శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము - పి.నారాయణరావు Back   Home 

నలుబదియారవ అధ్యాయము

బాబా గయ వెళుట - రెండు మేకల కధ

ఈ అధ్యాయములో శ్యామా కాశి, గయ, ప్రయాగ యాత్రలకు వెళ్ళుట, బాబా ఫోటోరూపమున అతనికంటె ముందు వెళ్ళుట చెప్పెదము. బాబా రెండు మేకల పూర్వజన్మవృత్తాంతమును జ్ఞప్తికి దెచ్చుట కూడ చెప్పుకొందము.

తొలిపలుకు

ఓ సాయి! నీ పాదములు పవిత్రములయినవి. నిన్ను జ్ఞప్తియందుంచుకొనుట మిగుల పావనము. కర్మబంధములనుండి తప్పించు నీ దర్శనము కూడ మిక్కిలి పావనమయినది. ప్రస్తుతము నీ రూపమగోచరమయినప్పటికి, భక్తులు నీయందే నమ్మక ముంచినచో, వారు నీవు సమాధి చెందకముందు చేసిన లీలలను అనుభవించెదరు. నీవు కంటి కగపడని చిత్రమైన దారముతో నీ భక్తులను దగ్గరనుండిగాని ఎంతో దూరమునుండిగాని యీడ్చెదవు. వారిని దయగల తల్లివలె కౌగలించుకొనెదవు. నీవెక్కడున్నావో నీ భక్తులకు దెలియదు. కాని నీవు చతురతతో తీగలను లాగుటచే వారి వెనుకనే నిలబడి తోడ్పడుచున్నావని తుట్టతుదకు గ్రహించెదరు. బుద్ధిమంతులు, జ్ఞానులు, పండితులు అహంకారముచే సంసారమనే గోతిలో పడెదరు. కాని నీవు నీ శక్తివలన నిరాడంబర భక్తుల రక్షించెదవు. అంతరికముగను, అదృశ్యముగను ఆటంతయు నాడెదవు. కాని దానితో నీకెట్టి సంబంధము లేనట్లు గనిపించెదవు. నీవే పనులన్నియును నెరవేర్చుచున్నప్పటికి ఏమియు చేయనివానివలె నటించెదవు. నీ జీవితము నెవరు తెలియజాలరు. కాబట్టి మేము పాపముల నుండి విముక్తి పొందుట ఎట్లన - శరీరమును, వాక్కును, మనస్సును నీ పాదములకు సమర్పించి నీ నామమునే జపించవలెను. నీ భక్తుల కోరిక లను నీవు నెరవేర్చెదవు. ఎవరికయితే కోరికలుండవో అట్టివారికి నీవు బ్రహ్మానందము నిచ్చెదవు. నీ మధురమగు నామము జపించుటయే భక్తులకు సులభసాధనము. ఈ సాధనవల్ల మన పాపములు, రజస్తమోగుణములు నిష్క్రమించును. సాత్వికగుణములు ధార్మికత్వము ప్రాముఖ్యము వహించును. దీనితో నిత్యానిత్యములకు గల భేదము నిర్వ్యామోహము, జ్ఞానము లభించును. మనమట్టి సమయమందు గురువునే యనగా నాత్మనేయనుసంధానము చేసెదము. ఇదియే గురువునకు సర్వస్యశరణాగతి. దీనికి తప్పనిసరి యొకే గుర్తు - మన మనస్సు నిశ్చలము శాంతమునగుట. ఈ శరణాగతి గొప్పదనము, భక్తి, జ్ఞానములు, విశిష్టమైనవి. ఎందుకన శాంతి, అభిమానరాహిత్యము, కీర్తి, తదుపరి మోక్షము, ఒకటి వెనుక నింకొకటి వెన్నంటి వచ్చును.

ఒకవేళ బాబా ఎవరైన భక్తుని ఆమోదించినచో రాత్రింబవళ్ళు అతని చెంతనే యుండి, యింటి వద్దనుగాని దూరదేశమునగాని వానిని వెంబడించుచుండును. భక్తుడు తన యిష్టము వచ్చిన చోటునకు పోనిమ్ము. బాబా అచ్చటకు భక్తునికంటే ముందుగా బోయి ఏదో ఒక ఊహించరాని రూపమున నుండును. ఈ దిగువకధ దీనికి ఉదాహరణము.

గయ యాత్ర

బాబాతో పరిచయము కలిగిన కొన్నాళ్ళ తరువాత కాకా సాహెబు తన పెద్ద కుమారుడు బాబు ఉపనయనము నాగపూరులో చేయ నిశ్చయించెను. సుమారదే సమయమందు నానాసాహెబు చాందోర్కరు తన పెద్ద కుమారుని వివాహము గ్వాలియర్ లో చేయ నిశ్చయించుకొనెను. కాకాసాహెబు, నానాసాహెబు చాందోర్కరును, శిరిడీకి వచ్చి బాబాను ప్రేమతో ఆ శుభకార్యములకు ఆహ్వానించిరి. శ్యామాను తన ప్రతినిధిగా దీసికొని వెళ్ళుడని బాబా నుడివెను. తామే స్వయముగా రావలసినదని బలవంతపెట్టగా బాబా వారికి శ్యామాను దీసుకొని పోవలసినదనియు "కాశీ ప్రయాగ యాత్రలు ముగియుసరికి నేను శ్యామా కంటే ముందుగనే గయలో కలిసికొనెద" నని చెప్పెను. ఈ మాటలు గుర్తుంచుకొనవలెను. ఏలన అవి బాబా సర్వవ్యాపియని నిరూపించును.

బాబా సెలవు పుచ్చుకొని, శ్యామా నాగపూరు గ్వాలియరు పోవనిశ్చయించెను. అచటినుండి కాశీ, ప్రయాగ, గయ పోవలెననుకొనెను. అప్పాకోతే యతని వెంట బోవ నిశ్చయించెను. వారిరువురు మొట్టమొదట నాగపూరులో జరుగు ఉపనయనమునకు బోయిరి. కాకాసాహెబు దీక్షిత్ శ్యామాకు 200 రూపాయలు ఖర్చుల నిమిత్తము కానుక నిచ్చెను. అచ్చటి నుండి గ్వాలియర్ పెండ్లికి బోయిరి. అచ్చట నానాసాహెబు చాందోర్కరు శ్యామాకు 100 రూపాయలును, అతని బంధువగు జధార్ 100 రూపాయలును ఇచ్చిరి. అక్కడినుండీ శ్యామా కాశీకి వెళ్ళెను. అచ్చట జధారు యొక్క అందమైన లక్షీనారాయణ మందిరములో అతనికి గొప్ప సత్కారము జరిగెను. అచ్చటినుండి శ్యామా అయోధ్యకు పోయెను. అచ్చట జధారు మేనేజరు శ్రీ రామమందిరమున ఆహ్వానించి మర్యాద చేసెను. వారు అయోధ్యలో 21 రోజులుండిరి. కాశీలో రెండు మాసములుండిరి. అక్కడనుంచి గయకు పోయిరి. రైలుబండిలో గయలో ప్లేగు గలదని విని కొంచెము చీకాకు పడిరి. రాత్రి గయ స్టేషనులో దిగి ధర్మశాలలో బసచేసిరి. ఉదయమే గయ పండా వచ్చి యిట్లనెను. "యాత్రికులందరు బయలుదేరుచున్నారు. మీరు కూడ త్వరపడుడు." "అచ్చట ప్లేగు గలదా?" యని శ్యామా ప్రశ్నించెను. లేదని పండా జవాబు నిచ్చెను. మీరే స్వయముగా వచ్చి చూచుకొనుడనెను. అప్పుడు వారు అతని వెంట వెళ్ళి పండా ఇంటిలో దిగిరి. ఆ యిల్లు చాల పెద్దది. పండా ఇచ్చిన బసకు శ్యామా చాల సంతుష్టి చెందెను. అచ్చట గల బాబా యొక్క అందమైన పెద్దపటము అతనికి అన్నిటికంటే ఎక్కువ ప్రీతిని కలుగజేసెను. అది ఇంటికి ముందు భాగములో మధ్య నమర్చబడియుండెను. దీనిని చూచి శ్యామా మైమరచెను. "కాశీ ప్రయాగ యాత్రలు ముగియుసరికి నేను శ్యామాకంటే ముందుగనే గయకు బోయెదను" అను బాబా పలుకులను జ్ఞప్తికి దెచ్చుకొనెను. కండ్ల నీరు గ్రమ్మెను, శరీరము గగుర్పొడిచెను, గొంతుక యార్చుకొని పోయెను. అతడు వెక్కి వెక్కి ఏడ్వసాగెను. ఆ పట్టణములో ప్లేగుజాడ్యము గలదని భయపడి ఏడ్చుచున్నాడేమో యని పండా యనుకొనెను. పండాను బాబా పటమెక్కడనుండి తెచ్చితివని శ్యామా యడిగెను. పండా తన ప్రతినిధులు రెండుమూడువందల మంది మన్మాడులోను, పుణతాంబేలోను గలరనియు, వారు గయకు పోయేయాత్రికుల మంచిచెడ్డల చూచెదరనియు, వారివల్ల బాబా కీర్తి విని బాబా దర్శనము 12 ఏండ్ల క్రిందట చేసితిననియు చెప్పెను. శిరిడీలో శ్యామా యింటిలో వ్రేలాడుచున్న బాబా పటమును జూచి దానినిమ్మని కోరితిననియు బాబా యనుజ్ఞపొంది శ్యామా దానిని తనకిచ్చెననియు చెప్పెను. శ్యామా పూర్వము జరిగిన దంతయు జ్ఞప్తికి దెచ్చుకొనెను. పూర్వము తనకు పటము నిచ్చిన శ్యామాయే ప్రస్తుతము తన యింట నతిధిగా నుండుట గ్రహించి పండా మిక్కిలి యానందించెను. వారిరువురు ప్రేమానురాగములనుభవించి యమితానందమును పొందిరి. శ్యామాకు పండా చక్కని రాజలాంచనములతోడి స్వాగతమిచ్చెను. పండా ధనవంతుడు. అతడొక పల్లకీలో కూర్చుండి శ్యామాను ఏనుగు పైన కూర్చుండబెట్టి ఊరేగించెను. అతిధికి తగిన సౌఖ్యములన్నియు ఏర్పరచెను.

ఈ కధవల్ల నేర్చుకొనవలసిన నీతి :- బాబా మాటలు అక్షరాలా సత్యములనియు బాబాకు తన భక్తులందుగల ప్రేమ యమితమనియు తెలియుచున్నది. ఇదియేగాక, వారికి జంతువులయందు కూడ సమాన ప్రేమ యుండెను. వారు వానిలో నొకరుగా భావించెడివారు. ఈ దిగువ కధ దీనిని వెల్లడించును.

రెండు మేకల కధ

ఒకనాడుదయము బాబా లెండితోటనుండి తిరిగి వచ్చుచుండెను. మార్గమున మేకలమందను జూచెను. అందులో రెండు మేకల మీద బాబా దృష్టిపడెను. బాబా వానిని సమీపించి ప్రేమతో తాకి లాలించి వానిని 32 రూపాయలకు కొనెను. బాబా వైఖరిని జూచి భక్తులు ఆశ్చర్యపడిరి. బాబా మిగుల మోసపోయెనని వారనుకొనిరి. ఎందుచేతననగా నొక్కొక్కమేకను 2 గాని, 3 గాని 4 గాని రూపాయలకు కొనవచ్చును. రెండు మేకలును 8 రూపాయలకు హెచ్చు కాదనిరి. బాబాను నిందించిరి. బాబా నెమ్మదిగా నూరకొనెను. శ్యామా, తాత్యాకోతే బాబాను సమాధానము వేడగా బాబా "నాకు ఇల్లుగాని, కుటుంబముగాని లేకుండుట చేత నేను ధనము నిలువ చేయరాదు." అనిరి. మరియు బాబా తమ ఖర్చుతోనే 4 సేర్ల శనగపప్పును కొని వానికి పెట్టుమని చెప్పెను. పిదప ఆ మేకలను వాని యజమానికి తిరిగి యిచ్చివేసెను. వాని పూర్వ వృత్తాంతమును ఈ రీతిగా చెప్పెను.

"ఓ శ్యామా! తాత్యా! మీరీ బేరములో నేను మోసపోయితినని యనుకొనుచున్నారు. అట్లు కాదు, వానికధ వినుడు. గతజన్మలో వారు మానవులు. వారి యదృష్టము కొలది నా జతగాండ్రుగా నుండెడివారు. వారొకే తల్లిబిడ్డలు. మొదట వారికి నొకరిపై నొకరికి ప్రేమ యుండెను. రానురాను శత్రువులైరి. పెద్దవాడు సోమరి గాని, చిన్నవాడు చురుకైన వాడు. అతడు చాల ధనము సంపాదించెను. పెద్దవాడు అసూయ చెంది చిన్నవానిని చంపి వాని ద్రవ్యము నపహరింప నెంచెను. తమ సోదరత్వమును మరచి వారిద్దరు కలహించిరి. అన్న తమ్ముని జంపుటకు పెక్కు పన్నుగడలను పన్నెను, కాని నిష్పృయోజనములయ్యెను. ఇద్దరు బద్ధవైరులయిరి. ఒకనాడు అన్న తన సోదరుని బడితెతో కొట్టెను. చిన్నవాడు అన్నను గొడ్డలితో నరకెను. ఇద్దరదే స్థలమున చచ్చిపడిరి. వారి కర్మఫలముచే మేకలుగా పుట్టిరి. నా ప్రక్కనుండీ పోవుచుండగా వారిని ఆనవాలు పట్టితిని. వారి పూర్వ వృత్తాంతమును జ్ఞప్తికి దెచ్చుకొంటిని. వారియందు కనికరించి వారికి తిండి పెట్టి, కొంత విశ్రాంతి కలుగజేసి యోదార్చవలెనని యనుకొంటిని. అందుచే నింతద్రవ్యమును వ్యయపరచితిని. అందులకు మీరు నన్ను దూషించుచున్నారా? నా బేరము మీరిష్టపడకుండుటచే నేను వాని యజమానివద్దకు తిరిగి పంపివేసితిని." మేకలపైని కూడ బాబా ప్రేమ ఎట్టిదో చూడుడు.

ఓం నమో శ్రీ సాయినాధాయ

శాంతిః శాంతిః శాంతిః

నలుబదియారవ అధ్యాయము సంపూర్ణము.