శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము - పి.నారాయణరావు Back   Home 

అయిదవ అధ్యాయము

చాంద్ పాటీలు పెండ్లి వారితో కలసి బాబా తిరిగి శిరిడీ రాక; సాయీయని స్వాగతము; ఇతరయోగులతో సహవాసము; పాదుగల చరిత్ర; మొహియుద్దీన్ తో కుస్తీ; జీవితములో మార్పు; నీళ్ళను నూనెగా మార్చుట; జౌహర్ ఆలీ యను కపటగురువు

పెండ్లివారితో కలసి బాబా తిరిగి శిరిడీ వచ్చుట

ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అను గ్రామము కలదు. అచ్చట ధనికుడగు మహమ్మదీయు డొకడుండెను. అతని పేరు చాంద్ పాటీలు. ఔరంగాబాదు పోవుచుండగా అతని గుర్రము తప్పిపోయెను. రెండుమాసములు శోధించినను దాని యంతు దొరకకుండెను. అతడు నిరాశ చెంది భుజముపై జీను వేసికొని ఔరంగాబాదునుండి ధూప్ గ్రాపమునకు పోవుచుండెను. 9 మైళ్ళు నడచిన పిమ్మట నొక మామిడిచెట్టు వద్దకు వచ్చెను. దాని నీడలో నొక వింత పురుషుడు కూర్చొనియుండెను. అతడు తలపై టోపి, పొడుగైన చొక్కా ధరించియుండెను. చంకలో పటకా పెట్టుకొని చిలుము త్రాగుటకు ప్రయత్నించుచుండెను. దారి వెంట పోవు చాంద్ పాటీలును చూచి, అతనిని బిలిచి చిలుము త్రాగి కొంతతడవు విశ్రాంతి గొనుమనెను. జీనుగురించి ప్రశ్నించెను. అది తాను పోగొట్టుకొనిన గుర్రముదని చాంద్ పాటీలు బదులు చెప్పెను. దగ్గరగా నున్న కాలువలో వెదకుమని ఫకీరు చెప్పెను. అతడచటకు పోయి గడ్డి మేయుచున్న గుర్రమును చూచి మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ ఫకీరు సాధారణమనుజుడు కాడనియు గొప్ప ఔలియా (యోగిపుంగవుడు ) అయివుండవచ్చుననియు అనుకొనెను. గుర్రమును దీసికొని ఫకీరువద్దకు వచ్చెను. చిలుము తయారుగా నుండెను. కానీ నీరు, నిప్పు కావలసి యుండెను. ఫకీరు ఇనుపచువ్వను భూమిలోనికి గ్రుచ్చగా నిప్పు వచ్చెను. పటకాతో నేలపై మోదగా నీరు వచ్చెను. చప్పి నా నీటిలో తడిపి, నిప్పుతో చిలుమును వెలిగించెను. అంతయు సిద్ధముగా నుండుటచే ఫకీరు ముందుగా చిలుము పీల్చి చాంద్ పాటీలు కందించెను. ఇందంతయు జూచి చాంద్ పాటీలు ఆశ్చర్యమగ్నుడయ్యెను. ఫకీరును తన గృహమునకు రమ్మనియు, అతిధిగా నుండుమనియు చాంద్ పాటీలు వేడెను. ఆ మరుసటిదినమే ఫకీరు పాటీలు ఇంటికి పోయి యచ్చట కొంతకాలముండెను. ఆ పాటీలు గ్రామమునకు మునసబు. అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించెను. పెండ్లి కూతురుది శిరిడీ గ్రామము. అందుచే శిరిడీ పోవుటకు పాటీలు కావలసినవన్నీ జాగ్రత్త చేసికొని ప్రయాణమునకు సిద్ధపడెను. పెండ్లివారితో కూడ ఫకీరు బయలుదేరెను. ఎట్టి చిక్కులు లేక వివాహము జరిగిపోయెను. పెండ్లి వారు ధూప్ గ్రామము తిరిగి వచ్చిరి గాని ఫకీరు మాత్రము శిరిడీ లో ఆగి యచ్చటనే స్థిరముగా నిలిచెను.

