నలుబదియవ అధ్యాయము
బాబా కధలు 1. దేవుగారి ఇంటిలో ఉద్యాపనకు బాబా సన్యాసి వేషముతో మరి
ఇద్దరిని తోడ్కొని పోవుట. 2. హేమఆడ్ పంతు ఇంటికి ఫోటో రూపములో పోవుట.
ఈ యధ్యాయములో రెండు కధలు చెప్పుదుము. 1. దహనులో బి.వి.దేవుగారింటికి వారి తల్లి యాచరించిన
ఉద్యాపనవ్రతమునకు బాబా వెళ్ళుట 2. బాంద్రాలోని హేమాడ్ పంతు ఇంటికి హోళీ పండుగనాడు భోజనమునకు
పోవుట.
తొలిపలుకు
శ్రీ సాయిసమర్థుడు, పావనమూర్తి. తన భక్తుల కిహపర విషయములందు తగిన సలహాల నిచ్చి జీవితపరమావధిని
పొందునట్లు చేసి వారిని సంతోషపెట్టును. సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను
వారిలోనికి పంపించి భేదబావమును నశింపజేసి, అప్రాప్యమును ప్రాపింపజేయును. వారు తమ భక్తుల యెడ
భేదము లేక నమస్కరించినవారిని కౌగలించుకొనువారు. వర్షాకాలములో నదులు కలియుసముద్రమువలె బాబా
భక్తులతో కల్సి తమ శక్తిని స్థాయిని శిష్యులకిచ్చును. దీనినిబట్టి, ఎవరయితే భగవద్ భక్తుల లీలలను
పాడెదరో వారు భగవంతుని లీలలను పాడినవారికంటెగాని, యంతకంటే ఎక్కువగాని దేవుని ప్రేమకు
పాత్రులగుదురని తెలియవలెను. ఇక ఈ అధ్యాయములోని కధల వైపు మరలుదము.
దేవుగారింట ఉద్యాపనవ్రతము
దహనులో బి.వి దేవుగారు మామలతదారుగా నుండెను. వారి తల్లి 25, 30 నోములు నోచెను. వాని ఉద్యాపన
చేయవలసి యుండెను. ఈ కార్యములో 100,200 బ్రాహ్మణులకు భోజనము పెట్టవలసి యుండెను. ఈ శుభకార్యమునకు
ముహూర్తము నిశ్చయమయ్యెను. దేవుగారు బాపు సాహెబుజోగ్ గారి కొక లేఖ వ్రాసిరి. అందులో బాబా ఈ
శుభకార్యమునకు దయచేయవలయుననియు, వారు రాకున్నచో అసంతృప్తికరముగా నుండుననియు వ్రాసెను. జోగ్ ఆ
యుత్తరము చదివి బాబాకు వినిపించెను. మనఃపూర్వకమయిన విజ్ఞాపనను విని బాబా యిట్లనెయె. "నన్నే
గురుతుంచుకొనువారిని నేను మరువను. నాకు బండి గాని, టంగాగాని, రైలుగాని, విమానముగాని యవసరములేదు.
నన్ను ప్రేమతో బిల్చువారియొద్దకు నేను పరుగెత్తిపోయి ప్రత్యక్షమయ్యెదను. అతనికి సంతోషమయిన జవాబు
వ్రాయుము. నీవు, నేను, ఇంకొకరు సతర్పణకు వచ్చెదమని వ్రాయుము" జోగ్ బాబా చెప్పినది దేవుకు
వ్రాసెను. దేవుగారెంతో సంతసించిరి. కాని బాబా రాహాతా, రుయి, నీమగాం దాటి ప్రత్యక్షముగా ఎక్కడికి
పోరని ఆయనకు తెలియును. బాబాకు అసాధ్యమైనదేమియు లేదు. వారు సర్వాంతర్యామి యగుటచే హఠాత్తుగా
నేరూపమున నయిన వచ్చి, తమ వాగ్ధానమును పాలించవచ్చు ననుకొనెను.
ఉద్యాపనకు కొద్దిరోజులు ముందుగా, బెంగాలీదుస్తులను ధరించిన సన్యాసి యొకడు గోసం రక్షణకయి
సేవచేయుచు దహను స్టేహన్ మాస్టరు వద్దకు చందాలు వసూలుచేయు మిషతో వచ్చెను. స్టేషన్ మాస్టరు, ఊరి
లోనికిపోయి మామలతదారుని కలిసికొని వారి సహాయముతో చందాలు వసూలు చేయుమనెను. అంతలో మామలతదారే
యచ్చటికి వచ్చెను. స్టేషను మాస్టరు దేవుగారికి పరిచయమొనర్చెను. ఇద్దరు ప్లాట్ ఫారం మీద
కూర్చుండి మాట్లాడిరి. దేవు, ఊరిలో నేదో మరొక చందా పట్టి రావుసాహెబు నరోత్తమ శెట్టి
నడుపుచుండుటచే, నింకొకటి యిప్పుడే తయారు చేయుట బాగుండదని చెప్పి 2 లేదా 4 మాసముల పిమ్మట
రమ్మనెను. ఈ మాటలు విని సన్యాసి యచటనుండి పోయెను. ఒకనెల పిమ్మట యా సన్యాసి యొక టాంగాలో వచ్చి,
10 గంటలకు దేవుగారి యింటిముందర ఆగెను. చందాల కొరకు వచ్చెనేమోయని దేవు అనుకొనెను. ఉద్యపనకు
కావలసిన పనులలో దేవుగారు నిమగ్నులై యుండుట జూచి, తాను చందాలకొరకు రాలేదనియు భోజనమునకై
వచ్చితిననియు సన్యాసి చెప్పెను. అందుకు దేవు "మంచిది; చాల మంచిది, మీకు స్వాగతము. ఈ గృహము మీదే"
యనెను. అప్పుడు సన్యాసి "ఇద్దరు కుర్రవాళ్ళు నాతో నున్నారు." అనెను. దేవు: "మంచిదే, వారితో కూడ
రండు." అనెను. ఇంకా రెండుగంటల కాలపరిమితి యుండుటచే, వారికొరకు ఎచ్చటికి పంపవలెనని యడిగెను.
సన్యాసి ఎవరిని బంపనవసరము లేదనియు తామే స్వయముగా వచ్చెదమనియు చెప్పెను. సరిగా 12 గంటలకు రమ్మని
దేవుచెప్పెను. సరిగ 12 గంటలకు ముగ్గురు వచ్చి సంతర్పణలో భోజనము చేసిన పిమ్మట వెడలిపోయిరి.
ఉద్యాపన పూర్తికాగానే దేవుగారు బాపుసాహెబు జోగుకు ఉత్తరము వ్రాసెను. అందులో బాబా తన మాట
తప్పెనని వ్రాసెను. జోగు ఉత్తరము తీసికొని బాబావద్దకు వెళ్ళెను. దానిని తెరువకమునుపే బాబా
యిట్లనెను. "హా! వాగ్దానము చేసి, దగా చేసితిననుచున్నాడు. ఇద్దరితో కూడ నేను సంతర్పణకు
హాజరయితిని, కాని నన్ను పోల్చుకొనలేకపోయెనని వ్రాయుము. అట్టివాడు నన్ను పిలువనేల? సన్యాసి చందాల
కొరకు వచ్చెనని యనుకొనెను. అతని సంశయమును తొలగించుటకే మరిద్దరితో వచ్చెదనంటిని. ముగ్గురు సరిగా
భోజనము వేళకు వచ్చి యారగించలేదా? నామాట నిలబెట్టుకొనుటకు ప్రాణములనైన విడిచెదను. నామాటలను
నేనెప్పుడు పొల్లు చేయను." ఈ జవాబు జోగ్ హృదయములో నానందము కలుగజేసెను. బాబా సమాధానమంతయు
దేవుగారికి వ్రాసెను. దానిని చదువగనే దేవుకు ఆనందబాష్పములు దొరలెను. అనవసరముగా బాబా ను
నిందించినందులకు పశ్చాత్తాపపడెను. సన్యాసి మొదటిరాకచే తానెట్లు మోసపోయెనో; సన్యాసి చందాలకు
వచ్చుట, మరిద్దరితో కలసి భోజనమునకు వచ్చెదనను అతని మాటలు తాను గ్రహింపలేక మోసపోవుట - మొదలైనవి
అతనికి ఆశ్చర్యము కలుగజేసెను.
భక్తులు పూర్ణముగా సద్గురువును శరణు వేడినచో, వారు తమ భక్తుల యిండ్లలో శుభకార్యములను సవ్యముగా
నెరవేరునట్లు జూచెదరు అనునది యీ కధవల్ల స్పష్టపడుచున్నది.
హేమాడ్ పంతు ఇంట హోళీ పండుగ భోజనము
ఇక బాబా తన ఫోటో రూపమున సాక్షాత్కరించి భక్తుని కోరిక నెరవేర్చిన మరొక కధను చెప్పెదము.
1917 వ సంవత్సరము హోళీ పండుగనాడు వేకువజామున హేమాడ్ పంతుకొక దృశ్యము కనిపించెను. చక్కని
దుస్తులు ధరించిన సన్యాసివలె బాబా గాన్పించి, నిద్ర నుండి లేపి ఆనాడు భోజనమునకు వారింటికి
వచ్చెదనని చెప్పెను. ఇట్లు తనను నిద్రనుండి లేపినది కూడ కలలోని బాగమే. నిజముగా లేచి చూచుసరికి
సన్యాసిగాని, బాబాగాని కనిపించలేదు. స్వప్నమును బాగుగా గుర్తుకు దెచ్చుకొనగా సన్యాసి చెప్పిన
ప్రతిమాట జ్ఞాపకమునకు వచ్చెను. బాబాగారి సహవాసము ఏడు సంవత్సరములనుండి యున్నప్పటికి, బాబా
ధ్యానము నెల్లప్పుడు చేయుచున్నప్పటికి, బాబా తన ఇంటికి వచ్చి భోజనము చేయునని అతడనుకొనలేదు. బాబా
మాటలకు మిగుల సంతసించి తన భార్యవద్దకు బోయి ఒక సన్యాసి భోజనమునకు వచ్చునుగాన, కొంచెము బియ్యము
ఎక్కువ పోయవలెనని చెప్పెను. అది హోళి పండుగదినము వచ్చువారెవరని ఎక్కడనుండి వచ్చుచున్నారని యామె
యడిగెను. ఆమె ననవసరముగా పెడదారి పట్టించక ఆమె ఇంకొక విధముగా భావింపకుండునట్లు, జరిగినది
జరిగినట్లుగా చెప్పనెంచి, తాను గాంచిన స్వప్నమును తెలియజేసెను. శిరిడీలో మంచి మంచి పిండివంటలను
విడిచి బాబా తమవంటివారింటికి బాంద్రాకు వచ్చునాయని, యామెకు సంశయము కలిగెను. అందులకు హేమాడ్ పంతు
బాబా స్వయముగా రాకపోవచ్చు. కాని ఎవరినైన బంపవచ్చును కనుక కొంచెము బియ్యము ఎక్కువ పోసినచో నష్టము
లేదనెను.
మధ్యాహ్న భోజనమునకై ప్రయత్నము లన్నియు చేసిరి. మిట్ట మధ్యాహ్నమునకు సర్వము సిద్ధమయ్యెను. హోళీ
పూజ ముగిసెను. విస్తళ్ళు వేసిరి, ముగ్గులు పెట్టిరి. భోజనమునకు రెండు పంక్తులు తీర్చిరి.
రెండింటిమధ్య నొక పీట బాబా కొరకమర్చిరి. గృహములోని వారందరు కొడుకులు, మనుమలు, కొమార్తెలు,
అల్లుళ్ళు మొదలగువారందరు వచ్చి వారివారి స్థలముల నలంకరించిరి. వండిన పదార్థములు వడ్డించిరి.
అందరు అతిధికొరకు కనిపెట్టుకొనియుండిరి. 12 గంటలు దాటినప్పటికి ఎవరు రాలేదు. తలుపు వేసి
గొండ్లెము పెట్టిరి. అన్నశుద్ధి యయ్యెను, అనగా నెయ్యి వడ్డించిరి. భోజనము ప్రారంభించుట కిది యొక
గుర్తు. అగ్నిహోత్రునకు శ్రీ కృష్ణునకు నైవేద్యము సమర్పించిరి. అందరు భోజనము
ప్రారంభింపబోవుచుండగా, మేడ మెట్ల పై చప్పుడు వినిపించెను. హేమాడ్ పంతు వెంటనే పోయి తలుపుతీయగా
ఇద్దరు మనుష్యులు లచట నుండిరి. 1.అలీమహమ్మద్, 2. మౌలానా ఇస్ముముజాఫర్, ఆ యిరువురు, వడ్డన మంతయు
పూర్తియై అందరును భోజనము చేయుటకు సిద్ధముగా నుండుటను గమనించి హేమాడ్ పంతును క్షమించుమని
కోరియిట్లు చెప్పిరి. "భోజన స్థలము విడిచిపెట్టి మా వద్దకు పరుగెత్తుకొని వచ్చితివి. తక్కినవారు
నీ కొరకు చూచుచున్నారు. కావున, ఇదిగో నీ వస్తువును నీవు తీసుకొనుము. తరువాత తీరుబడిగా
వృత్తాంతమంతయు దెలిపెదము." అట్లనుచు తమ చంకలోనుంచి ఒక పాత వార్తాపత్రికలో కట్టిన పటమును విప్పి
టేబిల్ పైన బెట్టిరి. హేమాడ్ పంతు కాగితము విప్పి చూచుసరికి అందులో పెద్దది యగు చక్కని సాయిబాబా
పటముండెను. అతడు మిగుల ఆశ్చర్యపడెను. అతని మనస్సు కరగెను. కండ్లనుండి నీరు కారెను, శరీరము
గగుర్పాటు చెందెను. అతడు వంగిపటములోనున్న బాబా పాదములకు నమస్కరించెను. బాబా యీ విధముగా తన లీలచే
ఆశీర్వదించెనని యనుకొనెను. గొప్ప యాశక్తితో నీకా పటమెట్లువచ్చెనని అలీమహమ్మద్ ను అడిగెను. అతడా
పటమొక యంగడిలో కొంటిననియు, దానికి సంబంధించిన వివరము లన్నియు తరువాత తెలియజేసెదననెను.
తక్కినవారు భోజనమునకు కనిపెట్టుకొని యుండుటచే త్వరగా పొమ్మని యనెను. హేమాడ్ పంతు వారికి
అభినందనము తెల్పి భోజనశాలలోనికి బోయెను. అ పటము బాబా కొరకు వేసిన పీటపయి బెట్టి వండిన
పదార్థములన్నియు వడ్డించ్మి, నైవేద్యము పెట్టినపిమ్మట అందరు భుజించి, సకాలమున పూర్తిచేసిరి.
పటములో నున్న బాబా యొక్క చక్కని రూపును జూచి యందరు అమితానందభరితులయిరి. ఇదంతయు నెట్లు జరిగెనని
యాశ్చర్యపడిరి.
ఈ విధముగా బాబా హేమాడ్ పంతుకు స్వప్నములో జెప్పిన మాటలను నెరవేర్చి తన వాగ్దానమును
పాలించుకొనెను. అ ఫోటో వివరములు అనగా నది అలీమహమ్మదు కెట్లు కొరికెను? అతడెందుకు తెచ్చెను?
దానిని హేమాడ్ పంతు కెందుకిచ్చెను? అనునవి వచ్చే అధ్యాయములో చెప్పుకొందము.
|