శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము - పి.నారాయణరావు Back   Home 

(7వ రోజు పారాయణము - బుధవారము)

నలుబదియైదవ అధ్యాయము

1.కాకాసాహెబు సంశయము 2.ఆనందరావు దృశ్యము 3.కర్రబల్ల మంచము బాబాదే - భక్త మహాళ్సాపతి ది కాదు.

తొలిపలుకు

గత మూడు అధ్యాయంలలో బాబా దివంగతులగుట గూర్చి చెప్పితిమి. వారి భౌతిక శరీరము మన దృష్టి నుండి నిష్క్రమించెను, గాని వారి యనంతస్వరూపము లేదా సాయిశక్తి ఎల్లప్పుడు నిలిచియే యుండును. ఇప్పటివరకు వారి జీవితకాలములో జరిగిన లీలలను చెప్పితిమి. వారు సమాధి చెందినపిమ్మట క్రొత్తలీలలు జరుగుచున్నవి. దీనినిబట్టి బాబా శాశ్వతముగా నున్నారనియు తమ భక్తులకు పూర్వము వలె తోడ్పడుచున్నారనియు తెలియుచున్నది. ఎవరయితే బాబా సమాధి చెందక ముందు వారిని జూచిరో వారు నిజముగ నదృష్టవంతులు. అట్టివారిలో నెవరైన ప్రపంచసుఖములందు వస్తువులందు మమకారము పోగొట్టుకొననిచో, వారి మనస్సులు భగవత్పరము కానిచో యది వారి దురదృష్టమని చెప్పవచ్చును. అప్పుడుకాదు ఇప్పుడుకూడ కావలసినది బాబా యందు హృదయపూర్వకమయిన భక్తి. మన బుద్ధి, ఇంద్రియములు, మనస్సు బాబా సేవలో నైక్యము కావలెను. కొన్నిటిని మాత్రమే సేవలో లయము చేసి తక్కినవానిని వేరే సంచరించునట్లు చేసినచో, ప్రయోజనము లేదు. పూజగాని ధ్యానము కాని చేయ పూనుకొనినచో దానిని మనఃపూర్వకముగను ఆత్మశుద్ధితోడను చేయవలెను.

పతివ్రతకు తన భర్తయందుగల ప్రేమము, భక్తుడు గురువు నందు చూపవలసిన ప్రేమతో పోల్చెదరు. అయినప్పటికి మొదటిది రెండవ దానితో పోల్చుటకే వీలులేదు. జీవితపరమావధిని పొందుటకు తండ్రిగాని, తల్లిగాని, సోదరుడు గాని యింక తదితరబంధువులెవ్వరు గాని తోడ్పడరు. ఆత్మసాక్షాత్కారమునకు దారిని మనమే వెదకుకొని ప్రయాణమును సాగించవలెను. నిత్యానిత్యములకు భేదమును తెలిసి కొని, ఇహలోక పరలోకములలోని విషయసుఖములను త్యజించి మన బుద్ధిని, మనస్సును స్వాధీనమందుంచుకొని మోక్షమునకై కాంక్షించ వలెను. ఇతరులపై నాధారపడుటకంటే మన స్వశక్తియందే మనకు పూర్తి నమ్మకము ఉండవలెను. ఎప్పుడయితే మనము నిత్యానిత్యములకు గల భేదమును పాటించెదమో, ప్రపంచము అబద్ధమని తెలిసికొనెదము. దానివలన ప్రపంచవిషయములందు మోహము తగ్గి, మనకు నిర్వ్యామోహము కలుగును. క్రమముగా గురువే పరబ్రహ్మస్వరూపమనియు కావున వారొక్కరే నిజమనియు గ్రహించెదము. వారు ఈ జగత్తును జయించిన వారును ప్రపంచమున కతీతులును. అప్పుడు వారిని ప్రతి జీవరాశి యందు జూడగలిగి పూజించెదము. ఇదియే అద్వైతభజనము లేదా పూజ. ఎప్పుడయితే మనము బ్రహ్మమును, లేదా గురుని హృదయపూర్వకముగ ధ్యానించెదమో, మనము కూడ వారిలో ఐక్యమై ఆత్మ సాక్షాత్కారము పొందెదము. వేయేల, గురువు నామమును జపించుట వలనను, వారి స్వరూపమునే మనమున నుంచుకొని ధ్యానించుటచేతను వారిని సర్వజంతుకోటియందు చూచుట కవకాశము కలుగును. మనకది శాశ్వతానందమును కలుగజేయును. ఈ దిగువ కధ దీనిని విశదీకరించును.

కాకాసాహెబు సంశయము - ఆనందరావు దృశ్యము

కాకాసాహెబుదీక్షిత్ ను ప్రతిరోజు శ్రీ ఏకనాధుడు వ్రాసిన గంధములను అనగా భాగవతమును, భావార్థరామాయణమును చదువుటకు బాబా ఆదేశించెను. బాబా సమాధికి పూర్వము కాకాసాహెబు దీక్షిత్ ఈ గ్రంధములను చదువుచుండెను. బాబా సమాధిచెందిన తరువాత కూడ అట్లే చేయుచుండెడివాడు. ఒకనాడు ఉదయము బొంబాయి చౌపాటిలో నున్న కాకామహాజని యింటిలో కాకాసాహెబు దీక్షిత్ ఏకనాధభాగవతము చదువుచుండెను. శ్యామా, కాకామహాజని కూడ నచట నుండి శ్రద్ధతో భాగవతమును వినుచుండిరి. దీక్షిత్ ఏకాదశస్కంధములోని ద్వితీయాధ్యాయము చదువుచుండెను. అందు వృషభకుంటుంబములోని నవనాధులు లేదా సిద్ధులగు కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయను, అవిర్ హోత్ర, దృమిళ, చమస్, మరియు కరభజన్ లు భాగవత ధర్మసూత్రములను జనకమహారాజుకు చెప్పుచుండిరి. జనకుడు నవనాధులను ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని యడిగెను. వారొక్కొక్కరు సంతృప్తికరమైన సమాధానములిచ్చిరి. అందులో మొదటివాడగు కవి భాగవత ధర్మమును భోధించెను. హరి భక్తుని లక్షణములను, అంతరిక్షుడు మాయను దాటుటను, పిప్పలాయనుడు పరబ్రహ్మనును, అవిర్ హోత్రుడు కర్మను ద్రుమిళుడు భగవంతుని యవతారములను వారి లీలలను, చమస్ భక్తుడు కానివాడు చనిపోయిన పిమ్మట పరిస్థితిని, కరభజనుడు యుగయుగములందు భగవంతుని ఉపాసించు వేర్వేరు విధానములను సంతృప్తికరముగా బోధించిరి. వాని సారాశమేమన కలియుగములో మోక్షము పొందుట కొక్కటే మార్గము గలదు. అదేమన గురుని లేదా హరి పాదారవిందములను స్మరించుట. పారాయణ ముగించిన పిమ్మట కాకాసాహెబు నిరుత్సాహపడి శ్యామాతో నిట్లనియె. "నవనాధులు భక్తివిషయమై చెప్పినది ఎంత అధ్బుతముగా నున్నది? దాని నాచరించుట ఎంత కష్టము? నవనాధులు పూర్ణజ్ఞానులేగాని మనవంటి మూర్ఖులకు వారు వర్ణించిన భక్తిని పొందుటకు వీలగునా? అనేక జన్మలెత్తినను మనము దానిని సంపాదించలేము. అట్లయిన మనకు మోక్షము వచ్చుటెట్లు? కాబట్టి యట్టిదానిని మన మాశించరాదని తెలియుచున్నది." కాకా సాహెబు నిరుత్సాహము, నిరాశలు శ్యామా యిష్టపడలేదు. వెంటనే అతడిట్లనెను. "ఎవరయితే వారి యదృష్టవశముచే బాబా వంటి యాభరణమును పొందిరో, అట్టివారు నిరాశచెంది ఏడ్చుట విచారకరమైన సంగతే. వారికి బాబాయందు నిశ్చలమైన విశ్వాసమే యున్నచో, వారు చిరాకు చెందనేల? నవనాధుల భక్తి బలమైనదై యుండవచ్చును గాని, మనది మాత్రము ప్రేమానురాగములతో నిండియుండలేదా? హరినామస్మరణము గురునామస్మరణము మోక్షప్రదమని బాబా నొక్కిచెప్పియుండలేదా? అట్లయినచో భయమునకుగాని, ఆందోళనకుగాని యవకాశమేది?" కాకాసాహెబు శ్యామా చెప్పిన సమాధానముతో సంతుష్టి చెందలేదు. ననవాధుల భక్తిని పొందుటెట్లు? అను మనోవేదన కలిగి ఆందోళనతో చికాకుగా నుండెను. అ మరుసటి యుదయమే యీ క్రింది యద్భుతము జరిగెను.

ఆనందరావు పాఖాడే యనువాడు శ్యామాను వెదకుచు పురాణ కాలక్షేపము జరుగుచున్న స్థలమునకు వచ్చెను. కాకాసాహెబ్ భాగవతము చదువుచుండెను. పాఖాడే శ్యామాకు దగ్గరగా కూచుండి అతని చెవిలో నేమో చెప్పుచుండెను. అతడు మెల్లగా తాను కాంచిన స్వప్న దృశ్యమును శ్యామాకు చెపుచుండెను. ఇది పురాణకాలక్షేపమునకు కొంచెమాటంకము గలుగజేసెను. కాకాసాహెబు పురాణము చదువుట మాని విష్యమేమని యడిగెను. శ్యామా యిట్లు నుడివెను. "నిన్న నీ సంశయమును దెలిపితివి. దానికి సమాధానమిదిగో! బాబా పాఖాడేకు చూపిన స్వప్నదృశ్యమును వినుము." రక్షకమైన భక్తి గాక వేరేదియును దీనిని సాధించలేదు. గురుని పాదములు భక్తితో ధ్యానించిన చాలును అని బాబా నొక్కి చెప్పియున్నారు." అందరు ముఖ్యముగా కాకా సాహెబు ఆదృశ్యమును వివరముగా వినగోరిరి. వారి కోరిక ప్రకారము పాఖాడే యా దృశ్యమును ఈ క్రింది విధముగ చెప్ప నారంభించెను.

లోతైన సముద్రములో నడుమువరకు దిగి యచ్చట నిలచితిని. హఠాత్తుగా నచట సాయిబాబాను చూచితిని. రత్నములు తాపిన చక్కని సింహాసనముపై బాబా కూర్చునియుండెను. వారి పాదములు నీటిలో నుండెను. బాబా స్వరూపమును జూచి మిగుల ఆనందించితిని. అది నిజమువలె నుండెనే కాని స్వప్నమువలె గానరాకుండెను. దానిని నేను స్వప్నమని యనుకొనలేదు. మాధవరావు కూడ అచ్చట నిలచి యుండెను. శ్యామా "ఆనందరావు! బాబా పాదములపై బడుము" అని సలహా నిచ్చెను. "నాకు కూడ నమస్కరించవలెననియే యున్నది, కాని వారి పాదములు నీటిలో నున్నవి. కనుక నా శిరస్సును వారి పాదములపై నెట్లుంచగలను? నేను నిస్సహాయుడను" అని నేనంటిని. అది విని యతడు బాబాతో నిట్లనెను. "ఓ దేవా! నీటిలో నున్న నీ పాదములను బయటకు దీయుము." వెంటనే బాబా తమ పాదములను బయటకు తీసెను. క్షణమైన ఆలస్యము చేయక నేను వారి పాదములకు మ్రొక్కి తిని. దీనిని జూచి బాబా నన్ను దీవించి యిట్లనెను. "ఇక పొమ్ము. నీవు క్షేమమును పొందెదవు. భయమునకు గాని ఆందోళనకు గాని కారణము లేదు. శ్యామాకు పట్టుపంచె యొకటి దానము చేయుము. దానివల్ల మేలు పొందెదవు."

బాబా యాజ్ఞానుసారము పాఖాడే పట్టుదోవతిని తెచ్చెను. మాధవ రావు కివ్వవలసినదని కాకాసాహెబును వేడెను. శ్యామా యందులకొప్పుకొనలేదు. ఏలన బాబా తనకు అట్టి సలహా నివ్వలేదు కనుక. కొంతవాదము జరిగిన పిమ్మట కాకాసాహెబు చీట్లు వేసి తెలిసికొనుటకు సమ్మతించెను. సంశయవిషయములందు చీటివేసి సంశయమును దీర్చుకొనుట కాకాసాహెబు స్వభావము. "పుచ్చుకొనుము" "నిరాకరించుము" అను రెండు చీటీలు వ్రాసి బాబా పాదుకలవద్ద బెట్టిరి. ఒక బాలునితో అందులో నొకదానిని తీయించిరి. "పుచ్చుకొనుము" అను చీటీ ఎంచుటచే మాధవరావుకు దోవతి ఇచ్చిరి. దానిని శ్యామా యంగీకరించెను. ఇద్దరును సంతుష్టి చెందిరి. కాకాసాహెబు సంశయము తీరెను.

