శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము - పి.నారాయణరావు Back   Home 

నలుబదితొమ్మిదవ అధ్యాయము

1.హరి కానోబా, 2.సోమదేవ స్వామి, 3.నానాసాహెబు చాందోర్కరు - కధలు.

తొలిపలుకు

వేదములు, పురాణములు బ్రహ్మమును లేదా సద్గురువును సరిగా పొగడలేవు. అట్లయినప్పుడు మా వంటి మూర్ఖులు సద్గురువగు సాయి బాబాను ఎట్లు వర్ణించగలరు? ఈ విషయములో మాట్లాడక ఊరకొనుటయే మేలని తోచుచున్నది. మౌనవ్రతమును పూనుటయే సద్గురుని స్తుతించుటకు తగిన మార్గమని తోచును. కాని సాయిబాబా సుగుణములను జూచినచో మా వ్రతమును మరచి మమ్ములను మాట్లాడునట్లు ప్రేరేపించును. మన స్నేహితులుగాని, బంధువులుగాని మనతో లేకున్నచో, మంచి పిండివంటలు కూడ రుచింపవు. కాని వారు మనతో నున్నచో ఆ పిండివంటలు మరింత రుచికరములగును. సాయిలీలామృతము కూడ అట్టిదే. దీనిని మనమొంటరిగా తినలేము, స్నేహితులు, బంధువులు కలసినచో చాల బాగుగా నుండును.

ఈ కధలను సాయిబాబా ప్రేరేపించి వారి యిష్టానుసారము మాచే వ్రాయించెదరు. వారికి సర్వస్యశరణాగతి యొనర్చి వారి యందే ధ్యానము నిలుపుట మా కర్తవ్యము. తీర్థయాత్ర, వ్రతము, త్యాగము, దానములకంటె తపస్సు చేయుట గొప్ప. హరిని పూజించుట, తపస్సు కంటె మేలు. సద్గురుని ధ్యానించుట యన్నిటికంటె మేలయినది. కాబట్టి మనము సాయినామమును నోటితో పలుకుచు వారి పలుకులను మననము చేయుచు, వారి యాకారమును మనస్సున భావించుకొనుచు, వారిపై హృదయపూర్వకమగు ప్రేమతో, వారికొరకే సమస్త కార్యక్రమములను చేయుచుండవలెను. సంసారబంధమునుండి తప్పించుకొనుటకు దీనికి మించిన సాధనము లేదు. పైన వివరింపబడిన ప్రకారము మన కర్తవ్యమును మనము చేయగలిగినచో, సాయి తప్పనిసరిగ మనకు సహాయము చేయును. తుదకు మోక్షము నిచ్చును. ఇక నీ యధ్యాయము లోని కధలవైపు మరలుదము.

హరికానోబా

హరి కానోబా యను బొంబాయి పెద్దమనుష్యుడొకడు తన స్నేహితులవల్ల, బంధువులవల్ల బాబా లీల లనేకములు వినెను. కాని నమ్మలేదు. కారణమేమన అతనిది సంశయస్వభావము. బాబాను స్వయముగా పరీక్షించవలెనని యతని కోరిక. కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు శిరిడీకి వచ్చెను. అతని తలపై జలతారుపాగ యుండెను. అతని పాదములకు కొత్తచెప్పులుండెను. కొంతదూరము నుండి బాబాను చూచి బాబా వద్దకు బోయి సాష్టాంగనమస్కారము చేయవలె ననుకొనెను. క్రొత్త చెప్పులెచ్చట నుంచవలెనో అతనికి తెలియలేదు. చెప్పులు మసీదు ముందొక మూలన బెట్టి బాబా దర్శనమునకు బోయెను. బాబాకు భక్తిపూర్వకమైన నమస్కారము చేసి, ఊదీని, ప్రసాదమును బాబాచేతి నుండి యందుకొని తిరిగివచ్చెను. మూలకుపోయి చూచుసరికి చెప్పులు కనిపించలేదు. చెప్పులకొరకు వెదకెను కాని నిష్పృయోజనమయ్యెను. చాల చీకాకు పడుచు బసకు వచ్చెను.

అతడు స్నానము చేసి, పూజ చేసి, నైవేద్యము పెట్టి భోజనము నకు కూర్చుండెను. కాని, తన చెప్పుల గూర్చియే చింతించుచుండెను. భోజనాంతరము, చేతులు కడుగుకొనుటకు బయటకు వచ్చెను. ఒక మరాఠీ కుర్రవాడు తనవైపు వచ్చుట చూచెను. ఆ కుర్రవాని చేతిలో నొక కర్ర యుండెను. దాని చివరకు క్రొత్త చెప్పులజత వ్రేలాడుచుండెను. చేతులు కడుగుకొనుటకు బయటకు వచ్చినవారితో అతడు బాబా తనను బంపెననియు, వీధిలో "హరీకా బేటా, జరీకా పేటా" యని యరచుమనియు చెప్పెననెను. ఎవరయిన ఆ చెప్పులు తమవే యన్నచో నతని పేరు హరి యనియు, నతడు కానోబా కొడుకనియు, అతని తలపై జరీపాగా గలదా యను సంగతి పరీక్షించిన తరువాత చెప్పుల నిచ్చివేయుమని చెప్పెననెను. ఈ కుర్రవాడిట్లు చెప్పుట విని, హరి కానోబా యాశ్చర్యానందములు పొందెను. కుర్రవాని వద్దకు బోయి చెప్పులు తన వని రూఢి చేసెను. అతడు తన పేరు హరి యనియు, తాను కానోబా కుమారుడననియు తన తలపై ధరించు జరీపాగాను చూపెను. ఆ కుర్రవాడు సంతృప్తిజెంది చెప్పుల నిచ్చెవేసెను. హరి కానోబా మిక్కిలి యాశ్చర్యపడెను. తన జల్తారుపాగ యందరికి కనిపించవచ్చునుగాని, తన పేరు, తన తండ్రిపేరు బాబా కెట్లు దెలిసెను? అదియే శిరిడీకి మొదటి సారి తన రాక. అతడచ్చటకు బాబాను పరీక్షించుటకే వచ్చెను. ఈ విషయమువల్ల నాతడు బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించెను. అతనికి కావలసినది బాబాను పరీక్షించుట, అది పూర్తిగ నెరవేరెను, సంతోషముతో నింటికి పోయెను.

సోమదేవస్వామి

బాబాను పరీక్షించుటకై యింకొకరు వచ్చిరి. వారి కధను వినుడు. కాకాసాహెబు దీక్షిత్ తమ్ముడు భాయీజీ నాగపూర్లో నివసించుచుండెను. 1906 వ సంవత్సరములో హిమాలయమునకు బోయినపుడు సోమదేవ స్వామి యను సాధువుతో అతనికి పరిచయము కలిగెను. ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తరకాశీ కి చెందినవారు. వారి మఠము హరి ద్వారములో గలదు. ఇద్దరు పరస్పరము తమ చిరునామాలు వ్రాసికొనిరి. 5 సంవత్సరముల పిమ్మట సోమదేవస్వామి నాగపూరు వచ్చి భాయీజీ యింట్లో దిగెను. బాబా లీలలను విని సంతసించెను. శిరిడీకి పోయి బాబాను చూడవలెనని అతనికి గట్టి కోరిక గలిగెను. భాయీజీ వద్దనుంచి పరిచయము ఉత్తరమును దీసికొని శిరిడీకి పోయెను. మన్మాడు, కోపరగాం దాటిన పిమ్మట టాంగా చేసికొని శిరిడీకి పోవుచుండెను. శిరిడీ సమీపమునకు రాగా మసీదుపై రెండు పెద్ద జండాలు కనిపించెను. సాధారణముగా యోగులు వేర్వేరు వైఖరులతోను, వేర్వేరు జీవనపద్ధతులతోను, వేర్వేరు బాహ్యాలంకారములతోను ఉందురు. కాని యీ పై పై గుర్తులనుబట్టి ఇదంతయు వేరే పంధాగా దోచెను. రెండు పతాకములెగురుట చూడగనే తానిట్లనుకొనెను. "ఈ యోగి జందాలయందేల మక్కువ జూపవలెను? అది యోగికి తగినది కాదు. దీనిని బట్టి ఈ యోగి కీర్తి కొరకు పాటుపడుచున్నట్లు తోచుచున్నది." యనుకొనెను. ఇట్లు ఆలోచించుకొని, శిరిడీకి పోవుట మానుకొన నిశ్చయించినట్లు తనతోనున్న యితర యాత్రికులకు జెప్పెను. వారతనితో నిట్లనిరి. "అట్లయిన ఇంత దూరము వచ్చితివేల? జండాలను చూచినంతలో నీ మనస్సు చికాకు పడినచో, శిరిడీలో రధము, పల్లకి, గుర్రము మొదలగు బాహ్యాలంకారములు చూచినచో మరెంత చికాకు పొందెదవు?" సోమదేవస్వామి గాభరాపడి యిట్లనెను. "గుర్రములతోను, పల్లకీతోను, జట్కాలతోను గల సాధువులను నేనెచ్చట జూచి యుండలేదు. అట్టి సాధువులను చూచుటకంటె తిరిగిపోవుటయే మేలు" అనెను. ఇట్లనుచు తిరుగు ప్రయాణమునకు సిద్ధమయ్యెను. తక్కిన తోడి ప్రయాణికులు అతనికి తన ప్రయత్నమును మాని శిరిడీ లోనికి బొమ్మనిరి. అట్టి వక్రాలోచనను మానుమనిరి. బాబా యా జండా లను కాని తక్కిన వస్తువులనుగాని ఆడంబరములను గాని కీర్తినిగాని లక్ష్యపెట్టనివారని చెప్పిరి. అవన్నియు నలంకరించినవారు బాబా భక్తులేగాని ఆయనకేమి యవసరముగాని సంబంధముగాని లేదనిరి. వారి భక్తి ప్రేమలకొలది వారు వాటిని కూర్చిరని చెప్పిరి. తుట్టతుదకు ప్రయాణము సాగించి శిరిడీకి పోయి సాయిబాబాను చూచునట్లు జేసిరి. సోమదేవస్వామి మసీదు దిగువనుంచి బాబాను దర్శించగనే అతని మనస్సు కరగెను. అతని కండ్లు నీటితో నిండెను; గొంతుక యార్చుకొని పోయెను. అతని కుంటి యాలోచనలన్నియు నడుగంటి పోయెను. "ఎచ్చట మనస్సు శాంతించి యానందమును పొంది యాకర్షింపబడునో అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము" అని తన గురువు చెప్పినదానిని జ్ఞప్తికి దెచ్చుకొనెను. అతడు బాబా పాదధూళిలో దొర్లుటకు తహతహలాడెను. బాబా దర్శనముకొరకు దగ్గరకు పోగా "మా వేషము మా దగ్గరనేయుండనీ, నీ యింటికి నీవు పొమ్ము. తిరిగి మసీదుకు రావద్దు. ఎవరయితే మసీదుపై జండా నెగురవైచుచున్నారో యట్టివారి దర్శనము చేయనేల? ఇది యోగి లక్షణమా? ఇక్కడొక నిమిషమయిన ఉండవద్దు" అనెను. ఆ స్వామి మిగుల యాశ్చర్యపడెను. బాబా తన మనస్సును గ్రహించి బయటికి ప్రకటించుచున్నాడని తెలిసికొనెను. అతడెంత సర్వజ్ఞుడు! తాను తెలివితక్కువవాడనియు బాబా మహానుభావుడనియు గ్రహించెను. బాబా కొందరిని కౌగిలించుకొనుట, కొందరిని యాశీర్వదించుట, కొందరిని యోదార్చుట, కొందరివైపు దాక్షిణ్యముతో జూచుట, కొందరివైపు చూచి నవ్వుట, ఊదీ ప్రసాదమును కొందరి కిచ్చుట, యిట్లు అందరిని ఆనందింపజేసి, సంతృప్తి పరచుట జూచి తన నొక్కరినే యేల యంత కఠినముగ జూచుచుండెనో అతనికి తెలియకుండెను. తీక్షణముగా నాలోచించి బాబా చేయునదంతయు తన యంతరంగమున నున్నదానితో సరిగా నుండెనని గ్రహించెను. దానివల్ల పాఠము నేర్చుకొని వృద్ధిపొందుటకు యత్నింపవెలని గ్రహించెను. బాబా కోపముమారురూపములో నున్న యాశీర్వాదమే యనుకొనెను. కొన్నాళ్ళ పిమ్మట బాబా యందు అతనికి నమ్మకము బలపడెను. అతడూ బాబాకు గొప్ప భక్తుడయ్యెను.