ఫకీరుకు సాయినామమెట్లు వచ్చెను?

పెండ్లి వారు శిరిడీ చేరగనే ఖండోబా మందిరమునకు సమీపమున నున్న భక్తమహాళ్సాపతి గారి పొలములో నున్న మర్రిచెట్టు క్రింద బస చేసిరి. ఖండోబా మందిరమునకు తగిలియున్న ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి. బండ్లలో నున్న వారొకరితరువాత నొకరు దిగిరి. ఫకీరు కూడ అట్లనే దిగెను. భక్తమహాళ్సాపతి యా చిన్నఫకీరు దిగుట జూచి "దయచేయుము సాయీ" అని స్వాగతించెను. తక్కినవారు కూడ ఆయనను సాయి యని పిలువనారంభించిరి. అదిమొదలు వారు సాయిబాబా యని ప్రఖ్యాతులైరి.

ఇతర యోగులతో సహవాసము

సాయిబాబా శిరిడీలో నొక మసీదులో నివాస మేర్పరుచుకొనిరి. బాబా రాకపూర్వమే దేవిదాసు అను యోగి శిరిడీలో ఎన్నో సంవత్సరములనుండి నివసించుచుండెను. బాబా అతనితో సాంగత్యమునకిష్టపడెను. అతనితో కలసి మారుతీ దేవాలయములోను, చావడిలో కొంతకాల మొంటరిగానుండెను. అంతలో జానకీదాసు గోసావి అనునింకొక యోగి యచ్చటకు వచ్చెను. బాబా ఎల్లప్పుడు ఈ యోగితో మాట్లాడుచు కాలము గడుపుచుండువారు. లేదా బాబా ఉన్న చోటుకు జానకీదాసు పోవుచుండెను. అట్లనే యొక వైశ్యయోగి పుణతాంబే నుంచి వచ్చుచుండెడివాడు. వారిపేరు గంగా ఖీరు. అతనికి సంసార ముండెను. అతడు బాబా స్వయముగా కుండలతో నీళ్ళు మోసి పూలచెట్లకు పోయుట జూచి యిట్లనెను. "ఈ మణి యిచ్చటుండుట చే శిరిడీ పుణ్యక్షేత్రమైనది. ఈ మనుజుడు ఈనాడు కుండలతో నీళ్ళు బోయుచున్నాడు. కాని యితడు సామాన్యమానవుడు కాడు. ఈ నేల పుణ్యము చేసికొనినది గనుక సాయిబాబా యను నీ మణి రాబట్టుకోగలిగెను." యేవలా గ్రామములో నున్న మఠములో ఆనందనాధుడు అను యోగిపుంగవుడుండెను. అతడు అక్కల్ కోటకర్ మహారాజు శిష్యుడు. అతడొకనాడు శిరిడీ గ్రామనివాసులతో బాబాను చూడ వచ్చెను. అతడు సాయిబాబాను చూచి ఇటులనెను. "ఇది యమూల్యమెన రత్నము. ఈతడు సామాన్యమానవునివలే గాన్పించునప్పటికిని యిది మామూలు రాయికాదు. యిదియొక రత్నమణి. ముందు ముందీ ఈ సంగతి మీకు తెలియగలదు." ఇట్లనుచు యేవలా చేరెను. ఇది శ్రీ సాయిబాబా బాల్యమున జరిగిన సంగతి.