ఇతర యోగుల మాటలను కూడ గౌరవించవలసినదని యీ కధ బోధించుచున్నది. కాని మన తల్లియగు గురువునందు పూర్ణమైన భక్తి విశ్వాసము లుండవలెను. వారి బోధల ప్రకారము నడువవలెను. ఎందుకనగా మన కష్టసుఖములితరులకంటె వారికే బాగా తెలిసి యుండును. నీహృదయఫలకమందు బాబా చెప్పిన ఈ దిగువ పలుకులను చెక్కుము. ఈ లోకములో ననేకమంది యోగులు గలరు. కాని, మనము మన గురువుయొక్క పలుకులను మరువరాదు. వేయేల, హృదయపూర్వకముగ నీ గురువును ప్రేమించుము. వారిని సర్వస్యశరణాగతి వేడుము. భక్తితో వారి పాదములకు మ్రొక్కుము. అట్లు చేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్లు, నీవు దాటలేని భవసాగరము లేదు.

కర్రబల్ల మంచము బాబాదే, మహాళ్సాపతిది కాదు

బాబా శిరిడీకి చేరిన కొద్ది కాలమునకే 4 మూరల పొడవు, ఒక జానెడు వెడల్పుగల కర్రబల్ల మీద నాలుగు చివరలకు నాలుగు దీపపు ప్రమిదలు పెట్టి దానిపై పండుకొనువారు. కొన్నాళ్ళు గడచిన పిమ్మట బాబా దానిని విరిచి ముక్కలు చేసి పారవేసెను. ఒకనాడు బాబా దాని మహిమను కాకాసాహెబుకు వర్ణించి చెప్పుచుండెను. ఇది విని యతడు బాబా కిట్లనియె. "మీ కింకను కర్రబల్ల యందు మక్కువ యున్నచో నింకొక బల్ల మీకొరకు మసీదులో వ్రేలాడ వేసెదను. దానిపై మీరు సుఖముగ నిద్రించవచ్చును." అందుకు బాబా ఇట్లనెను. "మహాళ్సాపతిని దిగువ విడిచి నేనొక్కడనే పైన పండుకొనుట కిష్టము లేదు." కాకా సాహెబు ఇట్లనెను. "మహాళ్సాపతికొరకింకొక బల్లను తయారు చేయుంచెదను," బాబా "అతడెట్లు బల్లపై పరుండగలడు, బల్లమీద అంత ఎత్తున పండుకొనుట సులభమయిన పని కాదు. ఎవరు మిక్కిలి పుణ్యవంతులో వారే పండుకొనగలరు. ఎవరయితే కండ్లు దెరచి నిద్రించగలరో వారికే యది వీలగును. నేను నిద్రపోవునపుడు, మహాళ్సాపతిని నా ప్రక్కన కూర్చుండి తన చేయి నా హృదయముపై నుంచుమనెదను. అచ్చటినుంచి వచ్చు భగవన్నామస్మరణమును వినుమమెదను. నేను పండుకొనినచో నన్ను లేవగొట్టుమనెదను. దీనినే యతడు నేరవేర్చలేకున్నాడు. నిద్రతో కునుకుపాట్లు పడుచుండును. నా హృదయముపై వాని చేతిబరువును గమనించి, ఓ భక్తా! అని పిలచెదను. వెంటనే కండ్లు తెరచి కదలును. ఎవడయితే నేలపై చక్కగా నిద్రించలేడో, ఎవడు కదలకుండ యుండలేడో, ఎవడు నిద్రకు సేవకుడో, వాడు ఎత్తైన బల్లమీద నెట్లు పండుకొనగలడు?" అనెను. అనేక పర్యాయములు బాబా తన భక్తులయందు ప్రేమచే నిట్లనెను. "మంచిగాని, చెడ్డగాని, ఏది మనదో యది మనదగ్గర నున్నది. ఏది ఇతరులదో, యది యితరులవద్ద నున్నది."

ఓం నమో శ్రీ సాయినాధాయ!

శాంతిః శాంతిః శాంతిః

నలుబది ఐదవ అధ్యాయము సంపూర్ణము.