శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము - పి.నారాయణరావు Back   Home 

తొమ్మిదవ అధ్యాయము

బాబావద్ద సెలవు పుచ్చుకొనునప్పుడు వారి యాజ్ఞను పాలించవలెను. వారి యాజ్ఞకు వ్యతిరేకముగా నడచిన ఫలితములు; కొన్ని ఉదాహరణములు; భిక్ష, దాని యావశ్యకత; భక్తుల యనుభవములు.

శిరిడీ యాత్ర యొక్క లక్షణములు

బాబా యాజ్ఞ లేనిదే ఎవరులు శిరిడీ విడువ లేకుండిరి. బాబా యాజ్ఞకు వ్యతిరేకముగా పోయినచో ననుకొనని కష్టములు వచ్చుచుండెడివి. బాబా యాజ్ఞను పొందుటకు వారి వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా కొన్ని సలహాలు ఇచ్చుచుండెడివారు. ఈ సలహా ప్రకారము నడచి తీరవలెను. వ్యతిరేకముగా పోయినచో ప్రమాదము లేవో తప్పక వచ్చుచుండెడివి. ఈ దిగువ అట్టి యుదాహరణములు కొన్ని ఇచ్చుచున్నాను.

తాత్యాకోతే పాటీలు

ఒకనాడు టాంగాలో తాత్యా కోపర్ గాం సంతకు వెళ్ళుచుండెను. తొందరగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్ గాం సంతకు పోవుచుంటినని చెప్పెను. బాబా ఇట్లనెను. "తొందర పడవద్దు. కొంచెమాగుము. సంత సంగతి యటుండనిమ్ము. పల్లె వెడిచి బయటకి పోవలదు." అతని యాతురతను జూచి "మాధవరావు దేశపాండేనయిన వెంట దీసికొని పొమ్మ"ని బాబా యాజ్ఞాపించెను. దీనిని లెక్కచేయక తాత్యా వెంటనే టాంగాను వదిలెను. రెండు గుర్రములలో నోకటి క్రొత్తది; మిక్కిలి చురుకైనది. అది రూ.300 ల విలువ జేయును. సాపుల్ బావి దాటిన వెంటనే అది వడిగా పరుగెత్తెను. కొంతదూరము పోయినపిమ్మట కాలు బెణికి యది కూలబడెను. తాత్యాకు పెద్ద దెబ్బ తగులలేదు. కాని తల్లిప్రేమగల బాబా యాజ్ఞను జ్ఞప్తికి తెచ్చుకొనెను. ఇంకొకప్పుడు కొళారు గ్రామమునకు పోవునపుడు బాబా యాజ్ఞను వ్యతిరేకించి టాంగాలో పోయి ప్రమాదమును పొందెను.

ఐరోపాదేశపు పెద్దమనిషి

బొంబాయినుండి ఐరోపాదేశపు పెద్దమనిషి యొకడు శిరిడి వచ్చెను. నానాసాహెబు చాందోర్కరు వద్దనుంచి తనను గూర్చి బాబాకు ఒక లేఖను తీసికొని యేదో ఉద్దేశముతో శిరిడీ వచ్చెను. అతనికి ఒక గుడారములో సుఖ్యమైన బస యేర్పరచిరి. అతడు బాబా పాదములకు నమస్కరించి వారిచేతిని ముద్దిడవలెనని మూడుసారులు మసీదులో ప్రవేశింప యత్నించెను. కాని బాబా అతనిని నిషేధించెను. క్రింద బహిరంగావరణములో కూర్చుండియే దర్శించవలెననిరి. అతడు తనకి జరిగిన మరియాదకు అసంతుష్టిపడి వెంటనే శిరిడి విడువవలెనని నిశ్చయించెను. బాబా సెలవు పొందుటకు వచ్చెను. తొందరపడక మరుసటి దినము పొమ్మని బాబా చెప్పెను. తక్కినవారు కూడ అట్లనే సలహా ఇచ్చిరి. వారి సలహాకు వ్యతిరేకముగా అతడు టాంగాలో బయలుదేరెను. ప్రప్రధమమున గుర్రములు బాగుగనే పరుగెత్తినవి. సావుల్ బావి దాటిన వెంటనే యొక త్రొక్కుడుబండి ఎదురు వచ్చెను. దానిని జూచి గుర్రములు బెదరి త్వరగా పరుగిడసాగెను. టాంగా తలక్రిందులయ్యెను. పెద్దమనిషి క్రిందబడి కొంత దూరము ఈడ్వబడెను. ఫలితముగా గాయములను బాగు చేసికొనుటకై కోపర్ గాం ఆసుపత్రిలో పడియుండెను. ఇటువంటి అనేక సంఘటనల మూలమున బాబా యాజ్ఞను ధిక్కరించువారు ప్రమాదముల పాలగుదురనియు బాబా యాజ్ఞానుసారము పోవువారు సురక్షితముగా పోవుదురనియు జనులు గ్రహించిరి.

భిక్ష యొక్క యావశ్యకత

బాబాయే భగవంతుడయినచో వారు భిక్షాటనముచే జీవతమంతయు గడుపనేల? యను సందియము చాలా మందికి కలుగవచ్చును. ఈ ప్రశ్నకు రెండు దృక్కోణములలో సమాధానము చెప్పవచ్చును. (1) భిక్షాటనము చేసి, జీవించుట కెవరికి హక్కు కలదు? (2) పంచసూనములు, వానిని పోగొట్టుకొను మార్గమేది? యను రెండు ప్రశ్నలకు సమాధానము చెప్ప వచ్చును.

సంతానము, ధనము, కీర్తి సంపాదించుటయం దాపేక్ష వదలుకొని సన్యసించువారు భిక్షాటనముచే జీవింపవచ్చునని మన శాస్త్రములు ఘోషించుచున్నవి. వారు ఇంటివద్ద వంట ప్రయత్నములు చేసికొని, తినలేరు. వారికి భోజనము పెట్టు బాధ్యత గృహస్థులపై గలదు. సాయిబాబా గృహస్థుడు కాడు; వాన ప్రస్థుడు కూడ కాడు; వారస్ఖలిత బ్రహ్మచారులు. బాల్యము నుంచి బ్రహ్మచర్యమునే అవలంబించుచుండిరి. ఈ జగత్తు వారి గృహమని వారి నమ్మకము. ఈ జగత్తునకు వారు కారణభూతులు. వారిపై జగత్తు ఆధారపడియున్నది. వారు పరబ్రహ్మస్వరూపులు. కాబట్టి వారికి భిక్షాటనము చేయు హక్కు సంపూర్ణముగా కలదు.

పంచసూనములు, వానిని తప్పించుకొను మార్గమును ఆలోచింతము. భోజనపదార్థములు తయారు చేయుటకు గృహస్థులు అయిదు పనులు తప్పక చేయవలెను. అవి యేవన 1.దంచుట, రుబ్బుటు, 2. విసరుట 3. పాత్రలు తోముట, 4. ఇల్లు ఊడ్చుట, తుడుచుట, 5.పొయ్యి యంటించుట. ఈ అయిదు పనులు చేయునప్పుడనేక క్రిమికీటకాదులు మరణించుట తప్పదు. గృహస్థులు ఈ పాపము ననుభవించవలెను. ఈ పాపపరిహారమునకు మన శాస్త్రములు ఆరు మార్గములు ప్రభోధించుచున్నవి. 1.బ్రహ్మయజ్ఞము, 2.వేదాధ్యాయనము, 3.పితృయజ్ఞము, 4. దేవయజ్ఞము, 5. భూతయజ్ఞము, 6. అతిథియజ్ఞము. శాస్త్రములు విధించిన ఈ యాజ్ఞములు నిర్వర్తించినచో గృహస్థుల మనస్సులు పాపరహితములగును. మోక్షసాధనమునకు ఆత్మసాక్షాత్కారమున కివి తోడ్పడును. బాబా యింటింటికి వెళ్ళి భిక్ష యడుగుటచే, ఆ యింటిలోనివారికి వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి దెచ్చుచుండెను. తమ ఇంటి గుమ్మము వద్దనే యింత గొప్ప సంగతి బాబా బోధించుటవలన శిరిడీ ప్రజలెంతటి ధన్యులు!

భక్తుల యనుభవములు

ఇంకొక సంతోషదాయకమగు సంగతి, శ్రీ కృష్ణుడు భగవద్గీత (9అ.25శ్లో.) యందిట్లు నుడివెను. శ్రద్ధాభక్తులతో ఎవరైన పత్రమునుగాని పుష్పముగాని ఫలముగాని లేదా నీరుగాని యర్పించినచో దానిని నేను గ్రహించెదను. తన భక్తుడేదైన సమర్పించవలెననుకొని మరచినచో అట్టివానిని బాబా జ్ఞాపకము చేసి, ఆయర్పితమును గ్రహించి యాశీర్వదించువారు. అట్టివి కొన్ని ఈ క్రింద చెప్పిన యుదాహరణలు.

