శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము - పి.నారాయణరావు Back   Home 

ఏబదియవ అధ్యాయము

1.కాకా సాహెబు దీక్షిత్ 2.టెంబెస్వామి 3.బాలారాం ధురంధర్ కధలు.

సచ్చరిత్ర మూలములోని 50 వ అ ధ్యాయము 39 వ అధ్యాయములో చేర్చుట జరిగినది. కారణము అందులోని యితివృత్తముగూడ నదియే కనుక. సచ్చరిత్రలోని 51 వ అధ్యాయమిచ్చట 50 వ అధ్యాయముగా పరిగణించవలెను.

తొలిపలుకు

భక్తుల కాశ్రయమైన శ్రీ సాయికి జయమగుగాక! వారు మన సద్గురువులు. వారు మనకు గీతార్థమును బోధించెదరు. మనకు సర్వశక్తులను కలుగజేయుదురు. ఓ సాయీ! మాయందు కనికరించుము. మమ్ము కటాక్షింపుము. చందనవృక్షములు మలయపర్వతముపై పెరిగి వేడిని పోగొట్టును. మేఘములు వర్షమును గురిపించి చల్లదనము కలుగజేయుచున్నవి. వసంత ఋతువునందు పుష్పములు వికసించి వానితో దేవుని పూజ చేయుటకు వీలు కలుగజేయుచున్నవి. అట్లనే సాయిబాబా కధలు మనకు ఊరటను సుఖశాంతులను కలుగజేయుచున్నవి. సాయి కధలు చెప్పవారును వినువారును ధన్యులు, పావనులు. చెప్పువారి నోరును, వినువారి చెవులును పవిత్రములు.

(కాకాసాహెబు దీక్షిత్ 1864 - 1926)

మధ్యపరగణాలలోని ఖాంట్వా గ్రామందు వడనగర నాగరబ్రాహ్మణ కుటుంబములో హరిసీతారాం ఉరఫ్ కాకాసాహెబు దీక్షిత్ జన్మించెను. ప్రాధమిక విధ్యను ఖాండ్వాలో హింగన్ ఘూట్ లలో పూర్తి చేసెను, నాగపూరులో మెట్రిక్ వరకు చదివెను. బొంబాయి విల్సన్, ఎల్ఫిన్ స్టన్ కాలేజీలలో చదివి 1883 లో పట్టభదుడయ్యెను. న్యాయవాది పరీక్షలో కూడ ఉత్తీర్ణుడై లిటిల్ అండు కంపెనీలో కొలువునకు చేరెను. తుదకు తన సొంత న్యాయవాదుల కంపెనీ పెట్టుకొనెను.

1909 కి ముందు సాయిబాబా పేరు కాకాసాహెబు దీక్షిత్ కు తెలియదు. అటుపిమ్మట వారు బాబాకు గొప్ప భక్తులైరి. ఒకానొకప్పుడు లోనావలాలో నున్నప్పుడు, తన పాతస్నేహితుడగు నానాసాహెబు చాందోర్కర్ ను జూచెను. ఇద్దరును కలిసి ఏవో విషయములు మాట్లాడుకొనిరి. కాకాసాహెబు తాను లండనులో రైలుబండి ఎక్కుచుండగా కాలుజారిపడిన యపాయమునుగూర్చి వర్ణించెను. వందలకొలది ఔషధములు దానిని నయము చేయలేకపోయెను. కాలు నొప్పియు, కుంటితనమును పోవలెనన్నచో, అతడు సద్గురువగు సాయిబద్దకు పోవలెనని నానాసాహెబు సలహా నిచ్చెను. సాయిబాబా విషయమై పూర్తి వృత్తాంతమును విశదపరచెను. సాయిబాబా "నా భక్తుని సప్త సముద్రముల మీద నుంచిగూడ పిచ్చుక కాలికి దారముకట్టి యీడ్చినట్లు లాగుకొని వచ్చెదను." అను వాగ్దానమును, ఒకవేళ వాడు తనవాడు కానిచో వారు తనచే నాకర్షింపబడడనియు, వాడు తన దర్శనమే చేయలేడనియు బాబా చెప్పిన సంగతి తెలియజేసెను. ఇదంతయు విని కాకాసాహెబు సంతసించి, "సాయిబాబా వద్దకు పోయి, వారిని దర్శించి కాలుయొక్క కుంటితనముకంటె నా మనస్సుయొక్క కుంటితనమును బాగుచేసి శాశ్వతమైన యానందమును కలుగజేయుమని వేడుకొనెద" నని నానా సాహెబుతో చెప్పెను.

కొంతకాలము పిమ్మట కాకాసాహెబు అహమద్ నగర్ వెళ్ళెను. బొంబాయి లెజిస్ లేటివ్ కౌన్సిల్ లో వోట్లకై సర్దార్ కాకాసాహెబు మిరీకర్ యింటిలో దిగెను. కాకాసాహెబు మిరీకర్ కొడుకు బాలా సాహెబు మిరీకర్. వీరు కోపర్ గాంకు మామలతదారు. వీరు కూడ గుర్రపు ప్రదర్శన సందర్భములో అహమద్ నగరు వచ్చి యుండిరి. ఎలక్షను పూర్తియైన పిమ్మట కాకాసాహెబు శిరిడీకి పోవ నిశ్చయించుకొనెను. మిరీకర్ తండ్రికొడుకులు వీరిని ఎవరివెంట శిరిడీకి పంపవలెనా యని యాలోచించుచుండిరి. శిరిడీలో సాయిబాబా వీరిని ఆహ్వానించుటకు సిద్ధపడుచుండెను. అహమద్ నగరులోనున్న శ్యామా మామగారు తన భార్య ఆరోగ్యము బాగా లేదనియు, శ్యామాను తన భార్యతో గూడ రావలసినదనియు టెలిగ్రాం ఇచ్చిరి. బాబా యాజ్ఞను పొంది శ్యామా అహమద్ నగరు చేరి తన అత్తగారికి కొంచెము నయముగా నున్నదని తెలిసికొనెను. మార్గములో గుర్రపు ప్రదర్శనమునకు బోవు చున్న నానాసాహెబు పాన్షె, అప్పాసాహెబు గద్రేయు శ్యామాను గలిసి, మిరీకరు ఇంటికి పోయి కాకాసాహెబు దీక్షితుని కలిసి, వారిని శిరిడీకి తీసికొని వెళ్ళుమనిరి. కాకాసాహెబు దీక్షితుకు మిరీకరులకు శ్యామా అహమద్ నగరు వచ్చిన విషయము తెలియజేసిరి. సాయంకాలము శ్యామా మిరీకరులవద్దకు పోయెను. వారు శ్యామాకు కాకాసాహెబుదీక్షిత్ తో పరిచయము కలుగజేసిరి. శ్యామా కాకాసాహెబు దీక్షితుతో కోపర్ గాంకు ఆనాటి రాత్రి 10 గంటల రైలులో పోవలనని నిశ్చయించిరి. ఇది నిశ్చయించిన వెంటనే యొక వింత జరిగెను. బాబా యొక్క పెద్దపటము మీది తెరను బాలాసాహెబు మిరీకరు తీసి దానిని కాకాసాహెబు దీక్షితుకు చూపెను. కాకాసాహెబు శిరిడీకి పోయి ఎవరినయితే దర్శించవలెనని నిశ్చయించుకొనెనో, వారే పటము రూపముగా నచట తన్ను ఆశీర్వదించుటకు సిద్ధముగా నున్నట్లు తెలిసి యతడు మిక్కిలి యాశ్చర్యపడెను. ఈ పెద్దపటము మేఘశ్యామునిది. దానిపై యద్దము పగిలినందున నాతడు దానికింకొక యద్దము వేయుటకు మిరీకరులవద్దకు బంపెను. చేయవలసిన మరమ్మతు పూర్తి చేసి ఆ పటమును కాకాసాహెబు, శ్యామా ల ద్వారా శిరిడీకి పంపుటకు నిశ్చయించిరి.

10 గంటల లోపల స్టేషనుకు పోయి టిక్కెట్లు కొనిరి. బండి రాగా సెకండ్ క్లాసు క్రిక్కిరిసి యుండుటచే వారికి జాగా లేకుండెను. అదృష్టవశాత్తు గార్డు కాకాసాహెబు స్నేహితుడు. అతడు వారిని ఫస్టు క్లాసులో కూర్చుండబెట్టెను. వారు సౌఖ్యముగా ప్రయాణము చేసి కోపర్ గాంలో దిగిరి. బండి దిగగానే శిదిడీకి పోవుటకు సిద్ధముగా నున్న నానాసాహెబు చాందోర్కరును జూచి మిక్కిలి యానందించిరి. కాకాసాహెబు, నానాసాహెబు కౌగలించుకొనిరి. వారు గోదావరిలో స్నానము చేసిన పిమ్మట శిరిడీకి బయలుదేరిరి. శిరిడీ చేరి బబా దర్శనము చేయగా, కాకాసాహెబు మనస్సు కరగెను. కండ్లు ఆనందబాష్ఫములచే నిండెను. అతడానందముచే పొంగిపొరలుచుండెను. బాబా కూడ వారికొరకు తాము కనిపెట్టుకొని యున్నట్లును వారిని తోడ్కొని వచ్చుటకే శ్యామాను బంపినట్లును తెలియజేసెను.

పిమ్మట కాకాసాహెబు బాబాతో నెన్నో సంవత్సరములు సంతోషముగా గడపెను. శిరిడీలో నొక వాడాను గట్టి దానినే తన నివాసస్థలముగా జేసికొనెను. అతడు బాబా వల్ల పొందిన యనుభవములు లెక్కలేనన్ని గలవు. వాని నన్నిటిని ఇచ్చట పేర్కొనలేము. ఈ కధను ఒక విషయముతో ముగించెదము. బాబా కాకా సాహెబుతో "అంత్యకాలమున నిన్ను విమానములో తీసుకపోయెదను" అన్న వాగ్దానము సత్యమైనది. 1926 వ సంవత్సరము జూలై 5 వ తేదీన అతడు హేమాడ్ పంతుతో రైలు ప్రయాణము చేయుచు బాబా విషయము మాట్లాడుచు, సాయిబాబా యందు మనస్సు లీనము చేసెను. ఉన్నట్లుండి తన శిరమును హేమాడ్ పంతు భుజముపై వాల్చి ఏ బాధయు లేక, ఎట్టి చీకాకు పొందక ప్రాణములు విడిచెను.

శ్రీ టెంబె స్వామి

యోగులు ఒకరినొకరు అన్నదమ్ములవలె ప్రేమించుకొనెదరు. ఒకానొకప్పుడు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వాములవారు (టెంబె స్వామి) రాజమండ్రి లో మకాం చేసిరి. ఆయన గొప్ప నైష్టికుడు. పూర్వాచారపరాయణుడు. జ్ఞాని, దత్తాత్రేయుని యోగిభక్తుడు. నాందేడు ప్లీడరగు పుండలీకరావు వారిని జూచుటకై కొంతమంది స్నేహితులతో పోయెను. వారు స్వాములవారితో మాట్లాడుచున్నప్పుడు సాయిబాబా పేరు శిరిడీ పేరు వచ్చెను. బాబా పేరు విని స్వామి చేతులు జోడించి, ఒక టెంకాయను దీసి పుండలీకరావు కిచ్చి యిట్లనిరి. "దీనిని నా సోదరుడగు సాయికి నా ప్రణామములతో నర్పింపుము, నన్ను మరువవద్దని వేడుము. నాయందు ప్రేమ చూపుమనుము." ఆయన స్వాములు సాధారణముగా నితరులకు నమస్కరించరనియు కాని బాబా విష్యమున ఇది యొక అపవాదమనియు చెప్పెను. పుండలీకరావు ఆ టెంకాయను, సమాచారమును శిరిడీకి దీసికొని పోవుటకు సమ్మతించెను. బాబాను స్వామి సోదరుడనుట సమంజసముగా నుండెను. ఏలన బాబా వలె వారును రాత్రింబవళ్ళు అగ్నిహోత్రమును వెలిగించియే యుంచిరి.

ఒక నెల పిమ్మట పుండలీకరావు తదితరులును శిరిడీకి టెంకాయను దీసికొని వెళ్ళిరి. వారు మన్మాడు చేరిరి. దాహము వేయుటచే ఒక సెలయేరు కడకు బోయిరి. పరిగడుపున నీళ్ళు తాగకూడదని కారపు అటుకులు ఉపాహారము చేసిరి. అవి మిక్కిలి కారముగా నుండుటచే టెంకాయను పగులగొట్టి దాని కోరును అందులో కలిపి యటుకులను రుచికరముగా జేసిరి. దురదృష్టముకొలది యా కొట్టిన టెంకాయ స్వాములవారు పుండలీకరావు కిచ్చినది. శిరిడీ చేరునప్పటికి పుండలీకరావు కీ విషయము జ్ఞప్తికి వచ్చెను. అతడు మిగుల విచారించెను. భయముచే వణకుచు సాయిబాబా వద్దకేగెను. టెంకాయ విషయమప్పటికే సర్వజ్ఞుడగు బాబా గ్రహించెను. బాబా వెంటనే తన సోదరుడగు టెంబెస్వామి పంపించిన టెంకాయను దెమ్మనెను. పుండలీకరావు బాబా పాదములు గట్టిగా పట్టుకొని, తన తప్పును ఆలక్ష్యము ను వెలిబుచ్చుచు, పశ్చాత్తాపపడుచు, బాబాను క్షమాపణ వేడెను. దానికి బదులింకొక టెంకాయను సమర్పించెదననెను. కాని కాకా యందులకు సమ్మతించలేదు. ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయ కెన్నో రెట్లనియు దాని విలువకు సరిపోవునది ఇంకొకటి లేదనియు చెప్పుచు నిరాకరించెను. ఇంకను బాబా ఇట్లనెను. "ఆ విషయమై నీవేమాత్రము చింతింపనవసరము లేదు. అది నా సంకల్పము ప్రకారము నీ కివ్వబడెను. తుదకు దారిలో పగులగొట్టబడెను. దానికి నీవేకర్తవని యనుకొననేల? మంచి గాని చెడ్డగాని చేయుటకు నీవు కర్తవని యనుకొనరాదు. గర్వాహంకార రహితుడవయి యుండుము. అప్పుడే నీ పరచింతన యభివృద్ధి పొందును." ఎంత చక్కని వేదాంతవిషయమును బాబా బోధించెనో చూడుడు!

బాలారాం ధురంధర్ (1878 - 1925)

బొంబాయికి దగ్గరనున్న శాంతాక్రుజులో పఠారెప్రభుజాతికి చెందిన బాలారాం ధురంధర్ యనువారుండిరి. వారు బొంబాయి హైకోర్టులో న్యాయవాది. కొన్నాళ్ళు బొంబాయి న్యాయశాస్త్ర కళాశాలకు ప్రిన్సిపాలుగా నుండెను. ధురంధర్ కుటుంబములోని వారందరు భక్తులు, పవిత్రులు. భగవచ్చింతన గలవారు. బాలారాం తన జాతికి సేవ చేసెను. ఈ విషయమై యొక గ్రంధము వ్రాసెను. అటుపిమ్మట తన దృష్టిని మతము ఆధ్యాత్మికవిష్యములవైపు మరలించెను. గీతను, జ్ఞానేశ్వరిని, వేదాంత గ్రంధములను, బ్రహ్మవిధ్య మొదలగువానిని చదివెను. అతడు పండరీపుర విఠోబా భక్తుడు. అతనికి 1912 లో సాయిబాబాతో పరిచయము కలిగెను 6 నెలలు పూర్వము తన సోదరులగు బాబుల్జీయును, వామనరావును శిరిడీకి పోయి బాబా దర్శనము చేసిరి. ఇంటికి వచ్చి వారి యనుభవములను బాలారామునకు ఇతరులకు చెప్పిరి. అందరు బాబాను చూడ నిశ్చయించిరి. వారు శిరిడీకి రాకమునుపే బాబా యిట్లు చెప్పెను. "ఈ రోజున నా దర్బారు జనులు వచ్చుచున్నారు." ధురంధర సోదరులు తమ రాకను బాబాకు తెలియజేయనప్పటికి బాబా పలికిన పలుకులు ఇతరుల వలన విని, విస్మయమొందిరి. తక్కినవారందరు బాబాకు సాష్టాంగనమస్కారము చేసి వారితో మాట్లాడుచు కూర్చొని యుండిరి. బాబా వారితో నిట్లనెను. "వీరే నా దర్బారు జనులు. ఇంతకు ముందు వీరి రాకయే మీకు చెప్పియుంటిని." బాబా ధురంధర సోదరులతో నిట్లనెను. "గత 60 తరముల నుండి మన మొండొరులము పరిచయము గలవారము". సోదరులందరు వినయవిధేయతలు గలవారు. వారు చేతులు జోడించుకొని నిలచి, బాబా పాదముల వైపు దృష్టి నిగిడించిరి. సాత్వికభావములు అనగా కండ్ల నీరు కారుట, రోమాంచము, వెక్కుట, గొంతుక యార్చుకొని పోవుట, మొదలగునవి వారి మనస్సులను కరగించెను. వారందరానందించిరి. భోజనానంతరము కొంత విశ్రమించి తిరిగి మసీదుకు వచ్చిరి. బాలారాం బాబాకు దగ్గరగా కూర్చొని బాబా పాదములొత్తుచుండెను. బాబా చిలుము త్రాగుచు దానిని బాలా రామునకిచ్చి పీల్చుమనెను. బాలారాము చిలుము పీల్చుట కలవాటుపడి యుండలేదు. అయినప్పటికి దానినందుకొని కష్టముతో బీల్చెను. దానిని తిరిగి నమస్కారములతో బాబా కందజేసెను. ఇదియే బాలారామునకు శుభసమయము. అతడు 6 సంవత్సరములనుండి ఉబ్బసము వ్యాధితో బాధపడుచుండెను. ఈ పొగ అతని వ్యాధి ని పూర్తిగ నయము చేసెను. అది అతనిని తిరిగి బాధపెట్టలేదు. 6 సంవత్సరముల పిమ్మట నొకనాడు ఉబ్బసము మరల వచ్చెను. అదేరోజు అదే సమయమందు బాబా మహాసమాధి చెందెను.

వారు శిరిడీకి వచ్చినది గురువారము. ఆ రాత్రి బాబా చావడి యుత్సవమును జూచుభాగ్యము ధురంధర సోదరులకు కలిగెను. చావడిలో హారతి సమయమందు బాలారాము బాబా ముఖమందు పాండురంగని తేజస్సు ను ఆ మరుసటి ఉదయము కాకడ హారతి సమయమందు అదే కాంతిని పాండురంగ విఠలుని ప్రకాశమును బాబా ముఖమునందు గనెను.

బాలారాం ధురంధర్ మరాఠీ భాషలో తుకారాం' జీవితమును వ్రాసెను. అది ప్రకటింపబడకమునుపే అతడు చనిపోయెను. 1928 లో అతని సోదరులు దానిని ప్రచురించిరి. అందు బాలారాము జీవితము ప్రప్రధమమున వ్రాయబడెను. అందు వారు శిరిడీకి వచ్చిన విషయము చెప్పబడియున్నది.

ఓం నమో శ్రీ సాయినాధాయ

శాంతిః శాంతిః శాంతిః

ఏబదియవ అధ్యాయము సంపూర్ణము.