బాబా దుస్తులు - వారి నిత్యకృత్యములు

యౌవనమునందు బాబా తలవెంట్రుకలు కత్తిరించక జుట్టు పెంచుచుండెను. పహిల్వానువలే దుస్తులు వేసికొనెడివారు. శిరిడీకి మూడుమైళ్ళ దూరములో నున్న రహాతా పోయినపుడు బంతి, గన్నేరు, నిత్యమల్లె మొక్కలు తీసికొనివచ్చి, నేలను చదునుచేసి, వానిని నాటి, నీళ్ళు పోయుచుండెను. బావినుండి నీళ్ళు చేది కుండలు భుజముపై పెట్టుకొని మోయుచుండెను. సాయంకాలము కుండలు వేపచెట్టు మొదట బోర్లించుచుండిరి. కాల్చనివగుటచే అవి వెంటనే విరిగి ముక్కలు ముక్కలగు చుండెడివి. ఆ మరుసటి దినము తాత్యా యింకొక రెండు కుండలను ఇచ్చుచుండెడివాడు. ఇట్లు మూడు సంవత్సరములు గడచెను. సాయిబాబా కృషివలన అచ్చట నొక పూలతోట లేచెను. ఆ స్థలములోనే యిప్పుడు బాబా సమాధి యిన్నది. దానినే సమాధిమందిర మందురు. దానిని దర్శించుట కొరకే యనేకమంది భక్తులు విశేషముగా పోవుచున్నారు.

వేపచెట్టు క్రింద నున్న పాదుకల వృత్తాంతము

అక్కల్ కోటకర్ మహారాజు గారు భక్తుడు భాయి కృష్ణజీ ఆలి బాగ్ కర్. ఇంతడు అక్కల్ కోటకర్ మహారాజుగారి ఫోటోను పూజించెడివాడు. అతడొకప్పుడు షోలాపూరు జిల్లాలోని అక్కల్ కోట గ్రామము నకు పోయి మహారాజుగారి పాదుకలు దర్శించి పూజింపవలెనని యనుకొనెను. అతడచ్చటికి పోకమునుపే స్వప్నములో మహారాజు దర్శనమిచ్చి యిట్లు చెప్పెను. "ప్రస్తుతము శిరిడీ నా నివాసస్థలము. అచ్చటికి పోయి నీ పూజ యొనరింపుము." అందుచే భాయి కృష్ణాజీ తన నిర్ణయ మును మార్చుకొని శిరిడీ చేరి బాబాను పూజించి యచ్చటనే యారుమాసములు ఆనందముతో నుండెను. దీని జ్ఞాపకార్థము పాదుకలు చేయించి శ్రావణమాసములో నొక శుభదినమున వేపచెట్టు క్రింద ప్రతిష్ఠ చేయించెను. ఇది 1912వ సంవత్సరములో జరిగెను. దాదా కేల్కర్ ఉపాసనీ బాబా అనువారు పూజను శాస్త్రోక్తముగా జరిపిరి. ఒక దీక్షిత్ బ్రాహ్మణుడు నిత్యపూజ చేయుటకు నియమింపబడెను. దీనిని పర్యవేక్షించు అధికారము భక్తసగుణున కబ్బెను.

ఈ కధ యొక్క పూర్తి వివరములు

ఠాణేవాసి బి.వి.దేవు బాబాకు గొప్ప భక్తుడు. వీరు విరమించిన మామలతదారు. వేపచెట్టు క్రింద పాదుకల విషయము సంగతులన్నియు భక్తసగుణునుండి గోవిందకమలాకర్ దీక్షిత్ నుండి సంపాదించి పాదుకల పూర్తి వృత్తాంతము, శ్రీ సాయిలీల 11 వ సంపుటిలో నీరీతిగా ప్రచురించినారు.

1912వ సంవత్సరము బొంబాయి నుండి రామారావు కొఠారే యను డాక్టరొకడు శిరిడీ వచ్చెను. వాని మిత్రుడొకడును, వాని కంపౌడర్ భాయి కృష్ణాజీ అలిబాగ్ కర్ అనునతడు వెంట వచ్చిరి. వారు భక్తసగుణుతోను జి.కె. దీక్షిత్ తోను స్నేహము చేసిరి. అనేక విషయములు తమలో తాము చర్చించుకొనునపుడు బాబా ప్రప్రధమమున శిరిడీ ప్రవేసించి వేపచెట్టు క్రింద తపస్సు చేసినదాని జ్ఞాపకార్ధము బాబా యొక్క పాదుకలను వేపచెట్టు క్రింద ప్రతిష్టించవలెనని నిశ్చయించుకొనిరి. పాదుకలను రాతితో చెక్కించుటకు నిశ్చయించిరి. అప్పుడు భాయికృష్ణజీ స్నేహితుడగు కంపౌండర్ లేచి యా సంగతి డాక్టరు రామారావు కొఠారె కు దెలిపినచో చక్కని పాదుకలు చెక్కించెదరని నుడివెను. అందరు ఈ సలహాకు సమ్మతించిరి. డాక్టరుగారికి ఈ విషయము తెలియపరచిరి. వారు వెంటనే శిరిడీ వచ్చి పాదుకల నమూనా వ్రాయించిరి. ఖండోబా మందిరమందున్న ఉపాసనీ మహారాజు వద్దకు పోయి తాము త్రాసిన పాదుకలను జూపిరి. వారు కొన్ని మార్పులను జేసి, పద్మము, శంఖము, చక్రము మొదలగునవి చేర్చి బాబా యోగశక్తిని వేపచెట్టు గొప్పతనమును దెలుపు యీ క్రింది శ్లోకమును కూడ చెక్కుమనిరి.

