శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము - పి.నారాయణరావు Back   Home 

ఆరవ అధ్యాయము

శ్రీరామనవమి ఉత్సవము, మసీదు మరామతు గురువుగారి కరస్పర్శ ప్రభావము - శ్రీ రామనవమి యుత్సవము, దాని ప్రారంభము, పరిణామము మొదలగునవి. మసీదు మరామతులు.

గురువుగారి హస్తలాఘవము

సంసారమను సముద్రములో జీవుడనే యోడను సద్గురువు నడుపునపుడు అది సులభముగాను జాగ్రర్తగాను గమ్యస్థానము చేరును. సద్గురువనగానే సాయిబాబా జ్ఞప్తికి వచ్చుచునారు. నా కండ్ల యెదుట సాయిబాబా నిలచియున్నట్లు, నా నుదుట విభూతి పెట్టుచున్నట్లు, నా శిరస్సు పై చేయివేసి యాశీర్వదించుచున్నట్లు పొడముచున్నది. నా మనస్సు సంతోషములో మునిగి నా కండ్లనుండి ప్రేమ పొంగి పొరలు చున్నది. గురువుగారి హస్తస్పర్శ ప్రభావము అద్భుతమైనది. సూక్ష్మ శరీరము (కోరికలు, భావముల మయము) అగ్ని చే కూడ కాలనట్టిది. గురువుగారి హస్తము తగులగానే కాలిపోవును; జన్మజన్మల పాపములు పటాపంచలై పోవును. మతవిషయములు భగవద్విషయములనగనే అసహ్యపడువారికి కూడ శాంతి కలుగును. సాయిబాబా చక్కని యాకారము చూడగనే సంతసము కలుగును. కండ్లనిండ నీరు నిండును, మనస్సు ఊహలతో నిండును. నేనే పరబ్రహ్మమునను చైతన్యమును మేల్కొలిపి ఆత్మసాక్షాత్కారానందమును కలిగించును. నేను నీవు అను భేధబావమును తొలగించి బ్రహ్మాములో నైక్యము చేయును. వేదములుగాని పురాణములుగాని పారాయణ చేయునప్పుడు శ్రీ సాయిబాబా రాముడుగా గాని, కృష్ణుడుగా గాని రూపము ధరించి తమ కథలు వినునట్లు చేయును. నేను భాగవత పారాయణకు పూనుకొనగనే శ్రీ సాయి యాపాదమస్తకము కృష్ణునివలే గాన్పించును. ఎవరితోనైనా సంభాషించునపుడు సాయిబాబా కథలే ఉదాహరణములుగా నిచ్చుటకు జ్ఞప్తికి వచ్చును. నేనేదైన వ్రాయ తలపెట్టినచో వారి యనుగ్రహము లేనిదే యొక మాటగాని వాక్యముగాని వ్రాయలేను. వారి యాశీర్వాదము లభించిన వెంటనే యంతులేనట్లు వ్రాయగల్గుదును. భక్తునిలో యహంకారము విజృంభిచగనే బాబా దానిని యణచివేయును. తన శక్తితో వాని కోరికను నెరవేర్చి సంతుష్టుజేసి యాశీర్వదించును. శాయి పాదములకు సాష్టాంగ నమస్కారముచేసి సర్వస్య శరణాగతి చేసినవానికి ధర్మార్థ కామమోక్షములు సిద్ధించును. భగవత్ సాన్నిధ్యమునకు పోవుటకు కర్మ , జ్ఞానయోగ, భక్తి యను నాలుగు మార్గములు కలవు. అన్నింటిలో భక్తి మార్గము కష్టమైనది. దాని నిండ ముండ్లు గోతులుండును. సద్గురుని సహాయముతో ముండ్లను గోతులను తప్పించుకొని నడచినచో గమ్యస్థానము అవలీలగా చేరవచ్చును. దీనిని గట్టిగా నమ్ముడని సాయిబాబా చెప్పుచుండెను.

స్వయంవత్తాకమైన బ్రహ్మముయొక్క తత్వవిచారము చేసినపిమ్మట బ్రహ్మముయొక్క శక్తి (మాయ), బ్రహ్మసృష్టిని గూర్చి చెప్పి వాస్తవమునకీ మూడును నొకటియేయని సిద్దాంతీకరించి, రచయిత బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన యభయప్రదానవాక్యములను ఈ క్రింద ఉదాహరించుచున్నాడు.

"నా భక్తుని యింటిలో అన్నవస్త్రములకు ఎప్పుడు లోటుండదు. నాయందే మనస్సు నిలిపి, భక్తిశ్రద్ధలతో మనఃపూర్వకముగా నన్నే యారాధించువారి యోగక్షేమముల నేను జూచెదను. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు కూడ ఇట్లనే చెప్పియున్నాడు. కావున వస్త్రాహారముల కోరకు ప్రయాసపడవద్దు. నీ కేమైన కావలసిన భగవంతుని వేడుకొనుము. ప్రపంచములో పేరుకీర్తులు సంపాదించుట మాని భగవంతుని కరుణాకటాక్షములు పొందుటకు, భగవంతునిచే గౌరవమందుటకు యత్నించుము. ప్రపంచగౌరవమందుకొను భ్రమను విడువుము. మనస్సునందు ఇష్టదైవము యొక్క యాకారమును నిలుపుము. సమస్తేంద్రియములను మనస్సును భగవంతుని యారాధన కొరకే నియమింపుము. ఇతరముల వైపు మనస్సు పోనివ్వకుము. ఎల్లప్పుడు నన్నే జ్ఞప్తి యందుంచుకొనునట్లు మనస్సును నిలుపుము. దానిని శరీరము, ధనము, ఇల్లు పట్ల సంచరించకుండ గట్టిగా నిలుపుము. అప్పుడది శాంతి వహించి నెమ్మదిగాను, యెట్టి చికాకు లేక యిండును. అప్పుడే మనస్సు సరియైన సాంగత్యములో నున్నదని గ్రహించుము. మనస్సు చంచలముగ నున్నచో దానికి ఏకాగ్రత లేనట్లే."

బాబా మాటలుదాహరించిన పిమ్మట గ్రంధకర్త శిరిడీలో జరుగు శ్రీరామనవమి యుత్సవమును వర్ణించుటకు మొదలిడెను. శిరిడీలొ జరుగు నుత్సవము లన్నిటిలో శ్రీరామనవమియే గొప్పది. కావున సాయిలీల (1925-పుట 197) పత్రికలో విపులముగ వర్ణింపబడిన శ్రీరామనవమి యుత్సవముల సంగ్రహమిట పేర్కొనబడుచున్నది.

కోపర్ గాంవ్ లో గోపాలరావు గుండ్ అనునతడు పోలీసు సర్కిలు ఇన్ స్పేక్టరుగా నుండెను. అతడు బాబాకు గొప్పభక్తుడు. అతనికి ముగ్గురు భార్యలున్నప్పటికీ సంతానము కలుగలేదు. శ్రీ సాయి యాశీర్వచనముచే అతని కొక కొడుకు బుట్టెను. దానికాతడు మిక్కిలి సంతసించి శిరిడీలో నుత్సవము చేసిన బాగుండునని 1897లో భావించెను. ఈ విష్యమై తక్కిన భక్తులగు తాత్యాపాటీలు, దాదా కోతేపాటీలు, మాధవరావు దేశపాండేలతో సంప్రదించెను. వారంతా దీనికి సమ్మతించిరి. బాబా ఆశీర్వచనమును, అనుమతిని పొందిరి. జిల్లా కలెక్టరు అనుమతికై దరఖాస్తు పెట్టిరి. గ్రామకరణము దానిపై నేదో వ్యతిరేకముగా చెప్పినందున అనుమతి రాలేదు. కానీ బాబా ఆశీర్వదించియుండుటచే రెండవ పర్యాయము ప్రయత్నించగా వెంటనే యనుమతి వచ్చెను. సాయిబాబాతో మాట్లాడిన పిమ్మట ఉత్సవము శ్రీరామనవమినాడు చేయుటకు నిశ్చయించిరి. దానిలో బాబా వారికేదో యింకొక ఉద్దేశ్యమున్నట్లు కానుపించుచున్నది. ఈ ఉత్సవమును శ్రీరామనవమితో కలుపుట, హిందువుల మహమ్మదీయుల మైత్రికొరకు కాబోలు. భవిష్యత్సంఘటనలను బట్టి చూడగా బాబా యిద్దేశములు రెండును నెరవేరినవి.

ఉత్సవములు జరుపుటకు అనుమతి వచ్చెనుగాని యితర కష్టములు గాన్పించెను. శిరిడీ చిన్న గ్రామమగుటచే నీటి యిబ్బంది యొక్కువగానుండెను. గ్రామమంతటికీ రెండు నూతులుండెడివి. ఒకటి ఎండా కాలములో నెండిపోవుచుండెను. రెండవదానిలో నీళ్ళు ఉప్పనివి. ఈ ఉప్పు నీటి బావిలో బాబా పువ్వులు వేసి మంచినీళ్ళబావిగా మార్చెను. ఈ నీరు చాలకపోవుటచే తాత్యాపాటీలు దూరమునుంచి మోటలద్వారా నీరు తెప్పించెను. అప్పటికి మాత్రమే పనికివచ్చునట్లు అంగళ్ళు వేసిరి. కుస్తీల కొరకేర్పాటు చేసిరి.

గోపాలరావుగుండున కొకస్నేహితుడు గలడు. వాని పేరు దాము అణ్ణా కాసార్. అతనిది అహమద్ నగరు. అతనికి కూడ ఇద్దరు భార్యలున్నప్పటికీ సంతానము లేకుండెను. అతనికి కూడ బాబా యాశీర్వాదముచే పుత్రసంతానము గలిగెను. ఉత్సవముకొరకు ఒక జండా తయారు చేయించవలెనని గోపాలరావు అతనికి చెప్పెను. అందులకతడు సమ్మతించెను. అట్లనే నానాసాహెము నిమోన్ కరును ప్రభోధించగా అతడు కూడ ఒక నగిషీజండా నిచ్చుటకు ఒప్పుకొనెను. ఈ రెండు జండాలు ఉత్సవముతో తీసికొనిపోయి మసీదు రెండుమూలలమందు నిలబెట్టిరి. ఈ పద్దతి ఇప్పటికినీ అవలంబించుచున్నారు. బాబా యుండు మసీదునకు ద్వారకామాయి అని పేరు.

చందన ఉత్సవము

ఈ యిత్సవములో నింకొక ఉత్సవము కూడ ప్రారంభమయ్యెను. కొరాహ్లే గ్రామమందు అమీరు షక్కర్ అను మహమ్మదీయ భక్తుడు గలడు. అతడు చందన ఉత్సవమును ప్రారంభించెను. ఈ ఉత్సవము గొప్ప మహమ్మదీయ ఫకీరుల గౌరవార్థము చేయుదురు. వెడల్పు పళ్ళెములో చందనపు ముద్దనుంచి తలపై పెట్టుకొని సాంబ్రాణి ధూపములతో బాజాభజంత్రీలతో ఉత్సవము సాగించెదరు. ఉత్సవమూరేగిన పిమ్మట మసీదునకు వచ్చి మసీదు గూటిలోను, గోడలపై నను ఆ చందనమును చేతితో నందరును తట్టెదరు. మొదటి మూడు సంవత్సరములు ఈ యుత్సవము అమీరుషక్కరు జరిపెను. పిమ్మట అతని భార్య జరిపెను. ఒకేదినమందు పగలు హిందువులచే జండాయుత్సవము, రాత్రులందు మహమ్మదీయులచే చందనోత్సవము ఏ కొట్లాటలు లేక జరుగుచున్నవి.

ఏర్పాట్లు

శ్రీ రామనవమి బాబాభక్తులకు ముఖ్యమైనది; పవిత్రమైనది. భక్తులందరు వచ్చి ఈ యిత్సవములో పాల్గొనుచుండిరి. బయటి ఏర్పాట్లన్నియు తాత్యాకోతేపాటీలు చూచుకొనెడివారు. ఇంటిలోపల చేయవలసినవన్నియు రాధాకృష్ణమాయి యను భక్తురాలు చూచుచుండెను. ఆమె యింటినిండా భక్తులు దిగేవారు. ఆమె వారికి కావలసినవన్నియు సమకూర్చుచుండెను. ఉత్సవమునకు కావలసినవన్నియు సిద్ధపరచుచుండెను. అమె స్వయముగా మసీదును శుభ్రపరచి గోడలకు సున్నము వేయుచుండెను. మసీదుగోడలు బాబా వెలిగించు ధునిమూలముగా మసితో నిండియుండెడివి. వానిని చక్కగా కడిగి సున్నము పూయుచుండెను. ఒక్కొక్కప్పుడు మండు ధుని కూడ తీసి బయట పెట్టుచుండెను. ఇదంతయు బాబా చావడిలో పరుండునప్పుడు చేసేది. ఈ పనిని శ్రీ రామనవమికి ఒకరోజు ముందే చేయుచుండెను. బీదలకు అన్నదానమనగా బాబాకు చాలా ప్రీతి. అందుచే బీదలకు అన్నదానము ఈ యుత్సవసమయమందు విరివిగా చేయుచుండిరి. వంటలు విస్తారముగా, మిఠాయి దినుసులతో రాధాకృష్ణామాయి ఇంటిలో చేయుచుండిరి. ఇందులో అనేకమంది భక్తులు పూనుకొనుచుండెడివారు.

మేళా లేదా ఉత్సవమును శ్రీరామనవమి ఉత్సవముగా మార్చుట

ఈ ప్రకారముగా 1897 నుండి 1911 వరకు ఉత్సవము వైభవముగా జరుగుచుండెను. రానురాను వృద్ధియగుచుండెను. 1912 లో నొక మార్పు జరిగెను. "సాయి సగుణోపాసన" ను వ్రాసిన కవియగు కృష్ణారావు జోగేశ్వర భీష్మయనువాడు దాదాసాహెబు ఖాపర్డే (అమరావతివాసి) తో నుత్సవమునకు వచ్చెను. వారు దీక్షిత్ వాడాలో బసచేసిరి. కృష్ణారావు వసారాలో చేరగిలి యుండగా కాకామహాజని పూజాపరికరముల పళ్ళెముతో మసీదుకు పోవుచుండగా అతనికి ఒక క్రొత్త యాలోచన తట్టెను. వానిని పిలిచి యిట్లనెను. 'ఈ యుత్సవమును శ్రీరామనవమి నాడు చేయుటలో భగవదుద్దేశ మేదియో యుండవచ్చును. శ్రీరామనవమి యుత్సవమనగా హిందువులకు చాలా ముఖ్యము. కనుక యీ దినమందు శ్రీరామనవమి యేల జరుపకూడ" దని యడిగెను. కాకామహాజని యీ యాలోచనకు సమ్మతించెను. బాబా యనుమతి తెచ్చుటకు నిశ్చయించిరి. ఒక కష్టము మాత్రము తీరనిదిగా గాన్పించెను. అది హరిదాసును సంపాదించుట. భగవన్మహిమలను కీర్తనచేయుటకు హరిదాసు నెచ్చటనుండి తేవలెననునది గొప్ప సమస్యగా నుండెను. తుదకది భీష్ముడే పరిష్కరించెను. ఎట్లన, అతని రామాఖ్యానమను శ్రీరాముని చరిత్ర సిద్ధముగా నుండుటచే నతడు దానిని కీర్తన చేయుటకు, కాకామహాజని హార్మోనియం వాయించుటకు నిశ్చయించిరి. చక్కెర తో కలిపిన శొంఠి గుండ ప్రసాదము రాధాకృష్ణామాయి చేయుట కేర్పాటయ్యెను. మసీదునందుండియే గ్రహించుచున్న బాబా వాడలో నేమి జరుగుచున్నదని మహాజనిని ప్రశ్నించెను. బాబా యడిగిన ప్రశ్నను మహాజని గ్రహించలేకపోవుటచే బాబా యదేప్రశ్న భీష్మునడిగెను. అతడు శ్రీరామనవమి యుత్సవము చేయ నిశ్చయించితిమనియు నందులకు బాబా యనుమతి నివ్వవలెననియు కోరెను. బాబా వెంటనే యాశీర్వదించెను. అందరు సంతసించి జయంతి ఉత్సవమునకు సంసిద్ధులైరి. ఆ మరుసటి దినమున మసీదు నలంకరించిరి. బాబా ఆసనమునకు ముందు ఊయెల వ్రేలాడగట్టిరి. దీనిని రాధాకృష్ణమాయి ఇచ్చెను. శ్రీరామజన్మోత్సవము ప్రారంభమయ్యెను. భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచెను. మహాజని హార్మోనియం వాయించుచుండెను. బాబా మహాజనిని పిలిపించెను. అతడు కొంచెము జంకెను. జన్మోత్సవము జరుపుటకు బాబా యొప్పుకొనునో లేదో యని అతడు సంశయించెను. అతడు బాబా వద్దకు వెళ్ళిన తోడనే యిదియంతయు యేమని బాబా యడిగెను. ఆ ఊయల యిందుకు కట్టిరని యడిగెను. శ్రీరామనవమి మహోత్సవము ప్రారంభమైనదనియు అందులకే ఊయల కట్టిరనియు అతడు చెప్పెను. బాబా మసీదులో నుండు భగవంతుని నిర్గుణస్వరూపమగు "నింబారు" (గూడు) నుండి యొక పూలమాలను తీసి మహాజని మెడలో వేసి యింకొకటి భీష్మునికి పంపెను. హరికధ ప్రారంభమయ్యెను. కొంతసేపటికి కధ ముగిసెను. 'శ్రీరామచంద్రమూర్తికీ జై ' యని ఎర్రగుండ బాజాభజంత్రీల ద్వనులమధ్య అందరిపైన బడునట్లు విరివిగా జల్లిరి. అందరు సంతోషములో మునిగిరి. అంతలో నొక గర్జన వినబడెను. చల్లుచుండిన గులాల్ యను ఎర్ర పొడుము ఎటులనో బాబా కంటిలో పడెను. బాబా కోపించిన వాడై బిగ్గరగా తిట్టుట ప్రారంభించెను. జనులందరు యిది చూచి భయపడి పారిపోయిరి. కాని బాబా భక్తులు, అవన్నియు తిట్ల రూపముగా తమ కిచ్చిన బాబా యాశీర్వాదమని గ్రహించి పోకుండిరి. శ్రీరామచంద్రుడు పుట్టినప్పుడు రావణుడనే యహంకారమును, దురాలోచనలను చంపుటకై నిశ్చయముగా బాబా రూపములోనున్న రాముడు తప్పక కోపించవలెననిరి. శిరిడీలో ఏదైన క్రొత్తది ప్రారంభించునపుడెల్ల బాబా కోపించుట యొక యలవాటు. దీనిని తెలిసినవారు గమ్మున నూరకుండిరి. తన ఊయలను బాబా విరుచునను భయముతో రాధాకృష్ణామాయి మహాజనిని బిలిచి ఊయలను దీసికొని రమ్మనెను. మహాజని పోయి దానిని విప్పుచుండగా బాబా అతనివద్దకు పోయి ఊయలను తీయవలదని చెప్పెను. కొంతసేపటికి బాబా శాంతించెను. ఆనాటి మహాపూజ హారతి మొదలగునవి ముగిసెను. సాయంత్రము మాహాజని పోయి ఊయలను విప్పుచుండగా ఉత్సవము పూర్తికానందున బాబా దానిని విప్పవద్దని చెప్పియా మరుసటి దినము శ్రీ కృష్ణ జననమునాడు పాటించు "కాలాహండి" యను నుత్సవము జరిపిన పిమ్మట తీసివేయవచ్చునని చెప్పెను. కాలాహండి యనగా నల్లని కుండలో యటుకులు, పెరుగు, ఉప్పుకారము కలిపి వ్రేలాడగట్టెదరు. హరికధ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టెతో పగులగొట్టెదరు. రాలిపడిన యటుకులను భక్తులకు పంచిపెట్టెదరు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే తన స్నేహితులగు గొల్లపిల్లవాండ్రకు పంచిపెట్టుచుండెను. ఆ మరుసటి దినము ఇవన్నియు పూర్తియైనపిమ్మట ఊయలను విప్పుటకు బాబా సమ్మతించెను. పగటివేళ పతాకోత్సవము, రాత్రి యందు చందనోత్సవము శ్రీ రామనవమి ఉత్సవసమయమందు గొప్ప వైభవముగా జరుగుచుండెను. అప్పటినుండి మామూలు జాతర (మేళ) శ్రీ రామనవమి యుత్సవముగా మారెను.

1913 నుంచి శ్రీరామనవమి యుత్సవములోని యంశములు హెచ్చించిరి. చైత్రపాడ్యమినుంచి రాధాకృష్ణమాయి "నామసప్తాహము" ప్రారంభించుచుండెను. భక్తులందరు అందు పాల్గొందురు. ఆమె కూడ వేకువజామున భజనలో చేరుచుండెను. దేశమంతట శ్రీ రామనవమి ఉత్సవములు జరుగుటచే హరికధాకాలక్షేపము చేయు హరిదాసు చిక్కుట దుర్లభముగా నుండెను. శ్రీరామనవమికి 5,6 రోజులు ముందు మహాజని బాలబువ మాలీని (ఆధునిక తుకారాం) కలిసియుండుటచే కీర్తన చేయుటకు వారిని తోడ్కొనివచ్చెను. అ మరుసటి సంవత్సరము అనగా 1914 లో సతారాజిల్లా బిర్హడ్ సిద్దకవఠె గ్రామములోని హరిదాసుడగు బాలబువ సతార్కర్ స్వగ్రామములో ప్లేగు వ్యాపించియుండుటచేత కధలు చెప్పక ఖాళీగా నుండెను. బాబా యనుమతి కాకా ద్వారా పొంది అతడు శిరిడీ చేరెను. హరికధ చెప్పెను. బాబా అతనిని తగినట్లు సత్కరించెను. ప్రతి సంవత్సరము ఒక్కొక్క క్రొత్త హరిదాసును పిలుచు ఈ సమస్యను 1914 వ సంవత్సరములో శ్రీ సాయి పరిష్కరించెను. ఈ పని శాశ్వతముగా దాసగణు మహారాజునకు అప్పగించెను. ఈనాటి వరకు దాసగణు ఈ కార్యమును జయప్రదముగా జరుపుచున్నారు.

1912 నుండి ఈ ఉత్సవము రాను రాను వృద్ధిపొందుచుండెను. చైత్రశుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు శిరిడీ తుమ్మెదల పట్టువలే ప్రజలతో నుండుచుండెను. అంగళ్ళ సంఖ్య పెరిగిపోయెను. కుస్తీలలో ననేకమంది పాల్గొనుచుండిరి. బీదలకు అన్నసంతర్పణ బాగుగ జరుగుచుండెను. రాధాకృష్ణమాయి కృషిచే శ్రీ సాయిసంస్థాన మేర్పడెను. అలంకారములు; ఆడంబరము లెక్కువాయెను. అలంకరింపబడిన గుర్రము, పల్లకి, రధము, పాత్రలు, వెండిసామానులు, బాల్టీలు, వంటపాత్రలు, పటములు, నిలువుటద్దములు బహూకరింపబడెను. ఉత్సవము నకు ఏనుగులు కూడ వచ్చెను. ఇవన్నియు హెచ్చినప్పటికీ సాయిబాబా వీనిని లెక్కించేవారు కారు. ఈ యుత్సవములో గమనింపవలసిన ముఖ్యవిషయమేమన హిందువులు, మహమ్మదీయులు కలసిమెలసి యెట్టి కలహములు లేకుండ గడిపేవారు. మొదట 5,000 మొదలు 7,000 వరకు యాత్రికులు వచ్చేవారు. తుదకు 75,000 వరకు రాజొచ్చిరి. అంతమంది గుమిగూడినప్పటికి ఎన్నడైనను వ్యాధులుకాని జగడములు గాని కనిపించలేదు.

మసీదు మరమతులు

గోపాలరావుగుండునకు ఇంకొక మంచి యాలోచన తట్టెను. ఉత్సవము ప్రారంభించినట్లే మసీదును తగినట్లుగా తీర్చిదిద్దవలెనని నిశ్చయించుకొనెను. మసీదుమరామతుచేయు నిమిత్తమై రాళ్ళను తెప్పించి చెక్కించెను. కాని ఈ పని బాబా అతనికి నియమించలేదు. ఈ పని నానాసాహెబు చాందోర్కరుకు, రాళ్ళు తాపన కాకాసాహేబుదీక్షిత్ కు నియోగించెను. ఈ పనులు చేయించుట బాబాకిష్టము లేకుండెను. కాని భక్తుడగు మహళ్సాపతి కల్గించుకొనుటవలన బాబా యనుమతి నిచ్చెను. బాబా చావడిలో పండుకొన్న ఒక్క రాత్రిలో మసీదు నేలను చక్కగా రాళ్ళచే తాపనచేయుట ముగించిరి. అప్పటినుండి బాబా గోనెగుడ్డపై కూర్చుండుట మాని చిన్న పరుపుమీద కూర్చుండువారు. గొప్ప వ్యయప్రయాసలతో 1911వ సంవత్సరములో సభామండపము పూర్తిచేసిరి. మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది. సౌకర్యముగా లేకుండెను. కాకాసాహెబు దీక్షిత్ దానిని విశాలపరచి పైకప్పు వేయదలచెను. ఎంతో డబ్బుపెట్టి యినుపస్థంభములు మొదలగునవి తెప్పించి పని ప్రారంభించెను. రాత్రియంతయు శ్రమపడి స్థంభములు నాటిరి. ఆ మరుసటి దినము ప్రాతఃకాలముననే బాబా చావడి నుండి వచ్చి యది యంతయు చూచి కోపించి వానిని పీకి పారవైచెను.

ఆ సమయమందు బాబా మిక్కిలి కోపోద్దీపితుడయ్యెను. ఒక చేతితో ఇనుపస్థంభమును బెకలించుచు, రెండవచేతిలో తాత్యాపాటీలు పీకను బట్టుకొనెను. తాత్యా తలపాగాను బలవంతముగా దీసి, యగ్గిపుల్లతో నిప్పంటించి, యొక గోతిలో పారవైచెను. బాబా నేత్రములు నిప్పుకణములవలే వెలగుచుండెను. ఎవరికినీ బాబా వైపు చూచుటకు ధైర్యము చాలకుండెను. అందరు భయకంపితులైరి. బాబా తన జేబులోనుండి ఒక రూపాయి తీసి యటువైపు విసరెను. అది శుభసమయమందు చేయు యాహుతివలె కనబడెను. తాత్యాకూడ చాల భయపడెను. తాత్యాకేమి జరుగనున్నదో ఎవరికీ ఏమియు తెలియకుండెను. అందులో కల్పించుకొనుట కెవ్వరికీ ధైర్యము లేకుండెను. కుష్ఠురోగి యు బాబా భక్తుడు నగు భాగోజి శిందియా కొంచెము ముందుకు పోగా బాబా వానిని ఒక ప్రక్కకు త్రోసెను. మాధవరావు ప్రయత్నించగా వానిపై బాబా ఇటుకరాయి రువ్వెను. ఎంతమంది జోలికి పోదలిచిరో అందరికీ యొకేగతి పట్టెను. కాని కొంతసేపటికి బాబా శాంతించెను. ఒక దుకాణదారుని పిలిపించెను. వాని వద్దనుండి జరీపాగాను క్రయమునకు దీసికొనెను. దానిని బాబా స్వయముగా తాత్యా తలకు చుట్టెను. తాత్యా ను ప్రత్యేకముగా గౌరవించుటకు బాబా యట్లు చేసియుండును. బాబా యొక్క యీ వైఖరిని జూచినవారెల్లరు నాశ్చర్యమగ్నులైరి. అంత త్వరలో బాబా కెట్లు కోపము వచ్చెను? ఎందుచేత నీ విధముగా తాత్యాను శిక్షించెను. వారి కోపము తత్ క్షణమే ఎట్లు చల్లబడెను? అని యందరు ఆలోచించుచుండిరి. బాబా ఒక్కొక్కప్పుడు శాంతమూర్తివలే గూర్చుండి యత్యంతానురాగముతో మాట్లాడుచుండువారు. అంతలో నకారణముగా కోపించెడివారు. అటువంటి సంఘటనలు అనేకములు గలవు. కాని యేది చెప్పవలెనను విషయము తేల్చుకొనలేకున్నాను. అందుచే నాకు జ్ఞాపకము వచ్చెనపుడెల్ల ఒక్కొక్కటి చెప్పెదను.

ఓం నమో శ్రీ సాయినాధాయ

శాంతిః శాంతిః శాంతిః

ఆరవ అధ్యాయము సమాప్తము