శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము - పి.నారాయణరావు Back   Home 

ఏడవ అధ్యాయము

అద్భుతావతారము; సాయిబాబా వైఖరి; వారి యోగాఖ్యానము; వారి సర్వాంతర్యామిత్వము; కుష్ఠుభక్తుని సేవ; ఖాపర్డే కొడుకు ప్లేగు సంగతి; పండరీపురము పోవుట.

అద్భుతావతారము

సాయిబాబాకు యోగాభ్యాసము లన్నియు తెలిసియుండెను. షణ్మార్గములందును బాబా ఆరితేరినవారు. అందులో కొన్ని ధౌతి, ఖండయోగము; సమాధి మొదలగునవి; ధౌతి అనగా 3 అంగుళముల వెడల్పు, 22 1/2 అడుగుల పొడవుగల తడిగుడ్డతో కడుపును లోపల శుభ్రపరచుట. ఖండయోగమనగా శరీరావయవములన్ని యు విడదీసి తిరిగి కలుపుట.

బాబా హిందువన్నచో వారు మహమ్మదీయ దుస్తులతో నుండెడి వారు. మహమ్మదీయుడన్నచో హిందూమతాచార సంపన్నుడుగ గాన్పించుచుండెను. బాబా శాస్త్రోక్తముగ హిందువుల శ్రీరామనవమి యుత్సవమును జరుపుచుండెను. అదే కాలమందు మహమ్మదీయుల చందనోత్సవము జరుపుటకు అనుమతించెను. ఈ యుత్సవసమయమందు కుస్తీలను ప్రోత్సహించుచుండువారు. గెలిచినవారికి బహుమతులిచ్చు వారు గోకులాష్టమినాడు "గోపాల్ కాలా" యుత్సవము జరిపించుచుండెను. ఈదుల్ ఫితర్ పండుగనాడు మహమ్మదీయులచే మసీదులో నమాజు చేయించుచుండెడివారు. మొహర్రం పండుగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజీయా లేక తాబూతు నిల్పి కొన్ని దినములు దానినచ్చట నుంచినపిమ్మట గ్రామములో నూరేగించెదమనిరి. నాలుగు దినములవరకు మసీదులో తాబూతునుంచుటకు బాబా సమ్మతించి యయిదవనాడు నిర్విచారముగ ఏ సంశయము లేక దానిని తానే తీసి వేసెను. వారు మహమ్మదీయులన్నచో హిందువులకువలె వారి చెవులకు కుట్లుండెను. వారు హిందువులన్నచో సున్ తీ చేసికొనుమని సలహా నిచ్చుచుండువారు. కాని వారు మాత్రం సున్ తీ చేసికొనియుండలేదు. బాబా హిందువైనచో మసీదునందేల యుండును? మహమ్మదీయుడైనచో ధునియను అగ్ని హోత్రమును ఏల వెలిగించెయుండువారు? అదేగాక మహమ్మదీయ మతమునకు వ్యతిరేకముగా తిరుగలితో విసరుట, శంఖమూదుట, గంటవాయించుట హోమముచేయుట, భజన చేయుట, సంతర్పణచేయుట, అర్ఘ్యపాద్యములు సమర్పించుట మొదలగునవి జరుగుచుండెను. వారే మహమ్మదీయులైనచో కర్మిష్ఠులగు సనాతనాచారపరాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారము లెటులు చేయుచుండెడివారు? వారే తెగవారని యడుగబోయిన వారెల్లరు వారిని సందర్శించిన వెంటనే మూగలగుచు పరవశించుచుండిరి. అంచుచే సాయిబాబా హిందువుడో మహమ్మదీయుడో ఎవరును సరిగా నిర్ణయించలేకుండిరి. ఇందియొక వింత కాదు. ఎవరయితే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్యశరణాగతి యొనరించెదరో వారు దేవునిలో నైక్యమైపోయెదరు. వారికి దేనితో సంబంధముగాని, భేదభావముగాని యుండదు. వారికి జాతిమతములతో నెట్టి సంబంధము లేదు. సాయిబాబా అట్టివారు వారికి జాతులందు భేదము గాన్పించకుండెను. బాబా ఫకీరులతో కలిసి మత్స్యమాంసములు భుజించుచుండెను. కాని వారి భోజనపళ్ళెములో కుక్కలు మూతిపెట్టినను సణుగువారు కారు.

శ్రీ సాయి యవరాతము విశిష్టమైనది; యద్భుతమైనది. నా పూర్వసుకృతముచే వారి పాదములవద్ద కూర్చొను భాగ్యము లభించినది. వారి సాంగత్యము లభించుట నా యదృష్టము. వారి సన్నిథిలో నాకు కలిగిన యానందము ఉల్లాసము చెప్పనలవి కానివి. సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు. నేను వారి గొప్పతనమును, విశిష్టతను పూర్తిగా వర్ణించలేను. ఎవరు వారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానము కలుగును. సన్యాసులు, సాధకులు మోక్షమునకై పాటుపడు తదితరులనేకమంది సాయిబాబా వద్దకు వచ్చెడివారు. బాబా వారితో నడచుచు, మాట్లాడుచు, నవ్వుచు అల్లామాలిక్ యని యెల్లప్పుడు పలుకుచుండెడివారు. వారికి వివాదములుగాని, చర్చలుగాని యిష్టము లేదు. అప్పుడప్పుడు కోపించినప్పటికి వారెల్లప్పుడు నెమ్మదిగా నుండి శరీరమును పూర్తిగా స్వాధీనములో నుంచి కొనెడివారు. ఎల్లప్పుడు వేదాంతమును బోధించుచుండువారు, ఆఖరువరకు బాబా యెవరో ఎవరికి తెలియనేలేదు. వారు రాజులను, భిక్షుకులను నొకే రీతిగా ఆదరించిరి. అందరి యంతరంగములందు గల రహస్యములన్ని బాబా ఎరిగెడివారు. బాబా ఆ రహస్యములను వెలిబుచ్చగనే యందరు ఆశ్చర్యమగ్ను లగుచుండిరి. వారు సర్వజ్ఞు లయినప్పటికి ఏమియు తెలియనివానివలె నటించుచుండిరి. సన్మానములన్నచో వారికి అయిష్టము. సాయిబాబా నైజమట్టిది. మానవశరీరముతో నున్నప్పటికి వారు చేయుపనులను జూడ సాక్షాత్తూ భగవంతుడని చెప్పవలెను. అందరును వారిని జూచి శిరిడీలో వెలసిన భగవంతుడని యే యనుకొనుచుండిరి.

సాయిబాబా వైఖరి

నేను వట్టి మూర్ఖుడనగుటచే బాబా మహిమలను వర్ణించలేను. బాబా శిరిడీలో నున్న దేవాలయములన్నిటిని మరామతు చేయించెను. తాత్యాపాటీలు సహాయముతో గ్రామములోనున్న శని, గణపతి, పార్వతీశంకర, గ్రామదేవత, మారుతీదేవాలయముల మరామతు చేయించెను. వారి దానము పొగడదగినది. దక్షిణరూపముగా వసూలయిన పైకమంతయు నొక్కొక్కరికి రోజు కొక్కంటికి రూ.50/- 20/- 15/- చొప్పున ఇష్టము వచ్చినట్లు పంచిపెట్టెడివారు.

బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభము పొందువారు. కొందరు ఆరోగ్యవంతులగుచుండిరి. దుర్మార్గులు సన్మార్గులుగా మారుచుండిరి. కుష్ఠువారు కూడ రోగవిముక్తు లగుచుండిరి. అనేకులకు కోరికలు నెరవేరుచుండెను. కంటిలో రసముగాని మందుగాని వేయకనే గ్రుడ్డివారికి దృష్టి వచ్చుచుండెను; కుంటివారికి కాళ్ళు వచ్చుచుండెను. అంతులేని బాబా గొప్పతనమును పారమును ఎవ్వరును కనుగొనకుండిరి. వారి కీర్తి చాల దూరమువరకు వ్యాపించెను. అన్ని దేశముల భక్తులు శిరిడీలో గుమిగూడుచుండిరి. బాబా ఎల్లప్పుడు ధునివద్దనే ధ్యానమగ్నులయి కూర్చొనుచుండెను. ఒక్కొక్కప్పుడు స్నానము కూడ మానెడివారు.

తొలిదినములలో బాబా తెల్లపాగా, శుభ్రమైన ధోవతి, చొక్కా ధరించువారు. మొదట గ్రామములో రోగులను పరీక్షించి ఔషధము లిచ్చెడివారు. వారి చేతితో నిచ్చిన మందులు పనిచేయుచుండెడివి. మంచి హస్తవాసిగల డాక్టరని పేరు వచ్చెను. ఈ సందర్భమున నొక వింత విషయము చెప్పవలెను. ఒక భక్తుని కండ్లు వాచి మిక్కిలి ఎర్రబడెను. శిరిడీలో డాక్టరు దొరకలేదు. ఇతర భక్తులాతని బాబావద్దకు గొనిపోయిరి. అట్టి రోగులకు అంజనములు, ఆవుపాలు, కర్పూరముతో చేసిన ఔషధములు డాక్టర్లు ఉపయోగించెదరు. కాని బాబా చేసిన చికిత్స విశిష్టమైనది. నల్ల జీడిగింజలను నూరి రెండు మాత్రలు చేసి ఒక్కొక్కకంటిలో నొక్కొక్కదానిని దూర్చి గుడ్డతో కట్టుకట్టెను. మరుసటి దినము కట్టులను విప్పి నీళ్ళను ధారగా పోసెను. కండ్లలో ని పుసి తగ్గి కంటిపాపలు తెల్లబడి శుభ్రమయ్యెను. నల్లజీడిపిక్కలమందు పెట్టినప్పుడు సున్నితమైన కండ్లు మండనేలేదు. అటువంటి చిత్రములనేకములు గలవు. కాని యందు ఒకటి మాత్రమే చెప్పబడినది.

బాబా యోగాభ్యాసములు

బాబాకు యోగములన్నియు దెలియును. కాని యందులో రెండు మాత్రమే వర్ణింపబడును.

1. ధౌతి లేక శుభ్రపరచు విధానము

మసీదుకు చాల దూరమున ఒక మర్రిచెట్టు కలదు. అక్కడొక బావి కలదు. ప్రతి మూడవరోజు బాబా యచ్చటకు పోయి ముఖప్రక్షాళనము, స్నానము చేయుచుండెను. ఒకనాడు బాబా తన యూపిరి తిత్తులను బయటకి కక్కి వాటిని నీటితో శుభ్రపరచి నేరేడుచెట్టుపై ఆరవేయుట కొందరు గమనించిరి. శిరిడీలోని కొందరు దీనిని కండ్లారచూచి చెప్పిరి. మామూలుగా ధౌతియనగా 3 అంగుళములు వెడల్పు 22 1/2 అడుగుల పొడవుగల గుడ్డను మ్రింగి కడుపులో అరగంటవరకు నుండనిచ్చిన పిమ్మట తీసెదరు. కాని బాబా గారి ధౌతి చాల విశిష్టము, అసాధారణము నైనది.

2. ఖండయోగము

బాబా తన శరీరావయవము లన్నియు వేరుచేసి మసీదునందు వేర్వేరు స్థలములలో విడిచిపెట్టువారు. ఒకనాడొక పెద్దమనిషి మసీదునకు పోయి బాబా అవయవయములు వేర్వేరు స్థలములందు పడియుండుట చూచి భయకంపితుడై బాబాను ఎవరో ఖూనీచేసిరనుకొని గ్రామ మునసబు వద్దకొ పోయి ఫిర్యాదుచేయ నిశ్చయించుకొనెను. కాని మొట్టమొదట ఫిర్యాదుచేసినవానికి ఆ విషయముగూర్చి కొంచెమైన తెలిసియుండునని తననే అనుమానించెదరని యూరకొనెను. మరుసటిదినమతడు మసీదుకు బోయెను. బాబా ఎప్పటివలే హాయిగా కూర్చొని యుండుట చూసి యాశ్చర్యపడెను. ముందుదినము తాను చూసినదంతయు స్వప్నమనుకొనెను.

3. యోగము

బాల్యమునుంచి బాబా యోగాభ్యాసము చేయుచుండెను. దానిలో వారెంత నిష్ణాతులో ఎవరికీ తెలియదు. వారి ఊదీ ప్రసాదము వల్ల బాగుపడిన రోగులవద్దనుంచి డబ్బు పుచ్చుకొనక యుచితముగానే సేవ చేయుచుండిరి. అనేకమందిని యారోగ్యవంతులుగ జేసిరి. వారు చేయు పుణ్యకార్యములబట్టి వారికి గొప్ప కీర్తి వచ్చెను. బాబా సొంతముకొరకు ఏమియు చేయక యితరుల మేలుకొరకే యెల్లప్పుడు పాటుపడువారు. ఒక్కక్కప్పుడు ఇతరుల వ్యాధిని తనపై వేసికొని తాను మిక్కిలి బాధ ననుభవించెడివారు. అందులో నొకటి ఈ దిగువ పేర్కొందును. దీనినిబట్టి బాబా సర్వజ్ఞుడనియు మిక్కిలి దయార్ధృఅ హృదయుడనియు తెలియును.

బాబా సర్వాంతర్యామిత్వము, కారుణ్యము

1910 వ సంవత్సరము దీపావళి పండుగనాడు బాబా ధునివద్ద కూర్చుండి చలి కాగుచుండెను. బాబా ధునిలో కట్టెలు వేయుచుండెను. ధుని బాగుగా మండుచుండెను. కొంతసేపయిన తరువాత కట్టెలు వేయుటమాని తన చేతిని ధునిలో పెట్టెను. వెంటనే చేయి కాలిపోయెను. మాధవుడనే నౌకరును, మాధవరావు దేశపాండేయు దీనిని చూచిరి. వెంటనే పరుగెత్తి బాబాను పట్టి వెనుకకు లాగిరి. దేవా! ఇట్లేల చేసితిరని యడిగిరి. స్పృహ తెచ్చుకొని బాబా యిట్లు జవాబిచ్చెను. "దూరదేశమున ఒక కమ్మరి భార్య కొలిమితిత్తులను ఊదుచుండెను. అంతలో నామె భర్త పిలిచెను. తన యొడిలో బిడ్డయున్న సంగతి మరచి ఆమె తొందరగా లేచి పరుగిడజొచ్చెను. ఆ బిడ్డ మండుచున్న కొలిమిలో బడెను. అందుచేత వెంటనే నాచేతిని కొలిమిలో నికి దూర్చి బిడ్డను రక్షించితిని. నా చేయి కాలుట నాకంత బాధాకరము కాదు. కాని బిడ్డ రక్షింపబడెనను విషయము నాకానందము గలుగచేయుచున్న" దని బాబా నుడివెను.

కుష్ఠురోగ భక్తుని సేవ

బాబా చేయ్యి కాల్చుకొనెనని మాధవరావు దేశపాండే నానా సాహెబు చాందోర్కరుకు తెలియచేసెను. వెంటనే ఆయన బొంబాయి నుండి డాక్టరు పరమానందుని మందుల పెట్టెతో వెంటబెట్టుకొని వచ్చెను. నానా బాబాను చికిత్స చేయుటకై డాక్టరును చేయి చూడనిమ్మని కోరెను. బాబా యందులకు ఒప్పుకొనలేదు. చేయి కాలిన లగాయతు భాగోజీశిందే యను కుష్ఠురోగియే కట్టు కట్టుచుండెను. కాలిన చేతిపైన నెయ్యి రాసి, యాకు వేసి గుడ్డతో కట్టు కట్టెడివాడు. నానా యెంత వేడినను బాబా డాక్టరుగారిచే చికిత్స పొందుటకు సమ్మతింపలేదు. డాక్టరుగారు కూడ అనేకసారులు వేడుకొనిరి. కాని అల్లాయే తన కాక్టరని బాబా కాలయాపన చేయుచుండెను. అందుచే డాక్టరు మందుల పెట్టె మూతయైన తీయకుండగనే తిరిగి పోయెను. కాని డాక్టరుగారికి బాబా దర్శనభాగ్యము లభించెను. బాబా ప్రతిరోజు భాగోజిచే చేతికి కట్టు కట్టించుకొనుచుండెను. కొన్ని దినముల తరువాత చేయి బాగుపడెను. అందరు సంతోషించిరి. ఇప్పటికిని ఏమైన నొప్పి మిగిలిపోయినదాయను సంగతి ఎవరికి తెలియదు. ప్రతిరోజు ఉదయము భాగోజీ కట్టులను విప్పి, నేతితో తోమి, తిరిగి కట్టులను కట్టుచుండెడివాడు. బాబా మహాసమాధి వరకు ఇది జరుగుచునేయుండెను. బాబా సిద్ధపురుషుడగుటచే వారి కిదంతయు నవసరములేనప్పటికి భాగోజీ భక్తునియందు గల ప్రేమచే అతడొనర్చు ఉపాసనాసేవకు సమ్మతించెడివారు. బాబా లెండితోటకు పోవునపుడు భాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకొని వెంట వెళ్ళే వాడు. ప్రతిరోజు ఉదయము బాబా ధునియొద్ద కూర్చొనగనే, భాగోజి తన సేవాకార్యము మొదలిడువాడు. గతజన్మయందు భాగోజి పాపి. కనుకనే కుష్ఠురోగముచే బాధపడుచుండెను. వాని వ్రేళ్ళు ఈడ్చుకొనిపోయియుండెను. వాని శరీరమంతయు చీము కారుచు, దుర్వాసన కొట్టుచుండెను. బాహ్యమునకు దురదృష్టవంతునివలే గాన్పించినప్పటికి అతడు అదృష్టశాలియు, సంతోషియు, ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు; బాబా సహవాసము పూర్తిగా ననుభవించెను.

ఖాపర్డే కుర్రవాని ప్లేగు జాడ్యము

బాబా విచిత్ర లీలలలో నింకొకదానిని వర్ణించెను. అమరావతి నివాసియగు దాదాసాహెబు ఖాపర్డే భార్య తన చిన్న కొడుకుతో శిరిడీలో మకాం చేసెను. కొడుకుకు జ్వరము వచ్చెను. అది ప్లేగు జ్వరముక్రింద మారెను. తల్లి మిక్కిలి భయపడెను. శిరిడీ విడచి అమరావతి పోవలెననుకొని సాయంకాలము బాబా బుట్టీవాడావద్దకు వచ్చుచున్నప్పుడు వారి సెలవు నడుగ బోయెను. వణుకుచున్న గొంతుతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడియున్నాడని బాబాకు చెప్పెను. బాబా యామెతో కారుణ్యముతో, నెమ్మదిగా మాట్లాడదొడగెను. ప్రస్తుతము ఆకాశము మేఘములచే కప్పబడియున్నది గాని యవి చెదరి పోయికొద్దిసేపట్లో నాకాశమంతయు మామూలు రీతిగా నగునని బాబా యోదార్చెను. అట్లనుచు తన కఫనీ ని పైకెత్తి చంకలో కోడి గ్రుడ్లంత పెద్దవి నాలుగు ప్లేగు పొక్కులను అచటివారికి జూపెను. "చూచితిరా.. నా బక్తులకొరకు నేనెట్లు బాధపడెదనో! వారి కష్టములన్నియు నావిగనే భావించెదను." ఈ మహాద్భుతలీలను జూచి యోగీశ్వరులు భక్తులకొరకెట్లు బాధ లనుభవింతురో జనులకు విశ్వాసము కుదిరెను. యోగీశ్వరుల మనస్సు మైనముకన్న మెత్తనిది. వెన్నెలవలే మృదువైనది. వారు భక్తులను ప్రత్యుపకారము కోరకయే ప్రేమించెదరు. భక్తులను తమ బంధువులవలే జూచెదరు.

పండరీపురము పోయి యచ్చటుండుట

సాయిబాబా తన భక్తులనెట్లు ప్రేమించుచుండెనో వారి కోరికలను, అవసరముల నెట్లు గ్రహించుచుండెనో యను కధను చెప్పి ఈ అధ్యాయమును ముగించెదను. నానాసాహెబు చాందోర్కరు బాబాకు గొప్ప భక్తుడు. అతడు ఖాందేషులోని నందురుబారులో మామలతదారుగా నుండెను. అతనికి పండరీపురమునకు బదిలీ జరిగెను. సాయిబాబా యందు అతనికి గల భక్తియను ఫలమానాటికి పండెను. పండరీపురమును భూలోకవైకుంఠ మనెదరు. అట్టి స్థలమునకు బదిలీ యగుటచే నాతడు గొప్ప ధన్యుడు. నానాసాహెబు వెంటనే పండరి పోయి ఉద్యోగములో ప్రవేశించవలసి యుండెను. కాన శిరిడీ కి ఉత్తరము వ్రాయకయే పండరీపురము పోవలెనని బయలుదేరెను. శిరిడీకి హఠాత్తుగా పోయి తన విఠోబాయగు బాబాను దర్శించి పండరిపోవలె ననుకొనెను. నానాసాహెబు శిరిడీ వచ్చునను సంగతి ఎవరికి తెలియదు. కాని బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించెను. నానాసాహెబు నీమగాం చేరుసరికి శిరిడీ మసీదులో కలకలము కలిగెను. బాబా మసీదులో కూర్చుండి మహళ్సాపతి, అప్పాశిందే, కాశీరాములతో మాట్లాడుచుండెను. వెంటనే బాబా యిట్లనియెను. "మన నలుగురము కలసి భజన చేసెదము. పండరి ద్వారములు తెరచినారు. కనుక ఆనందముగా పాడెదము లెండు." అందరు కలసి పాడదొడంగిరి. ఆ పాట భావమేమన, "నేను పండరి పోవలెను. నేనక్కడ నివసించవలెను. అది నా దైవము యొక్క భవనము."

బాబా పాడుచుండెను. భక్తులందరు బాబాను అనుగమించిరి. కొద్ది సేపటికి నానా కుటుంబముతో వచ్చి బాబా పాదములకు సాష్టంగనమస్కారము చేసి, బాబాను పండరీపురము వచ్చి వారితో కలసి యక్కడుండుమని వేడుకొనియెను. ఈ బతిమాలుట కవసరము లేకుండెను. ఏలన బాబా యప్పటికే పండరి పోవలెను; అచ్చట నుండవలెనను భావమును వెలిబుచ్చుచుండెనని తక్కిన భక్తులు చెప్పిరి. ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై బడెను. బాబా యొక్క ఆజ్ఞను పొంది ఊదీ ప్రసాదమును గ్రహించి, ఆశీర్వాదమును పొంది నానా సాహెబు పండరికి పోయెను. ఇట్టి బాబా లీలల కంతులేదు.

ఓం నమో శ్రీ సాయినాధాయ

శాంతిః శాంతిః శాంతిః

ఏడవ అధ్యాయము సంపూర్ణము

మొదటిరోజు పారాయణ ముగిసినది