శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము - పి.నారాయణరావు Back   Home 

ఏబదియొకటవ అధ్యాయము

సచ్చరిత్రములోని 52, 53 అధ్యాయములిందు 51 వ అధ్యాయముగా పరిగణించవలెను.

తుదిపలుకు

ఇదియే చివరి అధ్యాయము. ఇందు హేమాడ్ పంతు ఉపసమ్హార వాక్యములు వ్రాసెను. పీఠిక తో విషయసూచిక నిచ్చునట్లు వాగ్దానము చేసెను. కాని యది హేమాడ్ పంతు కాగితములలో దొరకలేదు. కావున దానిని బాబా యొక్క గొప్ప భక్తుడగు బి.విదేవు (ఠాణా వాసి, ఉద్యోగమును విరమించుకొనిన మామలతదారు) కూర్చెను. ప్రతి అధ్యాయ ప్రారంభమున దానిలోని యంశములను ఇచ్చుటచే విషయసూచిక యనవసరము. కాబట్టి దీనినే తుదిపలుకుగా భావించెదము. ఈ అధ్యాయమును సవరించుటకు, ప్రచురించుటకు పంపుసరికి దేవుగారికి ఇది పూర్తిగా వ్రాసియున్నట్లు కనబడలేదు. అచ్చటచ్చట చేతి వ్రారను బోల్చుకొనుటగూడ కష్టముగా నుండెను. కాని యదంతయు నున్నదున్నట్లుగా ప్రచురింపవలసి వచ్చెను. అందు చెప్పిన ముఖ్యవిషయములు ఈ దిగువ క్లుప్తముగా జెప్పబడినవి.

సద్గురు సాయియొక్క గొప్పదనము

శ్రీ సాయి సమర్థునకు సాష్టాంగనమస్కారము చేసి వారి యాశ్రయమును పొందెదము. వారు జీవజంతువులయందును, జీవములేని వస్తువులయందును కూడ వ్యాపించియున్నారు. వారు స్థంభము మొదలు పర బ్రహ్మస్వరూపమువరకు కొండలు, ఇండ్లు, మేడలు, ఆకాశము మొదలుగాగల వాని యన్నిటియందు వ్యాపించియున్నారు. జీవరాశియంతటను కూడ వ్యాపించియున్నారు. భక్తులందరు వారికి సమానమే. వారికి మానావమానములు లేవు. వారికిష్టమైనవి యయిష్టమయినవియు లేవు. వారినే జ్ఞప్తియందుంచుకొని వారి శరణు పొందినచో వారు మన కోరికలన్నిటిని నెరవేర్చి మనము జీవితపరమావధిని పొందునట్లు చేసెదరు.

ఈ సంసారమనే మహాసముద్రమును దాటుట మహాకష్టము. విషయ సుఖములనెడు కెరటములు దురాలోచనలనే ఒడ్డును తాకుచు ధైర్యమను చెట్లను కూడ విరుగగొట్టుచుండును. అహంకారమనే గాలి తీవ్రముగా వీచి మహాసముద్రమును కల్లోలపరచును. కోపము, అసూయలను మొసళ్ళు నిర్భయముగా సంచరించును. అచట నేను, నాది యను సుడిగుండములును, ఇతర సంశయములును గిర్రున తిరుగుచుండును. పరనింద, అసూయ, ఓర్వలేనితనము అను చేపలచట ఆడుచుండును. ఈ మహా సముద్రము భయంకరమైనప్పటికి సాయి సద్గురువు దానికి అగస్త్యునివంటి వాడు. (నాశనముచేయువాడు). సాయిభక్తులకు దానివల్ల భయమేమి యుండదు. ఈ మహాసముద్రమును దాటుటకు మన సద్గురువు నావవంటి వారు. వారు మనలను సురక్షితముగ దాటించెదరు.

ప్రార్థన

మనమిప్పుడు సాయిబాబాకు సాష్టాంగనమస్కారము చేసి వారి పాదములు బట్టుకొని సర్వజనుల కొరకు ఈ క్రింది ప్రార్థనము చేసెదము. మా మనస్సు అటునిటు సంచారము చేయకుండు గాక. నీవు దప్ప మరే మియు కోరకుండు గాక. ఈ సచ్చరిత్రము ప్రతిగృహమందుండు గాక. దీనిని ప్రతినిత్యము పారాయణ చేసెదముగాక. ఎవరయితే దీనిని నిత్యము పారాయణ చేసెదరో వారి యాపదలు తొలగిపోవుగాక.

ఫలశ్రుతి

ఈ గ్రంధమును పారాయణ చేసినచో గలుగు ఫలితమును గూర్చి కొంచెము చెప్పుదుము. పవిత్రగోదావరిలో స్నానము చేసి, శిరిడీలో సమాధిని దర్శించి, సాయి సచ్చరిత్రము పారాయణ చేయుటకు ప్రారంభింపుము. నీవిట్లు చేసినచో నీకుండు ముప్పేటల కష్టములు తొలగిపోవును. శ్రీ సాయి కధలను అలవోకగా విన్నను ఆధ్యాత్మికజీవితమునందు శ్రద్ధ కలుగును. ఇంకను ఈ చరిత్రమును ప్రేమతో పారాయణ చేయుచున్నచో నీ పాపములన్నియు నశించును. జననమరణములనే చక్రము నుండి తప్పించుకొనవలెనన్నచో సాయికధలను చదువుము. వాని నెల్లప్పుడు జ్ఞప్తియందుంచుకొనుము, వారి పాదములనే యాశ్రయింపుము; వానినే భక్తితో పూజింపుము. సాయికధలనే సముద్రములో మునిగి వానిని ఇతరులకు చెప్పించో నందు క్రొత్త సంగతులను గ్రహించగలవు. వినువారిని పాపములనుండి రక్షించగలవు. శ్రీ సాయి సగుణస్వరూపమునే ధ్యానించినచో క్రమముగా నది నిష్క్రమించి ఆత్మసాక్షాత్కారమునకు దారి చూపును. ఆత్మసాక్షాత్కారమును పొందుట బహుకష్టము. కాని నీవు సాయి సగుణస్వరూపము ద్వారా పోయినచో నీ ప్రగతి సులభమగును. భక్తుడు వారిని సర్వస్యశరణాగతి వేడిచచో నతడు "తాను" అనుదానిని పోగొట్టుకొని నది సముద్రములో గలియునట్లు భగవంతునిలో ఐక్యమగును. మూడింటిలో ననగా జాగ్రత్ స్వప్న సుషుప్త్యవస్థలలో నేదయిన యొక్క యవస్థలో వారియందు లీనమయినచో సంసారబంధమునుండి తప్పుకొందువు. స్నానము చేసిన పిమ్మట ఎవరు దీనిని భక్తి ప్రేమలతోను, పూర్తి నమ్మకముతోను పారాయణ చేసి వారము రోజులలో ముగింతురో, వారి యాపదలన్నియు నశించగలవు. దీనిని పారాయణ చేసి ధనమును కోరిచచో దానిని పొందవచ్చును. వర్తకుల వ్యాపారము వృద్ధియగును. వారి వారి భక్తి నమ్మకములేపి ఫలమాధారపడియున్నది. ఈ రెండును లేనిచో నెట్టి యనుభవమును కలుగదు. దీనిని గౌరవముతో పారాయణ చేసినచో, శ్రీ సాయి ప్రీతి చెందును. నీ యజ్ఞాయమును పేదరికమును నిర్మూలించి నీకు జ్ఞానము, ధనము, ఐశ్వర్యముల నొసంగును. కేంద్రీకరించిన మనస్సుతో ప్రతిరోజు ఒక అధ్యాయమును పారాయణ చేసినచో నది యప్రిమితానందమును కలుగజేయును. ఎవరు హృదయమునందు తమ శ్రేయస్సును కోరెదరో వారు దానిని జాగరూకతతో పారాయణ చేయవలయును. అప్పుడతడు శ్రీ సాయిని కృతజ్ఞతతో, సంతసముతో జన్మజన్మములవరకు మదిలో నుంచుకొనును. ఈ గ్రంధమును గురుపౌర్ణమినాడు (అనగా ఆషాఢ శుద్ధ పౌర్ణమినాడు) గోకులాష్టమినాడు, శ్రీ రామనవమి నాడు, దసరానాడు అనగా బాబా పుణ్యతిధినాడు) ఇంటివద్ద తప్పక పారాయణ చేయవలెను. ఈ గ్రహంధమును జాగరూకతతో పారాయణ చేసిన ఎడల వారల కోరికలన్నియును నెరవేరును. నీ హృదయమునందు శ్రీ సాయి చరణములనే నమ్మినయెడల భవసాగరమును సులభముగా దాటగలుగుదువు. దీనిని పారాయణ చేసినయెడల రోగులు ఆరోగ్యవంతులగుదురు, పేదవారు ధనవంతులగుదురు. అధములు ఐశ్వర్యమును పొందుదురు. వారి మనస్సునందు గల ఆలోచనలన్నియు పోయి తుదకు దానికి స్థిరత్వము కలుగును.

ఓ ప్రియమైన భక్తులారా! పాఠకులారా! శ్రోతలారా!

మీకు కూడ మేము నమస్కరించి మీ కొక మనవి చేయుచున్నాము. ఎవరి కధలను ప్రతిరోజు, ప్రతినెల, మీరు పారాయణ చేసితిరో వారిని మరువవద్దు. ఈ కధల నెంత తీవ్రముగా చదివెదరో, వినెదరో - అంత తీవ్రముగా మీకు ధైర్యము, ప్రోత్సాహము, సాయిబాబా కలుగజేసి, మీచే సేవ చేయించి, మీ కుపయుక్తముగా నుండునట్లు చేయును. ఈ కార్యమందు రచయితయు, చదువరులును సహకరించవలెను. ఒండొకరులు సహాయము చేసికొని సుఖపడవలెను.

ప్రసాద యాచనము

దీనిని సర్వశక్తిమయుడైన భగవంతుని ప్రార్థనతో ముగిచెదము. ఈ దిగువ కారుణ్యమును జూపుమని వారిని వేడెదము. దీనిని చదువువారును, భక్తులును హృదయపూర్వకమగు సంపూర్ణభక్తి శ్రీ సాయి పాదములందు పొందెదరుగాక! సాయి సగుణస్వరూపము వారి నేత్రములందు నాటిపోవును గాక! వారు శ్రీ సాయిని సర్వజీవములయందు చూచెదరు గాక! తధాస్తు.

ఓం నమో శ్రీ సాయి నాధాయ

శాంతిః శాంతిః శాంతిః

శ్రీ సాయిసచ్చరిత్రము సర్వము సంపూర్ణము.

ముఖ్య గమనిక

పారాయణానంతరము శ్రీ సాయిబాబా హారతి చేసి, యీ దిగువ మూడు శ్లోకములు పఠించి ముగించవలెను.

"నమో సాయి శివనందనా (గణేశ)
నమో సాయి కమలాసనా (బ్రహ్మ)
నమో సాయి మధుసూదనా! (విష్ణు)
పంచవదనా సాయినమో! (శివ)
నమో సాయి అత్రినందనా (దత్త)
నమో సాయి పాకశాసనా! (ఇంద్ర)
నమో సాయి నిశారమణా (చంద్ర)
వహ్నినారాయణా సాయి నమో! (అగ్ని)
నమో సాయి రుక్మిణీవరా (కృష్ణ)
నమో సాయి చిత్ భాస్కరా (సూర్య)
నమో సాయి జ్ఞానసాగరా (పరబ్రహ్మ)
జ్ఞానేశ్వరా శ్రీ సాయి నమో||"

ఓం