సదా నింబవృక్షస్య మూలాధివాసాత్
సుధాస్రావిణం తిక్తమప్యప్రియం తం |
తరు కల్పవృక్షాధికం సాధయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాధం ||

ఉపాసనీ సలహాల నామోదించి పాదుకలు బొంబాయి లో చేయించి కాంపౌండరు ద్వారా పంపిరి. శ్రావణ పౌర్ణమినాడు స్థాపన చేయుమని బాబా యాజ్ఞాపించెను. ఆనాడు 11 గంటలకు జి.కె. దీక్షిత్ తన శిరస్సుపై పాదుకలు పెట్టుకొని ఖండోబా మందిరమునుండి ద్వారకామాయికి ఉత్సవముతో వచ్చిరి. బాబా యా పాదుకలను తాకెను. అవి భగవంతుని పాదుకలని నుడివెను. చెట్టుక్రింద ప్రతిష్టింపుడని యాజ్ఞాపించెను. శ్రావణ పౌర్ణమి ముందురోజు బొంబాయి పాస్తాసేట్ యను పార్సీ భక్తుడొకడు మనియార్డరుద్వారా రూ 25 లు పంపెను. బాబా యీ పైకము పాదుకలను స్థాపించు ఖర్చునిత్తమిచ్చెను. మొత్తము రూ.100 లు ఖర్చు పెట్టిరి. అందులో రూ.75 లు చందాలవల్ల వసూలు చేసిరి. మొదటి 5 సంవత్సరములు జి.కె.దీక్షిత్ యను బ్రాహ్మణుడు ఈ పాదుకలకు పూజ చేసెను. తరువాత లక్ష్మన్ కచేశ్వర్ జఖాడె యను బ్రాహ్మణుడు (నానుమామా పూజారి) పూజ చేయుచుండెను. మొదటి 5 సం||ములు నెలకు రూ.2 లు చొప్పున డాక్టర్ కొఠారె దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండెను. పాదుకలచుట్టు కంచెకూడ పంపెను. ఈ కంచెయు, పై కప్పును కోపర్ గాం స్టేషను నుండి శిరిడీ తెచ్చుటకు 7-8-0 ఖర్చు భక్తసగుణు ఇచ్చెను. ప్రస్తుతము జఖాడె పూజచేయుచున్నాదు. సగుణుడు నైవేద్యమును, దీపమును పెట్టుచున్నాడు.

మొట్టమొదట భాయికృష్ణజీ అక్కల్ కోటకర్ మాహారాజు భక్తుడు. 1912 వ సం||ములో వేపచెట్టు క్రింద పాదుకలు స్థాపించునపుడు అక్కల్ కోటకు పోవుచు మార్గమధ్యమున శిరిడీ యందు దిగెను. బాబా దర్శనమును చేసిన తరువాత అక్కల్ కోట గ్రామమునకు పోవలెననుకొని బాబా వద్ద కేగి యనుమతి నిమ్మనెను. బాబా నిట్లనెను. "అక్కల్ కోటలో నేమున్నది? అక్కడకేల పోయెదవు? అక్కడుండే మహారాజు ప్రస్తుతమిక్కడ నున్నారు. వారు నేనే." ఇది విని భాయి కృష్ణాజీ అక్కల్ కోట వెళ్ళుట మానుకొనెను. పాదుకల స్థాపన తరువాత అనేక పర్యాయములు శిరిడీ యాత్ర చేసెను.

