శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము - పి.నారాయణరావు Back   Home 

(రెండవ రోజు పారాయణ - శుక్రవారం)

ఎనిమిదవ అధ్యాయము

మానవజన్మ పాముఖ్యము; సాయిబాబా భిక్షాటనము; బాయజాబాయి సేవ; సాయిబాబా పడక జాగా; కుళాల్ చంద్ పై వారి ప్రేమ.

మానవజన్మ యొక్క ప్రాముఖ్యము

ఈ యధ్బుత విశ్వమందు భగవంతుడు కోట్లకొలది జీవులను సృష్టించి యున్నాడు. దేవతలు వీరులు, జంతువులు, పురుగులు, మనుష్యులు మొదలగువానిని సృష్టించెను. స్వర్గము, నరకము, భూమి మహాసముద్రము, ఆకాశమునందు నివసించు జీవకోటి యంతయు సృష్టించెను. వీరిలో నెవరిపుణ్య మెక్కువగునో వారు స్వర్గమునకు పోయి వారి పుణ్యఫలము ననుభవించిన పిమ్మట త్రోసి వేయబడుదురు. ఎవరి పాప మెక్కువగునో వారు నరకమునకు పోదురు. అచ్చట వారు పాపములకు తగినట్టు బాధలను పొందెదరు. పాపపుణ్యములు సమానమగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్షసాధనమునకై యవకాశము గాంచెదరు. వారి పాపపుణ్యములు నిష్క్రమించునపుడు వారికి మోక్షము కల్గును. వేయేల? మోక్షముగాని, పుట్టుకగాని వారువారు చేసికొనిన కర్మపై ఆధారపడి యుండును.

మానవశరీరముయొక్క ప్రత్యేక విలువ

జీవకోటి యంతటికి ఆహారము, నిద్ర, భయము, సంభోగము సామాన్యము. మానవున కివిగాక యింకొక శక్తి గలదు. అదియే జ్ఞానము దీని సహాయముననే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు. ఇంకే జన్మమందును దీని కవకాశము లేదు. ఈ కారణం చేతనే దేవతలు కూడ మానవజన్మను ఈర్ష్యతో చూచెదరు. వారు కూడ భూమిపై మానవజన్మమెత్తి మోక్షమును సాధించవలెనను కోరెదరు.

కొంతమంది మానవజన్మము చాల నీచమైనదనియు; చీము, రక్తము, మురికితో నిండియుండుననియు; తుదకు శిధిలమయి రోగమునకు మరణమునకు కారణమగునందురు. కొంతవరకది కూడ నిజమే. ఇన్ని లోటులున్నప్పటికి మానవునకు జ్ఞానమును సంపాదించు శక్తి కలదు. మానవ శరీరమును బట్టియే జన్మ యశాశ్వతమని గ్రహించుచున్నాడు. ఈ ప్రపంచ మంతయు మిధ్యయని, విరక్తి పొందుచు ఇంద్రియసుఖములు అనిత్యములు, అశాశ్వతములని గ్రహించి నిత్యానిత్యములకు భేదము కనుగొని, యనిత్యమును విసర్జించి తుదకు మోక్షమునకై మానవుడు సాధించును. శరీరము మురికితో నిండియున్నదని నిరాకరించినచో మోక్షమును సంపాదించు అవకాశమును పోగొట్టుకొనెదము. శరీరమును ముద్దుగా పెంచి విషయసుఖములకు మరగించినచో నరకమునకు పోయెదము. మనము నడువవలసిన త్రోవ యేదనగా శరీరము నశ్రద్ధ చేయకూడదు. దానిని ప్రేమించకూడదు. కావలసినంత జాగ్రర్త మాత్రమే తీసికొనవలెను. గుర్రపురౌతు తన గమ్యస్థానము చేరువరకు గుర్రమును ఎంత జాగ్రర్తతో చూచుకొనునో యంత జాగ్రర్త మాత్రమే తీసికొనవలెను. ఈ శరీరమును మోక్షము సంపాదించుటగాని లేక యాత్మసాక్షాత్కారము కొరకు గాని వినియోగించవలెను. ఇదియే జీవుని పరమావధియై యుండవలెను.

భగవంతుడనేక జీవులను సృష్టించినప్పటికి అతనికి సంతుష్టి కలుగలేదట. ఎందుకనగా భగవంతుని శక్తిని యవి గ్రహించలేక పోయినవి. అందుచేత ప్రత్యేకముగా మానవుని సృష్టించెను. వానికి జ్ఞానమనే ప్రత్యేకశక్తి నిచ్చెను. మానవుడు భగవంతుని లీలలను, అద్బుతకార్యము లను బుద్దిని మెచ్చుకొనునప్పుడు భగవంతుడు మిక్కిలి సంతుష్టి చెంది యానందించెను. అందుచే మానవజన్మ లభించుట గొప్ప యదృష్టము. బ్రాహ్మణజన్మ పొందుట అంతకంటే మేలయినది. అన్నిటికంటే గొప్పది సాయిబాబా చరణారవిందములపై సర్వస్య శరణాగతి చేయు అవకాశము కలుగుట.

మానవుడు యత్నించవలసినది

మానవజన్మ విలువైనదనియు, తుదకు మరణము తప్పదనియు, గ్రహించి మానవుడెల్లప్పుడు జాగరూకుడై యుండి జీవిత పరమావధిని సంపాదించుటకై యత్నించవలయును. ఏమాత్రమును అశ్రద్ధగాని ఆలస్యముగాని చేయరాదు. త్వరలో దానిని సంపాదించుటకు త్వరపడవలెను. భార్య చనిపోయిన వాడు రెండవ భార్యకొరకెంత ఆతురుతపడునో, కోల్పోయిన యువరాజుకై చక్రవర్తి యెంతగా వెదకయత్నించునో యట్లనే యాత్మసాక్షాత్కారము పొందువరకు రాత్రింబవళ్ళు విసుగు విరామము లేక కృషి చేసి సంపాదించవలెను. బద్ధకమును, అలసటను కునుకుపాట్లను దూరమొనర్చి రాత్రింబవళ్ళు ఆత్మయందే ధ్యానము నిలుపవలెను. ఈ మాత్రము చేయలేనిచో మనము పశుప్రాయుల మగుదుము.

నడువవలసిన మార్గము

మన ధ్యేయము త్వరలో ఫలించే మార్గమేదన, వెంటనే భగవత్ సాక్షాత్కారము పొందిన సద్గురువువద్ద కేగుట. మతసంబంధమైన యుపన్యాసములు వినినప్పటికి పొందనట్టిదియు, మతగ్రంధములు చదివినను తెలియనట్టిదియు నగు ఆత్మసాక్షాత్కారము సద్గురువుల సహవాసముచే సులభముగా పొందవచ్చును. నక్షత్రములన్నియు కలిసి యివ్వలేని వెలుతురు సూర్యుడెట్లు ఇవ్వగలుగుచున్నాడో యట్లనే మతోపన్యాసములు, మత గ్రంధములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలరు. వారి వైఖరి, సంభాషణలే గుప్తముగా మనకు సలహా నిచ్చును. క్షమ, నెమ్మది, వైరాగ్యము, దానము, ధర్మము, శరీరమును, మనస్సును స్వాధీనమందుంచుకొనుట, అహంకారము లేకుండుట మొదలగు శుభలక్షణములను - వారు అనుసరించునప్పుడు వారి పావనజీవితమునుంచి భక్తులు నేర్చుకొందురు. ఇది భక్తుల మనములకు ప్రభోధము కలుగచేసి పారమార్థికముగా ఉద్ధరించును. సాయిబాబా యట్టి యోగిపుంగవుడు; సద్గురువు.

బాబా ఫకీరువలే నటించునప్పటికిని వారెప్పుడును ఆత్మానుసంధానమునందే నిమగ్నులగుచుండిరి. దైవభక్తి గలవారిని, పవిత్రులనెల్లప్పుడు ప్రేమించుచుండిరి. సుఖములకు ఉప్పొంగువారు కారు. కష్టములవలన క్రుంగిపోవువారు కారు. రాజున్ను, దివాలా తీసిన వాడునూ బాబాకు సమానమే. తమదృష్టి మాత్రమున ముష్టివానిని చక్రవర్తిని చేయగలశక్తి యున్నప్పటికి బాబా యింటింటికి భిక్షకు పోయేవారు. వారి భిక్ష ఎట్టిదో చూతము.

బాబా యొక్క భిక్షాటనము

శిరిడీ జనులు పుణ్యాత్ములు. వారి యిండ్లయెదుట బాబా భిక్షకునివలే నిలచి "అక్కా! రొట్టె ముక్కపెట్టు" అనుచు దానిని అందుకొనుటకు చేయి చాచెడివారు. ఒక చేతిలో తంబిరేలుడొక్కు, ఇంకొక చేతిలో గుడ్డజోలీ పట్టుకొని పోవువారు. ప్రతిరోజు కొన్ని యిండ్లకు మాత్రమే పోవువారు. పలుచని పదార్ధములు, పులుసు, మజ్జిగ, కూరలు మొదలగునవి డొక్కులో పోసుకొనెడివారు. అన్నము, రొట్టెలు, మొదలగునవి జోలెలో వేయించుకొనెడివారు. బాబాకు రుచి యనునది లేదు. వారు నాలుకను స్వాధీనమందుంచుకొనిరి. కాన అన్నివస్తువులును డొక్కులోను, జోలెలోను వేసికొనెడివారు. అన్నిపదార్థములను ఒకేసారి కలిసి తిని సంతుష్టి చెందేవారు. పదార్థముల రుచిని పాటించేవారు కాదు. వారి నాలుకకు రుచి యనునది లేనట్లే కాన్పించుచుండెను. బాబా సరిగ 12 గంటలవరకు భిక్ష చేసేవారు. బాబా భిక్షకు కాలపరిమితి లేకుండెను. ఒక్కక్కదినమందు కొన్ని యిండ్లకు మాత్రమే పోయెడివారు సాధారణముగా 12 గంటలవరకు భిక్ష చేసేవారు. భిక్షలో దొరికిన పదార్థముల నన్నిటినీ ఒక మట్టిపాత్రలో వేసేవారు. దానిని కుక్కలు, పిల్లులు, కాకులు విచ్చలవిడిగా తినుచుండెడివి. వాటిని తరిమేవారు కారు. మసీదు తుడిచి శుభ్రము చేయు స్త్రీ 10, 12 రొట్టెముక్కలను నిరాటంకముగా తీసికొనుంచుండెడిది. కుక్కలను, పిల్లులను కలలో గూడా అడ్డుచెప్పనివారు, ఆకలిబాధతో నున్న మానవులకు భోజనము పెట్టుట మానుదురా? ఆయన జీవితము మిగుల పావనమైనది.

మొదట శిరిడీ ప్రజలు బాబాను పిచ్చిఫకీరని పిలిచెడివారు. ఎవరయితే భోజనోపాధికై గ్రామములో రొట్టెముక్కలపై నాధారపడుదురో అట్టివారు గౌరవింపబడుదురా? వారి మనస్సు, చేయి ధారాళమయినవి, ధనాపేక్షలేక దాక్షిణ్యము చూపువారు. బయటికి చంచలముగ సుస్థిరత్వములేనివారుగ గాన్పించిననూ లోన వారు స్థిర మనస్సు గలవారు. వారి మార్గము తెలియరానిది. అంత చిన్న గ్రామములో కూడ దయార్ధ్ర హ్రుదయులును, పవిత్రులును కొంతమంది బాబాను మహానుభావునిగా గుర్తించిరి. అట్టివారి విషయమొకటి యిచట చెప్పుచున్నాను.

బాయజాబాయి గొప్ప సేవ

తాత్యాకోతే పటీలు తల్లిపేరు బాయజాబాయి. ఆమె ప్రతి రోజు తలపై ఒక గంపలో రొట్టె, కూర పెట్టుకొని, యడవిలో బాబా తపస్సు చేయుచున్న చోటికి పోయి బాబాకు భోజనము పెట్టుచుండెను. ఒక్కొక్కప్పుడు మైళ్ళకొలది ముండ్లు, పొదలు దాటి బాబాను వెతకి పట్టుకొని సాష్టంగనమస్కారము చేయుచుండెను. ఫకీరు నెమ్మదిగా కదలక మెదలక ధ్యానము చేయుచుండువాడు. ఆమె బాబా యెదుట విస్తరొకటి వేసి భోజనపదార్థములు, రొట్టె, కూర మొదలగునవి పెట్టి బాబాను బలవంతము చేసి తినిపించుచుండెను. ఆమె భక్తివిశ్వాసములు చిత్రమైనవి. ప్రతిరోజు అడవిలో 12 గంటలకు మైళ్ళకొలది నడచి బాబాను వెదకి పట్టుకొని భోజనము చేయుమని బలవంతము చేయుచుండెడిది. ఆమె సేవను బాబా మహాసమాధి యగునంతవరకు మరువలేదు. ఆమె సేవకు తగినట్లు ఆమె పుత్రుడగు తాత్యాపాటీలునకు బాబా రోజు ఒక్కంటికి రూ 25/- కానుకగా నిచ్చుచుండెను. తల్లి కొడుకులకు బాబా సాక్షాత్ భగవంతుడనెడి విశ్వాసముండెను. బాబా ఫకీరు పదవియే శాశ్వతమగు రాజత్వమనియు, లోకులనుకొనే ధనమువట్టి భూటకమనియు చెప్పుచుండెను. కొన్ని సంవత్సరములు తదుపరి బాబా యడవులకు బోవుట మాని మసీదులోనే కూర్చుండి భోజనము చేయువారు. అప్పటినుంచి పొలములో తిరుగు కష్టము బాయజాబాయికి తప్పినది.

ముగ్గురు - పడక స్థలము

యోగీశ్వరులు గొప్ప పుణ్యాత్ములు. వారి హృదయమందు వాసుదేవుడు వసించును. వారి సహవాసము లభించు భక్తులు గొప్ప యదృష్టవంతులు. అట్టివారిద్దరు; తాత్యాకోతే పాటీలు, మహాళ్సాపతి. బాబా వారిని సమానముగా ప్రేమించువారు. ఈ ముగ్గురు మసీదులో తలలను తూర్పు, పడమర, ఉత్తరములవైపు చేసి ఒకరి కాళ్ళు ఒకరికి మధ్య తగులునట్లు నిద్రుంచుచుండిరి. ప్రక్కలు పరచుకొని, వానిపై చతికిలపడి సగము రేయివరకు ఏవో సంగతులు మాట్లాడుకొనుచుండిరి. అందులో నెవరైన పండుకొన్నట్లు గాన్పించిన తక్కినవారు వారిని లేవగొట్టునుండిరి. తాత్యా పండుకొని గుర్రుపెట్టినచో బాబా వానిని యటునిటు ఊపి వాని శిరస్సు గట్టిగా నొక్కుచుండెను. మహళ్సాపతిని కౌగలించుకొని, కాళ్ళు నొక్కి వీపు తోమెడివారు. ఈ విధముగా 14 సం||లు తాత్యా తలిదండ్రులను విడచి బాబాపై ప్రేమచే మసీదులో పండుకొనెను. అవి మరపురాని సంతోషదినములు. బాబా ప్రేమ కటాక్షములు కొలువరానివి; ఇంతయని చెప్పుటకు వీలులేనివి. తండ్రి చనిపోయిన పిమ్మట తాత్యా యింటి యజమాని యగుటచే నింటిలోనే నిద్రించుటకు ప్రారంభించెను.

రహతా నివాసి కుశాల్ చంద్

శిరిడీలోని గణపతి కోతే పాటీలను వానిని బాబా ప్రేమించువారు. అంతటీ ప్రేమతోనే రాహాతా నివాసియగు చంద్రభాను శేట్ మార్వాడీని జూచుచుండెను. ఈ శేట్ చనిపోయిన పిమ్మట వాని యన్న కొడుకగు కుశాల్ చందును గూడ మిక్కిలి ప్రేమతో జూచుచు రాత్రింబగళ్ళు వాని క్షేమ మరయుచుండిరి. ఒక్కొక్కప్పుడు టాంగాలోను, ఇంకొకప్పుడెద్దుల బండి మీద బాబా తన ప్రియ భక్తులతో రాహాతా పోవు వారు. రాహాతా ప్రజలు బాజాభజంత్రీలతో బాబాను గ్రామసరిహద్దుద్వారమువద్ద కలిసి సాష్టంగనమస్కారములు చేసేవారు. గొప్ప వైభవముతో బాబాను గ్రామములోనికి తీసికొని వెళ్ళేవారు. కూశాల్ చందు బాబాను తన యింటికి తీసికొనిపోయి తగిన యాసనమునందు కూర్చుండచేసి భోజనము పెట్టెడివారు. ఇరువురు కొంతసేపు ప్రేమాస్పదముగాను, ఉల్లాసముగాను మాట్లాడెడివారు. తదుపరి బాబా వారిని ఆశీర్వదించి శిరిడీ చేరుచుండువారు.

శిరిడీ రాహాతాకు, దక్షిణమున నిమగాంకు ఉత్తరదిశయందు మధ్యనున్నది. ఈ రెండు గ్రామములు విడిచి బాబా ఎన్నడు ఎచ్చటికీ పోయియుండలేదు. రైలుబండి చూచి యుండలేదు. దానిపై ప్రయాణము చేసి ఎరుగరు. కాని బండ్ల రాకపోకలు సరిగా తెలిసియుండెడివారు. బాబా సెలవు పుచ్చుకొని వారి యాజ్ఞానుసారము ప్రయాణము చేయువారల కే కష్టము లుండెడివి కావు. బాబా యాజ్ఞకు వ్యతిరేకముగ పోవువారనేక కష్టములపాలగుచుండిరి. ఈ వృత్తాంతము ఇంకను ఇతరవిషయములు వచ్చే యధ్యాయములో చెప్పెదను.

ఓం నమో శ్రీ సాయినాధాయ

శాంతిః శాంతిః శాంతిః

ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము