శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము - పి.నారాయణరావు Back   Home 

నలుబదియొకటవ అధ్యాయము

1.చిత్రపటము యొక్క వృత్తాంతము 2. గుడ్డపేలికలను దొంగిలించుట 3. జ్ఞానేశ్వరి పారాయణము.

గత అధ్యాయములో చెప్పిన ప్రకారము ఈ అ ధ్యాయములో చిత్రపటముయొక్క వృత్తాంతమును చెప్పెదము.

గత అధ్యాయములో విషయము జరిగిన 9 సంవత్సరములకు అలీమహమ్మద్, హేమాడ్ పంతును కలిసి ఈ దిగువ కధ నతనికి జెప్పెను.

ఒకనాడు బొంబాయి వీధులలో బోవునపుడు, వీధిలో తిరిగి యమ్మువానివద్ద అలీమహమ్మద్ సాయిబాబా పటమును కొనెను. దానికి చట్రము కట్టించి, తన బాంద్రా యింటిలో గోడకు వ్రేలాడ వేసెను. అతడు బాబాను ప్రేమించుటచే ప్రతిరోజు చిత్రపటము దర్శనము చేయుచుండెను. హేమాడ్ పంతుకు ఆ పటమిచ్చుటకు 3 నెలల ముందు అతడు కాలుమీద కురుపు లేచి బాధపడుచుండెను. దానికి శస్త్రచికిత్స జరిగెను. అప్పుడతడు బొంబాయిలో నున్న తన బావమరది యగు నూర్ మహమ్మద్ పీర్ భాయి యింటిలో పడియుండెను. బాంద్రాలో తన యిల్లు 3 మాసములవరకు మూయబడియుండెను. అక్కడ ఎవ్వరును లేకుండిరి. అచ్చట ప్రసిద్ధిజెందిన అబ్దుల్ రహిమాన్ బాబా, మౌలానాసాహెబు మహమ్మద్ హుసేను, సాయిబాబా, తాజుద్దీన్ బాబా మొదలగు (సజీవ) యోగుల పటములుండెను. వానిని కూడ కాలచక్రము విడువలేదు. అతడు వ్యాధితో బాధపడుచు బొంబాయిలో నుండెను. బాంద్రాలో ఆ పటములేల బాధపడవలెను? పటములకు గూడ చావుపుట్టుక లున్నట్టుండెను. పటములన్నియు వానివాని యదృష్టము లనుభవించెను గాని సాయిబాబా పటము మాత్రము ఆ కాలచక్రమును తప్పించుకొనెను. అదెట్లు తప్పించుకొనగలిగెనో నాకింతవరకెవరు చెప్పలేరైరి. దీనిని బట్టి సాయిబాబా సర్వాతర్యామి యనియు, సర్వవ్యాపి యనియు ననంత శక్తుడనియు దెలియుచున్నది.

అనేకసంవత్సరముల క్రిందట యోగియగు అబ్దుల్ రహిమాన్ బాబాయొక్క చిన్న పటమును మహమ్మద్ హుసేన్ తారియా వద్ద సంపాదించెను. దానిని తన బావమరదియగు నూర్ మహమ్మద్ పీర్ బాయికి ఇచ్చెను. అది యతని టేబిల్ లో 8 సంవత్సరములు పడియుండెను. ఒకనాడు అతడు దానిని జూచెను. అతడు దానిని ఫోటో గ్రాఫర్ దగ్గరకు తిసికొనిపోయి సజీవప్రమాణమంత పెద్దదిగా చేయించి దాని ప్రతులను తన బంధువులకు, స్నేహితులకు పంచిపెట్టెను. అందులో నొకటి అలీమహమ్మద్ కిచ్చెను. దాని నతడు తన బాంద్రా యింటిలో బెట్టెను. నూర్ మహమ్మద్, అబ్దుల్ రహమాన్ గారి శిష్యుడు. గురువు నిండు దర్బారులో నుండగా నతడు గురువుగారికి దీనిని కానుకగా నిచ్చుటకు పోగా వారు మిక్కిలి కోపించి కొట్టబోయి నూర్ మహమ్మదు నచటినుండి తరిమివేసిరి. అతడు మిగుల విచారపడి చికాకు పొందెను. తన ద్రవ్యమంతయు నష్టపడుటయే గాక, గురువుగారి కోపమునకు, అసంతుష్టికి కారణ మాయెనుగదా యని చింతించెను. విగ్రహారాధన గురువుగారికి ఇష్టము లేకుండెను. ఆ పటమును అపోలో బందరుకు తీసుకొని పోయి, ఒక పడవను అద్దెకు గట్టించుకొని సముద్రములోనికి పోయి, దాని నక్కడ నీళ్ళలో ముంచివేసెను. తన బంధువుల వద్దనుంచి స్నేహితుల వద్దనుంచి పటములను తెప్పించి (6 పటములు) వానిని కూడ బాంద్రా సముద్రములో ముంచెను. ఆ సమయమున అలీమహమ్మద్ తన బావమరది యింటిలో నుండెను. యోగుల పటములను సముద్రములో పడవైచినచో తన వ్యాధి కుదురునని బావమరది చెప్పెను. ఇది విని అలీమహమ్మద్ తన మేనేజర్ ను బాంద్రా యింటికి పంపి యక్కడున్న పటములనన్నింటిని సముద్రములో వేయించెను.

రెండునెలల పిమ్మట అలీ మహమ్మద్ తన యింటికి తిరిగి రాగా బాబా పటము ఎప్పటివలె గోడమీద నుండుట గమనించి యాశ్చర్యపడెను. తన మేనేజర్ పటములన్ని దీసివైచి బాబా పటము నెట్లు మరచెనో అతనికే తెలియకుండెను. వెంటనే దానిని తీసి బీరువాలో దాచెను. లేకున్న తన బావగారు దానిని చూచినచో దానిని కూడ నాశనము చేయునని భయపడెను. దాని నెవరికివ్వవలెను? దాని నెవరు జాగ్రత్త పరచెదరు? దానిని భద్రముగా నెవరుంచగలరు? అను విషయముల నాలోచించుచుండగా, సాయిబాబాయే స్వయముగా తనకు సలహానిచ్చి మౌలానా ఇస్ము ముజాఫర్ ను కలిసి వారి యభిప్రాయము ప్రకారము చేయవలసినదని చెప్పెను. అలీమహమ్మద్ మౌలానాను కలిసికొని జరిగిన దంతయు జెప్పెను. ఇరువురును బాగుగా ఆలోచించి యా పటమును హేమాడ్ పంతుకివ్వ నిశ్చయించిరి. అతడు దానిని జాగ్రత్త పరచునని తోచెను. ఇద్దరును హేమాడ్ పంతు వద్దకు బోయిరి. సరియైన కాలములో దానిని బహూకరించిరి.

ఈ కధనుబట్టి బాబాకు భూతభవిష్యద్వర్తమానములు తెలియుననియు, చాకచక్యముగ సూత్రములు లాగి తన భక్తుల కోరికల నెట్లు నెరవేర్చుచుండెనో కూడ తెలియుచున్నది. ఎవరికయితే అధ్యాత్మిక విషయములలో నెక్కువ శ్రద్ధయో వారిని బాబా ప్రేమించుటే కాక వారి కష్టములను తొలగించి వారిని ఆనందభరితులుగా జేయుచుండిరని రాబోవు కధవలన తెలియును.

గుడ్డపేలికలను దొంగిలించుట - జ్ఞానేశ్వరి చదువుట

బి.వి దేవు దహనులో మామలతదారు. జ్ఞానేశ్వరిని ఇతర మతగ్రంధములను చదువవలెనని చల కాలమునుండి కొరుచుండెను. భగవద్గీతపయి మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు వ్రాసిన వ్యాఖ్యయే జ్ఞానేశ్వరి. ప్రతిదినము భగవద్గీతలో నొక యధ్యాయమును ఇతర గ్రంధముల నుండి కొన్ని భాగములను పారాయణ చేయుచుండెను. కాని జ్ఞానేశ్వరి ని ప్రారంభించగనే ఏదో అవాంతరము లేర్పడుటచే పారాయణ ఆగిపోవుచుండెను. మూడు నెలలు సెలవు పెట్టి, శిరిడీకి వెళ్ళి యక్కడ నుండి తన స్వగ్రామమగు పౌడుకు బోయెను. ఇతరగ్రంధములన్నియు అచట చదువగలిగెను. కాని జ్ఞానేశ్వరి ప్రారంభించగనే ఏమో విపరీతమైన చెడ్డయాలోచనలు తన మనస్సున ప్రవేశించుటచే చదువలేకుండెను. అతడెంత ప్రయత్నించినను కొన్ని పంక్తులు కూడ చదువలేకపోయెను. కాబట్టి బాబా తనకు ఆ గ్రంధమందు శ్రద్ధ కలుగజేసినప్పుడే, దానిని చదువుమని వారి నోటివెంట వచ్చినప్పుడే దానిని ప్రారంభించెదననియు అంతవరకు దానిని తెరువననియు, నిశ్చయము చేసికొనెను. అతడు 1914 వ సంవత్సరము ఫిబ్రవరి నెలలో కుటుంబసహితముగా శిరిడీకి వెళ్ళెను. అక్కడ ప్రతిదినము జ్ఞానేశ్వరి చదువుచుంటివాయని బాపుసాహెబు జోగ్, దేవుగారి నడిగెను. దేవు తనకు అట్టి కోరిక గలదనియు, గాని దానిని ప్రారంభించెదననియు చెప్పెను. అప్పుడు జోగ్, ఒక పుస్తకమును దీసికొని బాబాకిచ్చినచో, దానిని వారు తాకి పవిత్రము చేసి యిచ్చెదరనియు అప్పటినుండి నిరాటంకముగా చదువవచ్చుననియు దేవుకు సలహా నిచ్చెను. బాబాకు తన యుద్దేశ్యము తెలియును గనుక దేవుగారట్లు చేయుటకు అంగీకరించలేదు. బాబా తన కోరికను గ్రహించలేడా? దానిని పారాయణ చేయుమని స్పష్టముగా నాజ్ఞాపించలేడా? యనెను.

దేవు బాబాను దర్శించి, ఒక రూపాయి దక్షిణ నిచ్చెను. బాబా 20 రూపాయలు దక్షిణ యడుగగా దానిని చెల్లించెను. ఆనాడు రాత్రి బాలకరాముడను వానిని కలిసికొని యతడు బాబాయందు భక్తిని, వారి యనుగ్రహమును ఎట్లు సంపాదించెనని ప్రశ్నించెను. మరుసటి దినము హారతి పిమ్మట అంతయు దెపిపెదనని యతడు బదులిచ్చెను. ఆ మరుసటి దినము దర్శనము కొరకు దేవు వెళ్ళగా బాబా అతనిని 20 రూపాయలు దక్షిణ యిమ్మనెను. వెంటనే దేవు దానిని చెల్లించెను. మసీదు నిండ జనులు నిండి యుండుటచే దేవు ఒక మూలకు బోయి కూర్చుండెను. బాబా అతనిని బిలచి తన దగ్గర శాంతముగా కూర్చొనుమనియెను. దేవు అట్లనే చేసెను. మధ్యాహ్న హారతి పిమ్మట భక్తులందరు పోయిన తరువాత దేవు బాలకరాముని జూచి యాతని పూర్వవృత్తాంతముతోపాటు బాబా యాతని కేమేమి చెప్పెనో, ధ్యానము నెట్లు నేర్పిరో యని యడుగగా బాలకరాముడు ఇవ్వివరములు చెప్పుటకు సిద్ధపడెను. అంతలో బాబా చంద్రు అను కుష్టురోగ భక్తుని బంపి, దేవును తీసికొని రమ్మనెను. దేవు బాబా వద్దకు బోగా నెవరితో మాట్లాడుచుంటి వని బాబా యడిగెను. బాలకరామునితో మాట్లాడుచుంటి ననియు, బాబా కీర్తిని వినుచుంటిననియు అతడు చెప్పెను. తిరిగి బాబా 25 రూపాయలు దక్షిణ అడిగెను. వెంటనే దేవు సంతోషముతో దక్షిణ చెల్లించెను. అతనిని బాబా లోపలకు దీసికొనిపోయి స్థంభము వద్ద కూర్చుండి "నా గుడ్డ పేలికలను నాకు దెలియకుండ దొంగిలించితి వేల?" యనెను. దేవు తనకు ఆ గుడ్డ పేలికలగూర్చి యేమియు తెలియదనెను. బాబా యతనిని వెదకుమనెను. అతడు వెదకెను. కాని యచ్చట ఏమియు దొకరలేదు. బాబా కోపగించి యిట్లనెను. "ఇక్కడ ఇంకెవ్వరు లేరు నీవొక్కడవే దొంగవు. ముసలితనముచే వెంట్రుకలు పండినప్పటికి ఇచ్చటకు దొంగిలించుటకు వచ్చితివా?" యని కోపగించెను. బాబా మతి చెడిన వానివలె తిట్టి కొపగించి చీవాట్లు పెట్టెను. దేవు నిశ్శబ్దముగా కూర్చుండెను. దేవు తాను పటకా దెబ్బలు కూడ తినునేమో యనుకొనెను. ఒక గంట తరువాత బాబా యతనిని వాడాకు వెళ్ళు మనెను. దేవు అచటికేగి జరిగినదంతయు జోగుకు, బాలకరామునకు తెలియజేసెను. సాయంకాల మందరిని రమ్మని బాబా కబురు పంపెను. ముఖ్యముగా దేవును రమ్మనెను, "నా మాటలు వృద్ధుని బాధించి యుండవచ్చును గాని యతడు దొంగిలించుతచే నేనట్లు పలుకవలసి వచ్చె" నని బాబా నుడివెను. తిరిగి బాబా 12 రూపాయలు దక్షిణ అడిగెను. దేవు దానిని వసూలుచేసి చెల్లించి, సాష్టాంగనమస్కారము చేసెను. బాబా యిట్లనెను. "ప్రతిరోజు జ్ఞానేశ్వరిని చదువుము; పోయి వాడాలో కూచుండుము. ప్రతినిత్యము కొంచెమైనను క్రమము తప్పక చదువుము. చదువునపుడు దగ్గరనున్నవారికి శ్రద్ధాభక్తులతో బోధపరచి చెప్పుము. నేను నీకు జల్తారు సెల్లా నిచ్చుటకు ఇచట కూర్చొనియున్నాను. ఇతరులవద్దకు పోయి దొంగిలించెదవేల? నీకు దోంగతనమునకు అలవాటు పడవలెనని యున్నదా?"

బాబా మాటలు విని దేవ్ సంతసించెను. బాబా తనను జ్ఞానేశ్వరిని ప్రారంభించుమని యాజ్ఞాపించె ననియు, తనకు కావలసినదేదో యది దొరికె ననియు, అప్పటినుండి తాను సులభముగ చదువగలననియు అనుకొనెను. తిరిగి బాబా పాదములకు సాష్టాంగనమస్కార మొనర్చెను. తాను శరణు వేడెను. కనుక తనను బిడ్డగా నెంచి, జ్ఞానేశ్వరి చదువుటలో తోడ్పడవలసినదని బాబా ను వేడుకొనెను. పేలికలు దొంగిలించుట యనగా నేమో దేవు అప్పుడు గ్రహించెను. బాలకరాముని ప్రశ్నించుటయే గుడ్డపేలికలు దొంగిలించుట. బాబా కట్టి వైఖరి యిష్టము లేదు. ఏ ప్రశ్న కైన సమాధానము ఇచ్చుటకు తామే సిద్ధముగా నుండిరి. ఇతరుల నడుగుట బాబాకు ఇష్టములేదు. అందుచే నతని బాధించి చీకాకు పెట్టెను అదియును గాక యితరుల నడుగకుండ బాబానే సర్వము అడిగి తెలిసికొనవలయు ననియు, నితరులను ప్రశ్నించుట నిష్పృయోజనమనియు చెప్పెను. దేవు అతిట్లను పువ్వులు, ఆశీర్వాదములుగా భావించి సంతుష్టితో ఇంటికి బోయెను.

ఆ సంగతి యంతటితో సమాప్తి కాలేదు. చదువుమని యాజ్ఞాపించి బాబా ఊరుకొనలేదు. ఒక సంవత్సరము లోపుగా బాబా దేవు వద్దకు వెళ్ళి వాని యభివృద్ధిని కనుగొనెను. 1914 వ సంవత్సరము ఏప్రిల్ నెల 2 వ తేదీ గురువారము ఉదయము బాబా స్వప్నములో సాక్షాత్కరించి పై అతస్తులో కూర్చుండి "జ్ఞానేశ్వరి బోధపడుచున్నదా లేఆ?" యని యడిగెను. "లేదు" అని దేవు జవాబిచ్చెను.

బాబా: ఇంకా ఎప్పుడు తెలిసికొనెదవు?

దేవు కండ్ల తడిపెట్టుకొని "నీ కృపను వర్థింపనిదే పారాయణము చికాకుగా నున్నది, బోధపడుట చాల కష్టముగా నున్నది. నేను దీనిని నిశ్చయముగా చెప్పుచున్నాను." అనెను.

బాబా : చదువునపుడు నీవు తొందరపడుచున్నావు. నా ముందర చదువుము. నా సమక్షమున చదువుము.

దేవు: ఏమి చదువవలెను?

బాబా: అధ్యాత్మ చదువుము.

పుస్తకమును తీసికొని వచ్చుటకు దేవు వెళ్ళెను. అంతలో మెలకువ వచ్చి కండ్లు తెరచెను. ఈ దృశ్యమును జూచిన పిమ్మట దేవు కెంత యానందము, సంతోషము కలిగెనో చదువరులే గ్రహింతురు గాక!

ఓం నమో శ్రీ సాయినాధాయ

శాంతిః శాంతిః శాంతిః

నలుబదియొకట అధ్యాయము సంపూర్ణము.