హేమాడ్ పంతునకీ సంగతులు తెలియవు. వారికి తెలిసియన్నచో సచ్చరిత్రలో వ్రాయుట మానియుండరు.

మొహియుద్దీన్ తంబోలితో కుస్తీ - జీవితములో మార్పు

శిరిడీ గ్రామములో కుస్తీలు పట్టు వాడుక. అచ్చట మొహియుద్దీన్ తంబోలి యనువాడు తరచుగా కుస్తీలు పట్టుచుండెడివాడు. వానితో బాబాకు ఒక విషయములో భేధాభిప్రాయము వచ్చి కుస్తీపట్టిరి. అందులో బాబా యోడిపోయెను. అప్పటినుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను, నివసించు రీతిని మార్చుకొనెను. లంగోటి బిగించుకొని పొడుగాటి చొక్కాను తొడిగికొని నెత్తిపైని గుడ్డ కట్టుకొనేవారు. ఒక గోనె ముక్కపై కూర్చునేవారు. చింకిగుడ్డలతో సంతుష్టి చెందేవారు. రాజ్యభోగముకంటే దారిద్ర్యమే మేలని నుడివెడువారు. దరిద్రుని స్నేహితుడు భగవంతుడే. గంగాఖీరు కు కూడ కుస్తీలయందు ప్రేమ. ఒకనాడు కుస్తీ పట్టుచుండగా వైరాగ్యము కలిగెను. అదే కాలమందు శరీరమును మాడ్చి దేవుని సహవాసము చేయవలెనని యాకాశవాణి పలికెను. అప్పటినుండి గంగాఖీరు సంసారమును విడిచెను. ఆత్మసాక్షాత్కారము కొరకు పాటుపడెను. పుణతాంబే దగ్గర నదియొడ్డున యొక మఠమును స్థాపంచి తన శిష్యులతో నివసించుచుండెను.

సాయిబాబా జనులతో కలసి మెలసి తిరుగువారు . అడిగినపుడు మాత్రము జవాబిచ్చువారు. దినమంతయు వేపచెట్టునీడయందు, అప్పుడప్పుడు ఊరవతలనున్న కాలువ యొడ్డునందుండు తుమ్మచెట్టు నీడన కూర్చొనెడివారు. సాయంకాల మూరకనే పచారు చేయువారు. లేదా నీమగాం పోవుచుండెడివారు. త్రయంబక్ జి.డేంగలే యనునతని యింటికి తరచుగా పోవుచుండెడివారు. డేంగలేయందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ. అతని తమ్ముని పేరు నానా సాహెబు. అతను ద్వితీయ వివాహము చేసికొన్నను సంతానము కలుగలేదు. బాబా సాహెబుడేంగలే నానా సాహెబును సాయిబాబా వద్దకు పంపెను. వారి యనుగ్రహముచే పుత్రసంతానము కలిగెను. అప్పటినుంచి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా వచ్చుచుండిరి. వారి కీర్తి యంతట వెల్లడియాయెను. అహమద్ నగరు వరకు వ్యాపించెను. అక్కడనుంచి నానాసాహెబు చాందోర్కరు, కేశవ చిదంబర్ మొదలుగాగల యనేకమంది శిరిడీకి వచ్చుట ప్రారంభించిరి. దినమంతయు బాబాను భక్తులు చుట్టియుండెడివారు. బాబా రాత్రులందు పాడుపడిన పాతమసీదు నందు శయనించు చుండెను. అప్పట్లో బాబాయొక్క సామానులు చాలా తక్కువ. అవి చిలుము, పొగాకు, తంబిరేలుగ్లాసు, పొడుగుచొక్కా, తలపై గుడ్డ, ఎల్లప్పుడు దగ్గరనుంచుకొను పటకా మాత్రమే. తలపైగుడ్డ జడవలె చుట్టి యడమచెవిపై నుంచి వెనుకకు వ్రేలాడునట్లు వేసికొనువారు. దీనిని వారములతబడి ఉతుకకుండ నుంచువారు. చెప్పులను తొడిగేవారు కారు. దినమంతయు గోనెగుడ్డపైనే కూర్చొనేవారు. కౌపీనము ధరించువారు. చలిని వారించుటకు ధుని కెదురుగా యెడమచేయి కట్టడాపై వేసి దక్షిణాభిముఖముగా కూర్చుండువారు. ఆ ధునిలో అహంకారమును, కోరికలను, ఆలోచనలను ఆహుతి చేసి అల్లాయే యజమాని అని పలికేవారు. మసీదులో రెండుగదుల స్థలము మాత్రముండెను. భక్తులందరచటకు పోయి బాబాను దర్శించుచుండిరి. 1912 తదుపరి దానిలో మార్పు కలిగెను. పాతమసీదు మరామతు చేసి నేలపై నగిషీరాళ్ళు తాపన చేసిరి. బాబా యా మసీదుకు రాకపూర్వము 'తకియా' (రచ్చ) లో చాలా కాలము నివసించిరి. బాబా కాళ్ళకు చిన్ని మువ్వలు కట్టుకొని సొగసుగా నాట్యము చేసేవారు. భక్తి పూర్వకమైన పాటలు పాడేవారు.

నీళ్ళను నూనెగా మార్చుట

సాయిబాబాకు దీపములన్న చాలా యిష్టము. ఊరులోనున్న షాహుకార్లను నూనె యడిగి తెచ్చి మసీదునందు రాత్రియంతయు దీపములు వెలిగించుచుండెను. కొన్నాళ్ళు ఇట్లు జరిగెను. నూనె ఇచ్చు కోమట్లు అందరు కూడి బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకొనెను. బాబా వారి దుకాణములకు ఎప్పటివలె పోగా నూనె లేదనిరి. బాబా కలత చెందక వట్టి వత్తులు మాత్రమే ప్రమిదలలో బెట్టి యుంచెను. కోమట్లు ఆతురతతో నిదంతయు గమనించుచుండిరి. రెండుమూడు నూనెచుక్కలున్న తంబిరేలు డొక్కులో నీళ్ళు పోసి దానిని బాబా త్రాగెను. నీటిని ఈ విధముగా పావనము చేసిన పిమ్మట, నీరంతయు డొక్కులో నుమ్మి యా నీటిని ప్రమిదలలో నింపెను. దూరముగా నిలిచి పరీక్షించుచున్న కోమట్లు విస్మయమొందునట్లు ప్రమిదలన్నియు తెల్లవారుదాక చక్కగా వెలుగుచుండెను. షాహుకార్లు ఇదంతయు జూచి పశ్చాత్తాపపడిరి; క్షమాపణ కోరిరి. బాబా వారిని క్షమించెను. ఇక మీదట సత్ర్పవర్తనను అలవరచుకొనుడని పంపెను.

జౌహర్ ఆలీ యను కపటగురువు

పైన వివరించిన కుస్తీ జరిగిన యయిదేండ్ల తరువాత అహమదునగరు నుంచి జౌహరు అలీ అను ఫకీరొకడు శిష్యులతో రహాతా వచ్చెను. వీరభద్రమందిరమునకు సమీపమున నున్న స్థలములో దిగెను. ఆ ఫకీరు బాగా చదువుకొన్నవాడు; ఖురానంతయు వల్లించగలడు, మధుర భాషణుడు ఆ యూరిలోని భక్తులు వచ్చి వానిని సన్మానించుచు గౌరవముతో చూచుచుండెడివారు. వారి సహాయముతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా "ఈద్ గా" యను గోడను నిర్మించుటకు పూనుకొనెను. ఈదుల్ ఫితర్ అను పండుగనాడు మహమ్మదీయులు నిలుచుకొని ప్రార్థించు గోడయే ఈద్గా. ఈ విషయములో కొట్లాట జరిగి జౌహర్ ఆలి రహతా విడిచి, శిరిడీ లో బాబా తో మసీదునందుండెను. ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయిరి. అతడు బాబాను తన శిష్యుడని చెప్పువాడు. బాబా అందులకడ్డు చెప్పక చేలాగ నుండుటకు సమ్మతించెను. గురువునకు చేలా శక్తి యేమియు తెలియకుండెను. కాని చేలాకు గురువుయొక్క లోపములు బాగా తెలియును. అయినప్పటికీ వాని నెప్పుడు అగౌరవించలేదు. వాని పనులన్నియు చక్కగా నెరవేర్చుచుండెడివారు. అప్పుడప్పుడు శిరిడీకి ఇరువురు వచ్చి పోవుచుండెడివారు. కాని అధికముగా రహాతాలో నివసించేవారు. శిరిడీలో బాబా భక్తులకు బాబా రహాతా లో నుండుట ఎంతమాత్రమిష్టములేదు. అందుచే వారందరు కలసి రహాతానుండి బాబాను తెచ్చుటకు పోయిరి. వారు రహాతాలో బాబాను ఈద్గా వద్ద చూచి బాబాను తిరిగి శిరిడీ తీసికొనిపోవుటకై వచ్చినామని చెప్పిరి. ఫకీరు ముక్కోపి; చెడ్డవాడు. తనను విడిచెపెట్టడు గనుక ఫకీరు వచ్చులోపల వారు తనయందు ఆశ విడిచి శిరిడీ పోవుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చెను. వారిట్లు మాట్లాడుచుండగా ఫకీరు వచ్చి బాబాను తీసికొని పోవుటకు ప్రయత్నించుచున్న శిరిడీ ప్రజలను మందలించెను. కొంత వివాదము జరిగిన పిమ్మట గురువుగారున్నూ చేలాను తిరిగి శిరిడీ పోవుటకు నిర్ణయమైనది.

కాబట్టి వారు శిరిడీ చేరి యచ్చట నివసించుచుండిరి. కొన్ని దినముల పిమ్మట దేవీదాసు కపటగురువును పరీక్షించి లోటుపాటు లనేకములున్నట్లు గనిపెట్టెను. బాబా శిరిడీ ప్రవేశించుటకు 12 సంవత్సరములు ముందు దేవీదాసు 10 లేదా 11 ఏండ్ల బాలుడుగా శిరిడీ చేరెను. వారు మారుతి దేవాలయములో నుండేవారు. దేవీదాసు చక్కని ముఖలక్షణములు, ప్రకాశించే నేత్రములు కలిగి నిర్వ్యామోహితావతారమువలే జ్ఞానివలే కనబడుచుండెను. తాత్యాబా పాటీలు, కాశీనాధు మొదలుగాగల యనేకమంది దేవీదాసును గురువుగా మన్నించుచుండిరి. వారు జౌహరును దేవీదాసు వద్దకు తెచ్చిరి. జరిగిన వాదములో తగిన సమాధానమివ్వలెక, జౌహరు ఓడిపోయి శిరిడీ విడిచి పారిపోయి, బిజాపురములో నుండెను. చాలా ఏండ్ల తరువాత శిరిడీకి తిరిగి వచ్చి బాబా పాదములపై బడెను. తాను గురువు, సాయిబాబా చేలాయను తప్పుడు అభిప్రాయము వాని మనస్సునుండి తొలగెను. పశ్చాత్తాపపడుటచే సాయిబాబా వానిని గౌరవముగానే చూచెను. ఈ విధముగా బాబా, శిష్యుడు గురువు నెట్లు కొలువవలెనో ఎట్లు అహంకారమును విడిచి గురుశుశ్రూషచేసి తుదకు ఆత్మసాక్షాత్కారమును పొందవలెనో నిరూపించెను. ఈ కధ భక్త మహళ్సాపతి చెప్పినరీతిగా వ్రాయబడినది.

ఓం నమో శ్రీ సాయి నాధాయ

ఓం శాంతిః శాంతిః శాంతిః

అయిదవ అధ్యాయము సంపూర్ణము