శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము - పి.నారాయణరావు Back   Home 

ముప్పదితొమ్మిదవ అధ్యాయము

బాబాగారి సంస్కృత పరిజ్ఞానము
1.భగవద్గీత శ్లోకమునకు బాబాగారి యర్థము. 2. మహాసమాధి మందిర నిర్మాణము.

ఈ యధ్యాయములో భగవద్గీతయందుగల ఒక శ్లోకమునకు బాబా చెప్పిన యర్థమున్నది. కొందరు బాబాకు సంస్కృతము తెలియదనియు అది నానాసాహెబు చాందోర్కర్ యనువారిదనియు ననుటచే హేమాడ్ పంతు 50 వ అధ్యాయములో ఈ సంగతిని విశదీకరించెను. రెండధ్యాయములలో నొకేవిషయముండుటచే రెండును నిందులో పొందుపరచనైనవి.

తొలిపలుకు

శిరిడీ పవిత్రమైనది, ద్వారకామాయి గూడ పావనమైనదే. ఏలన శ్రీసాయి యచటనే నివసించుచు, తిరుగుచు, మసలుచు తుదకు అక్కడనే మహాసమాధి పొందిరి. శిరిడీ గ్రామప్రజలు ధన్యులు. వారి సర్వకార్యములను బాబా నెరవేర్చుచుండెను. వారికొరకే చాలదూరము నుండి యచటకు వచ్చెను. మొదట శిరిడి చాల చిన్నగ్రామము. సాయి బాబా యచటనివసించుటచే దానికి గొప్ప ప్రాముఖ్యము వచ్చెను. తుదకది పవిత్రమైన యాత్రాస్థలమాయెను. అచటనుండు స్త్రీలుకూడ ధన్యులు. బాబాయందు వారిభక్తి నిస్సంశయముగా పరిపూర్ణమైనది. బాబా మహిమను వారు స్నానము చేయునప్పుడు, విసురునప్పుడు, రుబ్బునప్పుడు, ధాన్యము దంచునప్పుడు, తదితర గృహకృత్యములు చేయునప్పుడు పాడుచుండెడివారు. వారి భక్తి ప్రేమలు పావనములు. వారు చక్కని పాటలు పాడుచుండెడివారు. అవి పాడిన వారికి, విన్నవారికి మనశ్శాంతి కలుగజేయుచుండెను.

బాబా చెప్పిన యర్థము

బాబాకు సంస్కృతము వచ్చునని నమ్మువారుండరు. ఒకనాడు భగవద్గీతలోని ఒక శ్లోకమునకు బాబా చక్కని యర్థమును నానాసాహెబు చాందోర్కరుకు బోధించి ఆశ్చర్యము కలుగజేసెను. ఈ విషయమును గూర్చి బి.వి.దేవుగారు (శ్రీసాయి లీల సంపుటి IV, పుట 563 - స్ఫుట విషయ) వ్రాసినారు. వారు స్వయముగా నానాసాహెబు చాందోర్కర్ వద్దనుంచి కొన్ని సంగతులు తెలిసికొనుటచే ఆ వృత్తాంతము ఈ దిగువ నివ్వబడెను.

నానాసాహెబు చాందోర్కర్ వేదాంతమును బాగా చదివినవారు. ఆయన భగవద్గీతను వివిధవ్యాఖ్యానములతో చదివియున్నందున తన పాండిత్యమునకు గర్వించుచుండెను. బాబాకీ విషయముగాని, సంస్కృతముగాని తెలియదని ఆయన అభిప్రాయము. అందుచే ఒకనాడు బాబా యతని గర్వమణచెను. ఆ తొలిరోజులలో భక్తులు గుంపులుగుంపులుగా రానప్పుడు బాబా భక్తుల సంశయముల దీర్చుటకు నొంటరిగా వారితో మసీదులో మాట్లాడుచుండెను. బాబా దగ్గర నానా కూర్చొని వారి కాళ్ళనొత్తుచు నోటిలో ఏదో గొణుగుకొనుచుండెను.

బాబా: నానా! ఏమి గొణుగుచున్నావు?

నానా: సంస్కృత శ్లోకమును వల్లించుచున్నాను.

బాబా: ఏ శ్లోకము?

నానా: భగవద్గీతలోనిది.

బాబా: గట్టిగా చదువుము.

నానా: (భగవద్గీత 4 - వ అధ్యాయము, 34 వ శ్లోకము ఈ క్రింది విధముగా చదివెను.)

"తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్వదర్శినః"

బాబా: నానా! అది నీకు బోధపడినదా?

నానా: అవును.

బాబా: నీకు తెలిసినచో నాకు చెప్పుము.

నానా: దాని తాత్పర్యమిది. సాష్టాంగనమస్కారము చేయుట అనగా పాదములపై బడుట, గురుని ప్రశ్నించుట, వారి సేవచేయుట ద్వారా ఈ జ్ఞానమును తెలిసికొనుము. అప్పుడు మోక్షమును పొందు జ్ఞానముగలవారు అనగా, పరబ్రహ్మమును దెలిసినవారు ఆ జ్ఞానము నుపదేశించెదరు.

బాబా: నానా! శ్లోకముయొక్క తాత్పర్యమక్కరలేదు. ప్రతిపదార్థము వ్యాకరణము, మరియు దాని యర్థము చెప్పుము.

అప్పుడు నానా ప్రతి పదమున కర్థము చెప్పెను.

బాబా: నానా! ఉత్త సాష్టాంగనమస్కారము చేసినచో చాలునా?

నానా: ప్రణిపాత యను పదమున కొంకొక యర్థము నాకు తెలియదు. ప్రణిపాత యనగా సాష్టాంగనమస్కారమని నాకు తెలియును.

బాబా: పరిప్రశ్న యనగా నేమి?

నానా: ప్రశ్నలడుగుట.

బాబా: ప్రశ్న యనగా నేమి?

నానా: అదే, అనగా ప్రశ్నించుట.

బాబా: పరిప్రశ్న యన్నను ప్రశ్న యన్నను ఒక్కటే యయినచో, వ్యాసుడు "పరి" యను ప్రత్యయమును ప్రశ్నకు ముందేల యుపయోగించెను? వ్యాసుడు తెలివి తక్కువవాడా?

నానా: పరిప్రశ్న యను మాటకు నాకితరయర్థమేమియు తెలియదు.

బాబా: సేవ యనగా నెట్టిది?

నానా: ప్రతిరోజు మేము చేయుచున్నట్టిది.

బాబా: అట్టి సేవ చేసిన చాలునా?

నానా: సేవయను పదమునకింకను వేరే యర్థమేమి గలదో నాకు తోచుట లేదు.

బాబా: రెండవ పంక్తిలోని "ఉపదేక్ష్యంతి తే జ్ఞానం" అను దానిలో జ్ఞానమను పదముపయోగించకుండ యింకొకపదము ఉపయోగించగలవా?

నానా: అవును.

బాబా: ఏ పదము?

నానా: అజ్ఞానము.

బాబా: జ్ఞానమునకు బదులు అజ్ఞానము ఉపయోగించినచో ఈ శ్లోకములో నేమైన అర్థము గలదా?

నానా: లేదు. శంకరభాష్య మావిధముగా చెప్పుట లేదు.

బాబా: వారు చెప్పనిచో పోనిమ్ము. అజ్ఞానము అనుపదము నుపయోగించిన ఎడల తగిన యర్థము వచ్చునపుడు దాని నుపయోగించుట కేమైన ఆక్షేపణ కలదా?

నానా: అజ్ఞానమను పదమును చేర్చి దాని యర్థమును విశదపరచుట నాకు తెలియదు.

బాబా: కృష్ణుడు అర్జునుని జ్ఞానులకు తత్వదర్శులకు నమస్కారము, ప్రశ్నించుట, సేవ చేయుమని చెప్పనేల? స్వయముగా కృష్ణుడు తత్వదర్శికాడా? వారు నిజముగా జ్ఞానమూర్తియే కదా!

నానా: అవును, అతడు తత్వదర్శియే, కాని అర్జును నితర జ్ఞానుల నేల సేవించుమనెనో నాకు తోచుటలేదు.

బాబా: నీకిది బోధపడలేదా?

నానా సిగ్గుపడెను. అతని గర్వమణగెను. అప్పుడు బాబా యిట్లు వ్యాఖ్యానించెను.

1. జ్ఞానులముందు ఉత్త సాష్టాంగము చేసినచో సరిపోదు. మనము సద్గురువునకు సర్వస్యశరణాగతి చేయవలెను.

2. ఊరకప్రశ్నిచుట చాలదు. దుర్బుద్ధితోగాని, దొంగయెత్తుతో గాని, వారిని బుట్టలో వేయుటకుగాని, వారి తప్పులు పట్టుటకుగాని, పనికిమాలిన యాసక్తితో యడుగకూడదు. నిజముగా తెలిసికొని దానిచే మోక్షము పొందుటకుగాని, ఆధ్యాత్మికాభివృద్ధికిగాని యడుగవలెను.

3. సేవ యనగా ఇష్టమున్నచో చేయవచ్చును, లేనిచో మానవచ్చుననే యభిప్రాయముతో చేయునది కాదు. శరీరము తనదికాదనియు, దానికి తాను యజమాని కాదనియు, శరీరము గురువుగారిదనియు, వారిసేవకొరకే శరీరమున్నదనియు భావింపవలెను. ఇట్లు చేసినచో సద్గురువు శ్లోకములో చెప్పబడిన జ్ఞానము బోధించును.

గురువజ్ఞానమును బోధించుననగా, నానాకు అర్థముకాలేదు.

బాబా: జ్ఞానము ఉపదేశ మెట్లగును? అనగా సాక్షాత్కారమును బొధించుట ఎట్లు? అజ్ఞానమును నశింపజేయుటయే జ్ఞానము.

జ్ఞానేశ్వరమహారాజు ఇట్లు చెప్పియున్నారు. "అజ్ఞానమును తొలగించుట ఇట్లు. ఓ అర్జునా! స్వప్నము, నిద్ర తొలగిపోయినచో మిగులనది నీవుగా గ్రహింపుము. జ్ఞానమనగా నజ్ఞానమును నశింపజేయుటయే. చీకటిని తరుముటయే వెలుతురు. ద్వైతమును నశింపజేయుటయే అద్వైతము. చీకటిని నశింపజేసెద మనినచో, వెలుతురు గూర్చి చెప్పుట. అద్వైతమును పొందవలెననినచో, ద్వైతమను భావమును మనలోనుంచి తీసివేయవలెను. అదియే అద్వైతమును పొందుజ్ఞానము. ద్వైతములోనే యుండి అద్వైతమును గూర్చి మాట్లాడగలవారెవ్వరు? ఎవరైన నట్లు చేసినచో నా స్థితిలోనికి వారు వస్తేనేగాని వారికి అది ఎట్లు తెలియును? దాని నెట్లు పొందెదరు? శిష్యుడు గురువువలె జ్ఞానమూర్తియే. వీరిద్దరికి భేదమేమనగా గ్రహించుతీరు, గొప్ప సాక్షాత్కారము, ఆశ్చర్యకరమైన మానవాతీత సత్వము, మహాశక్తిమత్వము, మరియు ఐశ్వర్యయోగము. సద్గురువు నిర్గుణుడు, సచ్చిదానందుడు. వారు మానవాకారమున నవతరించుట, మానవులను లేవనెత్తుటకును ప్రపంచము నుద్ధరించుటకును మాత్రమే. దానివలన వారి యసలయిన నిర్గుణస్వభావము కొంచెము గూడ చెడిపోదు. వారి సత్యస్వరూపము, దైవికశక్తి, జ్ఞానము తరుగకుండ నుండును. శిష్యుడు కూడ నట్టి స్వరూపము కలవాడే. కాని యతని అనేకజన్మల యజ్ఞానము తానే శుద్ధచైతన్యమను సంగతిని కప్పివేయును. అతడు "నేను సామాన్య నికృష్టజీవుడను." అనుకొనును. గురువు ఈ యజ్ఞానమును మూలముతో తీసివేయవలెను. తగిన యుపదేశము నివ్వవలెను. లెక్కలేనన్ని జన్మలనుంచి సంపాదించిన యజ్ఞానమును గురువు నిర్మూలించి యుపదేసించవలెను. ఎన్నోజన్మలనుంచి తాను నికృష్టజీవుడననుకొను శిష్యుని గురువు "నీవే దైవము, శక్తి యుతుడవు, ఐశ్వర్యశాలివి" అని బోధించును. అప్పుడు శిష్యుడు కొంచెము కొంచెముగా తానే దైవమని గ్రహించును. తాను శరీరమనియు, తానొక జీవిననియు లేదా యహంకారమనియు, దేవుడు, లోకము తనకంటే వేరనియు తలంచు నితాంతభ్రమ అనేకజన్మలనుంచి వచ్చుచున్న దోషము. దానిపై నాధారపడి చేసిన కర్మలనుండి వానికి సంతోషము, విచారము, ఈ రెంటియొక్క మిశ్రమము కలిగెను. ఈ భ్రమను, ఈ దోషమును, ఈ మూల అజ్ఞానమునుగూర్చి అతడు విచారమారంభించవలెను. ఈ అజ్ఞానమెట్లు అంకురించినది? అది ఎక్కడ నున్నది? అను దానిని చూపుటయే గురూపదేశమందురు. ఈ దిగువ వివరించినవి యజ్ఞానలక్షణములు:

1. నేను జీవిని (ప్రాణిని)
2. శరీరమే యాత్మ (నేను శరీరమును)
3. భగవంతుడు, ప్రపంచము, జీవుడు వేర్వేరు.
4. నేను దేవుడను కాను
5. శరీర మాత్మకాదని తెలిసికొనకుండుట
6. దేవుడు, జీవుడు ప్రపంచము ఒకటేయని తెలియకుండుట

ఈ తప్పులన్నియు చూపించనిదే, శిష్యుడు దేవుడనగా, ప్రపంచమనగా, శరీరమనగానేమో తెలియజాలడు. వానిలో వానికి ఎట్టి సంబంధము కలదో, ఒకటి యింకొకటికంటే వేరైనదా లేక రెండును ఒక టేనా యను సంగతి గ్రహింపజాలడు. ఈ సంగతులను బోధించుటకు వాని యజ్ఞానము నశింపజేయుటకు చెప్పునది జ్ఞానమా? అజ్ఞానమా? జ్ఞానమూర్తియైన జీవునకు జ్ఞానోపదేశము చేయనేల? ఉపదేశమనునది వాని తప్పును వానికి చూపి వాని యజ్ఞానమును నశింపజేయుటకొరకే. బాబా ఇంకను ఇట్లనెను.

1.ప్రణిపాత మనగా శరణాగతిచేయుట. 2. శరణాగతి యనగా తను (శరీరము), మన (మనస్సు), ధనముల (ఐశ్వర్యము) నర్పించుట. 3. శ్రీకృష్ణుడు అర్జునుని ఇతర జ్ఞానుల నాశ్రయించుమననేల?

సద్భక్తుడు సర్వము వాసుదేవమయముగా భావించును. భక్తుడు ఏ గురువునైన శ్రీ కృష్ణునిగనే భావించును. గురువు శిష్యుని వాసుదేవుడుగాను, శ్రీ కృష్ణుడు ఇద్దరిని తన ప్రాణము, ఆత్మలు గాను భావించును. అటువంటి భక్తులు గురువులు గలరని శ్రీ కృష్ణునికి తెలిసియుండుటచే, వారిని గూర్చి అర్జునునికి చెప్పెను. అట్టివారి గొప్పతనము హెచ్చి యందరికి తెలియవలెననియే కృష్ణుడట్లు పేర్కొనెను.