తర్ ఖడ్ కుంటుంబము (తండ్రి, కొడుకు)

రామచంద్ర ఆత్మారాం వురఫ్ బాబాసాహెబు తర్ ఖడ్ యొకానొకప్పుడు ప్రార్థనసమాజస్థుడైనను బాబాకు ప్రియభక్తుడు. వాని బార్యాపుత్రులు కూడ బాబాను మిగుల ప్రేమించుచుండిరి. తల్లితో కూడ కొడుకు శిరిడీ పోయి యచ్చట వేసవి సెలవులు గడుపవలెనని నిర్ణయించిరి. కాని కొడుకిష్టపడలేదు. కారణమేమన తన తండ్రి ప్రార్థన సమాజమునకు చెందినవాడగుటచే ఇంటివద్ద బాబాయొక్క పూజ సరిగా చేయకపోవచ్చునని సంశయించెను. కాని తండ్రి, పూజను సక్రమముగా చేసెదనని వాగ్థానము చేయుటచే బయలుదేరెను. అందుచే శుక్రవారము రాత్రి తల్లి, కొడుకు బయలు దేరి శిరిడీ వచ్చిరి.

ఆ మరుసటిదినము శనివారమునాడు తండ్రియగు తర్ ఖడ్ త్వరగా లేచి, స్నానముచేసి, పూజను ప్రారంభించుటకు పూర్వము బాబా పటమునకు సాష్టంగనమస్కారము చేసి లాంఛనమువలే కాక కొడుకు చేయునట్లు పూజను సక్రమముగా నెరవేర్చెదనని ప్రార్థించెను. ఆనాటి పూజను సమాప్తిచేసి నైవేద్యము నిమిత్తము కలకండను అర్పించెను. సమయమందు దానిని పంచిపెట్టెను.

ఆనాటి సాయంత్రము, మరుసటిదినము ఆదివారము పూజ యంతయు సవ్యముగా జరిగెను. దానికి మరుసటిదినము సోమవారము కుడ చక్కగా గడిచెను. ఆత్మారాముడు ఎప్పుడిట్లు పూజచేసియుండలేదు. పూజయంతయు కొడుకునకు వాగ్ధానము చేసినట్లు సరిగా జరుగుచున్నందుకు సంతసించెను. మంగళవారమునాడు పూజనెప్పటివలే సలిపి కచేరికి పోయెను. మధ్యాహ్నభోజనమునకు వచ్చినప్పుడు తినుటకు ప్రసాదము లేకుండెను. నౌకరును, అడుగగా ఆనాడు ప్రసాదమర్పించుట మరచుటచే లేదని బదులు చెప్పెను. ఈ సంగతి వినగనే ఆత్మారాం భోజనమునకు కూర్చున్నవాడు లేచి బాబా పటమునకు సాష్టాంగనమస్కారముచేసి బాబాను క్షమాపణ కోరెను. బాబా తనకు ఆ విషయము జ్ఞప్తికి తేనందుకు నిందించెను. ఈ సంగతులన్నిటిని శిరిడీలో నున్న తన కొడుకునకు వ్రాసి బాబాను క్షమాపణ వేడుమనెను. ఇది బాంద్రాలో మంగళవారము 12 గంటలకు జరిగెను.

అదే సమయమందు మధ్యాహ్నహారతి ప్రారంభించుటకు సిద్దముగానున్నప్పుడు, బాబా యాత్మారాముని బార్యతో "తల్లీ! బాంద్రాలో మీ ఇంటికి ఏమయిన తినే ఉద్దేశముతో పోయినాను. తలుపు తాళము వేసియుండెను. ఏలాగుననో లోపల ప్రవేశించితిని. కానీ తినుట కేమిలేక తిరిగి వచ్చితిని." అనెను.

ఆమెకు బాబా మాటలు బోధపడనేలేదు. కాని ప్రక్కనేయున్న కుమారుడు ఇంటివద్ద పూజలో నేమియో లోటుపాటులు జరిగినవని గ్రహించి యింటికి పోవుటకు సెలవు నిమ్మని బాబాను వేడెను. అందులకు బాబా నిరాకరించెను. కాని పూజను అక్కడనే చేయుమనెను. కోడుకు వెంటనే తండ్రికి శిరిడీలో జరిగినదాని నంతటినీ వ్రాసెను. పూజను తగిన శ్రద్ధతో చేయుమని వేడుకొనెను.

ఈ రెండు ఉత్తరములు ఒకటికొకటి మార్గమధ్యమున తటస్థపడి తమతమ గమ్యస్థానములకు చేరెను. ఇది ఆశ్చర్యకరము కదా!

ఆత్మారాముని భార్య

ఆత్మారాముని భార్యవిషయమాలోచింతము. ఆమె మూడు వస్తువులని నైవేద్యము పెట్టుటకు సంకల్పించుకొనెను. 1.వంకాయ పెరుగుపచ్చడి, 2.వంకాయ వేపుడు కూర, 3.పేడా. బాబా వీనినెట్లు గ్రహించెనో చూచెదము.

బాంద్రా నివాసియగు రఘువీరభాస్కరపురందరే బాబాకు మిక్కిలి భక్తుడు. ఒకనాడు భార్యతో శిరిడీ బయలుదేరుచుండెను. ఆత్మారాముని భార్య పెద్దవంకాయలు రెండింటిని మిగుల ప్రేమతో తెచ్చి పురందరుని బార్య చేతికిచ్చి యొకవంకాయతో పెరుగుపచ్చడిని రెండవదానితో వేపుడును చేసి బాబాకు వడ్డించుమని వేడెను. శిరిడీ చేరిన వెంటనే పురందరుని భార్య వంకాయ పెరుగుపచ్చడి చేసి బాబా భోజనమునకు కూర్చున్నపుడు తీసికొని వెళ్ళెను. బాబాకాపచ్చడి చాలా రుచిగా నుండెను. కాన దాని నందరికీ పంచిపెట్టెను. బాబా వంకాయ వేపుడు కూడ అప్పుడే కావలెననెను. ఈ సంగతి రాధాకృష్ణమాయికి తెలియపరచిరి. అది వంకాయల కాలము కాదు గనుక యామె కేమియు తోచకుండెను. వంకాయ లెట్లు సంపాదించుట యనునది ఆమెకు సమస్యయాయెను. వంకాయపచ్చడి తెచ్చిన దెవరని కనుగొనగా పురందరుని భార్యయని తెలియుటచే వంకాయవేపుడు గూడ ఆమెయే చేసిపెట్టవలెనని నిశ్చయించిరి. అప్పుడందరికి బాబా కోరిన వంకాయ వేపుడుకు గల ప్రాముఖ్యము తెలిసినది. బాబా సర్వజ్ఞుడని యందరాశ్చర్యపడిరి.

1915 డిసెంబరులో గోవింద బలరాం మంకడ్ యనువాడు శిరిడీ పోయి తన తండ్రికి ఉత్తరక్రియలు చేయవలెననుకొనెను. ప్రయాణము నకు పూర్వము ఆత్మారామునివద్దకు వచ్చెను. ఆత్మారాం భార్య బాబాకొరకేమైన పంపవలె ననుకొనెను. ఇల్లంతయు వెదకెను. కాని యొక్క పేడా తప్ప యేమియు గాంపించలేదు. ఈ పేడా యప్పటికే బాబాకు నైవేద్యము పెట్టియుండెను. తండ్రి మరణించుటచే గోవిందుడు విచారగ్రస్తుడై యిండెను. కాని అమె బాబాయందున్న భక్తిప్రేమలచే, యా పేడాను అతని ద్వారా పంపెను. బాబా దానిని పుచ్చుకొని తినునని నమ్మియుండెను. గోవిందుడు శిరిడీ చేరెను. బాబాను దర్శించెను. పేడా తీసికొనివెళ్ళుట మరచెను. బాబా ఊరకుండెను. సాయంత్రము బాబా దర్శనమునకై వెళ్ళినపుడు కూడ పేడాను తీసికొనిపోవుట మరచెను. అప్పుడు బాబా యోపికపట్టక తనకొరకేమి తెచ్చెనావని యడిగెను. ఏమియు తీసికొని రాలేదని గోవిందుడు జవాబిచ్చెను. వెంటనే బాబా "నీ ఇంటివద్ద బయలుదేరునప్పుడు ఆత్మారాముని భార్య నాకొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా?" యని యడిగెను. కుర్రవాడదియంతయు జ్ఞప్తికి దెచ్చుకొని సిగ్గుపడెను. బాబాను క్షమాపణ కోరెను. బసకు పరుగెత్తి పేడాను దెచ్చి బాబా చేతికిచ్చెను. చేతిలో పడిన వెంటనే బాబా దానిని గుటుక్కున మ్రింగెను. ఇవ్విధముగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా మెచ్చుకొనెను. "నా భక్తులు నన్ను నమ్మినట్లు నేను వారిని చేరదీసెదను." అను గీతావాక్యము (4-11) నిరూపించెను.

బాబాకు సంతుష్టిగా భోజనము పెట్టుట యెట్లు?

ఒకప్పుడు ఆత్మారముని భార్య శిరిడీలో నొక ఇంటియందు దిగెను. మధ్యాహ్న భోజనము తయారయ్యెను. అందరికీ వడ్డించిరి. ఆకలితోనున్న కుక్క యొకటి వచ్చి మొరుగుట ప్రారంభించెను. వెంటనే తర్ఖడ్ భార్య లేచి యొక రొట్టె ముక్కను విసరెను. ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టె ముక్కను తినెను. ఆనాడు సాయంకాలము ఆమె మసీదునకు పోగా బాబా యిట్లనెను. "తల్లీ ! నాకు కడుపునిండ గొంతువరకు భోజనము పెట్టినావు. నా జీవశక్తులు సంతుష్టి చెందినవి. ఎల్లప్పుడు ఇట్లనే చేయుము. ఇదీ నీకు సద్గతి కలుగజేయును. ఈ మసీదులో గూర్చుండి నేనెన్నడసత్యమాడను. యాయందిట్లే దయ యుంచుము మొదట ఆకలితో నున్న జీవికి భోజనము పెట్టిన పిమ్మట నీవు భుజింపుము. దీనిని జాగ్రర్తగా జ్ఞప్తియందుంచుకొనుము." ఇదంతయూ ఆమెకు బోధపడనే లేదు. కావున ఆమె యిట్లు జవాబిచ్చెను. "బాబా నేను నీకెట్లు భోజనము పెట్టగలను? నా భోజనముకొర కితరులపై ఆధారపడి యున్నాను. నేను వారికి డబ్బిచ్చి భోజనము చేయుచున్నాను. అందులకు బాబా ఇట్లు జవాబిచ్చెను. "నీ విచ్చిన ప్రేమపూర్వకమైన యా రొట్టెముక్కను తిని యిప్పటికి త్రేనుపులు తీయుచున్నాను. నీ భోజనమునకు పూర్వ మేకుక్కను నీవు జూచి రొట్టె పెట్టితివో అదియునేను ఒక్కటియే. అట్లనే, పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలుగా గలవన్నియు నా యంశములే. నేనే వాని యాకారములో తిరుగుచున్నాను. ఎవరయితే జీవకోటిలో నన్ను జూడగలుగుదురో వారే నా ప్రియభక్తులు. కాబట్టి నేనొకటి తక్కిన జీవరాశి యింకొకటి యను ద్వంద్వభావమును భేదమును విడిచి నన్ను సేవింపుము." ఈ అమృతతుల్యమగు మాటలు విని ఆమె మనస్సు కరగెను. ఆమె నేత్రములు కన్నీటితో నిండెను. గొంతు ఆర్చుకొనిపోయెను. ఆమె ఆనందమునకు అంతులేకుండెను.

నీతి

"భగవంతుని జీవులన్నిటియందు గనుము" అనునది యీ అధ్యాయములో నేర్చుకొనవలసిన నీతి. ఉపనిషత్తులు, గీత, భాగవతము మొదలగునవి అన్నియు భగవంతుని ప్రతిజీవియందు చూడుమని ప్రభోధించుచున్నవి. ఈ యధ్యాయము చివర చెప్పిన యుదాహరణము నను ఇతరానేకముల మూలమునను, సాయిబాబా ఉపనిషత్తులలోని ప్రబోధలను, ఆచరణరూపమున నెట్లుంచవలెనో యనుభవపూర్వకముగా నిర్థారణ చేసి యున్నారు. ఈ విధముగా సాయిబాబా ఉపనిషత్తుల సిద్ధాతములను భోధించు చక్కని గురువని మనము గ్రహించవలెను.

ఓం నమో శ్రీ సాయినాధాయ

శాంతిః శాంతిః శాంతిః

తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము