శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము - పి.నారాయణరావు Back   Home 

నలుబదిరెండవ అధ్యాయము

బాబా సమాధి చెందుట
1. ముందుగా సూచించుట 2. రామచంద్ర దాదా పాటీలు, తాత్యా కోతే పాటీలుల చావులను తప్పించుట 3. లక్ష్మీ బాయి శిందే కు దానము 4. చివరి దశ.

ఈ అధ్యాయములో బాబా తమ దేహమును చాలించిన వృత్తాంతము వర్ణింతము.

తొలిపలుకు

గత అధ్యాయములలో చెప్పిన కధలు, బాబా కృపయను కాంతిచే ఐహిక జీవితమందలి భయము నెటుల త్రోసివేయగలమో, మోక్షమునకు మార్గము నెట్లు తెలిసికొనగలమో మన కష్టములను సంతోషముగా నెట్లు మార్చగలమో చెప్పును. సద్గురుని పాదారవిందములను జ్ఞప్తియందుంచుకొనినచో, మన కష్టములు నశించును. మరణము దాని నైజమును కోలుపోవును. ఐహికదుఃఖములు నశించును. ఎవరయితే తమ క్షేమమును కోరెదరో వారు శ్రీ సాయి లీలలను జాగ్రత్తగా వినవలెను. అది వారి మనస్సును పావనము చేయును.

ముందుగా సూచించుట

చదువరు లింతవరకు బాబా జీవితకధలను వింటిరి. ఇప్పుడు వారు మహాసమాధిని ఎట్లు పొందిరో వినెదరుగాక. 1918 సెప్టెంబరు 28 వ తేదీన బాబాకు కొంచెము జ్వరము తగిలెను. జ్వరము రెండుమూడు దినము లుండెను, కాని అటుతరువాత బాబా భోజనమును మానెను. అందుచేత క్రమముగా బలహీనులైరి. 17 వ రోజు అనగా 1918 వ సంవత్సరము అక్టోబర్ 15 వ తేదీ మంగళవారము 2-30 గంటలకు బాబా భౌతిక శరీరమును విడిచెను. ఈ విషయమును రెండు సంవత్సరములకు ముందే బాబా సూచించెను గాని, యది ఎవరికి బోధపడలేదు. అది యిట్లు జరిగెను. విజయదశమినాడు సాయంకాలము గ్రామములోని వారందరు సీమోల్లంఘన మొనర్చి తిరిగి వచ్చుచుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులైరి. సీమోల్లంఘన మనగా గ్రామపు సరైహద్దును దాటుట. బాబా తమ తలగుడ్డ, కఫనీ, లంగోటీ తీసి వానిని చించి ముందున్న ధుని లోనికి విసరివైచిరి. దీని మూలముగా ధుని ఎక్కువగా మండజొచ్చెను. ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించెను. బాబా అక్కడ దిగంబరుడై నిలచి ఎర్రగా మండుచున్న కండ్లతో బిగ్గరగా అరచెను. "ఇప్పుడు సరిగా గమనించి నేను హిందువునో, మహమ్మదీయుడనో చెప్పుడు." అచటనున్న ప్రతివాడు గడగడ వణకిపోయెను. బాబా వద్దకు పోవుట కెవ్వరును సాహసించలేకపోయిరి. కొంతసేపటికి భాగోజి శిందే (కుష్టురోగ భక్తుడు) ధైర్యముతో దగ్గరకు బోయి లంగోటును గట్టి యిట్లనెను. "బాబా! సీమోల్లంఘనమునాడు ఇదంతయునేమి?" "ఈ రోజు నా సీమోల్లంఘనము." అనుచు బాబా పటకాతో నేలపై గొట్టెను. బాబా రాత్రి 11 గంటలవరకు శాంతించలేదు. ఆ రాత్రి చావడి యుత్సవము జరుగునో లేదో యని యందరు సంశయించిరి. ఒక గంట తరువాత బాబా మామూలు స్థితికి వచ్చెను. ఎప్పటివలె దుస్తులు వేసికొని చావడి యుత్సవమునకు తయారయ్యెను. ఈ విధముగా బాబా తాము దసరానాడు సమాధి చెందుదుమని సూచించిరి గాని యది ఎవరికి అర్థము కాలేదు. దిగువ వివరించిన ప్రకారము బాబా మరియొక సూచన గూడ చేసిరి.

రామచంద్ర, తాత్యాకోతే పాటీళ్ళ మరణము తప్పించుట

ఇది జరిగిన కొంతకాలము పిమ్మట రామచంద్ర పాటీలు తీవ్రముగా జబ్బుపడెను. అతడు చాల బాధపడెను. అన్ని ఔషధములు ఉపయోగించెను గాని, అవి గుణము నివ్వలేదు. నిరాశ చెంది, చావుకు సిద్ధముగా నుండెను. ఒకనాడు నడిరేయి బాబా యతని దిండువద్ద నిలచెను. పాటీలు బాబా పాదములు పట్టుకొని "నేను జీవితముపై ఆశ వదలుకొన్నాను. నేనెప్పుడు మరణించెదనో దయచేసి చెప్పుడు" అనెను. దాక్షిణ్యమూర్తి యగు బాబా "నీ వాతుర పడవద్దు, నీ చావు చీటి తీసివేసితిని. త్వరలో బాగుపడెదవు. కాని, తాత్యా కోతే పాటీలు గూర్చి సంశయించుచున్నాను. అతడు శక సం. 1840 విజయదశమినాడు (1918) మణించును. అది ఎవరికిని తెలియనీయకు; వానికి కూడ చెప్పవద్దు. చెప్పినచో మిక్కిలి భయపడును." అనిరి. రామచంద్ర దాదా జబ్బు కుదిరెను. కాని యాతడు తాత్యాగూర్చి సంశయించుచుండెను. ఏలన బాబా మాటకు తిరుగు లేదనియు కనుక తాత్యా రెండు సంవత్సరములలో మరణము చెందుననుకొనెను. దీనిని రహస్యముగా నుంచెను, ఎవరికిని తెలియనీయలేదు. కాని బాలాషింపి కి మాత్రము చెప్పెను. రామచంద్రపాటీలు, బాలాషింపియు, ఈ యిరువురు మాత్రమే తాత్యా గూర్చి భయపడుచుండిరి.

రామచంద్ర దాదా త్వరలో ప్రక్కనుండి లేచి నడువసాగెను. కాలము వేగముగా కదలిపోయెను. 1918 భాద్రపదము ముగిసెను. ఆశ్వయుజమాసము సమీపించుచుండెను. బాబా మాటప్రకారము తాత్యా జబ్బుపడెను, మంచము బట్టెను. అందుచే బాబా దర్శనమునకై రాలేకుండెను. బాబా కూడ జ్వరముతో నుండెను. తాత్యాకు బాబా యందు పూర్తి విశ్వాసముండెను; బాబా శ్రీ హరిని పూర్తిగా నమ్మియుండెను. దైవమే వారి రక్షకుడు. తాత్యా రోగము అధికమయ్యెను. అతడు కదలలేకపోయెను, ఎల్లప్పుడు బాబానే స్మరించుచుండెను. బాబా పరిస్థితి గూడ క్షిణించెను. విజయదశమి సమీపించుచుండెను. రామచంద్ర దాదాయు, బాలాషిపియు తాత్యాగూర్చి మిగుల భయపడిరి. వారి శరీరములు వణకజొచ్చెను, శరీరమంతయు చెమటలు పట్టెను. బాబా నుడివినప్రకారము తాత్యా చావు దగ్గరకు వచ్చెననుకొనిరి. విజయదశమి రానే వచ్చెను. తాత్యా నాడి బలహీనమయ్యెను. త్వరలో ప్రాణము విడుచునని యనుకొనిరి. ఇంతలో గొప్ప వింత జరిగెను. తాత్యా నిలచెను, అతని మరణము తప్పెను. అతనికి బదులుగా బాబా గతించెను. వారిలోవారు మరణము మార్చుకొన్నట్లు గనిపించెను. బాబా తన ప్రాణమును తాత్యాకోసమర్పించెనని జనులనుకొనిరి. బాబా ఎందుకిట్లు చేసెనో బాబాకే తెలియును. వారి కృత్యములగోచరములు. ఇవ్విధముగా బాబా తమ సమాధిని సూచించెను. తన పేరుకు బదులు తాత్యా పేరు తెలిపెను.

ఆ మరుసటి యుదయము అనగా అక్టోబర్ 16వ తేదీన పండరీపురములో దాసగణుకు బాబా స్వప్నమున సాక్షాత్కరించి యిట్లనిరి. "మసీదు కూలిపోయినది, వర్తకులు నన్ను చాల చీకాకు పెట్టిరి, కనుక ఆస్థలమును విడిచిపెట్టినాను. ఈ సంగతి నీకు తెలియజేయుటకై వచ్చి నాను. వెంటనే యక్కడకు పొమ్ము. నన్ను చాలినన్ని పుష్పములచే గప్పుము." శిరిడీనుండి వచ్చిన వుత్తరమువలన కూడ దాసగణుకీ సంగతి దెలిసెను. అతడు వెంటనే సిష్యులతో శిరిడీకి చేరెను. భజనకీర్తన ప్రారంభించెను. బాబాను సమాధి చేయుటకు ముందురోజంతయు భగవన్నామ స్మరణ చేసెను. భగవన్నామస్మరణ చేయుచు నొక చక్కని పువ్వుల హారమును స్వయముగా గ్రుచ్చి దానిని బాబా సమాధిపై వేసెను. బాబా పేరుతో అన్నదానము చేసెను.

లక్ష్మీబాయి శిందేకు దానము

దసరా లేదా విజయదశమి హుందువులకు గొప్ప సుభసమయము. ఆ దినమున బాబా సమాధి చెందుటకు నిశ్చయించుకొనుట మిగుల సవ్యముగా నున్నది. కొన్నిదినములనుండీ వారు వ్యాధిగ్రస్తులుగా నుండిరి, లోపల మాత్రము పూర్ణచైతన్యులుగా నుండిరి. చివరి సమయమప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయము లేకుండ, లేచి కూర్చుండి మంచి స్థితిలో నున్నట్లు గనపడిరి. అపాయస్థితి దాటినదని బాబా కోలుకొనుచుండెనని యందరనుకొనిరి. తాము త్వరలో సమాధి చెందెదమని బాబాకు తెలియును. కాన, లక్షీబాయి శిందే కు కొంత ద్రవ్యమును దానము చేయ నిశ్చయించుకొనిరి.

బాబా సర్వజీవవ్యాపి

ఈ లక్ష్మీబాయి శిందే ధనవంతురాలు, సుగుణవతి, రాత్రింబవళ్ళు ఆమె మసీదులో బాబా సేవ చేయుచుండెను. రాత్రిసమయమందు భక్త మహాళ్సాపతి, తాత్యా, లక్ష్మీబాయి శిందే తప్ప తదితరులెవ్వరు, మసీదులో కాలుపెట్టుట కాజ్ఞా లేకుండెను. ఒకనాడు సాయంకాలము బాబా మసీదులో తాత్యాతో కూర్చొనియుండగా లక్ష్మీబాయి శిందే వచ్చి బాబాకు నమస్కరించెను. బాబా యిట్లనెను, "ఓ లక్ష్మీ! నాకు చాల ఆకలి వేయుచున్నది." వెంటనే యామె లేచి "కొంచెము సేపాగుము. నేను త్వరలో రొట్టెను దీసికొని వచ్చెదను." అనిన ప్రకారము ఆమె త్వరగా రొట్టె, కూర తీసికొని వచ్చి బాబా ముందు పెట్టెను. బాబా దానిని అందుకొని యొక కుక్కకు వేసెను. లక్ష్మీబాయి యిట్లడిగెను. "ఇది ఏమి బాబా! నేను పరుగెత్తుకొని పోయి నా చేతులార నీకొరకు రొట్టె చేసితిని. నీవు దానిని కొంచెమైనను తినక కుక్కకు వేసితివి. అనవసరముగా నాకు శ్రమ కలుగజేసితివి." అందుకు బాబా యిట్లు సమాధానమిచ్చెను. "అనవసరముగా విచారించెదవేల? కుక్క యాకలి దీర్చుట నా యాకలి దీర్చుట వంటిది. కుక్కకు కూడ ఆత్మ గలదు. ప్రాణులు వేరు కావచ్చును. కాని అందరి యాకలి యొకటియే. కొందరు మాట్లాడగలరు. కొందరు మూగవలె మాట్లాడలేరు. ఎవరయితే యాకలితో నున్నవారికి భోజనము పెట్టెదరో వారు నాకన్నము పెట్టినట్లే. దీనినే గొప్పనీతిగా ఎరుగుము." ఇది చాల చిన్న విషయము గాని, బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యమును బోధించి, ఇతరుల కెట్టి బాధయు కలుగకుండ నిత్యజీవితములో దానిని ఆచరణలో పెట్టుట ఎటులో చూపించెను. ఆనాటినుండి లక్ష్మీబాయి రొట్టె పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండెను. బాబా మెచ్చుకొని ఎంతో ప్రేమతో తినుచుండెడివాడు. అందులో కొంత తాను తిని మిగత రాధాక్రిష్ణమాయికి పంపుచుండెను. ఆమె బాబా భుక్త శేషమునే ఎల్లప్పుడు తినుచుండెను. ఈ రొట్టె కధను విషయాంతరముగా భావించరాదు. దీనినిబట్టి బాబా సర్వజీవులయందు గలడని తెలిసి కొనగలము. బాబా సర్వవ్యాపి, చావు పుట్టుకలు లేనివారు, అమరులు.

బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞప్తియందుంచుకొనిరి. ఆమెను మరచెదరెట్లు? బాబా తమ భౌతిక శరీరమును విడుచునపుడు, తన జేబులో చేయి పెట్టి యొకసారి 5 రూపాయలు, ఇంకొకసారి 4 రూపాయలు మొత్తము 9 రూపాయలు తీసి లక్ష్మీబాయి కిచ్చిరి. ఈ సంఖ్య 21 వ అధ్యాయములోని నవవిధభక్తులను తెలియజేయును. లేదా ఇది సీమోల్లంఘన సమయమున నిచ్చు దక్షిణ యనుకొనవచ్చును. లక్ష్మీబాయి శిందే ధనవంతురాలగుటచే నామెకు ధనమవసరములేదు. కనుక బాబా ఆమెకు ముఖ్యముగా నవవిధభక్తులను గూర్చి బోధించియుండవచ్చును. భాగవతము ఏకాదశస్కంధమందు దశమాధ్యాయములో ఆరవ శ్లోకమున పూర్వార్థమున 5, ఉత్తరార్థమున 4 విధముల భక్తి చెప్పబడియున్నది. బాబా ఈ ప్రకారముగ మొదట 5, తదుపరి 4 మొత్తము 9 రూపాయలు ఇచ్చెను. ఒక తొమ్మిదేకాక తొమ్మిదికి ఎన్నోరెట్లు రూపాయలు లక్ష్మీబాయి చేతిమీదుగా వ్యయమైనవి. కాని బాబా ఇచ్చిన ఈ తొమ్మిది రూపాయల నామె ఎన్నటికిని మరువదు.

మిక్కిలి జాగరూకత మరియు పూర్ణచైతన్యము కలిగియుండు బాబా యవసానకాలమందు కూడ తగిన జాగ్రత్త పడెను. తనభక్తుల పైగల ప్రేమానురాగములయందు తగుల్కొనకుండునట్లు, వారందరిని లేచిపొమ్మనెను. కాకాసాహెబు దీక్షిత్, బాపుసాహెబు బుట్టీ మొదలగు వారు మసీదునందు ఆందోళనతో బాబాను గనిపెట్టుకొనియుండిరి. కాని బాబా వారిని వాడకు బోయి భోజనము చేసి రమ్మనెను. వారు బాబాను విడువ లేకుండిరి; బాబా మాటను జవదాటలేకుండిరి. మనస్సునందు ఇష్టము లేనప్పటికి వారు పోలేక పోలేక మసీదు విడిచి పోయిరి. బాబా స్థితి యపాయకరముగా నుండెనని వారికి దెలియును. కనుక వారు బాబాను మరువకుండిరి. వారు భోజనమునకు కూర్చుండిరే కాని వారి మనస్సు ఎక్కడనో బాబాపై నుండెను. వారు భోజనము పూర్తిచేయక మునుపే బాబా తమ భౌతిక శరీరమును విడిచెనని వార్త వచ్చెను. భోజనములను విడిచి యందరు మసీదుకు పరుగెత్తిరి. బాయాజీ తొడపై బాబా వ్రాలి యుండెను. వారు నేలపై గాని తమ గద్దెపై గాని పడలేదు. తమ స్థలములో ప్రశాంతముగా గూర్చుండి తమ చేతితో దానము చేయుచు శరీరమును విడిచిరి. యోగులు శరీరము ధరించి ఏదో పనిమీద ఈ లోకమునకు వత్తురు. అది నెరవేరిన పిమ్మట వారెంత నెమ్మదిగాను సులభముగాను అవతరించిరో యంత శాంతముగా వెళ్ళెదరు.

ఓం నమో శ్రీ సాయినాధాయ

శాంతిః శాంతిః శాంతిః

నలుబదిరెండవ అధ్యాయము సంపూర్ణము.