సమాధిమందిర నిర్మాణము

బాబా తాను చేయ నిశ్చయించుకొనిన పనులగూర్చి ఎప్పుడును మాట్లాడువారు కారు. ఏమి సందడి చేయువారు కారు. సంగతి సందర్భములను వాతావరణమును మిక్కిలి యుక్తిగా నేర్పరచి తప్పనిసరి ఫలితములు కలిగించుచుండువారు. అందుకు సమాధిమందిర నిర్మాణము ఒక ఉదాహరణము. నాగపూరు కోటీశ్వరుడు, శ్రీమాన్ బాపుసాహెబు బుట్టీ, శిరిడీలో సకుంటుంబముగా నుండెడివాడు. అతనికి అచట సొంత భవనముండిన బాగుండునని యాలోచన కలిగెను. కొన్నాళ్ళపిదప దీక్షిత్ వాడాలో నిద్రించుచుండగా అతనికొక దృశ్యము కనిపించెను. బాబా స్వప్నములో నగుపడి యొక వాడాను మందిరముతో సహనిర్మించుమనెను. అచ్చట నిద్రించుచున్న శ్యామాకు కూడ అట్టి దృశ్యము గనిపించెను. బాపుసాహెబు లేచి శ్యామా ఏడ్చుచుండుట చూచి కారణమడిగెను. శ్యామా యిట్లు చెప్పెను. "బాబా నా దగ్గరకు వచ్చి మందిరముతో వాడాను నిర్మింపుము. నేను అందరి కోరికలను నెరవేర్చెద ననెను. బాబా ప్రేమ మధురమైన పలుకులు విని, నేను భావావేశమున మైమరచితిని; నా గొంతుక యార్చుకొనిపోయెను. నా కండ్ల నీరు కారుచుండెను. నేను ఏడ్చుట మొదలిడితిని." వారిద్దరి దృశ్యములు ఒకటే యయినందులకు బాపుసాహెబు బుట్టీ విస్మయమందెను. ధనవంతుడగుటచేతను, చేతనయినవాడగుటచేతను. అచ్చటొక వాడాను నిర్మించుటకు నిశ్చయించుకొని మాధవరావు (శ్యామా) సహాయముతో ఒక ప్లాను వ్రాసెను. కాకాసాహెబు దీక్షిత్ దానినామోదించెను. దానిని బాబా ముందర పెట్టగా, బాబా కూడ వెంటనే యామోదించెను. కట్టుట ప్రారంభించిరి. శ్యామా పర్యవేక్షణ చేయుచుండెను. భూమ్యుపరిగృహము, భూగృహము, బావి, పూర్తియయ్యెను. బాబా కూడ లెండీకి పోవునప్పుడు, తిరిగి వచ్చునప్పుడు కొన్ని మార్పులను సలహాలను ఇచ్చుచుండెను. మిగిలిన పనియంతయు బాపుసాహెబు జోగును చూడుమనిరి. అది నిర్మించునపుడు, బాపుసాహెబు బుట్టీకి ఒక యాలొచన కలిగెను. చుట్టు గదులుండి, దాని మధ్యనొక విశాలమైన హాలులో మురళీధరుని (శ్రీ కృష్ణుని) ప్రతిమను ప్రతిష్ట చేయవలెనని తట్టెను. బాబాకీ సంగతి తెలియచేసి వారి యభిప్రాయమును కనుగొనవలెనని శ్యామాకు చెప్పెను. వాడా ప్రక్కనుంచి బాబా పోవుచుండగా వారిని శ్యామా యీ విషయము నడుగగా బాబా యందులకు సమ్మతించి "దేవాలయము పూర్తి కాగానే నేనే యచ్చట నివసించుటకు వచ్చెదను" అని వాడా వయిపు జూచుచు "వాడా పూర్తియయిన పిమ్మట మనమే దానిని నుపయోగించుకొనవలెను. మనమందరమచ్చట నుందము. అందరు కలసి మెలసి యాడుకొందము. ఒకరి నొకరు కౌగిలించుకొని సంతోషముగా ఉండవచ్చును." అనెను. దేవస్థానమధ్యమందిరము కట్టుట కది తగిన శుభసమయమా యని శ్యామా యడుగగా, బాబా సమ్మతించుటచే శ్యామా కొబ్బరికాయ తెచ్చి పగులగొట్టి పనిని ప్రారంభించెను. కొద్ది కాలములో పని పూర్తి యాయెను. మురళీధర్ విగ్రహము తయారు చేయుట కాజ్ఞాపించిరి. అది తయారు కాకమునుపే క్రొత్త సంగతి జరిగెను. బాబాకు తీవ్రమైన జ్వరము వచ్చెను. వారు కాయమును విడుచుటకు సిద్ధముగా నుండిరి. బాపుసాహెబు మిక్కిలి విచారగ్రస్తుడాయెను; నిరాశపడెను. బాబా సమాధి చెందినచో, తన వాడా బాబా పాదములచే పవిత్రము కాదనియు, తాను ముదుపు పెట్టిన లక్షరూపాయలు వ్యర్థమగుననియు చింతించెను. కాని బాబా సమాధి చెందకముందు "నన్ను రాతి మందిరములో నుంచుడు" అన్నట్టి పలుకులు బాపుసాహెబుకే గాక యందరికి ఊరట కలిగించెను. సకాలమున బాబా పవిత్ర శరీరము మధ్యమందిరములో బెట్టి సమాధి చేసిరి. ఇట్లు మురళీధర్ కొరకు నిర్ణయించిన స్థలమునందు బాబాను సమాధిచేయుటచే బాబాయే మురళీధరుడనియు, బుట్టీ వాడాయే సమాధి మందిరమనియు అర్థము గ్రహించవలెను. వారి విచిత్రజీవితము లోతును కనుగొన శక్యము గాదు. తాను కట్టించిన వాడాలో బాబా పవిత్రశరీరము సమాధి యగుటచే బాపుసాహెబ్ బుట్టీ మిగుల ధన్యుడు, అదృష్టశాలి.

ఓం నమో శ్రీ సాయినాధాయ

శాంతిః శాంతిః శాంతిః

ముప్పదితొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము.