వారికి మొట్టమొదట భోజనము పెట్టవలెను. కుంటి, గ్రుడ్డి,
రోగిష్టులు వచ్చినచో వారికి మొట్టమొదట భోజనము పెట్టిన పిమ్మట ఆరోగ్యవంతులకు, అటుపిమ్మట మన
బంధువులకు పెట్టవలెను. మంచి గున్నవారికి భోజనము పెట్టుటకంటే రోగులకు, చేతకానివారికి పెట్టుట
ఎంతో శ్రేయస్కరము. అన్నదానము లేకున్నచో నితర దానములు ప్రకాశించవు. ఎట్లన చంద్రుడు లేని
నక్షత్రములవలె, పతకములేని కంఠ హారమువలె, పింఛము లేని కిరీటమువలె, కమలము లేని చెవులవలె,
భక్తిలేని భజనవలె, కుంకుమబొట్టు లేని పుణ్యస్త్రీవలె, బొంగురు కంఠముగలవాని పాటవలె, ఉప్పు లేని
మజ్జిగవలె రుచింపవు. అన్ని వ్యంజనములకంటే పప్పుచారు ఎట్లు ఎక్కువో అట్లే అన్ని పుణ్యములలో
అన్నదానమెక్కువ. బాబా ఆహారము నెట్లు తయారుచేసి పంచి పెట్టుచుండెనో చూచెదము.
బాబా కొరకు చాలతక్కువ భోజనము కావలసియుండెను. అదియు కొన్ని యిండ్లనుండి భిక్షాటనము చేసి
తెచ్చుకొనెడివారని ఇదివరకే తెలిసికొంటిమి. ఏనాడైన అందరికి భోజనము పెట్టవలెనని బాబా
నిశ్చయించుకొన్నచో మొదటినుండి చివరివరకు కావలసిన ఏర్పాటు లన్నియు వారే స్వయముగా చేసికొనెడివారు.
ఈ విషయమై ఇతరులపై ఆధారపడలేదు; ఎవరికిని బాధ కలుగజేయలేదు. మొట్టమొదట బజారుకు వెళ్ళి ధాన్యము,
పిండి, మసాలా దినుసులు మొదలగునవి యన్నియు నగదు నిచ్చికొనెడివారు. వారే విసరుచుండెడివారు. మసీదు
ముందున్న ఖాళీ స్థలములో మధ్యన పొయ్యి బెట్టి దానిపై పెద్ద వంటపాత్రలో కొలతప్రకారము నీళ్ళుపోసి
పెట్టెడివారు. వారివద్ద వంటపాత్రలు రెండు గలవు. ఒకటి పెద్దది వందమందికి సరిపోవునది, రెండవది
చిన్నది 50 మందికి మాత్రము సరిపోవునది. ఒక్కొక్కప్పుడు చక్కెరపొంగలి వండే వారు. మరొక్కప్పుడు
మాంసపు పొలావ్ వండెడివారు. ఒక్కొక్కప్పుడు పప్పుచారుడుకునప్పుడు గోధుమపిండి బిళ్ళల నందులోనికి
వదిలేవారు. మసాలా వస్తువులను చక్కగా నూరి దానిని వంటపాత్రలో వేసేవారు. పదార్థములు చాలా రుచిగా
నుండుట కెంత శ్రమ తీసికొనవలెనో అంత శ్రమను పడుచుండెడివారు. అప్పుడప్పుడు అంబలి వండెడివారు. అనగా
జొన్నపిండిని నీళ్ళలో నుడకబెట్టి దానిని మజ్జిగలో కలుపుచుండెడివారు. భోజనపదార్థములతో అంబలి కూడ
అందరికి కొంచెముకొంచెముగా పెట్టెడివారు. అన్నము సరిగా నుడికినదో లేదో యని పరీక్షించుటకు బాబా తన
కఫనీని పైకెత్తి చేతిని నిర్భయముగ మరుగుచున్న డేకిసాలో బెట్టి కలుపుచుండేవారు. వారి ముఖమునందు
భయచిహ్నములు గాని చేయి కాలునట్లు గాని కనిపించెడిది కాదు. వంటపూర్తి కాగానే, బాబా ఆ పాత్రలను
మసీదులోనికి దెచ్చి, మౌల్వీచే ఆరగింపు పెట్టించేవారు. మొట్టమొదట కొంత మహాళ్సాపతికి, తాత్యాకు
ప్రసాదరూపముగ పంపించిన పిమ్మట మిగతదానిని బీదవాండ్రకు దిక్కులేనివారికి సంతృప్తిగా
బెట్టుచుండిరి. బాబా స్వయముగా తన చేతులతో తయారు చేసి స్వయముగా వడ్దించగా భోజనము చేసినవారు
నిజముగా ఎంతో పుణ్యాత్ములు అదృష్టవంతులయి యుండవలెను.
బాబా తన భక్తులందరికీ శాకాహారము మాంసాహార మొకేరీతిగా బెట్టుచుండెనాయని ఎవరికైన సందేహము
కలుగవచ్చును. దీని జవాబు సులభము, సామాన్యమైనది. ఎవరు మాంసాహారులో అట్టివారికే ఆ వంట పాత్రలోనిది
పెట్టెడివారు. మాంసాహారులు కానివారి నా పాత్రను గూడ ముట్టనీయలేదు. వారి మనసులో దీనిని తినుటకు
కోరిక కూడ కలుగనిచ్చెడివారుకారు. గురువుగారేదైనా ఇచ్చినప్పుడు దానిని తినవచ్చునా లేదా యని
యోచించు శిష్యుడు నరకమునకు పోవునను రూఢి కలదు. దీనిని శిష్యులు బాగా గ్రహించి నెరవేర్చుచుండిరో
లేదో చూచుటకు బాబా యొక్కొక్కప్పుడు పరీక్షించుచుండెడివారు. దీనికొక ఉదాహరణము. ఒక ఏకాదశినాడు
దాదా కేల్కరుకు కొన్ని రూపాయలిచ్చి కొరాల్బాకు పోయి మాంసమును కొనితెమ్మనెను. ఇతడు సనాతనాచార
పరాయణుడగు భ్రాహ్మణుడును ఆచారవంతుడును. సద్గురువుకు ధనము, ధాన్యము, వస్త్రములు మొదలగునవి ఇచ్చుట
చాలదనియు, కావలసినది అక్షరాల గురువు ఆజ్ఞను పాటించుటే యనియు గురువు ఆజ్ఞానుసారము నెరవేర్చుటయే
యనియు, ఇదియే నిజమైన దక్షిణ యనియు, దీనివల్లనే గురువు సంతుష్టి చెందెదరనియు అతనికి తెలియును.
కనుక దాదాకేల్కరు దుస్తులు ధరించి బజారుకు బయలదేరెను. కాని బాబా అతనిని వెంటనే పిలచి తానే
స్వయముగా పోవలదనియు నింకెవరినైన పంపుమనెను. అతడు పాండువను నౌకరును బంపెను. వాడు బయలుదేరుట జూచి
బాబా వానినికూడ వెనుకకు బిలిపించి యానాడు మాంసము వండుట మానుకొనిరి. ఇంకొకసారి బాబా
దాదాకేల్కరును బిలచి పొయ్యిమీదనున్న పొలావ్ ఉడికినదో లేదో చూడుమనెను. కేల్కర్ దానిని
పరీక్షించకయే సరిగా నున్నదని జవాబిచ్చెను. అప్పుడు బాబా "నీవు కండ్లతో దానిని చూడలేదు, నాలుకతో
రుచి చూడలేదు, రుచిగానున్నదని ఎట్లు చెప్పితివి. మూత తీసి చూడుము." అనుచు బాబా యతని చేతిని
బట్టుకొని మరుగుచున్న డేకిసాలో బెట్టెను. ఇంకను నిట్లనెను. "నీ చేయిని తీయుము. నీ ఆచారము నొక
ప్రక్కకు బెట్టి తెడ్డుతో దీసి, కొంచెము ప్లేటులో వేసి సరిగా ఉడికినది లేనిది తెలిసికొనుము."
తల్లి మనస్సున నిజమైన ప్రేమ జనించునప్పుడు ఆమె తన బిడ్డను గిల్లి ఆ బిడ్డ ఏడ్చునపుడు దానిని
కౌగిలించి ముద్దుబెట్టుకొనును. అట్లనే బాబా కూడ కన్నతల్లివలె దాదా కేల్కరును ఈ విధముగా
గిల్లెను. నిజముగా ఏ యోగిగాని, గురువుగాని తన శిష్యునకు నిషేధాహారమును తిని చెడిపొమ్మని
చెప్పడు.
ఈ వంటపాత్రలో వండుట 1910 వ సంవత్సరము వరకు జరిగిన పిమ్మట ఆగిపోయెను. పూర్వము చెప్పిన రీతిగా
దాసుగణు బాబా కీర్తిని తన హరికధలద్వారా బొంబాయి రాష్ట్రములో వెల్లడి చేసెను. ఆ ప్రాంతమునుండి
ప్రజలు తండోపతండములుగా శిరిడీకి వచ్చుచుండిరి. కొలది దినములలో శిరిడీ యొక పుణ్యక్షేత్రమాయెను.
భక్తులనేక రకముల యాహారములను బాబాకు నైవేద్యము పెట్టుచుండిరి. వారు తెచ్చిన పదార్థములు ఫకీరులు,
బీదలు తినగా నింకను మిగులుచుండెను. నైవేద్యమునెట్లు పంచిపెట్టెడివారో చెప్పుటకు ముందు బాబాకు
శిరిడీ లోని దేవాలయములందును, నందుండు దేవతలయందును గల గౌరవమును చాటెడు నానాసాహెబు చాందోర్కరు కధ
తెలిసికొందము.
నానాసాహెబు దేవాలయమును అగౌరవించుట
ఎవరికి తోచినట్లు వారాలోచించి ఊహించి బాబా బ్రాహ్మణుడని కొందరు, మహమ్మదీయుడని మరికొందరు
చెప్పుచుండిరి. నిజముగా బాబా ఏజాతికి చెందినవారు కారు. వారెప్పుడు పుట్టిరో, ఏజాతియందు
పుట్టిరో, వారి తల్లిదండ్రులెవరో ఎవరికిని తెలియదు. కనుక వారు బ్రాహ్మణుడు గాని,
మహమ్మదీయుడుగాని ఎట్లు కాగలరు? వారు మహమ్మదీయులయినచో మసీదులో నెప్పుడు ధుని నెట్లు మండనిత్తురు?
అచ్చోట తులసీబృందావన మెట్లుండును? శంఖము లూదుటకెట్లు ఒప్పుకొందురు? గంటలను మ్రోయించుట కెట్లు
సమ్మతింతురు? సంగీతవాద్యముల నెటుల వాయించనిత్తురు? హిందువుల మతప్రకారముగా షోడశోపచార పూజలెటుల
జరుగనిత్తురు? వారు మహమ్మదీయులయినచో చెవులకు కుట్లు (రంధ్రము) ఎటులుండును? గ్రామములో
హిందూదేవాలయము లన్నిటిని ఏల మరమ్మతు చేయించిరి? బాబా హిందూదేవాలయములను దేవతలను ఏమాత్రము
అగౌరవించినను ఊరుకొనెడివారు కారు.
ఒకనాడు నానాసాహెబు చాందోర్కరు తన షడ్డకుడగు బినివల్లెతో శిరిడీకి వచ్చెను. బాబా వద్దకూర్చొని
మాటాడుచుండగా నానామీద బాబా హఠాత్తుగా కోపగించి, "నా సహవాసము ఇన్నాళ్ళు చేసియు నిట్లే చేసితివి?"
అనెను. నానాసాహెబు మొదట దీనిని గ్రహించలేకపోయెను. కనుక అదేమిటో వివరింపవలసినదిగా ప్రార్థించెను.
కోపర్ గాం నుండి శిరిడీకి ఎట్లు వచ్చితివని బాబా యతని నడిగెను. నానాసాహెబు వెంటనే తన తప్పును
గ్రహించెను. సాధారణముగా శిరిడీకి పోవునపుడెల్ల నానా సాహెబ్ కోపర్ గాంలో దిగి దత్తదర్శనము
చేసికొనెడివారు కాని ఈసారి తన బంధువు దత్తభక్తుడయినప్పటికి అతనినిగూడ వెళ్ళనీయక,
యాలస్యమయిపోవునని చెప్పుచు తిన్నగా శిరిడీకి చేర్చెను. ఇదంతయు బాబా కు తెలియజేయుచు, తాను
గోదావరిలో స్నానము చేయునప్పుడొక ముల్లు పాదములో గ్రుచ్చుకొని తనను చాల బాధ పెట్టెనని చెప్పెను.
బాబా యది కొంతవరకు ప్రాయశ్చిత్తమే యనుచు నికమీదట జాగ్రత్తయని హెచ్చరించెను.
కాలా (మిశ్రమము)
ఇక నైవేద్యమెటుల పంచిపెట్టెడువారో చూచెదము. హారతి పిమ్మట భక్తులందరికి ఊదీతో తమ ఆశీర్వాదములు
ఇచ్చి పంపివేసిన పిమ్మట బాబా మసీదులోనికి బోయి నీంబారువైపు వీపు బెట్టి కూర్చొనుచుండెను.
కుడివైపు నెడమవైపు భక్తులు పంక్తులలో కూర్చొనుచుండిరి. నైవేద్యము తెచ్చిన భక్తులు పళ్ళెములను
మసీదులో బెట్టి బాబా యాశీర్వాదములకై ఊదీకై కనిపెట్టుకొని బయట నిలుచుచుండిరి. అన్ని రకముల
ప్రసాదములు, బాబాకు వచ్చుచుండెడివి. పూరీలు, మడెగలు, బొబ్బట్లు, బాసుంది, సాంజా, పరమాన్నము
మొదలగునవన్నియు ఒక్కదానిలో వేసి బాబా ముందుంచువారు. బాబా దీనిని దేవునకు సమర్పించి,
పావనమొనర్చుచుండెను. అందులో కొంతభాగము బయట కనిపెట్టుకొని యున్నవారికి పంచి తక్కినది బాబాకు
అటునిటు రెండు వరుసలలో కూర్చుండిన భక్తులు సంతృప్తిగా తినుచుండిరి. శ్యామ, నానాసాహెబు నిమోంకర్
వడ్డించువారు. వచ్చినవారి సౌకర్యములను వీరు చూచువారు. వారాపని అతిజాగ్రత్తగాను, ఇష్టముగాను
చేయుచుండిరి. తినుప్రతిరేణువు కూడ తృప్తియు, సత్తువయు కలుగజేయుచుండెను. అది యట్టి రుచి, ప్రేమ,
శక్తి గలిగిన యాహారము. అది సదా శుభ్రమైనది, పవిత్రమైనది.
ఒక గిన్నెడు మజ్జిగ
ఒకనాడు హేమాడ్ పంతు మసీదులో నందరితో కడుపునిండ తినెను. అట్టిసమయమున బాబా అతనికొక గిన్నెడు
మజ్జిగ త్రాగుమని యిచ్చెను. అది తెల్లగా చూచుట కింపుగ నుండెను. కాని యతని కడుపులో ఖాళీ
లేనట్లుండెను. కొంచెము పీల్చగా అది మిక్కిలి రుచిగా నుండెను. అతని గుంజాటనము గనిపెట్టి బాబా
యతనితో నిట్లనెను. "దాని నంతయు త్రాగుము. నీకికమీదట ఇట్టి యవకాశము దొరకదు" అతడు వెంటనే
దానినంతయు త్రాగెను. బాబా పలుకులు సత్యమయ్యెను. ఏలన త్వరలో బాబా సమాధి చెందిరి.
చదువరులారా! హేమాడ్ పంతుకు మనము నిజముగా నమస్కరించవలెను. అతడు గిన్నెడు మజ్జిగను ప్రసాదముగా
త్రాగెను. కాని మనకు కావలసినంత యమృతమును బాబా లీలల రూపముగా నిచ్చెను. మనము ఈ యమృతమును గెన్నెలతో
త్రాగి సంతుష్టిచెంది యానందించెదముగాక.
|