నానాసాహెబు చాందోర్కరు

ఈ యధ్యాయమును హేమాడ్ పంతు నానాసాహెబు చాందోర్కరు కధతో ముగించెను. ఒకనాడు నానాసాహెబు మసీదులో మహాళ్సాపతి మొదలగువారితో కూర్చొని యుండగా బీజాపూరునుండి ఒక మహమ్మదీయుడు కుటుంబముతో బాబాను జూచుటకు వచ్చెను. అతనితో గోషా స్త్రీలుండుటచే నానాసాహెబు అచ్చటనుంచి లేవనెంచెను. కాని బాబా యాతని నివారించెను. స్త్రీలు వచ్చి బాబా దర్శనము చేసికొనిరి. అందులో నొక స్త్రీ ముసుగు దీసి బాబా పాదములకు నమస్కరించి తిరిగి ముసుగు వేసికొనెను. నానా సాహెబు ఆమె ముఖసౌందర్యమును చూచి మరల మరల చూడగోరెను. నానా యొక్క చాంచల్యమును జూచి, స్త్రీలు వెళ్ళి పోయిన పిమ్మట, బాబా నానాతో నిట్లనెను. "నానా! అనవసరముగా చీకాకు పడుచుంటి వేల? ఇంద్రియములను వాని పనులను జేయనిమ్ము. వానిలో మనము జోక్యము కలుగజేసికొన గూడదు. దేవుడు ఈ సుందరమైన ప్రపంచమును సృష్టించియున్నాడు గాన అందరిని చూచి సంతసించుట మన విధి. క్రమముగాను, మెల్లగాను మనస్సు స్థిరపడి శాంతించును. ముందు ద్వారము తెరచియుండగా, వెనుక ద్వారము గుండా పోనేల? మన హృదయము స్వచ్ఛముగ నున్నంతవరకు నేమియు దోషము లేదు. మనలో చెడ్డ యాలోచన లేనప్పుడితరులకు భయపడ నేల? నేత్రములు వానిపని యవి నేరవేర్చుకొనవచ్చును. నీవు సిగ్గుపడి బెదరనేల?"

శ్యామా యచ్చటనే యుండెను. కాని బాబా చెప్పినదానిని గ్రహించలేక పోయెను. ఇంటికి పోవు దారిలో శ్యామా ఆ విష్యమై నానా నడిగెను. ఆ చక్కని స్త్రీ వైపు జూచి తాను పొందిన యా చంచలత్వమును గూర్చి నానా చెప్పెను. బాబా దానిని గ్రహించి ఎట్లు సలహా నిచ్చెనో వివరించెను. బాబా చెప్పిన దాని భావము నానా యిట్లు చెప్ప దొడంగెను. "మనస్సు సహజముగా చంచలమైనది. దానిని ఉద్రేకించునట్లు చేయరాదు. ఇంద్రియములు చలింపవచ్చును. శరీరమును స్వాధీనమునందుంచుకొనవలెను. దాని యోరిమి పోవునట్లు చేయరాదు. ఇంద్రియములు విషయములవైపు పరుగెత్తును. కాని, మనము వానివెంట పోరాదు. మనము ఆ విష్యములను కోరగూడదు. క్రమముగాను, నెమ్మదిగాను, సాధన చేయుటవలన చంచలత్వమును జయించవచ్చును. ఇంద్రియములకు మనము లోబడకూడదు. కాని వానిని మనము పూర్తిగ స్వాధీనమందుంచుకొనలేము. సమయానుకూలముగ వాని నణచి సరిగా నుంచుకొంచుండవలెను. నేత్రములందమైన వానిని జూచుటకొరకే యివ్వబడినవి. విషయముల సౌందర్యమును నిర్భయముగా చూడవచ్చును. భయమునకు గాని, లజ్జకు గాని యవకాశము లేదు. దురాలోచనలు మనస్సునందుంచుకొనరాదు. మనస్సున ఎట్టి కోరికయు లేక భగవంతుని సుందరమైన సృస్టిని చూడుము. ఈ విధముగ నింద్రియములను సులభముగాను, సహజముగాను స్వాధీనము చేసికొనవచ్చును. విషయములనుభవించుటలో కూడ నీవు భగవంతుని జ్ఞప్తియందుంచుకొనెదవు. బాహ్యేంద్రియముల మాత్రము స్వాధీనమందుంచుకొని మనస్సును విషయములవైపు పరుగిడనిచ్చినచో, వానిపై అభిమాన ముండనిచ్చినచో, చావుపుట్టుకల చక్రము నశింపదు. ఇంద్రియవిషయములు హానికరమయినవి. వివేకము (అనగా నిత్యానిత్యములకు భేదమును గ్రహించుటను) సారధిగా, మనస్సును స్వాధీనమందుంచుకొనవలెను. ఇంద్రియముల నిచ్చ వచ్చినట్లు సంచరింపజేయరాదు. అటువంటి సారధితో విష్ణుపదమును చేరగలము. అదియే మన గమ్యస్థానము. అదియే మన నిజమైన యావాసము. అచటనుండి తిరిగి వచ్చుటలేదు.

ఓం నమో శ్రీ సాయినాధాయ

శాంతిః శాంతిః శాంతిః

నలుబదితొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము.