43, 44 అధ్యాయములు
బాబా సమాధి చెందుట 1.సన్నాహము, 2.సమాధిమందిరము 3.ఇటుకరాయి విరుగుట, 4.72
గంటల సమాధి, 5.జోగుయొక్క సన్యాసము 6.అమృతము వంటి బబా పలుకులు.
43, మరియు 44 అధ్యాయములు కూడ బాబా శరీర త్యాగము చేసిన కధనే వర్ణించునవి కనుక వాటినొకచోట చేర్చుట
జరిగినది.
ముందుగా సన్నాహము
హిందువులలో నెవరైన మరణించుటకు సిద్ధముగా నున్నప్పుడు మతగ్రంధములు చదివి వినిపించుట
సాధారణాచారము. ఏలన ప్రపంచ విషయములనుండి అతని మనస్సును మరలించి భగవద్విషయములందు లీనమొనర్చినచో
నతడు పరమును సహజముగాను, సులభముగాను పొందును. పరీక్షిన్మహారాజు బ్రాహ్మణ ఋషిబాలునిచే శపింపబడి
వారము రోజులలో చనిపోవుటకు సిద్ధముగా నున్నప్పుడు గొప్ప యోగి యగు శుకుడు భాగవతపురాణమును ఆ
వారములో బోధించెను. ఈ అభ్యాయసము ఇప్పటికిని అలవాటులో నున్నది. చనిపోవుటకు సిద్ధముగా నున్నవారికి
గీతా, బాగవతము మొదలగు గ్రంధములు చదివి వినిపించెదరు. కాని బాబా భగవంతుని యవతారమగుటచే వారి
కట్టిది యవసరము లేదు. కాని, ఇతరులకు ఆదర్శముగా నుండుటకు ఈ యలవాటును పాటించిరి. త్వరలోనే
దేహత్యాగము చేయునున్నామని తెలియగనే వారు వజే యను నాతని బిలచి రామవిజయమను గ్రంధమును పారాయణ
చేయుమనిరి. అతడు వారములో గ్రంధమును నొకసారి పఠించెను. తిరిగి దానిని చదువుమని బాబా యాజ్ఞాపింపగా
అతడు రాత్రింబవళ్ళు చదివి దానిని మూడు దినములలో రెండవ పారాయణము పూర్తిచేసెను. ఈ విధముగా 11
దినములు గడచెను. అతడు తిరిగి 3 రోజులు చదివి యలసిపోయెను. బాబా అతనికి సెలవిచ్చి పొమ్మనెను. బాబా
నెమ్మదిగా నుండి ఆత్మానుసంధానములో మునిగి చివరి క్షణముకయి ఎదురు చూచుచుండిరి.
రెండుమూడు దినముల ముందునుండి బాబా గ్రామము బయటకు పోవుట, భిక్షాటనము చేయుట మొదలగునవి మాని
మసీదులో కూర్చుండిరి. చివరవరకు బాబా చైతన్యముతో నుండి, అందరిని ధైర్యముగా నుండుమని సలహా
ఇచ్చిరి. వారెప్పుడు పోయెదరో ఎవరికిని తెలియనీయలేదు. ప్రతిదినము కాకాసాహెబు దీక్షితు, శ్రీమాన్
బుట్టీ యు వారితో కలిసి మసీదులో భోజనము చేయుచుండెడివారు. ఆనాడు (అక్టోబరు 15 వ తారీఖు) హారతి
పిమ్మట వారిని వారివారి బలసకు బోయి భోజనము చేయుమనెను. అయినను కొంతమంది లక్ష్మీబాయి శిందే,
భాగోజి సిందే, బాయాజి, లక్ష్మన్ బాలాషింపి, నానాసాహెబు నిమోన్ కర్ యక్కడనే యుండిరి. దిగువ
మెట్లమీద శ్యామా కూర్చొనియుండెను. లక్ష్మీబాయి సిందేకు 9 రూపాయలను దానము చేసినపిమ్మట, బాబా తన
కాస్థలము (మసీదు) బాగలేదనియు అందుచేత తనను రాతితో కట్టిన బుట్టీ మేడ లోనికి దీసికొని పోయిన నచట
బాగుగా నుండుననియు చెప్పెను. ఈ తుదిపలుకు లాడుచు బాబా బాయాజీ శరీరముపై ఒరిగి ప్రాణములు
విడిచెను. భాగోజీ దీనిని గనిపెట్టెను. దిగువ కూర్చొనియున్న నానాసాహెబు నిమోన్ కర్ కు ఈ సంగతి
చెప్పెను. నానాసాహెబు నీళ్ళు తెచ్చి బాబా నోటిలో పోసెను. అవి బయటకు వచ్చెను. అతడు బిగ్గరగా ఓ
దేవా! యని యరచెను. అంతలో బాబా కండ్లు తెరచి మెల్లగా "ఆహా" యనెను. బాబా తన భౌతిక శరీరమును
విడిచిపెట్టెనని తేలిపోయెను.
బాబా సమాధి చెందెనను సంగతి శిరిడీ గ్రామములో కార్చిచ్చు వలె వ్యాపించెను. ప్రజలందరు స్త్రీలు,
పురుషులు, బిడ్డలు మసీదుకు పోయి ఏడ్వసాగిరి. కొందరు బిగ్గరగా నేడ్చిరి. కొందరు వీధులలో
నేడ్చుచుండిరి. కొందరు తెలివితప్పి పడిరి. అందరి కండ్లనుండు నీళ్ళు కాలువలవలె పారుచుండెను.
అందరును విచారగ్రస్తులయిరి.
కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపకము చేసికొనమొదలిడిరి. మునుముందు ఎనిమిదేండ్ల బాలునిగా
ప్రత్యక్షమయ్యెదనని బాబా తమ భక్తులతో చెప్పిరని యొకరనిరి. ఇవి యోగీశ్వరుని వాక్కులు కనుక
నెవ్వరును సందేహింపనక్కరలేదు. ఏలన కృష్ణావతారములో శ్రీ మహావిష్ణు వీకార్యమే యొనర్చెను. సుందర
శరీరముతో, ఆయుధములు గల చతుర్భుజములతో శ్రీ కృష్ణుడు దేవకీదేవికి కారాగారమున ఎనిమిదేండ్ల
బాలుడుగానే ప్రత్యక్షమయ్యెను. ఆ యవతారమున శ్రీ కృష్ణుడు భూమిభారమును తగ్గించెను. ఈ యవతారము
(సాయి బాబా) భక్తుల నుద్ధరించుటకై వచ్చినది. కనుక సంశయింప కారణమే మున్నది? యోగుల
జాడలగమ్యగోచరములు. సాయిబాబాకు తమ భక్తులతోడి సంబంధ మీయొక్క జన్మతోడిదే కాదు, అది కడచిన
డెబ్బదిరెండు జన్మల సంబంధము. ఇట్టి ప్రేమబంధములు కల్గించిన యా మాహారాజు (సాయిబాబా) ఎచటికో
పర్యటనకై పోయినట్లనిపించుట వారు శ్రీఘ్రముగానే తిరిగి వత్తురను దృఢవిశ్వాసము భక్తులకు గలదు.
బాబా శరీరమునెట్లు సమాధి చేయవలెనను విషయము గొప్ప సమస్య యాయెను. కొందరు మహమ్మదియులు బాబా
శరీరమును బయట సమాధి చేసి దానిపై గోరి కట్టవలెననిరి. ఖుషాల్ చంద్, అమీరు శక్కర్ కూడ ఈ
యభిప్రాయమునే వెలిబుచ్చిరి కాని రామ చంద్రపాటీలు అను గ్రామమునసబు గ్రామములోని వారందరికీ
నిశ్చితమైన దృఢకంఠస్వరముతో "మీ యాలోచన మా కసమ్మతము. బాబా శరీరము రాతి వాడాలో పెట్టవలసినదే"
యనిరి. అందుచే గ్రామస్థులు రెండు వర్గములుగా విడిపోయి ఈ వివాదము 36 గంటలు జరిపిరి.
బుధవార ముదయము గ్రామములోని జ్యోతిష్కుడును, శ్యామాకు మేనమామయునగు లక్ష్మన్ మామాజోషికి బాబా
స్వప్నములో కనిపించి, చేయిపట్టి లాగి యిట్లనెను. "త్వరగాలెమ్ము, బాపుసాహెబు నేను మరణించితి
ననుకొనుచున్నాడు. అందుచే నతడు రాడు. నీ పూజ చేసి, కాకడహారతిని ఇమ్ము." లక్ష్మణమామా
సనాతనాచారపరాయణుడయిన బ్రాహ్మణుడు. ప్రతిరోజు ఉదయము బాబాను పూజించిన పిమ్మట తక్కిన దేవతలను
పూజించుచుండెడివాడు. అతనికి బాబా యందు పూర్ణభక్తివిశ్వాసము లుండెను. ఈ దృశ్యమును చూడగనే
పూజాద్రవ్యముల పళ్ళెమును చేత ధరించి మౌల్వీలు ఆటంకపరచుచున్నను పూజను హారతిని చేసి పోయెను. మిట్ట
మధ్యాహ్నము బాపు సాహెబు జోగ్ పూజాద్రవ్యములతో నందరితో మామూలుగా వచ్చి మధ్యాహ్న హారతిని
నెరవేర్చెను.
బాబా తుదిపలుకులను గౌరవించి ప్రజలు వారి శరీరమును వాడాలో నుంచుటకు నిశ్చయించి అచటి మధ్య భాగమును
త్రవ్వుట ప్రారంభించిరి. మంగళవారము సాయంకాలము రాహాతానుండి సబ్ ఇన్ స్పెక్టర్ వచ్చెను. ఇతరులు
తక్కిన స్థలములనుండి వచ్చిరి. అందరు దానిని అమోదించిరి. అ మరుసటి యుదయము అమీర్ భాయి బొంబాయి
నుండి వచ్చెను. కోపర్ గాం నుండి మామలతదారు వచ్చెను. ప్రజలు భిన్నాభిప్రాయములతో నున్నట్లు
తోచెను. కొందరు బాబా శరీరమును బయటనే సమాధి చేయవలెలనని పట్టుబట్టిరి. కనుక, మామలతదారు ఎన్నిక
ద్వారా నిశ్చయించవలె ననెను. వాడా నుపయోగించుటకు రెండురెట్లకంటే ఎక్కువ వోట్లు వచ్చెను.
అయినప్పటికి జిల్లా కలెక్టరుతో సంప్రదించవలెనని అతడనెను. కనుక కాకా సాహెబు దీక్షిత్ అహమద్ నగర్
పోవుటకు సిద్ధపడెను. ఈ లోపల బాబా ప్రేరేపణవల్ల రెండవ పార్టి యొక్క మనస్సు మారెను. అందరు
ఏకగ్రీవముగా బాబాను వాడాలో సమాధి చేయుటకంగీకరించిరి. బుధవారము సాయంకాలము బాబా సరీరమును
ఉత్సవముతో వాడాకు తీసికొనిపోయిరి. మురళీధర్ కొరకు కట్టిన చోట శాస్తోక్తముగా సమాధి చేసిరి.
యధార్థముగా బాబాయే మురళీధరుడు. వాడా దేవాలయమయ్యెను. అది యొక పూజామందిర మాయెను. అనేకమంది
భక్తులచ్చటకు బోయి శాంతి సౌఖ్యములు పొందుచున్నారు. ఉత్తర క్రియలు బాలాసాహెబు భాటే ఉపాసనీ బాబా
నేవేర్చిరి. ఉపాసని బాబా, బాబాకు గొప్ప భక్తుడు.
ఈ సందర్భములో నొక విషయము గమనించవలెను. ప్రొఫెసరు నార్కే కధనము ప్రకారము బాబా శరీరము 36 గంటలు
గాలి పట్టినప్పటికి అది బిగిసిపోలేదు. అవయవములన్నియు సాగుచుండెను. వారి కఫనీ చింపకుండ సులభముగా
దీయగలిగిరి.
ఇటుకరాయి విరుగుట
బాబా భౌతిక శరీరమును విడుచుటకు కొన్ని దినముల ముందు ఒక దుశ్శకునమయ్యెను. మసీదులో ఒక పాత యిటుక
యుండెను. బాబా దానిపై చేయివేసి యానుకొని కూచుండువారు. రాత్రులందు దానిపై ఆనుకొని యాసనస్థులగు
చుండిరి. అనేకసంవత్సరములిట్లు గడచెను. ఒకనాడు, బాబా మసీదులో లేనప్పుడు, ఒక బాలుడు మసీదును
శుభ్రపరచుచు, దానిని చేతితో పట్టుకొనియుండగా అది చేతినుండి జారి క్రిందపడి రెండుముక్కలయిపోయెను.
ఈ సంగతి బాబాకు తెలియగనే వారు మిగుల చింతించి యిట్లని ఏడ్చిరి. "ఇటుకకాదు, నా యదృష్టమే ముక్కలు
ముక్కలుగా విరిగిపోయినది. అది నా జీవితపు తోడునీడ. దాని సహాయమువలననే నేను ఆత్మానుసంధానము
చేయుచుండెడి వాడను. నా జీవితమునందు నాకెంత ప్రేమయో, దానియందు నా కంత ప్రేమ. ఈ రోజు అది నన్ను
విడిచినది," ఎవరైన ఒక ప్రశ్న అడుగవచ్చును. "బాబా నిర్జీవియగు ఇటుక కోసమింత విచారపడనేల?" అందులకు
హేమాడ్ పంతు ఇట్లు సమాధానమిచ్చెను. "యోగులు పేదవారికి, నిస్సహాయులకు సహాయము చేయుటకయి
యవతరించెదరు. వారు ప్రజలతో కలసి మసలునప్పుడు ప్రజలవలె నటింతురు. వారు మన వలె బాహ్యమునకు
నవ్వెదరు, ఆడెదరు, ఏడ్చెదరు. కాని లోపల వారు శుద్ధచైతన్యులయి వారి కర్తవ్యవిధుల నెరుగుదురు.
72 గంటల సమాధి
ఇటుక విరుగుటకు 32 సంవత్సరములకు పూర్వమందు అనగా, 1886 సంవత్సరములో బాబా సీమోల్లంఘనము చేయ
ప్రయత్నించెను. ఒక మార్గశిరపౌర్ణమి నాడు బాబా ఉబ్బసము వ్యాధితో మిక్కిలి బాధ పడుచుండెను. దానిని
తప్పించుకొనుటకై బాబా తన ప్రాణమును పైకి తీసికొనిపోయి సమాధిలో నుంచవలెననుకొని, భక్తమహాళ్సాపతితో
ఇట్లనిరి. "నా శరీరమును మూడు రోజులవరకు కాపాడుము. నేను తిరిగి వచ్చినట్లయిన సరే, లేనియెడల నా
శరీరము నెదురుగా నున్న ఖాళి స్థలములో పాతిపెట్టి గుర్తుగా రెండు జెండాలను పాతుము." అని స్థలమును
జూపిరి. ఇట్లనుచు రాత్రి 10 గంటలకు బాబా క్రింద కూలెను. వారి ఊపిరి నిలచిపోయెను. వారి నాడికూడ
ఆడకుండెను. శరీరములో నుండి ప్రాణము పోయినట్లుండెను. ఊరి వారందరచ్చట చేరి న్యాయ విచారణ చేసి బాబా
చూపిన స్థలములో సమాధి చేయుటకు నిశ్చయించిరి. కాని మహాళ్సాపతి యడ్డగించెను. తన తొడపై బాబా
శరీరమునుంచుకొని మూడురోజులట్లే కాపాడుచు కూచుండెను. 3 దినముల పిమ్మట తెల్లవారుజామున 3 గంటలకు
బాబా శరీరములో ప్రాణమున్నట్లు గనిపించెను. ఊపిరి యాడ నారంభించెను; కడుపు కదలెను. కండ్లు
తెరచెను. కాళ్ళు చేతులు సాగదీయుచు బబా లేచెను.
దీనిని బట్టి చదువరు లాలోచించవలసిన విషయమేమన బాబా మూరల శరీరమా లేక లోపలనున్న యాత్మయా?
పంచభూతాత్మకమగు శరీరము నాశనమగును. శరీర మశాశ్వతము గాని, లోనున్న యాత్మ పరమసత్యము, అమరము,
శాశ్వతము. ఈ శుద్ధసత్తాయే బ్రహ్మము. అదియే పంచేంద్రియములను, మనస్సును స్వాధీనమందుంచుకొనునది,
పరిపాలించునది. అదియే సాయి. అదియే ఈ జగత్తునందు గల వస్తువులన్నిటియందు వ్యాపించియున్నది. అది
లేనిస్థలములేదు. అది తాను సంకల్పించుకొనిన కార్యమును నెరవేర్చుటకు భౌతిక శరీరము వహించెను.
దానిని నెరవేర్చిన పిమ్మట, శరీరమును విడిచెను. సాయి ఎల్లప్పుడు ఉండువారు. అట్లనే పూర్వము
గాణ్గాపురములో వెలసిన దత్తదేవుని యవతారమగు శ్రీ నరసిమ్హ సరస్వతియు, వారు సమాధిచెందుట బాహ్యమునకే
గాని, సమస్తచేతనాచేతనములందు గూడ నుండి వానిని నియమించువారును, పరిపాలించువారును వారే. ఈ విషయము
ఇప్పటికిని సర్వస్యశరణాగతి చేసిన వారికిని మనస్ఫూర్తిగ భక్తితో పూజించువారికినీ అనుభవనీయమయిన
సంగతి.
ప్రస్తుతము బాబా రూపము చూడ వీలులేనప్పటికిని, మనము శిరిడీకి వెళ్ళినచో, వారి జీవిత మెత్తుపటము
మసీదులో నున్నది. దీనిని శ్యామరావు జయకర్ యను గొప్ప చిత్రకారుడును బాబా భక్తుడును
వ్రాసియున్నాడు. భావుకుడు భక్తుడు నైన ప్రేక్షకునికి ఈ పటము ఈ నాటికిని బాబాను భౌతిక శరీరముతో
చూచినంత తృప్తి కలుగజేయును. బాబాకు ప్రస్తుతము భౌతిక శరీరము లేనప్పటికి వారక్కడనేకాక ప్రతి
చోటున నివసించుచు పూర్వమువలెనే తమ భక్తులకు మేలు చేయుచున్నారు. బాబా వంటి యోగులు ఎన్నడు
మరణించరు. వారు మానవుల వలె గనిపించినను నిజముగా వారే దైవము.
బాపుసాహెబు జోగ్ గారి సన్యాసము
జోగు సన్యాసము పుచ్చుకొనిన కధతో హేమాడ్ పంతు ఈ అధ్యాయమును ముగించుచున్నాడు. సఖారాం హరి, వురఫ్
బాపుసాహెబ్ జోగ్ పూనా నివాసియగు సుప్రసిద్ధ వార్కరి విష్ణు బువ జోగ్ గారికి మామ. 1909 వ
సంవత్సరమున సర్కారు ఉద్యోగమునుండి విరమించిన తరువాత (P.W.D.Supervisor), భార్యతో శిరిడీకి వచ్చి
నివసించుచుండెను. వారికి సంతానము లేకుండెను. భార్యాభర్తలు బాబాను ప్రేమించి, బాబా సేవయందే
కాలమంతయు గడుపుచుండిరి. మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట, బాపుసాహెబు జోగ్ మసీదులోను, చావడిలోను కూడ
బాబా మహాసమాధి పొందువరకు హారతి ఇచ్చుచుండెను. అదియును గాక ప్రతిరోజు సాఠేవాడలో జ్ఞానేశ్వరియు,
ఏకనాధ భాగవతమును చదివి, వినవచ్చిన వారందరికి బోధించుచుండెను. అనేకసంవత్సరములు సేవచేసిన పిమ్మట
జోగ్, బాబాతో "నేనిన్నాళ్ళు నీ సేవ చేసితిని. నా మనస్సు ఇంకను శాంతము కాలేదు. యోగులతో సహవాసము
చేసినను నేను బాగు కాకుండుటకు కారణమేమి? ఎప్పుడు కటాక్షించెదవు?" అనెను. ఆ ప్రార్థన విని, బాబా
"కొద్ది కాలములో నీ దుష్కర్మల ఫలితము నశించును. నీ పాపపుణ్యములు భస్మమగును. ఎప్పుడు
నీవభిమానమును పోగొట్టుకొని, మోహమును, రుచిని, జయించెదవో, యాటంకము లన్నిటిని కడచెదవో,
హృదయపూర్వకముగ భగవంతుని సేవించుచు సన్యాసము బుచ్చుకొనెదవో, అప్పుడు నీవు ధన్యుడవయ్యెదవు" అనిరి.
కొద్ది కాలముపిమ్మట బాబా పలుకులు నిజమాయెను. అతని భార్య చనిపోయెను. అతనికొంకొక యభిమానమేదియు
లేకుండుటచే నతడు స్వేచ్చాపరుడై సన్యాసమును గ్రహించి తన జీవిత పరమావధిని పొందెను.
అమృతతుల్యమగు బాబా పలుకులు
దయాదాక్షిణ్యమూర్తియగు సాయిబాబా పెక్కుసారులు మసీదులో ఈ దిగువ మధురవాక్యములు పలికిరి. "ఎవరయితే
నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడు నన్ను దర్శించెదరు. నేను లేక ఈ జగత్తంతయు వానికి
శున్యము, నా కధలు తప్ప మరేమియు చెప్పడు. సదా నన్నే ద్యానము చేయును. నా నామమునే ఎల్లప్పుడు
జపించుచుండును. ఎవరైతే సర్వస్యశరణాగతి చేసి, నన్నే ధ్యానింతురో వారికి నేను ఋణస్థుడను. వారికి
మోక్షము నిచ్చి వారి ఋణము దీర్చుకొనెదను. ఎవరయితే నన్నే చింతించుచు నా గూర్చియే దీక్షతో
నుందురో, ఎవరయితే నా కర్పించనిదే ఏమియు తినరో అట్టివారిపై, నేను ఆధారపడి యుందును. ఎవరయితే నా
సన్నిధానమునకు వచ్చెదరో, వారు నది సముద్రములో కలిసిపోయినట్లు నాలో కలిసిపోవుదురు. కనుక నీవు
గర్వము అహంకారము లేశమైన లేకుండ, నీ హృదయములో నున్న నన్ను సర్వస్యశరణాగతి వేడవలెను."
నేననగా నేరు?
నేను అనగా నెవ్వరో సాయిబాబా ఎన్నో సార్లు బోధించెను. వారిట్లనిరి. "నన్ను వెదకుటకు నీవు దూరము
గాని మరెచ్చటికి గాని పోనక్కరలేదు. నీ నామము నీ యాకారము విడిచినచో నోలోనేగాక అన్ని జీవులలోను,
చైతన్యము లేదా యంతరాత్మ యని యొకటి యుండును. అదే నేను. దీనిని నీవు గ్రహించి, నీలోనేగాక
అన్నిటిలోను నన్ను జూడుము. దీనిని నీ వభ్యసించినచో, సర్వవ్యాపకత్వమనుభవించి నాలో ఐక్యము
పొందెదవు."
హేమాడ్ పంతు చదువరులకు ప్రేమతో నమస్కరించి వేడునదేమన వారు వినయవిధేయతలతో దైవమును, యోగులను,
భక్తులను ప్రేమింతురుగాక! బాబా పెక్కుసారులు "ఎవరైతే ఇతరులను నిందించుదురో వారు నన్ను
హింసించినవారగుదురు. ఎవరయితే బాధననుభవించెదరో, ఓర్చుకొందురో వారు నాకు ప్రీతి గూర్చెదరు." అని
చెప్పిరి గదా! బాబా సర్వవస్తుజీవసముదాయములో నైక్యమైయున్నారు. భక్తులకు నలుప్రక్కల నిలచి
సహాయపడెదరు. సర్వజీవులను ప్రేమించుట తప్ప వారు మరేమియు కోరరు. ఇట్టి శుభమయిన పరిశుభ్రమయిన
యమృతము వారి పెదవులనుండి స్రవించుచుండెను. హేమాడ్ పంతు ఇట్లు ముగించుచున్నారు. ఎవరు బాబా
కీర్తిని ప్రేమతో పాడెదరో, ఎవరు దానిని భక్తితో వినెదరో ఉభయులును సాయితో నైక్యమగుదురు.
|